ఎంబీబీఎస్, దంత వైద్య విద్యలో కన్వీనర్ కోటా ఫీజు స్వల్పంగా పెరిగింది. ‘బీ, ‘సీ’ కేటగిరీల ఫీజులు తగ్గాయి. రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ 2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరం వరకు అమల్లో ఉండేలా కొత్త రుసుములను ఖరారు చేసి, ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీటిపై నవంబరు 2న సమాలోచనలు జరిగాయి. ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించిన అనంతరం కొత్త ఫీజులపై వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది.
ఎంబీబీఎస్లో..
* 2019-20 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటా ఫీజు కింద రూ.12,155 వసూలు చేశారు. దీనిని తాజాగా రూ.15 వేలుగా నిర్ణయించారు.
* ‘బీ’ కేటగిరీ సీటు ఫీజు రూ.13,37,057 ఉండగా రూ.12,00,000గా పేర్కొన్నారు.
* ‘బీ’ కేటగిరీ ఫీజుపై ఐదు రెట్లకు మించకుండా ‘సీ’ కేటగిరీ సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకుంటున్నాయి. తాజాగా ‘బీ’ కేటగిరీ సీటు ఫీజుపై 3 రెట్ల కంటే ఎక్కువ ‘సీ’ కేటగిరీ కింద ఫీజు వసూలు చేయకూడదని పేర్కొన్నారు.
దంత వైద్య విద్యలో...
* 2019-20లో కన్వీనరు కోటా కింద రూ.12,155ను వసూలు చేశారు. దీనిని తాజాగా రూ.15వేలు చేశారు.
* ‘బీ’ కేటగిరీ సీటు రూ.5,46,978 ఉండగా దీనిని 4,00,000 చేశారు.
* ‘సీ’ కేటగిరీ సీటు ఫీజును ‘బీ’ కేటగిరీ ఫీజుపై ఐదింతలకు మించకుండా వసూలు చేస్తున్నారు. తాజాగా దీనిని 3 రెట్లకు మించకూడదని పేర్కొన్నారు.
సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో..
5 ప్రైవేటు వైద్య కళాశాలల్లో మాత్రమే సూపర్ స్పెషాలిటీ సీట్లున్నాయి. ప్రస్తుతం ఒక్కో సీటుకు రూ.24 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులో రూ.9 లక్షలు తగ్గించారు. కొత్త ఫీజు రూ.15 లక్షలు.