‣ టెన్త్ తర్వాత? పాలిటెక్నిక్ కోర్సులు
పదో తరగతి పూర్తవగానే ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే అవకాశాన్ని పాలీసెట్ కల్పిస్తోంది. ఉద్యోగంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి ఇది చక్కని దారి. ర్యాంకు సాధించి పాలిటెక్నిక్ కోర్సులో చేరితే చదువుకుంటూనే ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. ఈ డిప్లొమా అందుకున్న వెంటనే కొన్ని రకాల కొలువుల్లో చేరేందుకు అర్హత లభిస్తుంది. ప్రవేశ పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ ఎంట్రన్స్ల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మెరుగైన కళాశాలలో సీటు పొంది, సాంకేతిక కెరియర్కు మేలైన బాట వేసుకోవచ్చు!
హైస్కూలు స్థాయి నుంచే నేటితరానికి కెరియర్పై కచ్చితమైన ప్రణాళికలు ఉంటున్నాయి. టెక్నాలజీలపై పట్టు పెంచుకోవడం, వేగంగా స్థిరపడటం లక్ష్యంగా సాగుతున్నారు. అందుకే కొత్త రంగాల ఆవిర్భావం, వాటికి సంబంధించి వస్తున్న స్పెషలైజేషన్లు, అందుబాటులోకి వస్తున్న కొత్త కోర్సులపై దృష్టిసారిస్తున్నారు. మూస ధోరణిలో కాకుండా కొత్త దారుల్లో కెరియర్ను మలచుకోవాలనుకుంటున్నవారూ ఉన్నారు. వాళ్లు తాము ఎంచుకున్న రంగంలో ముందుకు సాగడానికి అదనపు అనుభవం సంపాదించుకోవడం, ముందస్తు పరిజ్ఞానాన్ని పెంపొదించుకోవడంపై దృషి పెడుతున్నారు. అలాంటి వారికి అనుకూలమైనవి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు.
పదో తరగతి విద్యార్హతతో ఎన్నో డిప్లొమా/ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. పది తర్వాత అప్లైడ్ సైన్స్/ టెక్నికల్ సబ్జెక్టులను అభ్యసించాలనుకునేవారు వీటిని ఎంచుకోవచ్చు. ఇవి ఉద్యోగాధారిత కోర్సులు. పూర్తిచేయగానే సంబంధిత పరిశ్రమల్లో ఉద్యోగం సాధించుకునే విధంగా సిలబస్ ఉంటుంది. టెక్నికల్ డిప్లొమా ప్రోగ్రాముల్లో ఇంజినీరింగ్ అంశాలుంటాయి. అందుకే వీటిని డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్గా వ్యవహరిస్తారు. సాధారణంగా కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు. కొన్నింటికి మూడున్నరేళ్లు. సెమిస్టర్ విధానంలో నిర్వహిస్తారు. కోర్సుల కాలవ్యవధిని బట్టి ఆరు నెలల వరకు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది.
కోర్సులు.. ప్రవేశం
మనదేశంలో పాలిటెక్నిక్ కోర్సులకు పరిధి, గిరాకీ ఎక్కువ. ఎన్నో ఉత్తమ కళాశాలలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్) ద్వారా వీటిల్లోకి ప్రవేశాన్ని పొందవచ్చు. రెండు రాష్ట్రాల్లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ సంస్థలు ఈ ప్రవేశపరీక్షను విడివిడిగా నిర్వహిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు చెందినవారికి మాత్రమే అడ్మిషన్ లభిస్తుంది. పదో తరగతి లేదా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గుర్తింపు పొందిన తత్సమాన కోర్సు (సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎన్ఐఓఎస్, టీఓఎస్ఎస్, ఏపీఓఎస్ఎస్ వంటివి) పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.