• facebook
  • whatsapp
  • telegram

స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధి ప్రణాళికలు - ప్రణాళికా కాలంలో భారతదేశ ఆర్థికాభివృద్ధి, ప్రణాళికల్లో కేటాయింపులు


ప్రణాళికలు - పరిణామ క్రమం
లభ్యమవుతున్న వనరులను ఎంత సామర్థ్యంతో వీలైతే అంత సామర్థ్యంతో ఉపయోగించుకుని స్పష్టమైన లక్ష్యాలను సాధించాలని ఉద్దేశ పూర్వకంగా, జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ప్రభుత్వం తీసుకునే చొరవే ప్రణాళిక అని ప్రణాళికా సంఘం నిర్వచించింది.
* ఆడంస్మిత్ లాంటి సంప్రదాయవాదులు ఆర్థిక వ్యవస్థను అదృశ్య హస్తం నడిపిస్తుందని అంటారు. అదృశ్య హస్తం అంటే డిమాండు, సప్లయి లాంటి మార్కెటు శక్తులు. వీటినే ధరల యంత్రాంగం అని కూడా అంటారు.
జె.బి. సే ప్రకారం సప్లయి తనకు తాను డిమాండ్‌ను సృష్టించుకుంటుంది. అంటే ఉత్పత్తి జరుగుతున్న క్రమంలో ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలను చెల్లించడం జరుగుతుంది. ఉత్పత్తి కారకాలు తాము పొందిన ప్రతిఫలంతో ఉత్పత్తి అయిన వస్తువులను డిమాండు చేస్తాయి. ఆ విధంగా సప్లయి, డిమాండులు సమానం అవుతాయి. కాబట్టి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదు. అని సంప్రదాయ ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.
* 1929 - 33 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన ఆర్థిక మాంద్యం కాలంలో సంప్రదాయవాదుల సిద్ధాంతం పని చేయలేదు.
* ఆర్థికమాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ప్రభుత్వ జోక్యం తప్పనిసరి అనేది జె.ఎం. కీన్స్ అభిప్రాయం.
* 1929 - 33 మధ్యకాలంలో ఆర్థిక మాంద్యం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఏర్పడింది. ఫలితంగా మాంద్యం ప్రభావం అన్ని దేశాలపై పడింది. అయితే ఈ ఆర్థిక మాంద్యం ప్రణాళికలను అమలు చేస్తూ ప్రణాళికా బద్ధమైన ప్రగతిని సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న రష్యా (సోవియట్ యూనియన్)ను ప్రభావితం చేయలేదు. కొన్ని వందల సంవత్సరాల్లో అమెరికా సాధించిన వృద్ధిని రష్యా కేవలం కొన్నేళ్లలోనే సాధించింది. ఫలితంగా ప్రణాళికా భావన ప్రపంచ దేశాలను, ఆర్థిక వేత్తలను ప్రభావితం చేసింది. భారత్ కూడా రష్యాను స్ఫూర్తిగా తీసుకుని ప్రణాళికలను ప్రారంభించింది.

 

స్వాతంత్య్రానికి ముందు

* స్వాతంత్య్రానికి ముందు మనదేశానికి ఒక ప్రణాళిక అవసరమని చెప్పిన నాయకుడు సుభాష్ చంద్రబోస్.
* 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లాన్‌డ్ ఎకానమీ ఫర్ ఇండియా (Planned Economy for India) అనే గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథంలో భారతదేశానికి 10 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించారు.
* భారత జాతీయ కాంగ్రెస్ (INC) 1938లో జాతీయ ప్రణాళికా కమిటీని జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన వేసింది.
1943లో బాంబేకి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు A Plan of economic development for India అనే పేరుతో 15 సంవత్సరాల కాలానికి ఒక ప్రణాళికను రూపొందించారు. దీన్ని బాంబే ప్లాన్ అంటారు. వీరు ఇనుము, ఉక్కు, సిమెంట్, రసాయనాలు లాంటి భారీ పరిశ్రమల అభివృద్ధిని కాంక్షించారు.
* 1944లో ఎం.ఎన్. రాయ్ ప్రజాప్రణాళికలను (People's plan) రూపొందించారు. ఈయన వ్యవసాయ రంగానికి, వినియోగ వస్తువులకు ప్రాధాన్యం ఇచ్చారు.
* బాంబే ప్రణాళికను పారిశ్రామికవేత్తలు రూపొందించడం వల్ల అది పెట్టుబడిదారీ స్వభావాన్ని కలిగి ఉండగా, ప్రజాప్రణాళిక సామ్యవాద భావాలను కలిగి ఉంది.
బాంబే ప్లాన్ భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వగా, పీపుల్స్ ప్లాన్ చిన్న పరిశ్రమలకు, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చింది.
* 1944లో శ్రీమన్నారాయణ అగర్వాల్ గాంధీ ప్రణాళికను రూపొందించి, వికేంద్రీకృత ప్రణాళికను సూచించారు. గాంధీ ప్రణాళికను క్రోడికరించి ఆర్థిక ప్రణాళికను రూపొందించారు. కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారు.
* శ్రీమన్నారాయణ అగర్వాల్ గాంధీ ప్రణాళికను రూ.3,500 కోట్ల వ్యయ అంచనాలతో రూపొందించారు.
* 1946లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం ప్రణాళికల అభివృద్ధి సమస్యలను పరిష్కరించడానికి High level advisory planning board ను ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలో స్థిరప్రాతిపదికన ఒక ప్రణాళికా సంఘం ఉండాలని సలహా ఇచ్చింది.

 

స్వాతంత్య్రానంతరం
* రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్య్రం పొందిన వెనుకబడిన దేశాలు రష్యా దేశాన్ని మార్గదర్శకంగా తీసుకుని ఆర్థిక ప్రణాళికలను అమలు చేశాయి. ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను అమలు చేయడం, నిర్ణీత కాలవ్యవధిలో, నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నియంత్రించడాన్ని ఆర్థిక ప్రణాళికా విధానం అంటారు.
* కొరతగా ఉండి ప్రత్యామ్నాయ ఉపయోగిత ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగించి నిర్ణీత కాలంలో గరిష్ఠ వృద్ధిరేటు సాధించడానికి ఆర్థిక ప్రణాళికలు తోడ్పడతాయి.
* 1950లో జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ ప్రణాళికను రూపొందించారు.
* భారతదేశానికి ఒక ప్రణాళికా సంఘం అవసరమని అప్పటి ఆర్థికశాఖ మంత్రి షణ్ముగం శెట్టి పేర్కొంటూ ప్రణాళికా సంఘం స్వరూప, స్వభావాలను వివరించారు. దీనికి అనుగుణంగా 1950, మార్చి 15న కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు ప్రణాళికా సంఘం ఏర్పడింది.

 

ప్రణాళికా సంఘం

కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు 1950, మార్చి 15న ఇది ఏర్పడింది.
* ఇది రాజ్యాంగేతర సంస్థ, చట్టబద్ధం కాని సంస్థ.
* ఇది కేవలం కేంద్ర మంత్రిమండలి తీర్మానం మేరకు ఏర్పడిన సలహాసంఘం మాత్రమే.
* ఈ ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడిగా లేదా ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా దేశ ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.
* ఈ ప్రణాళికా సంఘానికి క్రియాశీలకంగా పనిచేసే వాస్తవ కార్య నిర్వాహకుడు ఒకరు ఉంటారు. అతడే ఉపాధ్యక్షుడు అయితే అతడి పదవీకాలం, నియామకం, తొలగింపు లాంటి అన్ని అంశాలు ప్రభుత్వం విచక్షణ మేరకు జరుగుతాయి.
* ఆదేశిక సూత్రాల్లోని 39వ అధికరణ ప్రకారం స్త్రీ, పురుషులు సమాన జీవన ప్రమాణాలను పొందాలని, దేశంలోని సహజ వనరులు సమానంగా పంపిణీ కావాలనీ, ఆర్థికశక్తి కొద్దిమంది వద్దే కేంద్రీకృతం కాకుండా చూడాలనీ తెలుపుతుంది.
భారత రాజ్యాంగంలోని 39వ అధికరణను అనుసరించి ప్రణాళికా సంఘం ఏర్పాటైంది.
* ఆర్థిక ప్రణాళికలు ఉమ్మడి జాబితాకు సంబంధించినవి. అందువల్ల ప్రణాళికలకు సంబంధించి కేంద్రం, రాష్ట్రం రెండూ కూడా ప్రణాళికలను రూపొందించుకుంటాయి.

 

ప్రణాళిక సంఘం మొదటి అధ్యకుడు: జవహర్‌లాల్ నెహ్రూ.
ప్రణాళికా సంఘం మొదటి ఉపాధ్యక్షుడు: గుల్జారీలాల్ నందా.
ప్రణాళికా సంఘం చివరి అధ్యక్షుడు: నరేంద్రమోదీ.
ప్రణాళికా సంఘం చివరి ఉపాధ్యక్షుడు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా.

 

జాతీయ అభివృద్ధి మండలి (National Development Council - NDC)

* ఇది 1952, ఆగస్టు 6న ఏర్పడింది.
* ఇది రాజ్యాంగేతర సంస్థ, చట్టబద్ధం కాని సంస్థ.
* ఇది కూడా ప్రణాళికా సంఘం మాదిరి కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు ఏర్పడింది.
* ప్రణాళికా సంఘంలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదు. అందువల్ల ప్రణాళికల అమలులో రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు.
* ఇది రాష్ట్రాలకు, ప్రణాళికా సంఘానికి మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది. ప్రణాళికల నిర్మాణంలో రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తుంది.
* మనదేశంలో ప్రణాళికలను తయారు చేసేది ప్రణాళిక సంఘం. వాటిని ఆమోదించేది జాతీయ అభివృద్ధి మండలి. ఇది ఆమోదించిన తర్వాతే ప్రణాళికలు అమల్లోకి వస్తాయి.
* జాతీయ అభివృద్ధి మండలికి ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* ప్రణాళికా సంఘం కార్యదర్శి జాతీయ అభివృద్ధి మండలి (NDC)కి కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
* NDC సభ్యుల్లో ప్రతి ఒక్కరూ ఎక్స్ అఫీషియో సభ్యులే. NDCలో పనిచేయడానికి పూర్తికాల సభ్యులు ఒక్కరూ కూడా లేరు.
* 1967లో పరిపాలనా సంఘం చేసిన సూచనల మేరకు జాతీయ అభివృద్ధి మండలి సభ్యత్వాన్ని విస్తరించారు. దీనిలోని సభ్యులు
    1) రాష్ట్ర ముఖ్యమంత్రులు.
    2) కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లు.
    3) ప్రణాళికా సంఘం సభ్యులు.
    4) కేంద్ర కేబినెట్ మంత్రులు.
* ప్రణాళిక సంఘం రూపొంచిందించిన ప్రణాళికలను చివరగా జాతీయ అభివృద్ధి మండలి ఆమోదిస్తేనే అవి అమల్లోకి వస్తాయి.
* అదేవిధంగా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రణాళికా బోర్డు (State Planning Board) ఉంటుంది. ముఖ్యమంత్రి దీనికి అధ్యక్షుడిగా ఉంటారు.
జిల్లాల్లో కూడా జిల్లా ప్లానింగ్ బోర్డు (District Planning Board) ఉంటుంది. జిల్లా కలెక్టరు దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అదేవిధంగా జిల్లా ప్లానింగ్ కమిటీ (District Planning Committee) కి ఛైర్మన్‌గా జిల్లాపరిషత్ ఛైర్మన్ వ్యవహరిస్తారు.

 

ప్రణాళికలు - వ్యూహాలు: ప్రణాళికా వ్యూహానికి మూడు అంశాలు ఆధారం.
 

   1) ఆర్థిక వ్యవస్థలో కనుక్కున్న వనరుల సమగ్ర అంచనా.
     2) దేశ సమస్యల తీవ్రత ఆధారంగా నిర్ణీతకాలంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ణయించడం.
     3) నిర్ణయించిన లక్ష్యాల సాధనకు పటిష్ట వ్యూహరచన.

 

ప్రణాళికలు - రకాలు:
 

ప్రభుత్వ పాత్రను బట్టి ప్రణాళికలు రెండు రకాలు.


    1) ఆదేశాత్మక ప్రణాళిక
    2) సూచనాత్మక ప్రణాళిక.

 

1) ఆదేశాత్మక ప్రణాళిక/ నిర్దేశాత్మక ప్రణాళిక

* ఇందులో ప్రణాళిక రచన, అమలు లాంటి వ్యవహారాలను సర్వాధికారాలున్న ఒక కేంద్ర సంస్థ నిర్వహిస్తుంది. దీనిలో ప్రజలకు, రాష్ట్రాలకు, వినియోగదారులకూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండవు.
* ఆర్థిక వ్యవస్థలోని వనరులు, ఆర్థిక కార్యకలాపాలన్నీ కేంద్ర సంస్థ దిశానిర్దేశం మేరకు జరుగుతాయి.
* సాధారణంగా ఇలాంటి ప్రణాళికలు రష్యా లాంటి సామ్యవాద దేశాల్లో అమలవుతాయి.

 

2) సూచనాత్మక ప్రణాళిక:

* దీనిలో ప్రభుత్వ స్థూల అంశాలను నిర్దేశించి, వాటిని సాధించడం కోసం ప్రైవేట్ రంగానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుంది. కానీ దిశానిర్దేశం చేయదు.
* ఇలాంటి ప్రణాళికలను మొదటిసారిగా 1947 - 50లో ఫ్రాన్స్ ప్రభుత్వం అమలు చేసింది.
* ఈ ప్రణాళికను మార్కెట్ ప్రణాళిక అని కూడా పిలుస్తారు.
* ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుంది.
* మనదేశంలో ఈ ప్రణాళికను 8వ పంచవర్ష ప్రణాళిక నుంచి అమలు చేస్తున్నారు.

 

ప్రజల భాగస్వామ్యం ఆధారంగా .......

    1) కేంద్రీకృత ప్రణాళిక
    2) వికేంద్రీకృత ప్రణాళిక

 

1) కేంద్రీకృత ప్రణాళిక:

* ప్రణాళిక రచన, అమలుకు సంబంధించిన వ్యవహారాలను సర్వాధికారాలు ఉన్న ఒక కేంద్ర సంస్థ చూస్తుంది.
 

2) వికేంద్రీకృత ప్రణాళిక:

* కిందిస్థాయి నుంచి (గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో) ప్రణాళికలను తయారుచేసి, వాటి ఆధారంగా కేంద్ర ప్రణాళికలను తయారు చేయడాన్ని వికేంద్రీకృత ప్రణాళిక అంటారు.
 

వనరుల కేటాయింపుల ఆధారంగా.........

    1) భౌతిక ప్రణాళిక
     2) విత్త ప్రణాళిక

 

1) భౌతిక ప్రణాళిక:

* సహజ వనరులు, మానవ వనరులు, ముడిపదార్థాలు లాంటి వాస్తవిక అంశాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించే ప్రణాళికను భౌతిక ప్రణాళిక అంటారు.
 

2) విత్త ప్రణాళిక:

* నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ద్రవ్యం రూపంలో వనరులను అంచనావేస్తే దాన్ని విత్త ప్రణాళిక అంటారు.
 

కాలం ఆధారంగా ప్రణాళికలు..........

    1) స్వల్పకాలిక ప్రణాళిక
    2) మధ్యకాలిక ప్రణాళిక
    3) దీర్ఘకాలిక ప్రణాళిక

 

1. స్వల్పకాలిక ప్రణాళిక:

* ఒక సంవత్సర కాలానికి రూపొందించే ప్రణాళికలను స్వల్పకాలిక ప్రణాళికలు అంటారు.
 

2. మధ్యకాలిక ప్రణాళిక:

* 4, 5, 6 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలను తయారుచేస్తే వాటిని మధ్యకాలిక ప్రణాళికలు అంటారు.
 

3. దీర్ఘకాలిక ప్రణాళిక:

* 15 నుంచి 20 సంవత్సరాల కాలానికి తయారుచేసే ప్రణాళికలను దీర్ఘకాలిక ప్రణాళికలు అంటారు.
 

సరళత్వం ఆధారంగా...........

      1) నిర్దిష్ట/స్థిర ప్రణాళిక
      2) నిరంతర ప్రణాళిక

 

1. నిర్దిష్ట/స్థిర ప్రణాళిక:

* కొన్ని సంవత్సరాల కాలాన్ని స్థిరంగా నిర్ణయించి ప్రణాళికను రూపొందిస్తే దాన్ని స్థిర/నిర్దిష్ట ప్రణాళిక అంటారు.
 

2. నిరంతర ప్రణాళిక:

* కొత్తగా, అనూహ్యంగా ఎదురయ్యే సమస్యలను బట్టి ప్రణాళిక లక్ష్యాలను కూడా నిరంతరం మార్చుకోవడానికి అవకాశం ఉండే ప్రణాళికను నిరంతర ప్రణాళిక అంటారు.
* ఈ నిరంతర ప్రణాళికను ప్రపంచంలో మొదటిసారిగా తయారుచేసింది గున్నార్ మిర్డాల్. ఈయన స్వీడన్ దేశస్థుడు.
* ఈ ప్రణాళికను మొదటిసారిగా నెదర్లాండ్స్‌లో అమలు చేశారు.
* ఇండియాలో ఈ నిరంతర ప్రణాళికా నమూనాను డాక్టర్ లక్‌డావాలా తయారుచేశారు.

వ్యవస్థ స్వరూపం ఆధారంగా ..........
     1) నిర్మాణాత్మక ప్రణాళికలు
     2) కార్యాత్మక ప్రణాళికలు

 

ప్రాంతాన్ని బట్టి..........
 
   1) ప్రాంతీయ ప్రణాళిక
    2) జాతీయ ప్రణాళిక
    3) అంతర్జాతీయ ప్రణాళిక

 

* ప్రణాళికలను పాక్షిక ప్రణాళిక, సాధారణ ప్రణాళిక, వార్షిక ప్రణాళికలుగా కూడా వర్గీకరించవచ్చు.
వార్షిక ప్రణాళికలు: ఒక సంవత్సర కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తయారుచేసే ప్రణాళికను వార్షిక ప్రణాళిక అని పిలుస్తారు. దీన్ని పిగ్మీ ప్రణాళిక అంటారు.
భారత్‌లో వార్షిక ప్రణాళికల కాలం: 1966 - 69 (3 సంవత్సరాలు), 1990 - 92 (2 సంవత్సరాలు)

 

* ప్రణాళికలను వేరొక విధంగా కూడా పేర్కొనవచ్చు. అవి:
 

1. నియంతృత్వ ప్రణాళిక:

* ఒక నియంతృత్వ వ్యక్తి లేదా ప్రభుత్వం చేతిలో ప్రణాళిక నియంత్రణ ఉంటే అది నియంతృత్వ ప్రణాళిక.
 

2. ప్రజాస్వామ్య ప్రణాళిక:

* ఈ ప్రణాళికలో లక్ష్యాలు, వనరుల కేటాయింపులను ప్రజాప్రతినిధులు నిర్ణయిస్తారు.
* ఈ ప్రణాళికలో ఉత్పత్తి, ఆర్థిక కార్యకలాపాలను ప్రభుత్వం నిర్ణయించదు.
* ప్రణాళికా సంఘం తయారు చేసిన ప్రణాళికలను మార్చే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

 

3. శాశ్వత ప్రణాళిక:

* ఒకసారి ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలను రూపొందిస్తే అవి దీర్ఘకాలంలో కూడా అమలు అవుతాయి. వాటిని మధ్యలో ఆపివేయడం లాంటిది జరగదు.
 

4. అత్యవసర ప్రణాళిక:

* ఆర్థిక వ్యవస్థలో అసమతౌల్యాలు ఏర్పడినప్పుడు, వాటిని తొలగించడానికి తాత్కాలికంగా ప్రవేశపెట్టేదే అత్యవసర ప్రణాళిక. అత్యవసర పరిస్థితులు తొలిగిపోయిన తర్వాత ఈ ప్రణాళికను రద్దు చేస్తారు.
 

5. సాధారణ ప్రణాళిక:

* ఇందులో స్థూల సమస్యలనే ప్రస్తావిస్తారు. స్థూల మార్గదర్శకాలు మాత్రమే ఉంటాయి.
 

6. వివరణాత్మక ప్రణాళిక:

* స్థూల మార్గదర్శకాలే కాకుండా వాటిని సాధించడానికి పూర్తి వివరాలు కూడా ఉంటాయి.
 

7. కరెక్టివ్ ప్లాన్: (Corrective plan)
* బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో తరచూ వ్యాపార చక్రాలు సంభవిస్తూ ఉంటాయి. ఆ వ్యాపార చక్రాల నియంత్రణకు తయారు చేసే ప్రణాళికను Anticyclical planning లేదా Corrective plan అని అంటారు.

 

8. డెవలప్‌మెంట్ ప్లాన్:
* ఆర్థికాభివృద్ధి సాధన కోసం వెనుకబడిన దేశాల్లో అవలంబించే ప్రణాళిక. ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగితను పెంచడమే దీని లక్ష్యం. ఇది కరెక్టివ్ ప్లాన్ కంటే కూడా విస్తృతమైంది.

 

9. మిశ్రమ ఆర్థిక ప్రణాళిక:
* ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కలిసి ఉండే ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. అందుకు తగిన ప్రణాళికే mixed economy planning.
* మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రయివేటు రంగానికి స్వేచ్ఛ ఉంటుంది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థకు ఉన్నంత స్వేచ్ఛ ఉండదు.

 

ప్రణాళికా విరామం (plan holiday):
* ఒక planకి మరొక planకి మధ్య వచ్చిన విరామాన్నే ప్రణాళికా విరామం (plan holiday) అంటారు.
* భారత్‌లో 1966 - 69 మధ్య 3 సంవత్సరాలు, 1990 - 92 మధ్య 2 సంవత్సరాలు ప్రణాళికా విరామం వచ్చింది.

 

భారత పంచవర్ష ప్రణాళికల దీర్ఘకాలిక లక్ష్యాలు:
   1. జాతీయ, తలసరి ఆదాయం పెంచడానికి గరిష్ఠ ఉత్పత్తి సాధించడం.
   2. వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి.
   3. పారిశ్రామిక ప్రగతి.
   4. సంపూర్ణ ఉద్యోగిత సాధించడం.
   5. ఆదాయ సంపదల అసమానతలు తగ్గించడం.
   6. సాంఘిక న్యాయం చేకూర్చడం.
   7. ప్రాంతీయ అసమానతలను తగ్గించడం.
   8. జననాణ్యత మెరుగుపరచడానికి సాంఘిక రంగ అభివృద్ధి.

 

భారత ప్రణాళికల లక్షణాలు:
* ఇవి సూచనాత్మక ప్రణాళికలు
* సమగ్ర ప్రణాళికలు
* భౌతిక, విత్తప్రణాళికలు
ప్రజాస్వామ్య వికేంద్రీకృత ప్రణాళికలు
* దీర్ఘకాలిక స్వభావాన్ని కూడా కలిగి ఉన్నాయి.

 

ప్రణాళికా వనరులు:
   1. దేశీయ వనరులు
   2. విదేశీయ వనరులు
   3. లోటు విత్తం

 

1. దేశీయ వనరులు:
* ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు
* మార్కెట్ నుంచి తీసుకునే రుణాలు
* చిన్న మొత్తాల పొదుపులు, PFలు
* ప్రభుత్వ సంస్థల ఉత్పత్తులు, ధరలు పెంచడం, అదనపు పన్ను విధించడం
* కరెంటు రెవెన్యూ నుంచి మిగులు

 

పంచవర్ష ప్రణాళికలు - వనరుల సేకరణ, కేటాయింపులు
* ప్రణాళికా పెట్టుబడులకు ద్రవ్య వనరులను మూడు రకాలుగా సేకరిస్తారు. అవి

 

      1. దేశీయ బడ్జెటు వనరులు
      2. విదేశీ సహాయం
      3. లోటు ద్రవ్యం

 

1. దేశీయ బడ్జెటు వనరులు: దేశీయ బడ్జెట్ వనరులు అంతర్గతంగా దేశ ప్రజలు, సంస్థల నుంచి ప్రభుత్వం సేకరిస్తుంది. ప్రణాళికా వ్యయానికి అవసరమైన విత్త వనరుల్లో అత్యధిక భాగం దేశీయ వనరులే. అవి:
 

ప్రస్తుత రాబడి మిగులు: ప్రస్తుతరాబడిలో వ్యయంపోగా మిగిలేది
* పబ్లిక్ రంగ సంస్థల వాటా

 

సేకరించిన అంతర్గత ప్రైవేటు పొదుపు: మార్కెటు రుణాలు, చిన్న పొదుపు మొత్తాలు, ప్రావిడెంట్ పన్ను లాంటివి.
* పన్నులు, సుంకాల ద్వారా అదనంగా వసూలైన ఆదాయం.

 

2. విదేశీ సహాయం/వనరులు

* విదేశాల నుంచి అందిన గ్రాంట్లు, రుణాలు.
* అంతర్జాతీయ ద్రవ్యసంస్థలైన IDBI, IMF, IDA, ADB ప్రపంచ బ్యాంకు నుంచి స్వీకరించిన రుణాలను విదేశీ సహాయంగా వ్యవహరిస్తారు.

 

3. లోటు ద్రవ్యం: దేశీయ బడ్జెట్ వనరులు, విదేశీ సహాయం వల్ల సేకరించిన ద్రవ్య వనరులు అభివృద్ధి పథకాల అమలుకు సరిపోవు. ప్రణాళికల వివిధ పథకాల అమలుకు ఏర్పడిన రాబడి లోటును ప్రభుత్వం లోటు ద్రవ్య విధానం ద్వారా సమకూర్చుకుంటుంది.
* ప్రణాళికల అమలుకు సేకరించే విత్త వనరుల్లో దేశీయ బడ్జెట్ వనరులు ఎంతో ముఖ్యమైనవి. దేశ పౌరులు, సంస్థల ప్రస్తుత రాబడి (current revenue) నుంచి సమకూరే దేశీయ వనరులను ప్రస్తుత వ్యయానికి ఉపయోగిస్తారు. ప్రస్తుత పబ్లిక్ వ్యయాన్ని తగ్గించి ప్రస్తుత రాబడి మిగులును ఆర్థికాభివృద్ధికి తప్పనిసరిగా ఉపయోగించాల్సిందని సూచించిన మొదటి Taxation enquiry commission ఛైర్మన్ వి.టి. కృష్ణమాచారి ప్రతిపాదనను ప్రణాళికా సంఘం 1950 - 51లో ఆమోదించింది. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత రాబడిలో మిగులు చూపించలేకపోతున్నాయి.
* వివిధ ప్రణాళికల్లో వ్యయానికి అవసరమైన ద్రవ్య వనరుల సేకరణ వివరాలు కింది పట్టికలో చూడొచ్చు.

 

మొదటి ప్రణాళిక నుంచి 8వ ప్రణాళిక వరకు వివిధ వ్యయాలకు ద్రవ్య వనరుల సేకరణ: 
* పంచవర్ష ప్రణాళికల వనరులు అనేక రంగాల మధ్య కేటాయిస్తారు. అందులో ముఖ్యమైనవి.

 

1. వ్యవసాయం
2. ఇంధనం, నీటిపారుదల
3. పరిశ్రమలు
4. రవాణా, సమాచారం
5. సాంఘిక సేవలు
* దేశీయ వనరులు సరిపోకపోతే విదేశీ సహాయం తీసుకుంటారు. విదేశీ సహాయం గ్రాంట్ల రూపంలో లభిస్తుంది.

ప్రణాళికల్లో వృద్ధి నమూనాలు

* మన పంచవర్ష ప్రణాళికలకు రెండు వృద్ధి నమూనాలు ఆధారం అవి:
 

2 నుంచి 7వ ప్రణాళిక వరకు నెహ్రూ మహలనోబిస్ నమూనా:
       1956లో అమలు చేసిన రెండో పంచవర్ష ప్రణాళికను భారీ పెట్టుబడుల వ్యూహం ఆధారంగా రూపొందించారు. ఆర్థికాభివృద్ధికి అవసరమైన కీలక రంగాలు భారీ, మూలధన పరిశ్రమలు; అవస్థాపన, పబ్లిక్‌రంగ పెట్టుబడులతో జరగాలని, పబ్లిక్ రంగంలో ఈ రెండు రంగాలు అభివృద్ధి చెందితే ప్రైవేటు రంగ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని భావించారు. 7వ పంచవర్ష ప్రణాళిక వరకు ఈ వృద్ధి నమూనా ఆధారంగా ప్రణాళికల రూపకల్పన జరిగింది. ఈ వృద్ధి నమూనాను 2వ పంచవర్ష ప్రణాళికలో చర్చించారు.

Posted Date : 15-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ 2019-20 

బడ్జెట్‌ అధ్యయనం ద్వారా రాష్ట్ర పాలనకు సంబంధించి స్థూలమైన అవగాహన ఏర్పడుతుంది. ప్రభుత్వ ప్రాధాన్యాలు, సంక్షేమ పథకాల అమలు, వివిధ విభాగాలకు కేటాయించిన నిధుల వివరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. ఒక్కోసారి కేటాయింపుల శాతాలపై ప్రశ్నలు వస్తున్నాయి. వాటిపైనా దృష్టి పెట్టాలి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను 2019 జులై 12న తాత్కాలిక శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. 2019-20 ఏడాదికి మొత్తం బడ్జెట్‌ వ్యయం రూ.2,27,974.99 కోట్లుగా అంచనా వేశారు. ఇది 2018-19 నాటి రూ.1,91,063.61 కోట్ల కంటే 19.32 శాతం అధికం. 2019-20 మొత్తం బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94 కోట్లు, మూలధన వ్యయం రూ.32,293.39 కోట్లు, ప్రజారుణం తిరిగి చెల్లింపు రూ.13,417 కోట్లు, లోన్లు, అడ్వాన్స్‌లు రూ.1,788.67 కోట్లుగా అంచనా వేశారు. గత బడ్జెట్‌ (2018-19)తో పోలిస్తే 2019-20 బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయంలో సుమారు 20.10 శాతం, మూలధన వ్యయంలో 12.60 శాతం పెరుగుదలను అంచనా వేశారు. 2019-20 బడ్జెట్‌లో రెవెన్యూ లోటు సుమారు రూ.1,778.52 కోట్లుగా అంచనా వేశారు. ఇది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ్బబిళీదీశ్శిలో 0.17%గా ఉంది. వ్యయలోటు (విత్తలోటు)ను సుమారు రూ.35,260.58 కోట్లుగా అంచనా వేశారు. ఇది జీఎస్‌డీపీ లో 3.30% శాతంగా ఉంది. 2019-20 రాష్ట్ర బడ్జెట్‌ రాబడుల్లో రెవెన్యూ రాబడులు రూ.1,78,697.42 కోట్లు, మూలధన రాబడి రూ.49,277.58 కోట్లు, ప్రజారుణం రూ.46,921 కోట్లు, లోన్ల రికవరీ రూ.600 కోట్లు, నికర ప్రజాఖాతా రూ.1,756.58 కోట్లుగా అంచనా వేశారు.

2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో రెవెన్యూ, మూలధన ఖాతాల నుంచి ఆర్థిక సేవలకు రూ.86,185.63 కోట్లు (మొత్తం బడ్జెట్‌లో 37.80%), సాంఘిక సేవలకు రూ.75,465.04 కోట్లు (33.10%), సాధారణ సేవలపై రూ.66,324.35 కోట్లు (29.09%) వ్యయం చేయనున్నారు.

ప్రజారుణం: 2019-20 రాష్ట్ర బడ్జెట్‌ల అంచనాల ప్రకారం మొత్తం ప్రజారుణం రూ.2,91,345 కోట్లు. ఇది మొత్తం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ్బబిళీదీశ్శిలో 26.96%గా ఉంది. 2018-19 సవరించిన అంచనాల ప్రకారం రూ.2,58,928.17 కోట్లుగా ఉంది. ఇది జీఎస్‌డీపీలో 28.18%. రాష్ట్ర ప్రభుత్వ ప్రజారుణంలో బహిరంగ మార్కెట్‌ లోన్‌లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు, ఇతర సంస్థల నుంచి రుణాలు, చిన్న మొత్తాల పొదుపు, ప్రావిడెంట్‌ఫండ్, డిపాజిట్లు, నిల్వ నిధులు కలిసి ఉంటాయి.

కేటాయింపులు
నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న ‘నవరత్నాలు’లో భాగంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గృహరంగం, సంక్షేమ రంగాలకు సంబంధించిన 9 క్రాస్‌ కటింగ్‌ థీమ్స్‌తో కూడిన సమగ్ర సంక్షేమ విధానం కింద అనేక నూతన పథకాలను బడ్జెట్‌లో భాగంగా ప్రకటించింది.

మధ్యాహ్న భోజన పథకం: దేశంలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకానికి 2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1077 కోట్లు కేటాయించారు. ఈ పథకానికి అయ్యే వ్యయ భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 : 40 నిష్పత్తిలో భరిస్తాయి. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు సంబంధించి 100% వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.

జగనన్న విద్యాదీవెన పథకం: మెట్రిక్‌ అనంతర కోర్సుల్లో తల్లితండ్రులపై భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని అమలు చేస్తుంది. దీనికి బడ్జెట్‌లో రూ.4,923.3 కోట్లు కేటాయించారు. ఏటా ఒక్కో విద్యార్థికి రూ.20,000 చొప్పున అందించనున్నారు.

108 సేవలు: అదనంగా 432 అంబులెన్స్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. బడ్జెట్‌లో రూ.143.38 కోట్లు కేటాయించారు.

104 సేవలు: దీనికి బడ్జెట్‌లో రూ.179.76 కోట్లు కేటాయించారు. అదనంగా 676 వాహనాలను సేకరించి సేవలందిస్తారు.

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా: ఈ పథకం కింద ప్రతి రైతుకు పంట కాలం ప్రారంభానికి ముందే ఏటా మే నెలలో రూ.12,500 పెట్టుబడి మద్దతును అందించనున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వ పథకం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.6000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6500 కలిపి ఇవ్వనుంది. ఈ పథకం కింద 64.06 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.8,750 కోట్లను కేటాయించారు.

వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణాలు: రైతులకు పరపతి వ్యయాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. దీనికోసం రూ.100 కోట్లు కేటాయించారు.

మత్స్యకారుల సంక్షేమం: చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చే సహాయాన్ని రూ.4000 నుంచి రూ.10000కు పెంచుతున్నట్లు పేర్కొంది. పెంచిన మొత్తాన్ని 2020 జనవరిలో పంపిణీ చేయనున్నారు. వీరి సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.200 కోట్లను కేటాయించారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమం: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చింది. షెడ్యూల్డ్‌ కులాల్లోని ఉపవర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గిరిజనులు పోషకాహారాన్ని పెంపొందించుకోవడానికి ఆహారబుట్ట పథకాన్ని అమలు చేస్తుంది. ఉచిత విద్యుత్‌ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు విద్యుత్‌ పరిమితిని 100 నుంచి 200 యూనిట్లకు పెంచాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ కుటుంబాలకు రూ.348.15 కోట్లు, ఎస్టీ కుటుంబాలకు రూ.81.70 కోట్లు కేటాయించారు. రాష్ట్రప్రభుత్వం 2019-20 సంవత్సరానికి ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.15,000.86 కోట్లు; ఎస్టీ ఉపప్రణాళిక కింద రూ.4,988.53 కోట్లు కేటాయించింది.

వెనుకబడిన తరగతుల సంక్షేమం: వెనుకబడిన తరగతుల్లోని 139 కులాల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి 139 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వెనుకబడిన తరగతుల్లో (బీసీ) 29 కులాలకు 29 ప్రత్యేక కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్‌ల ద్వారా వచ్చే ఏడాది నుంచి వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 7.82 లక్షల మంది బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2,218.14 కోట్లు కేటాయించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.7271.45 కోట్లు; వెనుకబడిన తరగతుల ఉపప్రణాళిక కింద రూ.15,061 కోట్లు కేటాయించారు.

మైనారిటీల సంక్షేమం: వక్ఫ్‌ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా వాటి పరిరక్షణ కోసం రూ.20 కోట్లు, వక్ఫ్‌ ఆస్తుల సర్వే కోసం రూ.20 కోట్లను 2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించారు. వైఎస్‌ఆర్‌ షాదీ కా తోఫా కింద మైనారిటీ యువతుల వివాహాలకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.50,000 నుంచి రూ. 1,00,000కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇమామ్‌ల గౌరవవేతనాన్ని నెలకు రూ.10,000కు, మౌజిమ్‌లకు నెలకు రూ.5,000కు పెంచాలని నిర్ణయించారు. పాస్టర్లకు నెలకు రూ.5,000 గౌరవ వేతనాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మైనారిటీల సంక్షేమం కోసం వివిధ సంక్షేమ పథకాల కింద 2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2,106 కోట్లను కేటాయించారు.

కాపు సంక్షేమం: 2019-20 సంవత్సరానికి కాపు సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.2000 కోట్లు కేటాయించారు.

బ్రాహ్మణ సంక్షేమం: ధూప, దీప, నైవేద్యం కార్యక్రమం కోసం 2019-20 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.234 కోట్లు;. బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించారు.

వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక: రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్‌ మొత్తాన్ని నెలకు రూ.2000 నుంచి రూ.2250కు పెంచింది. దీన్ని నాలుగేళ్లలో రూ.250 చొప్పున రూ.3000కు పెంచనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. డయాలసిస్‌ రోగులకు రూ.10,000 పెన్షన్‌ను అందించనున్నారు. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద లబ్ధిదారుల వయసు పరిమితిని 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. ఈ పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.15,746.58 కోట్లను కేటాయించారు.

జగనన్న అమ్మఒడి పథకం: దీని కింద లబ్ధిదారులందరికీ 2020 జనవరి 26న రూ.15,000 చొప్పున అందిస్తారు.2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.6,455.80 కోట్లు కేటాయించారు.

వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ: పేదవాళ్లకు నాణ్యమైన వైద్యసేవలు అందించే ఈ పథకానికి రూ.1740 కోట్లను కేటాయించారు. దీన్ని మరింత విస్తరించి వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్న అన్ని కుటుంబాలకు, వైద్య ఖర్చులు రూ.1000కు మించిన అన్ని కేసులకు వర్తింపజేస్తారు.

మహిళా సంక్షేమం: 2019-20లో ఈ పథకం కోసం రాష్ట్రంలోని 6,32,254 గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు రూ.1148 కోట్లు; 1,66,727 పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.648 కోట్లను కేటాయించారు.

వైఎస్‌ఆర్‌ గృహ నిర్మాణ పథకం: అయిదేళ్లలో 25 లక్షల గృహాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం బడ్జెట్‌లో రూ.8,615 కోట్లు కేటాయించింది.
 

Posted Date : 15-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

  ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి (2014 - 2019)

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికవ్యవస్థ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు రాష్ట్ర జీడీపీ, రంగాల వారీగా వృద్ధి రేట్లు తదితర వివరాలను తెలుసుకోవాలి. అన్నదాతల ఆదాయాన్ని పెంచడానికి, పారిశ్రామిక ప్రగతికి, సేవారంగంలో ముందంజలో ఉండటానికి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు, మిషన్ల గురించి అవగాహన పెంచుకోవాలి. సంబంధిత గణాంకాలనూ గుర్తుంచుకోవాలి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను 2014, జూన్‌ 2న విభజించడంతో నవ్యాంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. 2014 - 19 మధ్య అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రగతికి బాటలు వేస్తూ ఏడు మిషన్‌లతో అన్నిరంగాల్లో మార్పులు తీసుకొచ్చి రెండంకెల వృద్ధిరేటుకు ప్రయత్నించింది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం అన్నిదశల్లో సమాచార, సాంకేతిక విజ్ఞాన అప్లికేషన్స్‌ - రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌, సీఎఫ్‌ఎంఎస్‌, ఐ - ఏఎంఎస్‌ లాంటి నూతన విధానాలను ప్రవేశపెట్టింది. వ్యవసాయంలో రైతుకు రుణమాఫీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ప్రకృతి సేద్యం, నదుల అనుసంధానం, ఉద్యాన పంటల ప్రోత్సాహం లాంటి చర్యల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి కృషి చేసింది. పారిశ్రామిక సదస్సులు, విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రంలోని అనుకూల అంశాలను వివరిస్తూ సింగపూర్‌, జపాన్‌, దక్షిణకొరియా దేశాల నుంచి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామికాభివృద్ధికితోడ్పడింది.

ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే 2018 - 19 ప్రకారం రాష్ట్రం 1,62,970 చ.కి.మీ. విస్తీర్ణంతో దేశంలో 8వ స్థానం, జనాభాలో 4.10%తో 10వ స్థానంలో ఉంది. 2001 - 11 మధ్య రాష్ట్ర జనాభా వృద్ధిరేటు అతి తక్కువగా (9.21%) నమోదైంది. రాష్ట్ర జనాభాలో 29.47% మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. ఇది దేశ సగటు 31.16% కంటే తక్కువ. మనది గ్రామీణ ప్రధాన ఆర్థిక వ్యవస్థ.

రాష్ట్ర స్థూల ఆదాయం (GSDP)
సంవత్సర కాలంలో రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తయిన వస్తు సేవల మార్కెట్‌ విలువలను రాష్ట్ర స్థూల ఆదాయం అంటారు. ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక గణాంక శాఖ ప్రస్తుత, స్థిర ధరల్లో రాష్ట్ర స్థూల ఆదాయాన్ని లెక్కిస్తుంది. స్థిర ధరల కోసం 2011 - 12 ఏడాదిని ఆధార సంవత్సరంగా గుర్తించింది. ఆదాయ మదింపు కోసం ఆర్థిక వ్యవస్థను 3 స్థూల రంగాలు (ప్రాథమిక, ద్వితీయ, తృతీయ), 9 ప్రధాన రంగాలుగా విభజించి తిరిగి వాటిని 17 ఉపరంగాలుగా గుర్తించారు. వివిధ రంగాల నుంచి సేకరించే అంచనాలను బిజుతి GVA (Gross Value Added) at basic price అంటారు.

GSDP = GVA at basic prices + Net of product taxes and product subsidies

రాష్ట్రంలో జీఎస్‌డీపీ 2014-15లో (2011-12 ధరల్లో) రూ.4,44,564 కోట్లు కాగా 2018-19 నాటికి రూ.6,80,332 కోట్లకు పెరిగింది. GVA రూ.6,14,665 కోట్లు, GSDP ప్రస్తుత ధరల్లో రూ.9,33,402 కోట్లుగా ఉంది.

స్థూల దేశీయ జిల్లాల ఆదాయం (GDDP)
నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 13 జిల్ల్లాలు ఉన్నాయి. రాష్ట్రానికి ఆదాయాన్ని అందించడంలో కొన్ని జిల్లాలు ముందుండగా మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. జిల్లాల మధ్య ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాల నుంచి లభించే ఆదాయాన్ని స్థూల దేశీయ జిల్లాల ఆదాయం అంటారు. అన్ని జిల్లాల ఆదాయాలను కలిపితే స్థూల రాష్ట్ర దేశీయ ఆదాయం వస్తుంది.

ఆదాయంలో ముందున్న జిల్లాలు
1) విశాఖపట్నం 2) కృష్ణా 3) తూర్పు గోదావరి 4) గుంటూరు

అతి తక్కువ ఆదాయాన్నిచ్చే జిల్లాలు
1) విజయనగరం 2) శ్రీకాకుళం 3) కడప 4) ప్రకాశం

తలసరి ఆదాయం
రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర జనాభాకు పంచగా సగటున ఒక్కొక్కరికి వచ్చే ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. రాష్ట్రంలో జనాభా వృద్ధిరేటు తక్కువగా ఉండటం వల్ల ఈ అయిదేళ్ల కాలంలో తలసరి ఆదాయం స్థిర ధరల్లో రూ.79,174 నుంచి రూ.1,17,261 కు పెరిగింది. 2018 - 19 నాటికి ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం రూ.1,64,025 కు పెరిగింది.

తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న జిల్లాలు
1) విశాఖపట్నం 2) కృష్ణా 3) పశ్చిమ గోదావరి 4) నెల్లూరు

తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాలు
1) శ్రీకాకుళం 2) విజయనగరం 3) అనంతపురం 4) కర్నూలు

వివిధ రంగాల వాటా
రాష్ట్రానికి ఆదాయం స్థూలంగా మూడు రంగాల నుంచి లభిస్తుంది.

2018-19లో ఆయా రంగాల వాటా
1) ప్రాథమిక రంగం - 33.64% 2) ద్వితీయ రంగం - 23.38% 3) తృతీయ రంగం - 42.98%

విభజన తర్వాత రాష్ట్ర ఆదాయంలో ప్రాథమిక రంగం వాటా పెరిగింది. ద్వితీయ, తృతీయ రంగాల వాటాలు తగ్గాయి.

శ్వేతపత్రం ప్రకారం....
2019 మే 30న ఏర్పాటైన కొత్త ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం జీఎస్‌డీపీ వృద్ధిరేటు 1999 - 2004 మధ్య 8.19%, 2004 - 2009 మధ్య అత్యధికంగా 15.08%, 2009 - 14 మధ్య 12.93% గా నమోదైంది. విభజన తర్వాత 2014 - 19 మధ్య కాలంలో 14.96% గా ఉంది. జాతీయ సగటు వృద్ధిరేటు (7%) కంటే రాష్ట్రం ఎక్కువ వృద్ధిరేటు (రెండంకెల వృద్ధిరేటు) సాధించింది.

ప్రాథమిక రంగంలోని ఉపరంగాలు
వ్యవసాయం, పశుపోషణ, ఉద్యాన పంటలు, అడవులు, చేపలు పట్టడం లాంటివన్నీ ప్రాథమిక రంగంలోని ఉపరంగాలు. వీటిలో 2018 - 19లో చేపలు పట్టడం (19.0%), ఉద్యాన పంటల్లో (16%) అత్యధిక వృద్ధిరేటు నమోదవగా, వ్యవసాయంలో అతి తక్కువగా రుణాత్మక (-9.83%) వృద్ధిరేటు నమోదైంది. వర్షపాతం (-34.3%) లోటు వల్ల వృద్ధి తగ్గింది. నూతన ప్రభుత్వ శ్వేతపత్రం ప్రకారం 2014 - 19 మధ్య వ్యవసాయంలో రుణాత్మక వృద్ధిరేటు (-4.12%) నమోదైంది.

ద్వితీయ రంగంలోని ఉపరంగాలు
తయారీ రంగం; గనులు, క్వారీలు, నిర్మాణం; విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా ద్వితీయ రంగంలోని ఉపరంగాలు. వీటిలో విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా 10.72%; తయారీ రంగం 10.56%, గనుల తవ్వకం 10.34%, నిర్మాణ రంగంలో 9.55% వృద్ధి నమోదైంది.

తృతీయ (సేవా) రంగంలోని ఉపరంగాలు
వ్యాపారాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్‌ ఎస్టేట్‌ గృహాలు, రవాణా, రైల్వే, కమ్యూనికేషన్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, ప్రభుత్వ పాలన, ఇతర సేవలన్నీ తృతీయ రంగంలోని ఉపరంగాలు. వీటిలో బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల్లో అత్యధికంగా 12.90%, రైల్వేలో అత్యల్పంగా 8.4% వృద్ధిరేటు నమోదైంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో వృద్ధిరేటు పెరిగి ఆధునిక సాంకేతికత, మహిళా సాధికారత, నైపుణ్యం గల యువత లాంటి అంశాల్లో ముందంజలో ఉంది. కానీ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భారీ పరిశ్రమలు తక్కువగా ఉండటం; ఐటీ కంపెనీలున్న నగరాలు లేకపోవడంతో ఆదాయానికి, ఉపాధికి ప్రాథమిక రంగంపై ఆధారపడాల్సి వచ్చింది. అర్థశాస్త్రం ప్రకారం వెనుకబడిన ఆర్థిక వ్యవస్థల్లో మాత్రమే ఈ లక్షణం కనిపిస్తుంది.

Posted Date : 15-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత ఆర్థిక ప్రణాళికా వ్యవస్థ

1. మొదటి పంచవర్ష ప్రణాళికలో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి?
జ: అనుకూల రుతుపవనాలు

 

2. నాలుగో పంచవర్ష ప్రణాళిక విజయవంతం కాకపోవడానికి ఏర్పడిన ప్రధాన అవరోధం ఏది?
     1) బంగ్లాదేశ్ కాందీశీకుల సమస్య      2) రుతుపవనాల వైఫల్యం      3) పాకిస్థాన్‌తో యుద్ధం      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

3. ఇందిరాగాంధీ రద్దు చేసిన ప్రణాళిక ఏది?
జ: నిరంతర ప్రణాళిక

 

4. ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో భారతదేశ అభివృద్ధికి సంబంధించిన ప్రధాన బాధ్యత ప్రభుత్వ రంగానికి మారింది?
జ: 2వ

 

5. కిందివాటిలో మహలనోబిస్ నాలుగు రంగాల నమూనాలో అంశం కానిది ఏది?
     1) విదేశీ వ్యాపార రంగం                                      2) వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసే రంగం
     3) మూలధన వస్తువులను ఉత్పత్తి చేసే రంగం     4) సేవలను ఉత్పత్తి చేసే రంగం
జ: 1(విదేశీ వ్యాపార రంగం)

 

6. నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యం ఇచ్చిన పంచవర్ష ప్రణాళిక ఏది?
జ: 6వ

 

7. పంచవర్ష ప్రణాళికలు లేని కాలం ఏది?
జ: 1967

 

8. ప్రజా ప్రణాళికను రూపొందించింది ఎవరు?
జ: ఎం.ఎన్. రాయ్

 

9. సామ్యవాద దృక్పథంతో రూపొందించిన పంచవర్ష ప్రణాళిక ఏది?
జ: 2వ

 

10. కనీస అవసరాల కార్యక్రమం ప్రారంభించిన ప్రణాళిక ఏది?
జ: 5వ

 

11. ముఖర్జీ ఫార్ములా దేని స్థానంలో వచ్చింది?
జ: గాడ్గిల్ ఫార్ములా

 

12. మనదేశానికి ప్రణాళికా సంఘం అవసరమని సూచించిన మొదటి జాతీయ నాయకుడు ఎవరు?
జ: సుభాష్ చంద్రబోస్

 

13. కిందివాటిలో సరికానిది ఏది?
     1) ప్రణాళికా సంఘం - 1950, మార్చి 15
     2) ప్రణాళికలు - ఉమ్మడి జాబితా
     3) భారత ప్రణాళికల రూపశిల్పి - జవహర్‌లాల్ నెహ్రూ
     4) పిగ్మీ ప్రణాళికలు - రోలింగ్ ప్రణాళిక
జ: 4(పిగ్మీ ప్రణాళికలు - రోలింగ్ ప్రణాళిక)

 

14. కిందివాటిలో నాలుగో పంచవర్ష ప్రణాళికా కాలంలో చేపట్టని పథకం ఏది?
     1) పనికి ఆహార పథకం                       2) ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్
     3) కరవు ప్రాంతాల అభివృద్ధి పథకం     4) గ్రామీణ పనుల కార్యక్రమం
జ: 1(పనికి ఆహార పథకం)

 

15. ఆరో పంచవర్ష ప్రణాళిక అమలు చేసిన కాలం ఏది?
జ: 1980 - 85

 

16. భారత ఆర్థిక వ్యవస్థను సాధారణంగా కిందివిధంగా వర్ణిస్తారు?
   1) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ    2) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ    3) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ     4) ఏదీకాదు
జ: 2(మిశ్రమ ఆర్థిక వ్యవస్థ)

 

17. హరడ్ - డోమర్ వృద్ధి నమూనా ఏ ప్రణాళికకు ఆధారమైంది?
జ: 1వ

 

18. మౌలిక, భారీ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రణాళిక ఏది?
జ: 2వ

 

19. సామాజిక అభివృద్ధి పథకాన్ని (సీడీపీ) ఒక తీర్థయాత్రగా ఎవరు వర్ణించారు?
జ: ఎస్.కె. డే

 

20. ధైర్యంతో కూడిన ప్రణాళిక అని కిందివాటిలో ఏ ప్రణాళికను పిలుస్తారు?
     1) 1వ      2) 2వ      3) 10వ      4) 11వ
జ: 2(2వ)

 

21. విదేశీ మారకద్రవ్య నిరోధక చట్టం (ఫెరా) రూపొందించిన సంవత్సరం ఏది?
జ: 1973

 

22. కిందివాటిలో నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగం కానిది ఏది?
     1) స్ట్రక్చరల్ రిఫారమ్స్ (నిర్మాణాత్మక సంస్కరణలు)     2) విత్తరంగ సంస్కరణలు
     3) జనాభా విధానం                                                    4) కోశ సంస్కరణలు
జ: 3(జనాభా విధానం)

 

23. 3వ పంచవర్ష ప్రణాళిక ఎవరి నమూనా ప్రకారం రూపొందించారు?
జ: అశోక్ మెహతా

 

24. భారతదేశంలో నిరంతర ప్రణాళికలను రూపొందించిన ఆర్థికవేత్త ఎవరు?
జ: లకడవాలా

 

25. స్వాతంత్య్రం తర్వాత ప్రణాళికల్లో జరిగిన కృషి వల్ల భారత ఆర్థిక వ్యవస్థను ఏవిధంగా పేర్కొంటారు?
జ: అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ

 

26. 4వ పంచవర్ష ప్రణాళిక దేనిపై ఆధారపడి ఉంది?
జ: గాడ్గిల్ నమూనా

 

27. కిందివాటిలో 8వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు ఏవి?
     ఎ) జనాభా వృద్ధిని నిరోధించడం
     బి) వృద్ధి ప్రక్రియను కొనసాగించేందుకు అవస్థాపనా సదుపాయాలను బలోపేతం చేయడం
     సి) శతాబ్ద అంతానికి సంపూర్ణ ఉద్యోగిత సాధించేందుకు సరిపడే ఉపాధి సృష్టించడం
జ: ఎ, బి, సి

 

28. కిందివాటిలో రాజా చెల్లయ్య కమిటీని ఏ సంస్కరణల కోసం నియమించారు?
    1) పన్ను సంస్కరణలు    2) భూసంస్కరణలు    3) సేవా సంస్కరణలు    4) వర్తక సంస్కరణలు
జ: 1(పన్ను సంస్కరణలు)

 

29. భారత్‌లో ప్రణాళికల దీర్ఘకాలిక లక్ష్యం-
     1) సాంఘిక న్యాయం                                                            2) ఆర్థిక స్వావలంబన
     3) ప్రజల జీవన ప్రమాణస్థాయిని పెంచుతూ అధికవృద్ధి రేటు     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

30. పేదరిక నిర్మూలన, స్వావలంబన లక్ష్యాలుగా ప్రారంభించిన ప్రణాళిక ఏది?
జ: 5వ

 

31. నిధుల మంజూరు విషయంలో మొదటిసారి ప్రణాళికా సంఘం విచక్షణాత్మక పరిధిని తగ్గించిన ఫార్ములా-
జ: గాడ్గిల్ ఫార్ములా

 

32. సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు?
జ: 2వ

 

33. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఏ ప్రణాళికా కాలంలో ఏర్పడింది?
జ: 2వ

 

34. ఎడారి, కొండ ప్రాంతాల్లో 100 రోజులకు తక్కువ కాకుండా లాభదాయకమైన ఉపాధిని అందించేందుకు ప్రవేశపెట్టిన పథకం ఏది?
జ: ఉపాధి హామీ పథకం

 

35. అయిదో ప్రణాళిక ఎవరి నమూనా ప్రకారం రూపొందించారు?
జ: డి.పి. థర్

 

36. ప్రణాళికా సంఘానికి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
  1) రాజ్యాంగేతర సంస్థ   2) సలహా సంఘం   3) పార్లమెంటు చట్టంచే ఏర్పాటు చేసిన సంస్థ   4) అన్నీ సరైనవే
జ: 4(అన్నీ సరైనవే)

 

37. జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకాన్ని (ఎన్ఆర్ఈపీ) ఏ ప్రణాళికా కాలంలో ప్రారంభించారు?
జ: 6వ

 

38. కిందివాటిలో పంచవర్ష ప్రణాళికా విరామం ఏది?
     1) 1954 - 58      2) 1966 - 69      3) 1970 - 73      4) 1983 - 86
జ: 2(1966 - 69)

 

39. సింద్రీ ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేసిన పంచవర్ష ప్రణాళిక ఏది?
జ: 1వ

 

40. మొదటి ప్రణాళికలో అధిక ప్రాధాన్యం దేనికి ఇచ్చారు?
జ: సత్వర వ్యవసాయాభివృద్ధి, యుద్ధం, దేశ విభజన వల్ల విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం

 

41. 10వ పంచవర్ష ప్రణాళికా ప్రారంభం నాటికి శ్రమశక్తిలో బ్యాక్‌లాగ్ నిరుద్యోగిత శాతం ఎంత?
జ: 9%

 

42. హరిత విప్లవం ప్రారంభించిన కాలం ఏది?
జ: వార్షిక ప్రణాళిక

 

43. రెండు విదేశీదాడులను ఎదుర్కొన్న ప్రణాళిక ఏది?
జ: 3వ

 

44. 9వ ప్రణాళికలో అధిక ప్రణాళికా కేటాయింపులు ఏ రంగంపై జరిగాయి?
జ: రవాణా - సమాచారం

 

45. బొకారో - ఇనుము ఉక్కు కర్మాగారం ఏ ప్రణాళికలో స్థాపించారు?
జ: 4వ

 

46. పేదరికాన్ని గుడ్డివాడు సైతం చూడగలడు అని వ్యాఖ్యానించింది ఎవరు?
జ: అమర్త్యసేన్

 

47. భారత ప్రణాళికల రూపశిల్పి ఎవరు?
జ: జవహర్‌లాల్ నెహ్రూ

 

48. రెండో పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నుంచి భారతదేశం అవలంబించిన అభివృద్ధి వ్యూహం ఏ అంశాలపై ఆధారపడి ఉంది?
     ఎ) ఎగుమతుల ప్రోత్సాహం      బి) దిగుమతుల ప్రతిస్థాపన      సి) భారీ పరిశ్రమలు      డి) తేలిక పరిశ్రమలు
జ: బి, సి మాత్రమే

 

49. రోలింగ్ ప్రణాళికను ఏ కాలంలో రూపొందించారు?
జ: 1978 - 80

 

50. 5వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఏమిటి?
జ: పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వయంసమృద్ధిని సాధించడం

 

51. ఏ ప్రణాళికా కాలంలో సాధారణ ధరల స్థాయిలో తగ్గుదల ఏర్పడింది?
జ: 1వ

 

52. కిందివాటిలో ఆర్థికవేత్త లకడావాలా ప్రవేశపెట్టింది ఏది?
      1) మానవ వనరుల ప్రణాళిక       2) రోలింగ్ ప్రణాళిక       3) అభివృద్ధి ప్రణాళిక       4) ఆర్థిక ప్రణాళిక
జ: 2(రోలింగ్ ప్రణాళిక)

 

53. సేన్ పేదరికపు గీత సమాజంలో సంపద పంపిణీ కంటే సంక్షేమ పంపిణీని కొలిచిందని పేర్కొనడానికి కారణం...
జ: పేదరికపు గీతకు ప్రతి వ్యక్తి ఆదాయం ఎంత తక్కువ, ఎంత ఎక్కువ ఉందో కొలిచాడు

 

54. మన దేశ మొదటి పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యం ఇచ్చింది?
జ: వ్యవసాయ రంగం

 

55. పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు?
జ: 2వ

 

56. ప్రణాళికలను మొదటిసారిగా ప్రారంభించిన దేశం ఏది?
జ: రష్యా

 

57. 20 సూత్రాల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రణాళిక ఏది?
జ: 5వ ప్రణాళిక (1975, జులై)

 

58. ఒరిస్సాలోని రూర్కెలా ఇనుము - ఉక్కు కర్మాగార స్థాపనకు సహాయం చేసిన దేశం ఏది?
జ: పశ్చిమ జర్మనీ

 

59. పేదరికపు తీవ్రతను అంచనా వేసేందుకు అతిపేద వర్గం అనే భావనను ఏ పంచవర్ష ప్రణాళికలో తీసుకొచ్చారు?
జ: 4వ

 

60. కిందివాటిలో రెండోతరం ఆర్థిక సంస్కరణలుగా వేటిని పిలుస్తారు?
      1) శ్రామిక రంగంలో సంస్కరణలు       2) వ్యవసాయ రంగంలో సంస్కరణలు 
      3) రాష్ట్రాలకు సంస్కరణల విస్తరణ       4) అన్నీ
జ: 4(అన్నీ)

 

61. 12వ పంచవర్ష ప్రణాళికా కాలం ఏది?
జ: 2012 - 17

 

62. భారతదేశంలో ప్రణాళికలు, వాటి లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి మార్గదర్శకంగా పనిచేసేవి ఏవి?
జ: ఆదేశిక సూత్రాలు

 

63. Bold Plan అని ఏ ప్రణాళికను పిలుస్తారు?
జ: 2వ

 

64. Exim Bankను ఏ ప్రణాళికలో స్థాపించారు?
జ: 6వ

Posted Date : 25-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రణాళికల కాలంలో రాష్ట్రాభివృద్ధి

పంచవర్ష ప్రణాళికలు, వాటి విజయాలు , వైఫల్యాలపై సమగ్ర అవగాహన పెంచుకుంటే అభివృద్ధికి సంబంధించిన అంశాలను తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ప్రణాళిక లక్ష్యాలు ఏమిటి, ఏయే రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు, ఎంత వరకు సఫలీకృతమయ్యారు, ఆ సమయంలో ఎలాంటి పథకాలను అమలు చేశారు.. ఇలాంటి విషయాలపై అభ్యర్థులు దృష్టి పెట్టాలి. గణాంకాలను ఒకటికి రెండుసార్లు మననం చేసుకోవాలి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగిన భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల ద్వారా ఆర్థికాభివృద్ధికి ప్రయత్నించారు. కేంద్ర ప్రణాళికా సంఘం దేశం మొత్తానికి ఒకే విధమైన కేంద్రీకృత ప్రణాళికను రూపొందిస్తుంది. రాష్ట్రాల సభ్యత్వం కలిగిన జాతీయాభివృద్ధి మండలి ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమై చర్చించి నమూనా ప్రణాళికను ఆమోదిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రణాళికను అమలు చేస్తాయి.
                       1951-2017 మధ్య 12 పంచవర్ష ప్రణాళికలు; 1967-69, 1990-92 మధ్య రెండు వార్షిక ప్రణాళికలు, 1978-80 మధ్య ఒక నిరంతర ప్రణాళికను అమలుచేశారు. రాష్ట్రస్థాయిలో స్థానిక అవసరాలు, వనరులకు సరిపడే వార్షిక ప్రణాళికలను బడ్జెట్‌లో భాగంగా రాష్ట్రాలు తయారు చేసుకుంటాయి. వీటిని ప్రణాళికా సంఘం ఆమోదించాలి. రాష్ట్రస్థాయి ప్రణాళికలు జాతీయ ప్రణాళికల లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. రాష్ట్రాలకు కావాల్సిన ప్రణాళిక నిధులను ప్రణాళికా సంఘం అందిస్తుంది. రాష్ట్ర ప్రణాళికలను ఆయా రాష్ట్రాల ప్రణాళికా బోర్డులు రచిస్తాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక మంత్రి, ప్రణాళిక మంత్రి, సాంకేతిక నిపుణులు ప్రణాళిక బోర్డులో సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో పాలనాధికారి అధ్యక్షతన జిల్లా ప్రణాళిక, అభివృద్ధి కమిటీ; మండల స్థాయిలో మండల అభివృద్ధి అధికారి అధ్యక్షతన 25 మంది సభ్యులతో మండల ప్రణాళిక, అభివృద్ధి కమిటీ ప్రణాళిక అమలును పర్యవేక్షిస్తాయి.
2015, జనవరి 1 నుంచి ప్రణాళికా సంఘం స్థానంలో ప్రధానమంత్రి అధ్యక్షతన నీతిఆయోగ్‌ను న్యూదిల్లీలో ఏర్పాటు చేశారు. పంచవర్ష ప్రణాళికలు రద్దు చేసి మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక, ఏడేళ్ల విజన్, 15 ఏళ్ల దీర్ఘదర్శి ప్రణాళికను అమలు చేస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ సహా అన్ని రాష్ట్రాలు నీతిఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం కలిగి గతానికి భిన్నంగా ప్రణాళిక రచనలో పాలుపంచుకుంటున్నాయి. ఇది సహకార సమాఖ్యకు ముందడుగు. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేసిన ప్రణాళికలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కింది ప్రాధాన్యాలను కలిగి ఉన్నాయి.

ప్రాధాన్యాలు
రాష్ట్రంలో ముఖ్యంగా అభివృద్ధి అంశాలను ఎనిమిది ప్రాధాన్యత రంగాలుగా విభజించారు.
1. విద్యుత్తు
2. నీటిపారుదల
3. సామాజిక సేవలు
4. గ్రామీణాభివృద్ధి
5. రవాణా కమ్యూనికేషన్‌
6. వ్యవసాయం
7. పరిశ్రమలు, గనులు
8. ఇతర అంశాలు

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడే నాటికి (1956, నవంబరు )
1. దేశవ్యాప్తంగా రెండో పంచవర్ష ప్రణాళిక (1956-61) అమల్లో ఉంది. రాష్ట్రానికి రూ.179.8 కోట్లు కేటాయించారు.
* మొదటి మూడు ప్రాధాన్య అంశాలు స్థానాలు మార్చుకుంటూ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నీటిపారుదలకు రెండు, మూడో ప్రణాళికల్లో మొదటి ప్రాధాన్యం ఇచ్చి సగటున 35% నిధులు కేటాయించారు. వ్యవసాయాభివృద్ధికి ఆవశ్యకమైన నీటిపారుదల పెంపు కోసం నాగార్జునసాగర్, శ్రీశైలం లాంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రారంభించారు.
* పరిశ్రమల విస్తరణకు ఆధారమైన విద్యుత్‌ సౌకర్యాల వృద్ధి కోసం విద్యుత్‌ రంగానికి నాలుగు, ఐదు, ఎనిమిది, తొమ్మిదో పంచవర్ష ప్రణాళికల్లో మొదటి ప్రాధాన్యం కల్పించి దాదాపు 37% పైగా నిధులు కేటాయించారు. థర్మల్, జలవిద్యుత్‌ ప్లాంట్ల అభివృద్ధికి పునాదులు వేశారు.
* ఆరు, ఏడు, పది, పదకొండో పంచవర్ష ప్రణాళికల్లో సామాజిక సేవలకు దాదాపు 30% నిధులు కేటాయించి మొదటి ప్రాధాన్యం కల్పించారు. వివిధ సామాజిక సంక్షేమ పథకాలను అమలుచేశారు.
ఉదా: సబ్సిడీ బియ్యం, జనతావస్త్రాలు, మధ్యాహ్న భోజన పథకం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ.
* వ్యవసాయ అనుబంధ రంగాలకు సగటున అన్ని ప్రణాళికల్లోనూ 5%, గ్రామీణాభివృద్ధికి 6% నిధులు కేటాయించారు.
* పరిశ్రమల కోసం సగటున 4% నిధులు, రవాణా కమ్యూనికేషన్‌ లాంటి సేవల రంగాలకు 9% నిధులు మాత్రమే వెచ్చించారు. దీని ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రం సేవలరంగం అభివృద్ధిలో ముందంజలో ఉన్నప్పటికీ పారిశ్రామికంగా వెనుకబడింది. 90వ దశకం నుంచి ఈ ధోరణి ప్రస్పుటంగా కనిపిస్తుంది. ఫలితంగా వ్యవసాయ ఆర్థికవ్యవస్థ నుంచి సేవలే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది.
* 201217 మధ్యకాలంలో 12వ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి 2014, జూన్‌ 2న నవ్యాంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. ఆ సమయంలో పర్యవేక్షించ గల 50 అభివృద్ధి సూచికలను లక్ష్యంగా కలిగి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఈ ప్రణాళికలో మొత్తం రూ.3,42,842 కోట్ల కేటాయింపులతో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది.
జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు అమలుచేశారు. స్థానిక పరిస్థితులకు ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి సాధించారు.

 

గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు
 

1. ఆంధ్రప్రదేశ్‌ పదో పంచవర్ష ప్రణాళికలో అత్యధిక నిధుల వాటా ఏ రంగానిది? (గ్రూప్‌2, 2008)
1. శక్తి 2. నీటిపారుదల
3. సామాజిక రంగం 4. గ్రామీణ రంగం

2. కేంద్ర ప్రణాళికా సంఘం అనుమతి కోసం రాష్ట్ర పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను ఎవరు సమర్పిస్తారు? (గ్రూప్‌2, 2011)
1. ఆర్థిక మంత్రి
2. ముఖ్యమంత్రి
3. రెవెన్యూశాఖ మంత్రి
4. రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యదర్శి

3. ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో పంచవర్ష ప్రణాళిక విజయం ఎక్కువగా వేటి పనితీరుపై ఆధారపడి ఉంటుంది? (గ్రూప్‌2, 2011)
1. సేవల రంగం 2. పారిశ్రామిక రంగం
3. ఎగుమతుల రంగం 4. వ్యవసాయ రంగం

4. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పన్నెండో పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యం వేగవంతమైన, నిలకడగల, అధిక ...... (గ్రూప్‌2, 2012)
1. ఎగుమతుల వృద్ధి 2. మూలధన వృద్ధి
3. సమ్మిళిత వృద్ధి 4. అన్నీ

సమాధానాలు
1-3; 2--2; 3--4; 4--3.

Posted Date : 28-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌