• facebook
  • whatsapp
  • telegram

రాజపుత్రులు - సాంస్కృతిక సేవలు

రాజపుత్రుల కాలంలో ఎన్నో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు సంభవించాయి. ప్రధానంగా భూస్వాములు పుట్టుకొచ్చారు. హిందూమత ప్రాబల్యం ఎక్కువైంది. ఎన్నో కులాలు ఏర్పడ్డాయి. సమాజంలో స్త్రీల పరిస్థితి దిగజారిపోయింది. భారతదేశ చరిత్రలో రాజపుత్ర యుగం విశిష్టమైంది. దేశభక్తి, ధైర్య సాహసాలకు పేరుపొందిన రాజపుత్రులు సమర్థ పాలనను అందించారు. వీరి కాలంలోనే భూస్వామ్య వ్యవస్థ విస్తరించింది. హిందూమతంతో పాటు ఇస్లాం మతాన్నీ ఆదరించారు. భాషా, సాహిత్యాల అభివృద్ధికి; వాస్తు కళారంగాల విస్తరణకు కృషి చేశారు.

పరిపాలనా విధానం

రాజపుత్రుల రాజకీయ వ్యవస్థలో భూస్వామ్య వ్యవస్థ ప్రధానమైంది. రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. రాజు సర్వాధికారి. అతడి సార్వభౌమాధికారం దైవదత్తాధికార, సామాజిక ఒడంబడిక సిద్ధాంతాల మిశ్రమంగా ఉండేది. రాజుకు పాలనలో యువరాజు, పట్టమహిషి, మంత్రి మండలి సహాయపడేవారు. ప్రధాన రాజపురోహితుడు, జ్యోతిష్కుడు మంత్రి మండలిలో సభ్యులుగా ఉండేవారు. భుక్తి లేదా రాష్ట్ర ప్రతినిధులను రాజ ప్రతినిధులుగా పిలిచేవారు. విషయాలకు విషయపతి, గ్రామాలకు గ్రామపతి పాలకులుగా ఉండేవారు. ఉత్తర భారతదేశంలో భూస్వామ్య ప్రభువుల జోక్యం వల్ల గ్రామ స్వపరిపాలన కుంటుపడింది. కానీ ఇదే సమయంలో దక్షిణాదిన చోళుల పాలనలో గ్రామ స్వపరిపాలన చక్కగా సాగింది. రాజు సొంత సైన్యంతో పాటు భూస్వాముల సైన్యమూ రాజ్య విస్తరణలో సహాయపడేది. సైనిక సర్వీసు కేవలం రాజపుత్రులకే పరిమితమై ఉండేది. సైనిక వ్యయం అధికంగా ఉండటం వల్ల ప్రజలపై పన్ను భారం ఎక్కువగా ఉండేది. న్యాయపాలనలోనూ రాజే సర్వాధికారి. భుక్తుల్లో దండనాయకుడు న్యాయాన్ని నిర్ణయించేవాడు. రెవెన్యూ పాలనలో భూస్వాముల ఆధిపత్యం ఉండేది. భూమిశిస్తు నిర్ణయించి, వసూలు చేసే బాధ్యత వీరిదే.

సామాజిక వ్యవస్థ

రాజపుత్ర యుగం నాటి సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు సంభవించాయి. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ జటిలమయ్యాయి. కుమ్మరి, చేనేత, కంసాలి, మంగలి, జాలరి, మేళగాడు లాంటి కులాలు, ఉపకులాలతో పాటు రాజపుత్రులనే కొత్త కులం ఆవిర్భవించింది. కాయస్థ కులం ఈ కాలంలో ఉండేది. అధికంగా శ్రమించే కులాలను అస్పృశ్యులు, అంటరానివారుగా పరిగణించేవారు. భూస్వామ్య ప్రభువులుగా వ్యవహరించే రాణాలు, సామంతులు శక్తిమంతమైన వర్గంగా ఎదిగారు. ఓడిపోయిన రాజులు, స్థానిక అధిపతులు, యుద్ధ నిపుణులు, తెగ నాయకులు ప్రత్యేక భూస్వామ్య వర్గాలుగా ఆవిర్భవించారు. రాజు వీరికి దానం చేసిన భూములను భోగ లేదా జమీ భూములు అనేవారు. ప్రభుత్వ పదవులను వంశ పారంపర్యంగా అనుభవించేవారు. ఆడపిల్ల పుట్టగానే చంపే ఆచారం ఈ యుగంలోనే ప్రారంభమైంది. బహు భార్యత్వం, పరదా పద్ధతి, జౌహార్‌, సతీసహగమనం, బాల్య వివాహాలు లాంటి సాంఘిక దురాచారాల వల్ల స్త్రీల పరిస్థితి దయనీయంగా మారింది. స్త్రీలకు భూమి హక్కు ఉండేది కానీ విద్యావకాశాలు చాలా తక్కువ.

మత పరిస్థితులు

రాజపుత్ర యుగంలో జైన, బౌద్ధ మతాలు క్షీణించి హిందూమతం అభివృద్ధి చెందింది. శైవ, వైష్ణవ మతాలకు ఆదరణ పెరిగింది. భక్తి ఉద్యమాల ప్రభావంతో త్రిమూర్తుల ఆరాధన ప్రాధాన్యం పొందింది. ఉత్తర భారతదేశంలో శక్తి ఆరాధన (స్త్రీ దేవతల ఆరాధన) మరింత పెరిగింది. హిందువులు స్త్రీ మూర్తిని దుర్గ, కాళీ రూపాల్లో శివుడి అర్ధభాగంగా భావించి పూజించేవారు. అనేక దేవాలయాల నిర్మాణాలు రాజపుత్ర యుగంలో హిందూమతానికి దక్కిన ఆదరణకు సాక్ష్యాలుగా నిలిచాయి

ఆర్థిక పరిస్థితులు

రాజపుత్ర యుగం నాటి ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా భూస్వామ్య వ్యవస్థపై ఆధారపడింది. వ్యవసాయం చేయడంలో ప్రత్యక్ష పాత్ర లేనివారు, వ్యవసాయం ద్వారా వచ్చే మిగులు ఆదాయాన్ని వారసత్వ హక్కుగా అనుభవించే ఆర్థిక వ్యవస్థనే భూస్వామ్య వ్యవస్థ లేదా ఫ్యూడలిజంగా పేర్కొంటారు. ఈ యుగంలో అదనంగా పంటలు పండించి వాణిజ్యం చేసే ప్రయత్నాలు చేయలేదు. భూస్వామ్య ప్రభువుల ఒత్తిడి వల్ల రైతులు కనీస పంటలు పండించడమే మేలని భావించేవారు. వాణిజ్యం, నాణేల చెలామణి తగ్గిపోయాయి. రోమన్‌, ససానిడ్‌ రాజ్యాలు దెబ్బతినడంతో విదేశాల్లో భారతీయ వస్తువులకు గిరాకీ తగ్గి విదేశీ వాణిజ్యం క్షీణించింది. కోస్తా, బెంగాల్‌ ప్రాంతాల్లోని పట్టణాలు పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలతో వర్తక సంబంధాలను కొనసాగించాయి. పట్టణ ప్రాంతాల్లో ఉండే వృత్తి పనివారి సంఘాలకు (శ్రేణులు) ప్రాముఖ్యం తగ్గిపోయింది. భూమి ఇచ్చిన రాజు, సేద్యం చేసే రైతు ఇద్దరూ బలహీనపడి భూస్వామ్య ప్రభువులు బలపడ్డారు. భూమిశిస్తు కంటే అధికంగా పన్నులు చెల్లించడం వల్ల రైతులు ఆర్థికమాంద్యంలో కూరుకుపోయారు. దేవాలయ అధికారులూ రైతుల నుంచి పన్నులు వసూలు చేసేవారు. రాజులు, సామంతులు సైనిక వ్యయంతోపాటు దేవాలయాలు, కోటల నిర్మాణానికి, వాటి అలంకరణకు అధికంగా ఖర్చు చేసేవారు. ఈ విధానాలే అనంతర కాలంలో విదేశీయులు మనపై దాడిచేసి, దోపిడీ చేయడానికి కారణమయ్యాయి.

Posted Date : 14-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌