• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో జనాభా తీరుతెన్నులు

* ఒక ప్రదేశంలో నివసించే జనసంఖ్యను జనాభా (Population) అంటారు. ఒక ప్రదేశంలో ప్రతీ చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో నివసించే జనసంఖ్యను జన సాంద్రత  (Density) అంటారు.
* మరణాల రేటు తగ్గుతూ, జననాల రేటు పెరుగుతుండటం వల్ల మొత్తం జనాభాలో పెరుగుదల కనిపిస్తుంది. ఇలా జనాభా పెరగడాన్ని ‘జనాభా విస్ఫోటనం’ (Population Explosion) అంటారు. 
* ఆర్థికాభివృద్ధి అనేది భౌతిక, సహజ వనరులపైనే కాకుండా మానవ వనరులపై కూడా ఆధారపడుతుంది.
* మానవ వనరులు అంటే ముఖ్యంగా దేశంలోని జనాభా, వారి విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పౌష్ఠికాహార విధానాలు, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు, ఆదాయ పంపిణీ మొదలైనవి.
* మానవ వనరుల్లో ముఖ్యమైంది జనాభా.
* ఒక దేశంలోని జనాభా గుణాత్మకత  (Quality) అంటే జనాభా పరిమాణం, పెరుగుదల తీరు, పెరుగుదల రేటు అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. అందుకే జనాభా పెరుగుదలను ఒక దేశ అభివృద్ధిని నిర్దేశించే అంశంగా పేర్కొంటారు.  
* ఒక దేశ జనాభా అభిలషణీయ స్థాయి  (Optimum) కంటే తక్కువగా ఉంటే జనాభా పెరుగుదల ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. జనాభా అభిలషణీయ స్థాయిని దాటి ఇంకా పెరిగితే అది అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. సాధించిన ఆర్థికాభివృద్ధి పెరుగుదలనూ హరించివేస్తుంది.
* జనాభా పెరుగుదలకు సంబంధించి పలువురు ఆర్థికవేత్తలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. 
* ‘భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఒక అభివృద్ధి కారకం అవుతాడు’ - ఎడ్విన్‌ కానన్‌
* ‘భూమిపై పుట్టే ప్రతి బిడ్డ నరకాన్ని పెంపొందిస్తాడు’ - మాల్థస్‌
* 1798లో థామస్‌ రాబర్ట్‌ మాల్థస్‌ రాసిన “An Essay on the Principle of Population” గ్రంథంలో  మొదటిసారి శాస్త్రీయ జనాభా సిద్ధాంతాన్ని వివరించారు.
* ఆహార పదార్థాల సప్లయ్‌ వృద్ధికి, జనాభా వృద్ధికి మధ్య ఉన్న సంబంధాన్ని మాల్థస్‌ సిద్ధాంతం వివరిస్తుంది.
* జనాభా గుణశ్రేణిలో  (Geometric progression) పెరుగుతుందని, దీన్ని అరికట్టకుంటే ప్రతీ 25 ఏళ్లకు జనాభా రెట్టింపవుతుందని, ఆహార పదార్థాల ఉత్పత్తి నెమ్మదిగా అంకశ్రేణిలో పెరుగుతుందని మాల్థస్‌ సిద్ధాంతం పేర్కొంది. 
* మన దేశంలో జనాభా పెరుగుదలను అరికట్టేందుకు మొదటి ప్రణాళికా (1951-56) కాలంలో 1952లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే జనాభా నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది.
* మరణాల రేటు క్రమంగా తగ్గుతూ, జననాల రేటు పెరగడం వల్ల భారతదేశంలో జనాభా పెరుగుతోంది. ఇది జనాభా విస్ఫోటనానికి దారితీసింది.


దేశ జనాభా వేగంగా పెరగడానికి కారణాలు
* ఒక దేశ జనాభా వేగంగా పెరిగేందుకు మూడు కారణాలు ఉన్నాయి. అవి;
1. ఎక్కువ జననాల రేటు
2. సాపేక్ష అల్ప మరణాలు రేటు
3. వలస రావడం (భారతదేశ జనాభా వృద్ధిపై వలస ప్రభావం లేదు.)

మరణాల రేటు తగ్గడానికి కారణాలు:
* కరవులను నివారించడం. 
* రోగాల నియంత్రణ.   
* ఇతర కారణాలు
ఉదా: తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, విద్యా, వైద్య సౌకర్యాలను మెరుగుపరచడం.
 

అధిక జననాల రేటుకు కారణాలు:
జననాల రేటు పెరగడానికి రెండు రకాల కారణాలు -
1. ఆర్థిక కారణాలు    2. సాంఘిక కారణాలు


ఆర్థిక కారణాలు
1. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం 
2. నగరీకరణ
3. పేదరికం


సాంఘిక కారణాలు
1. వివాహానికి సర్వజన అంగీకారం 
2. చిన్న వయసులో వివాహం 
3. మతపరమైన సాంఘిక మూఢనమ్మకాలు
4. ఉమ్మడి కుటుంబం
5. నిరక్షరాస్యత
6. గర్భ నిరోధక పద్ధతులను పరిమితంగా ఉపయోగించడం


జాతీయ గణాంక సంస్థ నివేదిక
* జాతీయ గణాంక సంస్థ (National Statistical Office n- NSO), భారత ప్రభుత్వ కార్యక్రమాల అమలు, గణాంకాల మంత్రిత్వశాఖ (Ministry of Statistics and Programme Implementation Government of India - MOSPI) ఉమ్మడిగా ‘భారతదేశంలో మహిళలు, పురుషులు (Women and Men in India) - 2020 నివేదికను 2021, మార్చి 26న విడుదల చేశాయి.
* 2021లో మనదేశంలో మొత్తం జనాభా 136.13 కోట్లు ఉందని, స్త్రీ జనాభా శాతం 48.65%గా ఉన్నట్లు ఎన్‌ఎస్‌ఓ ప్రకటించింది. దేశంలో సగటు వార్షిక జనాభా వృద్ధిరేటు 2011లో 1.63% ఉండగా 2016 నాటికి 1.27 శాతానికి, 2021 నాటికి 1.07 శాతానికి తగ్గినట్లు పేర్కొంది.  
* ప్రతీ 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్యను తెలిపేది స్త్రీ - పురుష నిష్పత్తి. దేశవ్యాప్తంగా 2001లో స్త్రీ - పురుష నిష్పత్తి 933గా నమోదైంది. 2011 నాటికి 943కి, 2021 నాటికి 948కి పెరిగింది. 
* ప్రసవ సమయంలో పౌష్ఠికాహార లోపం వల్ల, వైద్య సదుపాయాలు లేక అనేకమంది స్త్రీలు మరణిస్తుంటారు. ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ వీరిని ‘మిస్సింగ్‌ ఉమెన్‌’గా పేర్కొన్నారు.
* 2011లో స్త్రీ - పురుష నిష్పత్తికి సంబంధించి దిల్లీలో 5.7%, చండీగఢ్‌లో 5.3%, అరుణాచల్‌ ప్రదేశ్‌ లో 5% పెరుగుదల నమోదైంది. డామన్‌ డయ్యూలో స్త్రీ, పురుష నిష్పత్తి 13 శాతం తగ్గింది.
* 2011లో 0 నుంచి 19 ఏళ్ల వారిలో స్త్రీ-పురుష నిష్పత్తి 908గా ఉంది. 15 - 59 మధ్య వయసువారిలో ఈ నిష్పత్తి 944  కాగా 60 కంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో స్త్రీ-పురుష నిష్పత్తి 1033గా నమోదైంది.
* శాంపుల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (SRS) ప్రకారం 2015-17లో స్త్రీ, పురుష నిష్పత్తి 896గా, 2016-18లో 899గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిష్పత్తి 2015-17లో 898 కాగా, 2016-18లో 900కి పెరిగింది. పట్టణాల్లో 2015-17లో 890 ఉండగా, 2016-18 మధ్య 897గా ఉంది.
* దేశంలో స్త్రీల వివాహ వయసు 2018లో 22.3 సంవత్సరాలుగా ఉంది. 2017 నుంచి 0.2 సంవత్సరాలు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల వివాహ వయసు 2017 నుంచి 2018 వరకు 0.1 సంవత్సరం; పట్టణాల్లో 0.3 సంవత్సరాలు పెరిగింది.


ప్రపంచ జనాభా స్వరూపం
* 1830 నాటికి ప్రపంచ జనాభా 100 కోట్లు (ఒక బిలియన్‌). 1930 నాటికి ఇది రెట్టింపైంది. 1960 నాటికి ప్రపంచ జనాభా 3 బిలియన్లకు (300 కోట్లు) చేరగా, 1975 నాటికి 4 బిలియన్లకు (400 కోట్లకు), 1987 నాటికి 5 బిలియన్లకు (500 కోట్లు) పెరిగింది. 5వ బిలియన్‌ చివరి శిశువు 1987, జులై 11న యుగోస్లేవియాలో జన్మించాడు. అందుకే జులై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా పరిగణిస్తారు.
* యూఎన్‌పీఎఫ్‌  (United Nations Population Fund - అంతకు ముందు దీన్ని యూఎన్‌ ఫండ్‌ ఫర్‌ పాపులేషన్‌ యాక్టివిటీస్‌గా (UNFPA) పిలిచేవారు.) నివేదిక ప్రకారం 1999, అక్టోబరు 12 నాటికి ప్రపంచ జనాభా 6 బిలియన్లకు (600 కోట్లు) చేరింది. దీన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ఆ రోజును 6వ బిలియన్‌ రోజుగా (6th day of Billion)  ప్రకటించింది. 2011 నాటికి ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరింది.
* యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ (UNPF) స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ - 2021 నివేదిక ప్రకారం 2021, ఏప్రిల్‌ నాటికి ప్రపంచ జనాభా 787.5 కోట్లకు చేరింది. ఈ నివేదిక ప్రకారం 2021 నాటికి చైనా జనాభా 144.42 కోట్లు, భారత్‌ జనాభా 139.34 కోట్లు. యూఎస్‌ఏ జనాభా 33.29 కోట్లు, ఇండోనేసియా జనాభా 27.64 కోట్లు, పాకిస్థాన్‌ జనాభా 22.52 కోట్లకు చేరింది. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (NSO) 2021, మార్చి 26న విడుదల చేసిన  ‘భారత్‌లో మహిళలు, పురుషుల నివేదిక - 2020’ ప్రకారం 2021 నాటికి భారతదేశ జనాభా 136.13 కోట్లు.
* 1921కి ముందు మనదేశంలో జనాభా పెరుగుదల చాలా స్వల్పంగా ఉండేది. కరవులు, అంటువ్యాధుల కారణంగా 1911-21 దశాబ్దంలో జనాభా తగ్గింది. అందుకే 1921ని ‘గొప్ప విభాజక సంవత్సరం’గా పేర్కొంటారు.
 

దేశంలో మతాలవారీగా  స్త్రీ, పురుష నిష్పత్తి (2011)

హిందువులు 939
ముస్లింలు 951
క్రిస్టియన్లు 1023
సిక్కులు 903
బౌద్ధులు 965
జైనులు 954

ఆధారం: ఎన్‌ఎస్‌ఓ ‘భారతదేశంలో మహిళలు, పురుషులు - 2020’ నివేదిక.


జనాభా పెరుగుదల నిర్మూలన చర్యలు
జనాభా పెరుగుదలను నివారించడానికి మూడు రకాల చర్యలు అవసరం. అవి;
1. ఆర్థిక చర్యలు     2. సాంఘిక చర్యలు  
3. కుటుంబ నియంత్రణ పథకం


ఆర్థిక చర్యలు
* పారిశ్రామిక రంగ విస్తరణ
* ఉద్యోగ అవకాశాల కల్పన
* సమానత్వంతో కూడిన ఆదాయ పంపిణీ, పేదరిక నిర్మూలన.


సాంఘిక చర్యలు
* జనాభా విస్ఫోటనం ఆర్థిక సమస్యతో పాటు సాంఘిక సమస్య కూడా. జననాల రేటును తగ్గించడానికి సాంఘిక దురాచారాలను రూపుమాపాలి.
* విద్య నీ స్త్రీల హోదా నీ వివాహ వయసును పెంచడం
 

కుటుంబ నియంత్రణ పథకానికి ప్రాధాన్యం
* ప్రభుత్వ సమాచార పథకం
* ప్రోత్సాహకాలు, నిరుత్సాహకాలు
* కుటుంబ నియంత్రణ కేంద్రాలు

Posted Date : 28-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌