• facebook
  • whatsapp
  • telegram

శాసనోల్లంఘన ఉద్యమం (1930 - 34)

జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన 1929 లో లాహోర్‌లో జరిగిన సమావేశంలో పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించారు. 1929 డిసెంబరు 31 అర్ధరాత్రి రావి నది ఒడ్డున ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాల మధ్య కొత్తగా ఆమోదించిన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. 1930 జనవరి 26 న అన్నిచోట్లా మొదటి స్వాతంత్య్ర దినంగా పాటించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది.
గాంధీజీ తన 11 డిమాండ్లను 1930 జనవరి 31 లోగా ఆమోదించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. గాంధీజీ చేసిన 11 డిమాండ్‌లు ....
1. భూమిశిస్తు 50 శాతం తగ్గించాలి.
2. ఉప్పుపై పన్ను నిషేధించాలి.
3. తీర ప్రాంత షిప్పింగ్‌ను భారతీయులకు కేటాయించాలి.
4. రూపాయి - స్టెర్లింగ్ మారకం నిష్పత్తి తగ్గించాలి.
5. స్వదేశంలోని దుస్తుల పరిశ్రమను రక్షించాలి.
6. సైనిక ఖర్చులో 50 శాతం తగ్గించాలి.
7. పౌర పరిపాలన ఖర్చులో 50 శాతం తగ్గించాలి.
8. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలి.
9. రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి.
10. కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖలో మార్పులు చేయాలి.
11. ఆయుధాల చట్టంలో మార్పు తీసుకురావడం ద్వారా పౌరుల స్వీయరక్షణకు ఆయుధాలను కలిగి ఉండటానికి అనుమతించాలి.
* ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాలని గాంధీజీని కోరింది. 1930 మార్చి 2 న గాంధీజీ తన కార్యాచరణ ప్రణాళికను వైస్రాయి ఇర్విన్‌కు తెలియజేశారు. మార్చి 12 న గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది సభ్యులతో అరేబియా తీరంలోని దండి యాత్రకు శ్రీకారం చుట్టారు. సుమారు 240 మైళ్లు నడిచి 1930 ఏప్రిల్ 6 న దండి తీరం నుంచి పిడికెడు ఉప్పును తీసుకురావడం ద్వారా ఉప్పు చట్టాన్ని అతిక్రమించారు. దీని ద్వారా బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలకు, పాలనకు భారత ప్రజలు వ్యతిరేకమని చాటి చెప్పారు. దండి యాత్ర, దాని పురోగతి, ప్రజలపై దాని ప్రభావం గురించి పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు ప్రచురితమయ్యాయి. గాంధీజీ పిలుపు మేరకు గుజరాత్‌లోని 300 మంది గ్రామాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు.
* ఉప్పు సామాన్య మానవుడి భోజనంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఉప్పు అమ్మకం ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. గాంధీజీ మాటల్లో 'గాలి, నీరు తర్వాత బహుశా ఉప్పు జీవితంలో ప్రధాన అవసరం'. శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించడానికి ఉప్పును ఎంచుకోవడానికి ఇదే ప్రధాన కారణం.


ఉద్యమ వ్యాప్తి

* తమిళనాడు: సి. రాజగోపాలాచారి (తిరుచిరాపల్లి నుంచి వేదారణ్యం వరకు పాదయాత్ర చేశారు.)
* మలబార్: కె. కేలప్పన్ (కాలికట్ నుంచి పొయన్నూర్ వరకు పాదయాత్ర చేశారు).
* పెషావర్: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (ఖుదై ఖిద్మత్ గార్స్ దళం ఏర్పాటు చేశారు. ఈయన బిరుదులు - బాద్షాఖాన్, సరిహద్దు గాంధీ). ఇతడు ఎర్రచొక్కా దళాన్ని ఏర్పాటు చేశాడు.
* ఈశాన్య భారతదేశంలో మణిపూర్ ప్రజలు రాణి గైడిన్ ల్యూ, ఆమె నాగా అనుచరులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.


ప్రజల భాగస్వామ్యం

* ఈ ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలని గాంధీజీ స్త్రీలను ప్రత్యేకంగా కోరారు. స్త్రీలతోపాటు యువకులు, విద్యార్థులు విదేశీ దుస్తులు, మద్యపాన బహిష్కరణలో ప్రధాన పాత్ర పోషించారు. సహాయ నిరాకరణ ఉద్యమంతో పోలిస్తే ఈ ఉద్యమంలో ముస్లింలు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్రల్ ప్రావిన్స్, మహారాష్ట్ర, కర్ణాటకలో షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు క్రియాశీలకంగా వ్యవహరించారు. ముంబయి, కోల్‌కతా, మద్రాసు, షోలాపూర్‌లో కార్మికులు పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, గుజరాత్‌లో రైతులు భాగస్వాములయ్యారు. బిహార్, దిల్లీ, లఖ్‌నవూలో ముస్లిం నేత పనివారు పాల్గొన్నారు. ఢాకాలో ముస్లిం నాయకులు, బలహీనవర్గాల వారు ఉద్యమంలో పాలుపంచుకున్నారు.
* ఉప్పు సత్యాగ్రహం భారతదేశంపై అధిక ప్రభావాన్ని చూపింది. గుజరాత్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం దశలవారీగా భారతదేశమంతా విస్తరించింది. ప్రజలు ఉప్పు చట్టాలను ఉల్లంఘించడంతోపాటు విదేశీ వస్తువులను బహిష్కరించడం, మద్యం అమ్మే షాపులను మూయించడం, విదేశీ బట్టలను దహనం చేయడం, పన్నుల చెల్లింపు నిరాకరణ, అధికారులు ప్రభుత్వ కార్యాలయాలను, విద్యార్థులు పాఠశాలలను బహిష్కరించడం మొదలైన కార్యక్రమాలను చేపట్టారు.

ఉద్యమంలోని వివిధ దశలు:

* మొదటి దశ (1930 మార్చి - సెప్టెంబరు): ఈ దశలో పట్టణాల్లో బూర్జువా వర్గం, గ్రామాల్లో రైతులు కీలకపాత్ర పోషించారు.
* రెండో దశ (1930 అక్టోబరు - 1931 మార్చి): ఇందులో వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం తగ్గింది. వీరు ప్రభుత్వం కాంగ్రెస్ మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు. వీరి కృషి ఫలితంగా 1931 మార్చిలో గాంధీ - ఇర్విన్ ఒడంబడిక జరిగింది.
* మూడో దశ (1932 జనవరి - 1934 ఏప్రిల్): ఈ దశలో ప్రభుత్వం అణచివేత విధానాన్ని అనుసరించింది. శాసనోల్లంఘన ఉద్యమం ఉధృతం కావడంతో బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీ, జవహర్‌లాల్ నెహ్రూలను నిర్బంధించింది. ప్రభుత్వం పత్రికా స్వాతంత్య్రంపై కూడా పరిమితులను విధించింది. భూమిశిస్తు చెల్లించని వేలాదిమంది రైతుల భూములను, వారి ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరి 1931 నాటికి సుమారు 24,000 మందిని అరెస్టు చేశారు.

రౌండ్ టేబుల్ సమావేశాలు


* మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్‌లో 1930 నవంబరు 12 నుంచి 1931 జనవరి 19 వరకు జరిగింది. ఈ సమావేశానికి మూడు బ్రిటిష్ రాజకీయ పక్షాలకు చెందిన 16 మంది ప్రతినిధులు, స్వదేశీ సంస్థానాల నుంచి 16 మంది, బ్రిటిష్ ఇండియా నుంచి 57 మంది ప్రతినిధులు హాజరయ్యారు. శాసనోల్లంఘన ఉద్యమం కొనసాగుతుండటంతో కాంగ్రెస్ ఈ సమావేశంలో పాల్గొనలేదు.
* ముస్లిం లీగ్‌కు చెందిన మహమ్మద్ అలీ, మహమ్మద్ షఫీ, జిన్నా, ఆగాఖాన్ హిందూ మహాసభకు చెందిన మూంజీ, జయకర్, ఇండియన్ లిబరల్ ఫెడరేషన్‌కు చెందిన తేజ్‌బహదూర్ సప్రూ, సి.వై. చింతామణి, శ్రీనివాస శాస్త్రి, అణగారిన కులాలకు ప్రాతినిథ్యం వహించిన డాక్టర్ అంబేడ్కర్ ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు.
* ఈ సమావేశంలో ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిథ్యం ఇవ్వాలని, తాను ప్రతిపాదించిన 14 సూత్రాలను ఆమోదించాలని మహమ్మద్ అలీ జిన్నా డిమాండు చేశారు. డా|| అంబేడ్కర్ షెడ్యూల్డ్ కులాలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండు చేశారు.
* కాంగ్రెస్ ప్రతినిధులు లేకుండా భారతదేశ రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించిన చర్చ జరపడం వృథా అని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. బ్రిటిష్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు.
* గాంధీ - ఇర్విన్ ఒప్పందం (1931 మార్చి 5): గాంధీజీ అప్పటి వైస్రాయి ఇర్విన్‌తో సమావేశమయ్యేలా తేజ్‌బహదూర్ సప్రూ, వి.ఎస్. శాస్త్రి, యం.ఆర్. జయకర్ మధ్యవర్తిత్వం చేశారు. దాని ఫలితంగా మార్చి 5, 1931 న గాంధీ - ఇర్విన్ ఒప్పందం జరిగింది.
* ముఖ్యాంశాలు: శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేశారు. కాంగ్రెస్ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి అంగీకరించింది. ఉద్యమం సందర్భంగా అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలను విడుదల చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. సముద్రతీరం నుంచి నిర్ణీత దూరంలో నివసించే ప్రజలు పన్నులు చెల్లించకుండా ఉప్పు తయారు చేసుకోవచ్చని తెలిపింది. అయితే కాంగ్రెస్‌లోని యువనాయకులు ముఖ్యంగా సుభాష్‌చంద్ర బోస్, జవహర్‌లాల్ నెహ్రూతోపాటు ఇతర నాయకులు ఉద్యమం ఆపివేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
* రెండో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశం 1931 సెప్టెంబరు 7 నుంచి డిసెంబరు వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధిగా గాంధీజీ ఒక్కరే హాజరయ్యారు. ముస్లింలతోపాటు షెడ్యూల్డ్ కులాలు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, ఐరోపా వారు కూడా ప్రత్యేక నియోజకవర్గాలను డిమాండ్ చేశారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి రామ్‌సే మెక్‌డొనాల్డ్ రెండు ముస్లిం మైనారిటీ రాష్ట్రాలను (వాయవ్య సరిహద్దు రాష్ట్రం, సింధ్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు.
* కమ్యూనల్ అవార్డు - 1932: 1932 ఆగస్టు 16 న మెక్‌డొనాల్డ్ రాష్ట్ర చట్టసభల్లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం గురించి బ్రిటిష్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశాడు. దీన్నే కమ్యూనల్ అవార్డు లేదా మెక్‌డొనాల్డ్ అవార్డు అంటారు. దీని ద్వారా ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, ఐరోపా వారికి వేర్వేరు నియోజకవర్గాలను కేటాయించారు.
* షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిస్తూ మిగిలిన సాధారణ నియోజకవర్గాల్లో ఓటువేసే అధికారాన్ని కూడా కల్పించారు. అయితే షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపును గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించి, 1932 సెప్టెంబరు 20 న ఎరవాడ జైలులో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. మదన్‌మోహన్ మాలవీయ కృషితో గాంధీజీ, అంబేడ్కర్ మధ్య 1932 సెప్టెంబరు 25 న పుణెలో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం హిందువులందరికీ సాధారణ నియోజకవర్గాలు కొనసాగుతాయి. కమ్యూనల్ అవార్డులో పేర్కొన్న విధంగా షెడ్యూల్డ్ కులాలకు 71 సీట్లకు బదులు 148 సీట్లు కేటాయించారు.
* మూడో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశం 1932 నవంబరు 17 నుంచి డిసెంబరు 24 వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు. ఇందులో 46 మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు. మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లోని చర్చల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దాని ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టం రూపొందింది.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌