గోదావరి
* దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది. భారతదేశంలో రెండో పెద్ద నది.
* గోదావరి మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసికా త్రయంబకం పీఠభూమి వద్ద అరేబియా సముద్రానికి 80 కి.మీ. దూరంలో జన్మించింది.
* నదీ పరీవాహక ప్రాంతం 3,12,812 చ.కి.మీ.
* మొత్తం పొడవు 1465 కి.మీ.; తెలంగాణ - 520 కి.మీ., ఆంధ్రప్రదేశ్ - 250 కి.మీ.
ప్రవహించే రాష్ట్రాలు: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి.
ఇతర పేర్లు: తేలివాక, వృద్ధగంగా, దక్షిణగంగా, ఇండియన్ రైన్, కవుల నది.
* గోదావరి నది నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.
* ఇది తెలంగాణలో నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో ప్రవహిస్తుంది.
* మంచిర్యాలలోని ‘జంగాం’ అనే ప్రాంతం వద్ద ఇది అర్ధచంద్రాకారంలో ప్రవహిస్తుంది.
* తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది ప్రవహించే జిల్లాలు: అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ.
* ఆంధ్రప్రదేశ్లోని పాపికొండల వద్ద ఈ నది బైసన్ గార్జ్ను ఏర్పర్చింది.
* ఈ నది పోలవరం వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది.
* గోదావరి సముద్రంలో కలిసే ముందు 7 పాయలుగా చీలింది. అవి: గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ.
* గౌతమి, వశిష్ఠల మధ్య ఉన్న ప్రాంతాన్ని ‘కోనసీమ’ అంటారు. ఇది కొబ్బరి తోటలకు ప్రసిద్ధి.
* కోనసీమను ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనంగా పిలుస్తారు.
ఉపనదులు
ఎడమవైపు ప్రవహించేవి: పూర్ణ, కడెం, ప్రాణహిత, పెన్గంగా, వైన్గంగా, వార్దా, ఇంద్రావతి, శబరి.
కుడివైపు ప్రవహించేవి: మంజీర, మానేరు, కిన్నెరసాని, ప్రవర.
వార్దా: మధ్యప్రదేశ్లోని సాత్పుర కొండల్లో ఉన్న ముత్తాయి వద్ద జన్మించింది.
పూర్ణా నది: అజంతా కొండల్లో జన్మించింది. జంబుల్బెట్ వద్ద గోదావరిలో కలుస్తుంది.
పూర్ణానది, దాని ఉపనది అయిన దుదున మధ్యలో ఎల్లోరా కొండలు ఉన్నాయి.
ప్రాణహిత: పెన్గంగా, వైన్గంగా, వార్దా నదులు కలిసి ప్రాణహితగా ఏర్పడ్డాయి. ఈ మూడు నదులు ఒకటిగా కలిసే ప్రాంతం చెన్నూరు.
* గోదావరి ఉపనదుల్లో పెద్దది - ప్రాణహిత.
* ఇది తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది.
* గోదావరి ఉపనదుల్లో ప్రాణహితలోనే పుష్కరాలను నిర్వహిస్తారు.
ఇంద్రావతి: ఇది ఒడిశాలో జన్మించి, తెలంగాణలో గోదావరిలో కలుస్తుంది.
* ఛత్తీస్గఢ్లోని చిత్రకూట్ జలపాతం ఈ నదిపైనే ఉంది.
శబరి: ఒడిశాలోని సింకారం కొండల్లో జన్మించి, ఆంధ్రప్రదేశ్లోని కూనవరం వద్ద గోదావరిలో కలుస్తుంది.
* దీన్ని ఒడిశాలో కొలాల్ నది అంటారు.
కడెం: ఆదిలాబాద్లోని బోతాయి వద్ద జన్మించింది.
* తెలంగాణలో అత్యంత ఎత్తయిన జలపాతమైన కుంతల (49 మీ.) ఈ నదిపైనే ఉంది.
మంజీర: మహారాష్ట్రలోని బాలాఘాట్ కొండల్లో జన్మించింది.
* కామారెడ్డిలోని నిజాంసాగర్ ప్రాజెక్టును ఈ నదిపైనే నిర్మించారు.
* గోదావరికి కుడివైపు నుంచి కలిసే ఉపనదుల్లో పెద్దది - మంజీర.
మానేరు: తెలంగాణలోని సిరిసిల్ల కొండల్లో జన్మించింది.
* కరీంనగర్ ఈ నది ఒడ్డునే ఉంది.
కిన్నెరసాని: ములుగులోని తాడ్వాయి వద్ద జన్మించింది.
* ఇది ఆంధ్రప్రదేశ్లోని బూర్గంపాడు వద్ద గోదావరిలో కలుస్తుంది.
* పాల్వంచ వద్ద కిన్నెరసాని నదిపై ‘కిన్నెరసాని ప్రాజెక్టు’ను కట్టారు.
గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు
జయక్వాది/ పైథాన్: మహారాష్ట్రలో ఉంది. గోదావరి నదిపై అతిపెద్ద ప్రాజెక్టు.
శ్రీరాం సాగర్ లేదా పోచంపాడు ప్రాజెక్టు: నిజామాబాద్ జిల్లాలో ఉంది.
* ఇది తెలంగాణలో గోదావరిపై నిర్మించిన మొదటి ప్రాజెక్టు.
* దీని ద్వారా రామగుండం థర్మల్ పవర్ కార్పొరేషన్కు నీటిని సరఫరా చేస్తారు.
* శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా కోసం ఏర్పాటుచేసిన మూడు ప్రధాన కాలువలు ఉన్నాయి. అవి:
1. లక్ష్మీ కాలువ 2. కాకతీయ కాలువ, 3. సరస్వతి కాలువ.
* తెలంగాణలో అతి పొడవైన మంచినీటి కాలువ కాకతీయ కాలువ. దీని పొడవు 284 కి.మీ. దీని ద్వారా కరీంనగర్ జిల్లాలోని ‘దిగువ మానేరు డ్యాం’కు నీటిని సరఫరా చేస్తారు.
* తెలంగాణలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు శ్రీరాం సాగర్.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం: ఆదిలాబాద్లోని తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై ఉంది. ప్రాణహిత - చేవెళ్ల పథకాన్ని రీ-డిజైన్ చేసి దీన్ని రూపొందించారు.
* కాళేశ్వరం ప్రాజెక్టు జయశంకర్ భూపాలపల్లిలో ఉంది.
* హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు మంచినీటిని అందించే ప్రాజెక్టు మంజీర.
* కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్టు ఉంది. దీన్ని మంజీర నదిపై నిర్మించారు.
* పోలవరం ప్రాజెక్టు లేదా ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టును పశ్చిమ గోదావరిలో నిర్మిస్తున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం వద్ద నిర్మించారు.
కృష్ణానది
* మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో ఉన్న మహాబలేశ్వరం దగ్గర జోర్ గ్రామం వద్ద జన్మించింది.
* మొత్తం పొడవు 1440 కి.మీ.; తెలంగాణలో - 235 కి.మీ., ఆంధ్రప్రదేశ్లో- 485 కి.మీ.
* కృష్ణానది మొత్తం పరీవాహక ప్రాంతం 2,58,948 చ.కి.మీ.
* అత్యధిక పరీవాహక ప్రాంతం కర్ణాటక (43%)లో ఉండగా, తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (26%), తెలంగాణ (19%), ఆంధ్రప్రదేశ్ (9%) ఉన్నాయి.
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుగా ఈ నది ప్రవహిస్తుంది.
* ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రాలో పొడవైన నది కృష్ణా.
* ఈ నది మహారాష్ట్రలో జన్మించి, అక్కడి నుంచి కర్ణాటకలోకి ప్రవేశించి తర్వాత ఉత్తరం నుంచి దక్షిణంగా ప్రవహించి తెలంగాణలోని నారాయణపేటలోని మక్తల్ తాలూకాలో ఉన్న తంగడి వద్ద ప్రవేశిస్తుంది.
* తెలంగాణలో కృష్ణానది ఆరు జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. అవి: నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట.
* కృష్ణానది ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే జిల్లాలు: కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, ఎన్.టి.ఆర్, గుంటూరు, కృష్ణా, బాపట్ల.
* ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కృష్ణానది ఒడ్డున ఉంది.
* కృష్ణానది విజయవాడ సమీపంలో రెండు పాయలుగా చీలి, మళ్లీ ఒకటిగా కలుస్తుంది. ఈ ప్రాంతాన్ని ‘దివిసీమ’ అంటారు.
* దివిసీమలో ఎక్కువగా పండించే పంట వరి.
* కృష్ణానది హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఉపనదులు
ఎడమవైపు కలిసేవి: భీమా, పాలేరు, మూసీ, మున్నేరు, దిండి.
కుడివైపు కలిసేవి: ఘటప్రభ, పంచగంగ, తుంగభద్ర, కొయనా.
భీమా: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఉన్న భీమశంకర గుట్టల వద్ద జన్మించింది.
* కృష్ణా నది ఉపపనదుల్లో అతిపొడవైంది. దీని పొడవు 861 కి.మీ.
* ఇది కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో ప్రవహిస్తుంది.
మూసీ:
* వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో ఉన్న శివారెడ్డిపేట వద్ద జన్మించింది.
* నల్గొండలోని వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.
* వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మూసీనది ప్రవహిస్తుంది.
* హైదరాబాద్లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను ఈ నదిపైనే నిర్మించారు.
దిండి: మహబూబ్నగర్లోని షాబాద్ కొండల్లో జన్మించింది.
* దీన్ని మీనాంబరం, దుందిభి అని కూడా పిలుస్తారు.
* ఇది నాగార్జునసాగర్ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.
మున్నేరు: మహబూబాబాద్లోని పాకాల సరస్సులో జన్మించింది.
* ఏపీలోని జగ్గయ్యపేట వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.
* ఖమ్మం మున్నేరు నది ఒడ్డున ఉంది.
తుంగభద్ర: కర్ణాటకలోని వరాహగిరి పర్వతాల్లో జన్మించింది. దీని పొడవు 531 కి.మీ.
* ఇది కృష్ణానది ఉపనదుల్లో అతిపెద్దది. దీన్ని రామాయణంలో పంబానదిగా పేర్కొన్నారు.
* తుంగభద్ర నది ప్రవహించే రాష్ట్రాలు - కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.
* ఇది కర్నూలులోని సంగం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.
* కృష్ణా, తుంగభద్రల మధ్య బాదామి కొండలు, రాయచూర్ పీఠభూమి, రాయచూర్ అంతర్వేది ఉన్నాయి.
ఉపనదులు: హగరి, హంద్రీ, వేదవతి.
* కర్ణాటకలో హోస్పేట్ వద్ద తుంగభద్ర ప్రాజెక్టు ఉంది.
కొయనా:
* దీన్ని మహారాష్ట్ర జీవనరేఖ (Life line of Maharashtra) అని పిలుస్తారు.
* కృష్ణా ఉపనదులైన బుడమేరు, తమ్మిలేరు, రాయలేరు వాగులు కొల్లేరు సరస్సులో కలుస్తాయి.
* కృష్ణానది శ్రీశైలం సమీపంలో ‘పాతాళగంగ గార్జ్’ను ఏర్పరిచింది.
* భారతదేశంలో అత్యంత అందమైన నదిగా కృష్ణానదిని పిలుస్తారు.
* కృష్ణానదిని శిల్పుల నది అని కూడా అంటారు.
కృష్ణానదిపై ఉన్న ఆనకట్టలు
జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు: తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో ఉంది.
* ఇది తెలంగాణలో కృష్ణానదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్టు.
ఈ ప్రాజెక్టు ఆధారంగా నిర్మించిన ఎత్తిపోతల పథకాలు:
1. వనపర్తిలోని భీమా లేదా రాజీవ్గాంధీ ప్రాజెక్టు.
2. గద్వాల్లోని నెట్టెంపాడు లేదా జవహర్ ప్రాజెక్టు.
శ్రీశైలం ప్రాజెక్టు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్మించారు.
* శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కాలువ లేదా మాధవరెడ్డి కాలువ ద్వారా తెలంగాణలోని నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు తాగునీరు అందిస్తున్నారు.
* శ్రీశైలం కుడి కాలువ ద్వారా పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు తాగునీరు, సాగునీరు అందుతుంది.
శ్రీశైలం ప్రాజెక్టు ఆధారంగా తెలంగాణలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు:
1. నాగర్ కర్నూల్లోని కల్వకుర్తి ప్రాజెక్టు (లేదా) మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్.
2. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.
3. నాగార్జునసాగర్ ప్రాజెక్టు: దీన్ని నల్గొండలోని నందికొండ వద్ద నిర్మించారు.
* ఇది ఆంధ్రా, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు.
* ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అతి ఎత్తయిన రాతి డ్యాం (మాషనరీ డ్యాం). దీని ఎత్తు 127.8 మీటర్లు.
* ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 1955లో ప్రారంభించి, 1967లో పూర్తిచేశారు.
* నాగార్జునసాగర్ కుడి కాలువను జవహర్ కాలువ అని, ఎడమ కాలువను లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అని అంటారు.
* కుడి కాలువ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం; ఎడమ కాలువ తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ఏపీలోని ప్రకాశం ప్రాంతాలకు నీరు అందిస్తుంది.
ప్రకాశం బ్యారేజీ: 1853లో బ్రిటిష్వారు విజయవాడ దగ్గర కృష్ణా నదిపై ఈ బ్యారేజీని నిర్మించారు.
* దీని నుంచి కాలువల ద్వారా సుమారు 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
పులిచింతల ప్రాజెక్టు: దీన్నే కె.ఎల్.రావు ప్రాజెక్టు అంటారు.
* భారతదేశ నదుల అనుసంధాన పితామహుడు కె.ఎల్.రావు.
కృష్ణానదిపై కర్ణాటకలో నిర్మించిన ప్రాజెక్టులు:
1. బసవసాగర్ ప్రాజెక్టు
2. ఆల్మట్టి ప్రాజెక్టు