ఆంగ్లో - మైసూర్ యుద్ధాలు (క్రీ.శ. 1767-1799)
* విజయనగర సామ్రాజ్యం క్షీణించాక మైసూర్ స్వతంత్ర రాజ్యంగా మారింది.
* వడయార్ వంశానికి చెందిన వారు ఈ ప్రాంతాన్ని పాలించారు.
* క్రీ.శ. 1399లో యదురాయ వడయార్ మైసూర్ రాజ్యాన్ని స్థాపించాడు.
* మైసూర్ రాజధాని శ్రీరంగపట్నం.
* క్రీ.శ. 1761 నాటికి ఈ మైసూర్ సామ్రాజ్యం హైదర్ అలీ ఆధీనంలోకి వచ్చింది.
హైదర్ అలీ (క్రీ.శ. 1722 - 82)
* ఇతడి అసలు పేరు హైదర్ నాయక్. తండ్రి ఫతే ముహమ్మద్- మైసూర్ సైన్య ఫౌజ్దార్ (జనరల్). హైదర్ అలీ కోలార్ జిల్లాలోని బుదికోట్లో జన్మించాడు.
* ఇతడు క్రీ.శ. 1755లో దిండిగల్ ఫౌజ్దార్ అయ్యాడు.
* హైదర్ తన సైన్యాన్ని ఫ్రెంచ్ సేనల సహకారంతో బలోపేతం చేశాడు.
* ఫ్రెంచ్ వారి సాయంతో దిండిగల్లో ఆయుధ కర్మాగారాన్ని స్థాపించాడు.
* ఇతడు అనేక యుద్ధాల్లో పాల్గొని, విజయాల్లో కీలక పాత్ర పోషించి మైసూర్ పాలకుల దృష్టిని ఆకర్షించాడు.
* ఇతడు క్రీ.శ. 1759 నాటికి పూర్తి మైసూర్ సేనలకు నాయకత్వం వహించాడు.
* ఐరోపా వారు అనుసరించే సైనిక విధానాలను హైదర్ అలీ ఆచరించి, తన సైన్యాన్ని వ్యవస్థీకరించాడు.
* ఇతడు మైసూర్ రాజ్య సరిహద్దులను మరాఠా సామ్రాజ్యం, హైదరాబాద్ వరకు విస్తరింపజేశాడు.
* బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ సైనిక విస్తరణను సమర్థవంతంగా ఎదుర్కొన్న కొద్దిమంది స్థానిక పాలకుల్లో హైదర్ అలీ ఒకడు.
* ఇతడికి సుల్తాన్ హైదర్ అలీ ఖాన్, హైదర్ అలీ సాహెబ్ అనే బిరుదులున్నాయి.
* రాకెట్ ఆర్టిలరీ (ఫిరంగి)లను అభివృద్ధి చేసి, యుద్ధాల్లో వాటిని ఉపయోగించాడు.
* రెండో కర్ణాటక యుద్ధ సమయంలో శ్రీరంగపట్నం యుద్ధం, గోల్డెన్రాక్ యుద్ధం, షుగర్-లోఫ్ రాక్ యుద్ధం, టోడ్ మాన్ ఉడ్స్ యుద్ధాల్లో క్రియాశీలంగా పాల్గొన్నాడు.
* ఇతడు మూడో కర్ణాటక యుద్ధ సమయంలో త్రివాడి యుద్ధం, పాండిచ్చేరి యుద్ధాల్లో చురుగ్గా వ్యవహరించాడు.
* హైదర్ అలీ మైసూర్ రాజయ్యాక రాజధాని పేరును హైదర్నగర్గా మార్చాడు.
మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం (క్రీ.శ. 1767 - 69)
* హైదర్ అలీ ఫ్రెంచ్ వారి సహకారంతో బళ్లారి, గుత్తి, కడప, కూర్గ్, మలబార్, సెరాలను జయించాడు.
* ఇతడ్ని నిలువరించేందుకు హైదరాబాద్ నిజాం, మరాఠాలు, ఆంగ్లేయులు కూటమిగా ఏర్పడి, యుద్ధం ప్రకటించారు.
* 1767, సెప్టెంబరు 25న ట్రింకోమలై యుద్ధం జరిగింది. బ్రిటిష్ కమాండర్ కల్నల్ జోసెఫ్ స్మిత్ చేతిలో హైదర్ అలీ ఓడిపోయాడు.
* చంగామ యుద్ధం 1767, సెప్టెంబరు 3న జరిగింది.
* మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోయారు.
* 1769, ఏప్రిల్ 4న మద్రాస్ ఒప్పందంతో ఈ యుద్ధం ముగిసింది.
* రెండు పక్షాలు పరస్పరం ఆక్రమించుకున్న భూభాగాలను పునరుద్ధరించడానికి, మూడో పక్షం దాడి చేసినప్పుడు పరస్పరం సహకరించుకునేలా ఒప్పందం కుదిరింది.
రెండో ఆంగ్లో-మైసూర్ యుద్ధం (క్రీ.శ. 1780 - 84)
* 1771లో మరాఠాలు హైదర్ అలీపై దాడి చేశారు. మద్రాస్ ఒప్పందం ప్రకారం ఆంగ్లేయులు ఇతడికి సహాయం చేయలేదు. దీంతో హైదర్ అలీ బ్రిటిష్ వారిని నమ్మలేదు.
* హైదర్ అలీ ఆధీనంలో ఉన్న మహే ప్రాంతాన్ని ఫ్రెంచ్ వారు తమ చేతుల్లోకి తీసుకున్నారు. దాన్ని ఆక్రమించేందుకు బ్రిటిష్ వారు ప్రయత్నించగా, హైదర్ అలీ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించాడు.
* 1780, సెప్టెంబరులో బ్రిటిష్, మైసూర్ సేనల మధ్య పొల్లిలూర్ యుద్ధం జరిగింది. ఇందులో బ్రిటిష్ లెఫ్టినెంట్ కల్నల్ విలియం బైలీని హైదర్ అలీ కొడుకైన టిప్పు సుల్తాన్ ఓడించాడు.
* బ్రిటిష్ వారితో జరిగిన యుద్ధాల్లో హైదర్ అలీ ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఓడిపోతూ వచ్చాడు.
* పోర్టో నోవో, పొల్లిలూర్, షోలింగూర్ యుద్ధాల్లో బ్రిటిష్ లెఫ్ట్టినెంట్ జనరల్ సర్ ఐర్ కూట్ చేతిలో హైదర్ అలీ ఓడిపోయాడు.
* 1782, డిసెంబరు 7న హైదర్ అలీ క్యాన్సర్ కారణంగా మరణించాడు. అతడి తర్వాత టిప్పు సుల్తాన్ యుద్ధాలను కొనసాగించాడు.
* 1782, ఫిబ్రవరిలో కుంభకోణం వద్ద జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ సైన్యాధ్యక్షుడు బ్రైత్ వైట్ను ఓడించాడు.
* బ్రిటిష్ వారు హనోవర్, బెదనూర్, మంగళూరు, దిండిగల్, కోయంబత్తూర్, పాల్ఘాట్లను ఆక్రమించుకున్నారు.
* మద్రాస్ కొత్త బ్రిటిష్ గవర్నర్గా మెక్కార్టే నియమితుడయ్యాడు.
* 1784, మార్చి 11న జరిగిన మంగళూరు ఒప్పందం ద్వారా రెండో ఆంగ్లో-మైసూర్ యుద్ధం ముగిసింది.
* ఈ ఒప్పందం ప్రకారం, రెండు వైపులా పరస్పరం స్వాధీనం చేసుకున్న భూభాగాలను పునరుద్ధరించి, యుద్ధ ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకరించారు.
మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధం (క్రీ.శ. 1790 - 92)
* బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కారన్ వాలీస్ కారణంగా మరాఠాలు, నిజాం, ట్రావెన్కోర్, కూర్గ్ పాలకులు టిప్పు సుల్తాన్కు వ్యతిరేకమయ్యారు.
* 1789, డిసెంబరు 29న టిప్పు ట్రావెన్కోర్పై దాడి చేశాడు. ట్రావెన్కోర్ బ్రిటిష్ వారితో పొత్తులో ఉంది.
* టిప్పు సుల్తాన్కు వ్యతిరేకంగా బ్రిటిష్ వారు, మరాఠా - నిజాం పాలకులు కూటమిగా ఏర్పడ్డారు. ఇది మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధానికి దారి తీసింది.
* ఈ యుద్ధంలో టిప్పు ఓడిపోయాడు.
* టిప్పు సుల్తాన్ 1792, మార్చిలో శ్రీరంగపట్నం ఒడంబడికపై సంతకాలు చేశాడు.
* ఈ ఒప్పందం ప్రకారం, టిప్పు తన భూభాగంలో సగభాగాన్ని (మలబార్, కూర్గ్, దిండిగల్, బారామహల్) వదులుకున్నాడు. ఆ భూమిని ఆంగ్లేయులు, మరాఠాలు, నిజాం విభజించి, పంచుకున్నారు.
* టిప్పు యుద్ధ నష్టపరిహారం కింద రూ.3.5 కోట్లు చెల్లించాడు.
నాలుగో ఆంగ్లో- మైసూర్ యుద్ధం (క్రీ.శ. 1798 - 99)
* టిప్పు తన నష్టాలను తగ్గించుకుని, కోటను బలోపేతం చేయడానికి ప్రయత్నించాడు.
* ముస్లిం ప్రజలు తనకు సాయం చేయాలని కోరాడు. అందుకోసం అరేబియా, కాన్స్టాంటినోపుల్, కాబూల్కు తన తరపున రాయబారులను పంపాడు. వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు.
* ఆ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ వెల్లస్లీ ‘సబ్సిడరీ అలయన్స్ (సైన్య సహకార పద్ధతి)’ను ప్రవేశపెట్టి, కూటమి ఒప్పందాన్ని అంగీకరించాలని టిప్పు సుల్తాన్ను కోరాడు.
* దీన్ని టిప్పు వ్యతిరేకించాడు. దీంతో నాలుగో ఆంగ్లో-మైసూర్ యుద్ధం ప్రారంభమైంది.
* జనరల్ స్టువర్ట్ నేతృత్వంలోని బొంబాయి సైన్యం పశ్చిమం నుంచి మైసూర్పై దాడి చేసింది.
* లార్డ్ వెల్లస్లీ సోదరుడైన ఆర్థర్ వెల్లస్లీ నేతృత్వంలోని మద్రాస్ సైన్యం శ్రీరంగపట్నంపై దండెత్తింది.
* 1799, మార్చి 5న సిద్ధేశ్వర్ యుద్ధం; 1799, మార్చి 27న మాలవెల్లీ యుద్ధం జరిగాయి.
* శ్రీరంగపట్నంలో టిప్పు ఓడిపోయి, బ్రిటిష్ వారి చేతిలో మరణించాడు.
* మైసూర్, శ్రీరంగపట్నంలను బ్రిటిష్ వారు పునరుద్ధరించి మళ్లీ వడయార్ రాజవంశానికి చెందిన కృష్ణరాజ వడయార్ IIIకి అప్పగించి, అతడ్ని రాజుగా ప్రకటించారు.
* అతడు సబ్సిడీ అలయన్స్పై సంతకం చేశాడు. కృష్ణరాజకు మైసూర్ మధ్యభాగాన్నే అప్పగించారు. మిగిలిన ప్రాంతాన్ని బ్రిటిష్ వారు, నిజాం విభజించి పంచుకున్నారు.
టిప్పు సుల్తాన్ (క్రీ.శ.1750-99)
* పూర్తి పేరు సుల్తాన్ ఫతే అలీ టిప్పు. తల్లిదండ్రులు ఫాతిమా, హైదర్ అలీ.
* 1750, నవంబరు 20న దేవనహళ్లిలో జన్మించాడు. 1799, మే 4న శ్రీరంగపట్నంలో మరణించాడు.
* శృంగేరీ శారదా ఆలయానికి విలువైన ఆభరణాలను విరాళంగా ఇచ్చాడు.
* శంకరాచార్యులను జగద్గురువు అని పేర్కొన్నాడు.
* ఫ్రెంచ్ వారి కోరిక మేరకు మైసూర్లో మొదటి చర్చిని నిర్మించాడు.
* కొత్త క్యాలెండర్ను; ఏకరీతి బరువులు, కొలతలను ప్రవేశపెట్టాడు.
* వాణిజ్యం కోసం ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్, చైనా, బర్మా, రష్యాలకు రాయబారులను పంపాడు.
* మైసూర్లో ‘లిబర్టీ ట్రీ’ని నాటాడు.
* జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేశాడు.
* ఫ్రాన్స్కు చెందిన ‘జాకోబియన్ క్లబ్’లో సభ్యుడిగా ఉన్నాడు.