‣ వివిధ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న పలు రకాల కోర్సులు
కారణాలు ఏవైనా..కళాశాలకు వెళ్లి చదువుకునే అవకాశం అందరికీ దక్కకపోవచ్చు. మరి ఇలాంటి వాళ్లు విద్యకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన పనిలేదు. ఆసక్తి, అభిరుచిని అనుసరించి ఇంటి నుంచే చదువుల పర్వాన్ని కొనసాగించవచ్చు. ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్నవారికి సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులను వివిధ విశ్వవిద్యాలయాలు దూరవిద్యలో అందిస్తున్నాయి. వీటితో ఉద్యోగాలు, ఉన్నత చదువులకు పోటీ పడవచ్చు!
కాలేజీకి వెళ్లి సహ విద్యార్థులతో కలిసి, గురువుల సమక్షంలో విద్య నేర్చుకోవడంలో ఉన్న అనుభూతి ఎంతో గొప్పది. విలువైనది. అయితే ఆ అవకాశం లేనివాళ్లు ఏ మాత్రం దిగులు చెందకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా రాణించడానికి మార్గాలు పెరిగాయి. ఇగ్నో, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇతర సంస్థలు ఇప్పుడు దూరవిద్యను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
నాణ్యమైన స్టడీ మెటీరియల్తోపాటు, తమ స్టడీ సెంటర్లలో నిర్దేశిత దినాల్లో ప్రభుత్వ సీనియర్ డిగ్రీ లెక్చరర్లతో కాంటాక్టు తరగతులూ నిర్వహిస్తున్నాయి. సందేహ నివృత్తికీ అవకాశం కల్పిస్తున్నాయి. అలాగే విద్యార్థి ఏ యూనివర్సిటీలో చేరినప్పటికీ స్వయం పోర్టల్, స్వయంప్రభ ఛానళ్ల ద్వారా తమ సిలబస్ ప్రకారం పాఠాలు వినే సౌకర్యమూ ఉంది. అందువల్ల అర్థం కావడం లేదు అనే పరిస్థితి ఉత్పన్నం కాదు. సైన్స్ విద్యార్థులకు ప్రయోగాల నిమిత్తం సంబంధిత స్టడీ సెంటర్లలో ఏర్పాట్లు చేస్తున్నారు. అందువల్ల మరో ఆలోచన లేకుండా వాటిలోనూ చేరవచ్చు.
చేతికందిన డిగ్రీ పట్టాకు విలువ ఉంటుందా అనే సందేహం అవసరం లేదు. డిస్టెన్స్ డిగ్రీ పూర్తిచేసుకున్నవారు యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ మొదలైన పోటీ పరీక్షలు రాసుకోవచ్చు. అలాగే బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో), క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నిర్వహించే స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డు ఉద్యోగాలకూ ప్రయత్నించవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోని కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షకు సన్నద్ధం కావచ్చు. రాష్ట్ర స్థాయుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్సై...తదితర పోస్టులకు పోటీ పడవచ్చు. అయితే వన్ సిటింగ్ డిగ్రీలకు విలువ లేదని గుర్తుంచుకోవాలి. అలాగే టెక్నికల్ డిప్లొమా, బీటెక్, ఎల్ఎల్బీ..మొదలైన ప్రొఫెషనల్ కోర్సులను దూరవిద్యలో చదువుకునే అవకాశం లేదు.
ఏడాదికి రెండు సార్లు...
తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, ఉస్మానియా, శ్రీవెంకటేశ్వర, ఆచార్య నాగార్జున, శ్రీకృష్ణ దేవరాయ.. దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలూ దూరవిద్య కోర్సు అందిస్తున్నాయి. వీటిలో అందుబాటులో ఉన్న సంస్థను ఎంచుకోవచ్చు. రెగ్యులర్ విధానంలో కళాశాలల్లో ప్రవేశాలు ఏడాదికి ఒకసారే ఉంటాయి. అయితే దూరవిద్యలో రెండు సార్లు లభిస్తాయి. దాదాపు విశ్వవిద్యాలయాలన్నీ ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో), పలు సంస్థలు జనవరి, జులై సెషన్లలో ప్రవేశాలకు ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. జులై సెషన్లో చేరినవారు రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా అకడమిక్ సంవత్సరం వృథా కాకుండా డిగ్రీ పూర్తిచేసుకోవచ్చు. ఏ కారణంతోనైనా జులైలో వీలుపడనివారు, సప్లిమెంటరీలో పాసైన వ్యక్తులు మరో ఏడాది వరకు వేచిచూడకుండా జనవరి సెషన్లో చేరిపోవచ్చు. కొన్ని యూనివర్సిటీలు అందించే కోర్సుల వివరాలు చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో...
బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందించే కోర్సుల్లో చేరుతున్నారు. ఇక్కడ ఇంటర్ పూర్తిచేసుకున్నవారి కోసం వివిధ సబ్జెక్టుల కాంబినేషన్తో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది.
కళలు (ఆర్ట్స్): తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, హిందీ సాహిత్యం, ఉర్దూ సాహిత్యం
సోషల్ సైన్సెస్ (సామాజిక శాస్త్రాలు): అర్థశాస్త్రం, చరిత్ర, రాజనీతిశాస్త్రం, మనోవిజ్ఞానశాస్త్రం, ప్రభుత్వ పాలనశాస్త్రం, సమాజశాస్త్రం, జర్నలిజం.
విజ్ఞానశాస్త్రాలు (సైన్స్): వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితశాస్త్రం, గణాంకశాస్త్రం, భూగర్భశాస్త్రం; వాణిజ్యశాస్త్రం: కామర్స్. కోర్సులను ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఏడాదికి రెండు సెమిస్టర్లు చొప్పున ఉంటాయి.
ఆంధ్రా యూనివర్సిటీ
ఇంటర్ విద్యార్హతతో. సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు. అందిస్తున్నారు..
సర్టిఫికెట్ కోర్సులు: ఆఫీస్ ఆటోమేషన్ అండ్ అకౌంటింగ్, ఆఫీస్ ఆటోమేషన్ అండ్ మల్టీమీడియా టెక్నాలజీస్, ఆఫీస్ ఆటోమేషన్ అండ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్ ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. వ్యవధి ఏడాది.
డిప్లొమా కోర్సులు: మ్యూజిక్. రెండేళ్ల వ్యవధి. స్పోకన్ హిందీ అండ్ ట్రాన్స్లేషన్ 6 నెలలు.
డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులను పలు సబ్జెక్టుల కాంబినేషన్తో ఈ విశ్వవిద్యాలయం అందిస్త్తోంది.
ఉస్మానియా యూనివర్సిటీ
యూజీలో వైవిధ్యమైన సబ్జెక్టు కాంబినేషన్లు కోరుకునేవారు ఓయూలో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
ఆచార్య నాగార్జున
ఎకనామిక్స్, బ్యాంకింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్ కాంబినేషన్తో బీఏ కోర్సు అందిస్తోంది. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులను పలు సబ్జెక్టుల కాంబినేషన్తో చదువుకోవచ్చు.
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ
బీఏ కర్ణాటక మ్యూజిక్, బీఏ స్పెషల్ తెలుగు కోర్సులు అందిస్తోంది.
అలాగే ఎస్వీయూ, ఎస్కేయూ, ఇటీవలి కాలంలో ఏర్పడిన విశ్వవిద్యాలయాలు, కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు తెలుగు రాష్ట్రాల్లో దూరవిద్యలో చదువులు అందిస్తున్నాయి.
ఇగ్నోలో...
కోర్సుల్లో నాణ్యత, అందుబాటులో స్టడీ సెంటర్లు, తక్కువ ఫీజు, చదువులకు విలువ లభించడంతో ఎక్కువ మంది ఇగ్నోలో చేరడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇంటర్ విద్యార్హతతో ఆరు నెలల సర్టిఫికెట్, ఏడాది డిప్లొమా, మూడేళ్ల డిగ్రీ కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది.
సర్టిఫికెట్ కోర్సులు: డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎన్జీవో మేనేజ్మెంట్, బిజినెస్ స్కిల్స్, ఫంక్షనల్ ఇంగ్లిష్, హెచ్ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, హెల్త్కేర్ వేస్ట్ మేనేజ్మెంట్, టూరిజం స్టడీస్, న్యూట్రిషన్ అండ్ చైల్డ్ కేర్, ఆర్గానిక్ ఫార్మింగ్, పౌల్ట్రీ ఫార్మింగ్, హ్యూమన్ రైట్స్, కన్జూమర్ ప్రొటెక్షన్, ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా, కమ్యూనికేషన్ అండ్ ఐటీ స్కిల్స్, వాల్యూ ఎడ్యుకేషన్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లైఫ్ అండ్ థాట్ ఆఫ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ట్రైబల్ స్టడీస్, జపనీస్ లాంగ్వేజ్, కొరియన్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, స్పానిష్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, జర్మన్ లాంగ్వేజ్, ఫ్యాషన్ డిజైన్, జనరల్ డ్యూటీ అసిస్టెన్స్, జెరియాట్రిక్ కేర్ అసిస్టెన్స్, ఫ్లెబోటమీ అసిస్టెన్స్, హోం హెల్త్ అసిస్టెన్స్, పర్షియన్ లాంగ్వేజ్, యోగా, పీస్ స్టడీస్ అండ్ కన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రాం ఆన్ జీఎస్టీ..
డిప్లొమాలు: ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, పంచాయత్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్, టూరిజం స్టడీస్, ఆక్వా కల్చర్, క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, ఉమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్, పారా లీగల్ ప్రాక్టీస్, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఫ్రం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ప్రొడక్షన్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఫ్రం సెరియల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్; ఫిష్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, రిటైల్, మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్, మీట్ టెక్నాలజీ.డిప్లొమా ఇన్ డెయిరీ టెక్నాలజీ కోర్సును తెలుగు మాధ్యమంలోనూ ఇగ్నో అందిస్తోంది.
డిగ్రీ: బీఏ టూరిజం స్టడీస్, బీసీఏ, బీఎస్డబ్ల్యూ, అందుబాటులో ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ ఒకేషనల్ స్టడీస్ (టూరిజం మేనేజ్మెంట్) కోర్సులను ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) విధానంలో అందిస్తోంది. సీబీసీఎస్ ఆనర్స్ విధానంలో బీఏ: ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇంగ్లిష్, హిందీ; బీఎస్సీ ఆంత్రోపాలజీ కోర్సులను ఎంచుకోవచ్చు.
డిప్లొమా ఇన్ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్): యాక్సెంచర్ సంస్థతో కలిసి ఇగ్నో ఈ కోర్సు అందిస్తోంది. విద్యార్థులు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కు సంబంధించి బీపీవో పరిశ్రమలో ఉద్యోగావకాశాలు సొంతం చేసుకునేలా కోర్సు రూపొందించారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంశాలు, ఇంగ్లిష్ కమ్యూనికేషన్, ఐటీ నైపుణ్యాల మెలకువలు నేర్పుతారు. 50 శాతం మార్కులతో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఇంటర్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు కోర్సు వ్యవధి ఏడాది. ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. ఫీజు రూ.19,200.
డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్: ప్రతి వేడుకనూ అట్టహాసంగా జరుపుకోవడానికి ప్రాధాన్యం పెరిగింది. ఈ కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను ఈవెంట్ మేనేజర్లకు అప్పగిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామిక విభాగాలు... బ్రాండ్ ప్రమోషన్, ప్రొడక్ట్ లాంచింగ్, ఆడియో ఫంక్షన్...ఇలాంటివాటికి ఈవెంటర్లపై ఆధారపడుతున్నాయి. ఈ కోర్సు పూర్తిచేసుకున్నవారు ఈవెంట్ సంస్థలో ఉద్యోగం లేదా సొంతగా ఈవెంట్స్ నిర్వహించవచ్చు. ఫీజు రూ.8000.
బీబీఏ సర్వీసెస్ మేనేజ్మెంట్: దీన్ని మహారాష్ట్ర నాలెడ్జ్ కార్పొరేషన్ లిమిటెడ్తో కలిసి అందిస్తోంది. సేవా రంగంలో ఉద్యోగిగా కొనసాగడానికి అనువుగా రూపొందించారు. కోర్సు వ్యవధి మూడేళ్లు. ఫీజు ఏడాదికి రూ.20,000. సేవా రంగంలో ప్రారంభస్థాయి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అలవర్చుకునేలా తర్ఫీదు అందిస్తారు. నేర్చుకోవడం, పని అనుభవం పొందడం రెండూ కోర్సు ద్వారా దక్కుతాయి.
*************************************
మరింత సమాచారం ... మీ కోసం!