‣ ఎన్సీహెచ్ఎం - జేఈఈ ప్రకటన విడుదల
విస్తృత అవకాశాలకు చిరునామాగా నిలుస్తోంది.. ఆతిథ్య రంగం. ప్రతి సందర్భాన్నీ వేడుకగా జరుపుకునే సంస్కృతి, కొత్త పుంతలు తొక్కుతున్న పర్యాటకం, బయట భిన్నరకాల ఆహారాన్ని ఆస్వాదించే అలవాట్లు.. ఈ పరిణామాలన్నీ హాస్పిటాలిటీకి ప్రాముఖ్యంపెంచుతున్నాయి. దీంతో మేటి సంస్థల్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తిచేసుకున్నవారు సులువుగా ఉద్యోగాలు పొందుతున్నారు. స్వయం ఉపాధితోనూ రాణిస్తున్నారు. ఆతిథ్యరంగంపై ఆసక్తి ఉన్నవారు దేశంలో విశిష్టమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఐహెచ్ఎం) సంస్థల్లో చదవడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఈ సంస్థలన్నీ ఉమ్మడి పరీక్షతో ప్రవేశం కల్పిస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ -జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎన్సీహెచ్ఎం - జేఈఈ) 2023 ప్రకటన వెలువడింది.
కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎం అండ్ సీటీ) ఏర్పాటైంది. ఈ సంస్థ బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును ఐహెచ్ఎంల్లో అందిస్తోంది. వీరికి డిగ్రీలను జేఎన్యూ, న్యూదిల్లీ ప్రదానం చేస్తుంది. కోర్సులో ప్రవేశానికి ఎన్సీహెచ్ఎం- జేఈఈ రాయాలి. ఈ స్కోరుతో మొత్తం 75 సంస్థల్లో అవకాశం లభిస్తుంది. వీటిలో కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న 21 జాతీయ ఐహెచ్ఎంలు ఉన్నాయి. మిగిలినవి రాష్ట్ర స్థాయి, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, ప్రైవేటు సంస్థలు.
తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఐహెచ్ఎం) హైదరాబాద్, రాష్ట్రీయ సంస్థలైన డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తిరుపతి, తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సంగారెడ్డి.. ఎన్సీహెచ్ఎం - జేఈఈతో ప్రవేశం కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని సంస్థల్లోనూ మొత్తం 11965 సీట్లు ఉన్నాయి. ఐహెచ్ఎం హైదరాబాద్లో 285, వైఎస్ఆర్ నిథమ్, హైదరాబాద్లో 120, తిరుపతి, మెదక్ ఐహెచ్ఎంలు ఒక్కో దానిలో 60 సీట్లు ఉన్నాయి. ఈ స్కోరుతో ఇతర ప్రైవేటు సంస్థల్లోనూ చేరవచ్చు.
ఉమ్మడి పరీక్ష
పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలుంటాయి. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ ఎనలిటికల్ ఆప్టిట్యూడ్ 30, రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ 30, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 30, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 60, సర్వీస్ సెక్టార్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.
ఏం చదువుతారు?
బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు వ్యవధి మూడేళ్లు. మొత్తం 6 సెమిస్టర్లు. ఇందులో భాగంగా ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్, అకామడేషన్ ఆపరేషన్, ఫ్రంట్ ఆఫీస్, అకౌంటింగ్, కమ్యూనికేషన్, హోటల్ ఇంజినీరింగ్, న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్, కంప్యూటర్స్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫెసిలిటీ ప్లానింగ్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంశాల్లో అధ్యయనం చేస్తారు. కోర్సు చివరలో ప్రాజెక్టు వర్కు పూర్తిచేయాలి. ఇందుకోసం విద్యా సంస్థలు ఏదైనా హోటల్ లేదా క్యాటరింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని తర్ఫీదు అందిస్తాయి. ఈ కోర్సును జనరిక్తోపాటు శాకాహారుల కోసమూ అందిస్తున్నారు. వెజిటేరియన్ కోర్సు ఎంచుకున్నవారికి వెజ్ అంశాల్లో ప్రత్యేక తర్ఫీదు అందుతుంది. వీరు మాంసాహార వంటలను నేర్చుకోనవసరం లేదు.
ఉద్యోగాలిక్కడ
కేంద్రం ఆధ్వర్యంలో నడిచే ఐహెచ్ఎంల్లో కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ఉద్యోగావకాశాలకు ఢోకా లేదు. ఈ సంస్థలకు జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు, అవసరాలకు అనుగుణంగా అందిస్తోన్న సమగ్ర శిక్షణ ఇందుకు కారణం. దాదాపు ఈ సంస్థల విద్యార్థులందరూ ప్రాంగణ నియామకాల్లో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.
చదివిన స్పెషలైజేషన్ ప్రకారం... కిచెన్ మేనేజ్మెంట్, హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్, ఫ్లైట్ కిచెన్స్/ ఆన్బోర్డ్ ఫ్లైట్ సర్వీసెస్, వివిధ సేవా పరిశ్రమల్లో గెస్ట్/ కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, ఫాస్ట్ఫుడ్ చెయిన్స్ లో ఎగ్జిక్యూటివ్, క్యాటరింగ్ సంస్థలు, షిప్పుల్లో సప్లై, కిచెన్ సెక్షన్ ఉద్యోగాలు; పర్యాటక సంస్థలు, కేంద్రాల్లో వివిధ రకాల సేవలు, బహుళజాతి కంపెనీల క్యాంటీన్లు, హౌస్ కీపింగ్ నిర్వహణ, హోటల్ మేనేజ్మెంట్ కళాశాలల్లో ఫ్యాకల్టీ, సొంతంగా ఫుడ్ చెయిన్ ప్రారంభించడం...తదితర అవకాశాలు దక్కుతాయి. లీలా, ఒబేరాయ్, తాజ్, పార్క్, స్టార్ వుడ్, మారియట్...ఇలా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. ఫుడ్ చైన్ సంస్థలైన కేఎఫ్సీ, మెక్ డొనాల్డ్స్, పీజాహట్, డామినోస్..మొదలైనవి ప్రాంగణ నియామకాల్లో ఎక్కువమందిని తీసుకుంటున్నాయి. ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు వీరు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉన్నత విద్య
బీఎస్సీ తర్వాత ప్రత్యేక అంశంలో ప్రావీణ్యం పొందాలనుకున్నవారు రెండేళ్ల వ్యవధితో ఎమ్మెస్సీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసుకోవచ్చు. పలు ఐహెచ్ఎంలు పీజీ కోర్సులు అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేసుకున్నవారు బోధనలో రాణించవచ్చు లేదా ఆతిథ్య రంగంలో ఉన్నత స్థాయి హోదాలతో అవకాశం పొందవచ్చు. బీఎస్సీ అనంతరం పీజీ డిప్లొమా కోర్సుల్లోనూ చేరవచ్చు. వీటిని ఏడాది/ ఏడాదిన్నర వ్యవధితో పలు సంస్థలు అందిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ హోటళ్లలోనూ ఈ కోర్సులు పూర్తిచేసుకుని అక్కడే ఉపాధి పొందవచ్చు. ఐటీసీ, వెల్కమ్ గ్రూపులు వీటిని ప్రత్యేకంగా అందిస్తున్నాయి. కోర్సు పూర్తయిన వెంటనే ఆ సంస్థల్లో మంచి హోదా, వేతనంతో ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి.
మెరుగైన స్కోరుకు..
కేంద్రం ఆధ్వర్యంలో నడిచే ఐహెచ్ఎంల్లో ప్రవేశానికి పోటీ ఎక్కువ. అందువల్ల సీటు పొందడానికి మేటి స్కోరు తప్పనిసరి.
‣ ఈ పరీక్ష మరీ అంత కష్టమేమీ కాదు. ప్రశ్నల్లో కొన్ని సులువుగా, మరికొన్ని మధ్యస్థంగా ఉంటాయి.
‣ న్యూమరికల్ ఎబిలిటీ, ఎనలిటికల్ ఆప్టిట్యూడ్ విభాగంలోని ప్రశ్నలకు 9, 10 తరగతుల గణిత పుస్తకాలు బాగా చదవాలి. వయసు, పని-వేతనం, చైన్ రూల్, సమయం-పని విభాగాల్లో ప్రశ్నలు వస్తున్నాయి. గుణింతాలు, కూడికలు, తీసివేతలు, భాగహారం, కసాగు, గసాభా, సగటు, నిష్పత్తి, భిన్నాలు మొదలైనవాటిలో ప్రాథమికాంశాలపై దృష్టి సారించాలి. ప్రతి అంశంలోనూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
‣ రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ విభాగంలోని ప్రశ్నలు తర్కంతో ముడిపడి ఉంటాయి. అయితే ఇవి తేలికగానే ఉంటాయి. బ్లడ్ రిలేషన్లు, సిరీస్, స్టేట్ మెంట్ అండ్ అజంప్షన్స్, వెర్బల్ రీజనింగ్ విభాగాలపై ఎక్కువ దృష్టి సారించాలి.
‣ జీకే, కరెంట్ అఫైర్స్ విభాగంలో ఎక్కువ ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ (స్టాక్ జీకే) నుంచే వస్తున్నాయి. హిస్టరీ, పాలిటీ, జనరల్ సైన్స్ల్లోని ప్రాథమికాంశాల నుంచి వీటిని ఎక్కువగా అడుగుతున్నారు. అందువల్ల 8,9,10 తరగతుల సైన్స్, సోషల్ పుస్తకాల్లోని ముఖ్యాంశాలు బాగా చదువుకోవాలి. రాజధానులు, కరెన్సీ, పార్లమెంట్లు, క్రీడలు-విజేతలు, అవార్డులు, పుస్తకాలు-రచయితలు..వీటిని ప్రాధాన్యంతో చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
‣ ఆంగ్ల విభాగంలోని ఎక్కువ ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలోనే ఉంటాయి. సమానార్థాలు, వ్యతిరేక పదాలు, కంజక్షన్లు, ప్రిపొజిషన్లు, పాసేజ్ మొదలైన విభాగాల నుంచి వీటిని అడుగుతారు. 9, 10 తరగతుల్లోని వ్యాకరణాంశాలు బాగా అధ్యయనం చేయాలి.
‣ సర్వీస్ సెక్టార్ ఆప్టిట్యూడ్ విభాగంలోని ప్రశ్నలు ఆతిథ్య, సేవా రంగాలకు చెందినవిగా ఉంటాయి. ప్రశ్నను బాగా చదివి, ఆలోచించి, విచక్షణతో సమాదానం గుర్తించవచ్చు. ఆతిథ్య పరిశ్రమ, సేవరంగంపై అవగాహన పెంచుకుంటే గరిష్ఠ మార్కులు సొంతం చేసుకోవచ్చు.
‣ పాత ప్రశ్నపత్రాలు నిశితంగా పరిశీలించాలి. ప్రశ్నలు ఏ అంశాల నుంచి, ఏ స్థాయిలో అడుగుతున్నారో తెలుసుకుని సన్నద్ధతను అందుకు తగ్గట్టుగా మలచుకోవాలి.
‣ పరీక్షకు ముందు వీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేసి, తప్పులు సరిదిద్దుకున్నవారు.. మేటి మార్కులతో కేంద్ర ఐహెచ్ఎంలో సీటు సాధించగలరు.
ముఖ్య సమాచారం
ఆన్లైన్ దరఖాస్తులు: ఏప్రిల్ 27 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ రూ.450. ఈడబ్ల్యుఎస్ రూ.700. జనరల్, ఓబీసీ, ఓబీసీ-ఎన్సీఎల్.. వీరందరికీ రూ.1000.
పరీక్ష తేదీ: మే 14
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: ఏ వయసువారైనా ఈ పరీక్ష రాసుకోవచ్చు. గరిష్ఠ వయసు నిబంధనను తొలగించారు..
పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో.. హైదరాబాద్, వరంగల్. ఏపీలో.. గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం
వెబ్సైట్: https://nchmjee.nta.nic.in/
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతిష్ఠాత్మక బిర్లా సంస్థల్లో ఇంజినీరింగ్!
‣ ప్రేమ్జీ సంస్థల్లో ప్రతిష్ఠాత్మక కోర్సులు!