‣ ఐఐటీటీఎం ప్రకటన విడుదల
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటీటీఎం) బీబీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. నెల్లూరుతో సహా దేశవ్యాప్తంగా వివిధ క్యాంపస్ల్లో వీటిని అందిస్తున్నారు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ, బృంద చర్చ, ముఖాముఖి ద్వారా ప్రవేశం లభిస్తుంది. ప్రకటన పూర్తి వివరాలు చూద్దాం...
పర్యాటక రంగంలో సేవల నిమిత్తం సుశిక్షితులైన మానవ వనరులను రూపొందించే నిమిత్తం మన దేశంలో జాతీయ ప్రాధాన్య సంస్థలుగా నెల్లూరు, గ్వాలియర్, భువనేశ్వర్, నోయిడాల్లో ఐఐటీటీఎంలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులను అందిస్తున్నారు. వీటిని ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, అమరాంతక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల్లో చదువుల నిమిత్తం ఫీజు చెల్లించడానికి పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణసదుపాయం కల్పిస్తుంది. వివిధ వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందుతున్నాయి.
ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్నవారు ప్రభుత్వ, ప్రైవేటు పర్యాటక సంస్థలు; రిసార్టులు, క్యాటరింగ్ సంస్థలు, విమానయాన సంస్థలు, హోటళ్లు, ఆతిథ్యంతో ముడిపడే ఇతర సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఇక్కడి విద్యార్థులను క్యాంపస్ నియామకాల ద్వారా మేక్ మై ట్రిప్, యాత్రా, ఐఆర్సీటీసీ, మారియట్, షెరటాన్, బామర్ లారీ, హాలిడే ఇన్, జెట్ ఎయిర్వేస్, హ్యాపీటూర్...తదితర సంస్థలు ఎంపిక చేసుకుంటున్నాయి.
ఏయే కోర్సులు?
ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్
సీట్లు: మొత్తం 750. వీటిలో గ్వాలియర్లో 334, భువనేశ్వర్లో 112, నోయిడా 189, నెల్లూరు 75, గోవాలో 40 చొప్పున ఉన్నాయి.
అర్హత: ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం సరిపోతుంది. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం డిగ్రీ కోర్సుల్లో ఉన్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జులై 1, 2021 నాటికి 27 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ, బృందచర్చ, ముఖాముఖిలో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు. పరీక్షకు 70 శాతం, గ్రూప్ డిస్కషన్కు 15, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. మ్యాట్, క్యాట్, సీమ్యాట్, జాట్, జీమ్యాట్, ఆత్మా- వీటిలో ఏదో ఒక పరీక్షలో స్కోరు సాధించినవారికి ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇవేవీ లేనివారు ఐఐటీటీఎం నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలి.
బీబీఏ టూరిజం అండ్ ట్రావెల్
సీట్లు: అన్ని క్యాంపస్ల్లోనూ కలిపి మొత్తం 375 ఉన్నాయి. వీటిలో గ్వాలియర్ 112, భువనేశ్వర్ 75, నోయిడా 113, నెల్లూరుకు 75 కేటాయించారు.
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 45 శాతం. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జులై 1, 2021 నాటికి 22 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల మినహాయింపు వర్తిస్తుంది
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, బృందచర్చ, ముఖాముఖిలతో సీట్లు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్షకు 70 శాతం, గ్రూప్ డిస్కషన్కు 15, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది
పరీక్ష ఇలా
బీబీఏ, ఎంబీఏ రెండు కోర్సులకూ ప్రవేశ పరీక్ష స్వరూపం ఒకటే. అయితే ప్రశ్నల స్థాయిలో వ్యత్యాసం ఉంటుంది. పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇందులో జనరల్ అవేర్నెస్ 50, వెర్బల్ ఎబిలిటీ 25, క్వాంటిటేటివ్ ఎబిలిటీ 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు. సమాధానాలు ఓఎంఆర్ పత్రంపై గుర్తించాలి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల స్వీకరణ: మే 21 వరకు.
పరీక్ష: జూన్ 6న ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: నెల్లూరు, భువనేశ్వర్, గ్వాలియర్, నోయిడాల్లో
వెబ్సైట్: https://iittm.ac.in/