దూరవిద్య అనగానే తెలుగు రాష్ట్రాల్లో వెంటనే గుర్తుకు వచ్చేది డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయమే. విద్యార్థులతోపాటు ఉద్యోగులూ ఈ విశ్వవిద్యాలయం అందించే కోర్సుల్లో చేరుతున్నారు. స్టడీ సెంటర్లు సమీపంలో ఉండడం, మెటీరియల్ నాణ్యత, తక్కువ ఫీజులు... తదితర కారణాలతో ఈ సంస్థ అందరికీ దగ్గరైంది. తెలుగు మీడియంలో పీజీ కోర్సులు ఈ విశ్వవిద్యాలయం ప్రత్యేకత. తాజాగా 2021-2022 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
ఇవీ కోర్సులు...
ఎంఏ: ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ. వీటిలో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ కోర్సులను తెలుగు మాధ్యమంలో ఈ వర్సిటీ అందిస్తోంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆంగ్ల మాధ్యమంలోనే లభిస్తుంది. లాంగ్వేజీ కోర్సులు సంబంధిత భాషలో ఉంటాయి. కోర్సుల ఫీజు మొదటి ఏడాదికి రూ.4400. రెండో ఏడాదికి రూ.4200. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్కు మొదటి ఏడాది రూ.6200. రెండో సంవత్సరానికి రూ.6600. ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు.
అర్హత: ఏదైనా యూజీ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎకనామిక్స్, తెలుగు కోర్సులకు మాత్రం యూజీలో ఆ సబ్జెక్టులు చదివుండడం తప్పనిసరి.
ఎమ్మెస్సీ: మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైకాలజీ. కోర్సును బట్టి ఫీజు మారుతుంది. వ్యవధి రెండేళ్లు. ఆంగ్ల మాధ్యమం .
అర్హత: సంబంధిత సబ్జెక్టులను బ్యాచిలర్ డిగ్రీలో చదివుండాలి. సైకాలజీకి మాత్రం ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీలో సైన్స్ గ్రూపులవారు ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్సులో చేరవచ్చు.
ఎంబీఏ: రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. ఈ కోర్సులో ప్రవేశానికి ఏపీ లేదా తెలంగాణ ఐసెట్్లో అర్హత తప్పనిసరి. డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 45 శాతం సరిపోతుంది. కోర్సు ఫీజు మొదటి ఏడాదికి రూ.10,150. రెండో సంవత్సరానికి రూ.పదివేలు.
ఎంఎల్ఐఎస్సీ: ఈ కోర్సుకు 40 శాతం మార్కులతో బీఎల్ఐఎస్సీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.కోర్సు వ్యవధి ఏడాది.
బీఎల్ఐఎస్సీ: గ్రాడ్యుయేషన్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 45 శాతం ఉన్నా సరిపోతుంది. కోర్సు వ్యవధి ఏడాది.
ఎంకాం: బీకాం, బీబీఏ, బీబీఎం, బీఏ (కామర్స్) వీటిలో ఏదైనా కోర్సు చదివినవారు చేరవచ్చు.
పీజీ డిప్లొమా: మార్కెటింగ్ మేనేజ్మెంట్, బిజినెస్ ఫైనాన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు, హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, ఉమెన్స్ స్టడీస్. ఒక్కో కోర్సు వ్యవధి ఏడాది.
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
సర్టిఫికెట్: ఫుడ్ అండ్ న్యూట్రిషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఎన్జీవోస్ మేనేజ్మెంట్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. కోర్సుల వ్యవధి ఆరు నెలలు. కోర్సును బట్టి వీటిని పదోతరగతి, ఇంటర్, ఎలాంటి విద్యార్హతలు లేకుండా అందిస్తున్నారు.
బీఏ.. బీఎస్సీ.. బీకాం
బీఏ, బీఎస్సీ కోర్సులను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో ఈ విశ్వవిద్యాలయం అందిస్తోంది. బీకాం తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్లో ఉంది. కోర్సుల వ్యవధి మూడేళ్లు. యూజీ కోర్సులకు ట్యూషన్ ఫీజు మొదటి ఏడాది రూ.2150, తర్వాత రెండేళ్లు ఏడాదికి రూ.2వేలు చొప్పున చెల్లించాలి. సైన్స్ కోర్సుల్లో చేరినవారు ల్యాబ్ ఫీజు ఒక్కో సబ్జెక్టుకు రూ.1200 చొప్పున కట్టాలి. యూజీ కోర్సులను ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)లో నిర్వహిస్తున్నారు. ఏడాదికి రెండు సెమిస్టర్ల చొప్పున ఉంటాయి.
ఏ కోర్సులు?
కళలు (ఆర్ట్స్): తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, హిందీ సాహిత్యం, ఉర్దూ సాహిత్యం.
సోషల్ సైన్సెస్ (సామాజిక శాస్త్రాలు): అర్థశాస్త్రం, చరిత్ర, రాజనీతిశాస్త్రం, మనోవిజ్ఞానశాస్త్రం, ప్రభుత్వ పాలనశాస్త్రం, సమాజశాస్త్రం, జర్నలిజం.
విజ్ఞానశాస్త్రాలు (సైన్స్): వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితశాస్త్రం, గణాంకశాస్త్రం, భూగర్భశాస్త్రం.
వాణిజ్యశాస్త్రం: కామర్స్.
అర్హత: యూజీ కోర్సులకు ఇంటర్ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా, రెండేళ్ల ఒకేషనల్/ ఐటీఐ కోర్సులు చదివినవారూ అర్హులే. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ చదివినవారికీ అవకాశం ఉంటుంది. ఎలాంటి విద్యార్హతలు లేనప్పటికీ యూజీ కోర్సులో చేరడానికి అవకాశం ఉంది. ఇలాంటి అభ్యర్థులు విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. జులై 1, 2021 నాటికి పద్దెనిమిదేళ్లు నిండినవారు ఈ పరీక్ష రాసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 12. రూ.200 అపరాధ రుసుముతో సెప్టెంబరు 9 http://www.braou.ac.in/Home.aspx