‣ చెన్నై మ్యాథమేటికల్ ఇన్స్టిట్యూట్ - మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీలు
కొన్ని సంస్థలు అందించే కోర్సులు ఎంతో ప్రత్యేకమైనవిగా నిలుస్తాయి. వాటికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. మన దేశంలో అలాంటి వాటిలో చెన్నై మ్యాథమేటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ) ఒకటి. ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్డీలతోపాటు ఎమ్మెస్సీ డేటాసైన్స్నూ అందిస్తున్నారు. వీటిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. పరీక్షలో ప్రతిభ చూపినవారికి అవకాశం కల్పిస్తారు. పేద విద్యార్థులకు ఫీజు మినహాయింపు, ప్రతిభా వంతులకు స్టైపెండ్ అందిస్తున్నారు.
మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ల్లో యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సులు పూర్తిచేయాలనే ఆకాంక్ష ఉన్నవారు, పరిశోధనల దిశగా అడుగులేయాలనుకున్నవారు సీఎంఐలో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఇక్కడ బోధన ప్రమాణాలు, పరిశోధన వనరులు మెరుగ్గా ఉంటాయి. దేశంలో ప్రసిద్ధ సంస్థలతోపాటు విదేశాల నుంచి సైతం నిపుణులు వచ్చి సీఎంఐ విద్యార్థులకు బోధిస్తారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, శ్రీరాం గ్రూప్... తదితర కార్పొరేట్ సంస్థలతోపాటు కేంద్రానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి నిధులు అందిస్తున్నాయి. యూజీసీ 2006లో ఈ సంస్థకు యూనివర్సిటీ హోదా ఇచ్చింది. ఇక్కడి విద్యార్థులు దేశీయంగానే కాకుండా ప్రపంచ స్థాయి సంస్థల్లో బోధన, పరిశోధనలో గొప్ప అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.
ఫీజు.. ఫెలోషిప్పులు..
అన్ని కోర్సులూ రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్నారు. ట్యూషన్ ఫీజు ప్రతి సెమిస్టర్కు రూ.లక్ష చెల్లించాలి. ఎమ్మెస్సీ డేటా సైన్స్కు మాత్రం రూ.2 లక్షలు. విద్యార్థుల ఆర్థిక నేపథ్యం బట్టి అన్ని కోర్సుల్లోనూ పూర్తిగా లేదా పాక్షికంగా ఫీజు మినహాయింపు లభిస్తుంది. అలాగే ప్రతిభావంతులకు యూజీ కోర్సులైతే ప్రతి నెలా రూ.5000 ఫెలోషిప్ కింద చెల్లిస్తారు. ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరినవారికి రూ.6000 అందిస్తారు. పీహెచ్డీ కోర్సులకు ఎంపికైనవారికి మొదటి రెండేళ్లూ నెలకు రూ.31,000 తర్వాత మూడేళ్లు రూ.35,000 చొప్పున చెల్లిస్తారు. పీహెచ్డీలో అవకాశం పొంది ప్రాంగణంలో వసతి సౌకర్యం లభించనివారు స్టైపెండ్లో 24 శాతం హెచ్ఆర్ఏ కింద అదనంగా అందుకోవచ్చు. పీహెచ్డీల్లో చేరినవారు బుక్ గ్రాంట్ ఏటా రూ.పదివేలు పొందవచ్చు.
ప్రవేశమిలా..
అన్ని కోర్సుల్లోనూ పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం కల్పిస్తారు. నేషనల్ ఒలింపియాడ్ల్లో ప్రతిభ చూపినవారికి నేరుగా యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. పీజీ, పీహెచ్డీలకు పరీక్షలతోపాటు ఇంటర్వ్యూలూ ఉంటాయి. ఫిజిక్స్లో పీహెచ్డీకి పరీక్ష నిర్వహించరు. జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్) స్కోరుతో నేరుగా ఇంటర్వ్యూకి అవకాశం కల్పిస్తారు. అలాగే మ్యాథ్స్లో పీహెచ్డీ చేయాలనుకున్నవారు ఎన్బీహెచ్ఎం ఫెలోషిప్కు ఎంపికైతే పరీక్ష రాయకుండా నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఇదే మాదిరిగా జస్ట్ ద్వారా కంప్యూటర్ సైన్స్లో రిసెర్చ్ అర్హత పొందినవారు సైతం నేరుగా ఇంటర్వ్యూతో ప్రవేశం పొందవచ్చు.
కోర్సులు.. అర్హతలు
‣ బీఎస్సీ ఆనర్స్: మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్; మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
‣ ఎమ్మెస్సీ: మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్
అర్హత: డిగ్రీలో మ్యాథ్స్ లేదా బీస్టాట్ లేదా బీటెక్ చదువుకున్నవారు ఎమ్మెస్సీ మ్యాథ్స్కు అర్హులు. కంప్యూటర్ సైన్స్ నేపథ్యంతో బీఎస్సీ, బీటెక్ కోర్సులు చదివినవారు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ నేపథ్యంతో యూజీ కోర్సులు చదివినవారు ఎమ్మెస్సీ డేటా సైన్స్కు అర్హులు. సంబంధిత సబ్జెక్టుల్లో ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ అర్హులే.
‣ పీహెచ్డీ: మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్
అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష ఇలా...
రెండు బీఎస్సీ కోర్సులకూ పరీక్షను ఉమ్మడిగానే నిర్వహిస్తారు. వంద పాయింట్లకు ఇది ఉంటుంది. ఇందులో 2 విభాగాలు ఉంటాయి. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ తరహా ప్రశ్నలు వస్తాయి. పార్ట్ ఎ 40, పార్ట్ బి 60 పాయింట్లు. పరీక్ష వ్యవధి 3 గంటలు. పార్ట్ ఎ స్క్రీనింగ్. ఇందులో కనీస పాయింట్లు సాధిస్తే పార్ట్ బి మూల్యాంకనం చేస్తారు. తుది ఎంపికలు మాత్రం రెండు పార్ట్ల్లో సాధించిన పాయింట్ల ఆధారంగా ఉంటాయి. పార్ట్ ఎలో 10 ప్రశ్నలు, ఒక్కో దానికి 4 పాయింట్లు. పార్ట్ బిలో 6 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 60 పాయింట్లు. ప్రశ్నలన్నీ ఇంటర్ మ్యాథ్స్ నుంచే అడుగుతారు. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, కాలిక్యులస్ విభాగాల నుంచి ఇవి ఉంటాయి.
‣ ఎమ్మెస్సీ, పీహెచ్డీ కోసం నిర్వహించే పరీక్షల్లోనూ రెండు పార్టులు ఉంటాయి. పార్ట్ ఎలో కనీస మార్కులు సాధిస్తేనే పార్ట్ బి మూల్యాంకనం చేస్తారు. రెండు విభాగాల్లోనూ సాధించిన మార్కులను ప్రవేశాల నిమిత్తం లెక్కిస్తారు. ప్రశ్నలన్నీ సంబంధిత సబ్జెక్టుల్లో యూజీ పాఠ్యాంశాల నుంచి వస్తాయి. ఎమ్మెస్సీ డేటా సైన్స్ ప్రశ్నలు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ నుంచి అడుగుతారు. పాతప్రశ్నపత్రాలు, సొల్యూషన్లు సీఎంఐ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వాటిని పరిశీలించడం ద్వారా ప్రశ్నల స్థాయి, చదవాల్సిన అంశాలపై అవగాహన పొందవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30
దరఖాస్తు ఫీజు: రూ.వెయ్యి.
పరీక్ష తేదీ: మే 22
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
వెబ్సైట్: https://www.cmi.ac.in/
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ టెన్త్తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
‣ నకిలీ ఉద్యోగ ప్రకటనలను గుర్తించడం ఎలా?
‣ ఆలోచన భిన్నమైతే అందుతాయి అవకాశాలు
‣ పర్సనాలిటీ పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు?
‣ రెండు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి?
‣ ఇప్పుడే మొదలుపెట్టండి... టెట్ సన్నద్ధత!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.