మనదేశంలో ప్రాధాన్యమున్న కోర్సుల్లో ఇంజినీరింగ్ ముందుంటుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణ భారతదేశంలో ఈ కోర్సుకి విశేష ప్రాధాన్యం ఉంది. లక్షల సంఖ్యలో విద్యార్థులు ఐఐటీ-జేఈఈ, ఎంసెట్ రాస్తున్నారు. దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలలు వివిధ బ్రాంచీల్లో కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో మేటి సంస్థల వివరాలు విద్యార్థులకు అందుబాటులో ఉండడానికి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ఏటా ర్యాంకులు ప్రకటిస్తోంది. ఇంజినీరింగ్లో ఈ ఏడాది కూడా ఐఐటీ మద్రాసే మొదటి స్థానంలో నిలిచింది!
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో ఇంజినీరింగ్ విభాగంలో 2016 నుంచి 2021 వరకు ఏటా ఐఐటీ మద్రాసే మేటి సంస్థగా నిలుస్తూ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఓవరాల్ కేటగిరీ, ఇంజినీరింగ్ ఇలా రెండు విభాగాల్లో ప్రథమ స్థానాన్ని పొందిన ఏకైక సంస్థగా ఐఐటీ మద్రాస్ గుర్తింపు పొందింది. ఇంజినీరింగ్ అనగానే గుర్తుకువచ్చేవి ఐఐటీలే. మన దేశంలో ఈ చదువులకు ఇవే ట్రేడ్ మార్కు సంస్థలు. వీటి తర్వాతి స్థానంలో పాత ఎన్ఐటీలకు ప్రాధాన్యం ఉంది. ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చోటు పొందుతున్నాయి. మొదటి స్థానానికి పోటీ ఎప్పుడూ ఐఐటీల మధ్యే ఉంటోంది. అయినప్పటికీ ఆరేళ్లగా ఐఐటీ మద్రాసే మెరుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ-ఎంలో ఉన్న వివిధ ఇంజినీరింగ్ కోర్సుల వివరాలు చూద్దాం...
‣ బీటెక్: ఏరోస్పేస్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ ఫిజిక్స్, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ బ్రాంచీల్లో నాలుగేళ్ల కోర్సులు ఉన్నాయి. ఏరోస్పేస్, బయలాజికల్, ఇంజినీరింగ్ డిజైన్ విభాగాల్లో అయిదేళ్ల బ్యాచిలర్, మాస్టర్ టెక్నాలజీ కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. సీట్లు ఐఐటీ-జేఈఈతో భర్తీ చేస్తారు.
‣ ఎంటెక్: ఈ సంస్థలో ఎంటెక్లో విస్తృత స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశం గేట్లో చూపిన ప్రతిభతో లభిస్తుంది. ఏరోస్పేస్, కంప్యుటేషనల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మెకానిక్స్, బయో మెడికల్, క్యాటలైసిస్ టెక్నాలజీ, బిల్డింగ్ టెక్నాలజీ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్, జియో టెక్నికల్, హైడ్రాలిక్ అండ్ వాటర్ రిసోర్సెస్, స్ట్రక్చురల్, ట్రాన్స్పోర్టేషన్, కెమికల్, క్లినికల్, కంప్యూటర్ సైన్స్, కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, పవర్ సిస్టమ్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ డిజైన్, కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఆర్ఎఫ్ అండ్ ఫొటోనిక్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ మ్యాథమేటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్, థర్మల్ ఇంజినీరింగ్, మెకానికల్ డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, ఓషన్ స్ట్రక్చర్, ఓషన్ టెక్నాలజీ, పెట్రోలియం, ఫంక్షనల్ మెటీరియల్స్ అండ్ నానో టెక్నాలజీ విభాగాల్లో ఇక్కడ ఎంటెక్ కోర్సులు చదువుకోవచ్చు.
బోధన, అభ్యాసం, వనరులు; పరిశోధన, వృత్తి అభ్యాసం; సంస్థలో చదివిన విద్యార్థుల ప్రతిభ, సంస్థలో చేరుతోన్న విద్యార్థుల్లో వైవిధ్యం, అకడమిక్, పరిశ్రమలకు చెందిన నిపుణుల దృక్పథం పరామితులుగా తీసుకుని వీటి విలువలను మదింపు చేసి మొత్తం స్కోరు ద్వారా మేటి సంస్థలను ఎంపిక చేశారు. ఇంజినీరింగ్ విషయానికొచ్చేసరికి విద్యార్థులకు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో లభించిన ఉన్నత విద్య అవకాశాలు, ప్లేస్మెంట్లు, మధ్యగత జీతం, విశ్వవిద్యాలయ పరీక్షల్లో ఫలితాలు, పీహెచ్డీలో చేరడానికి అర్హత పొందినవారు...తదితరాంశాలనూ పరిగణనలోకి తీసుకున్నారు.
టాప్ 10 సంస్థలు
ఐఐటీ- మద్రాస్,
దిల్లీ,
ముంబై,
కాన్పూర్,
ఖరగ్పూర్,
రవుర్కెలా,
గువాహటి,
హైదరాబాద్,
ఎన్ఐటీ-తిరుచురాపల్లి,
సూరత్కల్.
తెలుగు రాష్ట్రాల్లో: ఐఐటీ హైదరాబాద్ 8, ఎన్ఐటీ వరంగల్ 23, కేఎల్ యూనివర్సిటీ వడ్డేశ్వరం 50, ఐఐఐటీ హైదరాబాద్ 54, జేఎన్టీయూ హైదరాబాద్ 62, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 74, విజ్ఞాన్ గుంటూరు 111, జేఎన్టీయూ కాకినాడ 123, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 132, సీబీఐటీ హైదరాబాద్ 133, ఎస్ఆర్ యూనివర్సిటీ, వరంగల్ 134, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి హైదరాబాద్ 135, వర్ధమాన్ హైదరాబాద్ 141, అనురాగ్ యూనివర్సిటీ హైదరాబాద్ 146, సీవీఆర్ హైదరాబాద్ 155, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ హైదరాబాద్ 159, గోకరాజు రంగరాజు హైదరాబాద్ 165, వీఆర్ సిద్దార్థ విజయవాడ 178, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ 197, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి 200 స్థానాల్లో నిలిచాయి.