ఇంటర్మీడియట్ సైన్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మంచి కోర్సు డ్యుయల్ బి.ఎస్.-ఎం.ఎస్. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) సంస్థలు ఈ ప్రోగ్రామ్ను అందిస్తున్నాయి. దీనిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు నెల నెల స్కాలర్షిప్ లభిస్తుంది.
ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సులకు విపరీతమైన డిమాండ్ వల్ల శాస్త్ర విద్య వైపు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటర్ విద్యార్థులను బేసిక్ సైన్సెస్ వైపు ప్రోత్సహించడానికి ఐఐఎస్ఈఆర్లు ఏర్పాటయ్యాయి. పుణె, భోపాల్, కోల్కత, మొహాలీ, తిరువనంతపురంలలో స్వయం ప్రతిపత్తి హోదాతో ఈ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఐఐఎస్ఈఆర్లలో నిర్వహిస్తోన్న డ్యుయల్ బి.ఎస్. - ఎం.ఎస్. కోర్సులో ప్రవేశానికి కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై), కేంద్ర, రాష్ట్ర బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఈ సంస్థలు ప్రవేశం కల్పిస్తున్నాయి. ఎంపికైన విద్యార్థులు అందరికీ ప్రభుత్వం ఇన్స్పైర్ స్కాలర్షిప్లను అందిస్తుంది. బి.ఎస్.- ఎం.ఎస్. డ్యుయల్ డిగ్రీతోపాటు బీఎస్సీ పాసైన విద్యార్థులకు ఇంటెగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సును కూడా కొన్ని ఐఐఎస్ఈఆర్లు అందిస్తున్నాయి.
మొత్తం మూడు రకాల అభ్యర్థులు డ్యుయల్ డిగ్రీ కోర్సుకు అర్హులు. వీరంతా వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ వివరాలు...
‣ సంబంధిత స్ట్రీమ్లో కేవీపీవై స్కాలర్షిప్లకు ఎంపికైనవారు.
‣ జేఈఈలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు.
‣ కేంద్ర, రాష్ట్రాల బోర్డు పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులు
కేవీపీవై, జేఈఈ అభ్యర్థులకు ఒకేసారి కౌన్సెలింగ్ ఉంటుంది. కౌన్సెలింగ్కు అర్హులైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పెడతారు. కేంద్ర, రాష్ట్రాల బోర్డుల విద్యార్థులను ఐఐఎస్ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, కౌన్సెలింగ్ ఆధారంగా కోర్సుకు ఎంపిక చేస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్లో మేథమేటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అంశాల నుంచి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. బోర్డు కటాఫ్లు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఆన్లైన్ దరఖాస్తు విధానం, ఇతర వివరాలు ఐఐఎస్ఈఆర్ వెబ్సైట్ www.iiser-admissions.in లో లభిస్తాయి.