• facebook
  • whatsapp
  • telegram

ఏపీ సెట్‌.. ఇదిగో రూట్‌!

 పీ సెట్‌ ప్రకటన వెలువడింది! ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో సహాయ ఆచార్యుల, అధ్యాపకుల ఉద్యోగాల్లో అర్హత పరీక్షకు సంబంధించిన ప్రకటన ఇది. వివిధ యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడనున్న సందర్భంలో ఈ ప్రకటన.. పీజీ ఉత్తీర్ణత పొంది, అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించదలచినవారికి ఒక సదవకాశం! 
* ఏపీ సెట్‌ ఈసారి 30 సబ్జెక్టుల్లో జరుగుతుంది.
* విజువల్‌ ఆర్ట్స్‌ను కొత్తగా చేర్చారు.
* గతంలో ఉన్న 6 పరీక్ష కేంద్రాలకు అదనంగా కడప, కర్నూలుల్లో నూతన పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
* నెగిటివ్‌ మార్కు లేదు.
* ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్ష జరుగుతుంది.
ఏదైనా ఒక సబ్జెక్టులో ఇప్పటికే ఏపీ సెట్‌/నెట్‌ ఉత్తీర్ణులైనవారు మళ్లీ అదే సబ్జెక్టులో ఏపీ సెట్‌ రాయటానికి వీలు లేదు.


ఏ పేపర్‌ ఎలా?
పేపర్‌-1: అన్ని సబ్జెక్టుల అభ్యర్థులూ రాయాల్సినది. 50 ప్రశ్నలు, 100 మార్కులు. ప్రధానంగా అభ్యర్థి వివేచనా సామర్థ్యం, విషయ అవగాహన, విభిన్న ఆలోచన విధానం, సాధారణ పరిజ్ఞానం లాంటి అంశాల్లో ప్రశ్నిస్తారు. ప్రధానంగా పది విభాగాలుంటాయి. 1. బోధనాభిరుచి 2. పరిశోధనాభిరుచి 3. పఠనావగాహన 4. సంభాషణ 5. గణిత వివేచన 6. తార్కిక వివేచన 7. దత్తాంశ వ్యాఖ్యానం 8. ఐ.సి.టి. 9. ప్రజలు-పర్యావరణం, 10. ఉన్నత విద్యావ్యవస్థలో సుపరిపాలన. ప్రతి విభాగం నుంచి ప్రశ్నలకు అవకాశమున్న అంశాలు/ భావనలు ఎంచుకొని సన్నద్ధత ప్రారంభించాలి. జ్ఞానాత్మక సామర్థ్యాలు, అవబోధం, విశ్లేషణ, మూల్యాంకనం, ఆగమన, నిగమన, తార్కిక వివేచన సామర్థ్యాలు, పర్యావరణం, సహజ వనరులు, సమాచార సాంకేతిక రంగంపై మూలభావనలు, ఆధునిక జీవన విధానంపై ప్రభావం మొదలైన అంశాలపై లోతైన అవగాహన, పరిజ్ఞానం అవసరం.
బోధనాస్వభావం, లక్ష్యాలు, లక్షణాలు, బోధన ఉపగమాలు, మదింపు, మూల్యాంకనం, పరిశోధన-స్వభావం, సోపానాలు, పద్ధతులు, విలువలు, పరిశోధన వ్యాసం లక్షణాలు, కమ్యూనికేషన్‌ అర్థం, రకాలు, లక్షణాలు, అవరోధాలు, ఇంటర్‌నెట్‌, ఈ-మెయిల్‌, కంప్యూటర్‌ మెమరీ- ఈ భావలపై ప్రామాణిక పుస్తకాలు, మెటీరియల్‌ ఆధారంగా, గత ప్రశ్నపత్రాల ఆధారంగా నోట్స్‌ తయారు చేసుకోవాలి. అభ్యాసం, పునశ్చరణ, స్వీయ విశ్లేషణ చేసుకొని, ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.
పేపర్‌-2: దీనిలో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించి సమాధానాలు రాయాలి. 100 ప్రశ్నలు, 200 మార్కులు. సబ్జెక్టు పూర్వజ్ఞానం, విషయంపై అవగాహన స్థాయి, మూల భావనలు, ఆధునిక విషయ భావనలు నేర్చుకోవాలి. విషయాన్ని ఉన్నదున్నట్లుగా గాక రకరకాల సందర్భాలకు, సన్నివేశాలకు అనువర్తింపచేయాల్సినవిధంగా వివిధ సమస్యలను సాధన చేయాలి. ప్రశ్నల కఠినత్వస్థాయి పెరిగేకొద్దీ, సమాచారాన్ని విస్తరించుకుంటూ అభ్యసించాలి. ఎంచుకున్న సబ్జెక్టులో పీజీ స్థాయి ప్రశ్నలు అడుగుతారు. సబ్జెక్టును పూర్తిగా అవగాహన చేసుకొని, అన్వయించగలిగే సామర్థ్యాన్ని పొందివుండాలి. అకడమిక్‌ పరీక్షలకు చదివిన విషయాన్ని, ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలలోకి మార్చుకోగలగాలి.


 

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌