రాష్ట్ర అర్హత పరీక్ష (సెట్) ఆప్షనల్ సబ్జెక్టుల్లో అర్థశాస్త్రం కూడా ఒకటి. ఎకనామిక్స్ ఆప్షనల్ నేపథ్యంలో అనేక అంశాలు నిరంతరం మారుతుంటాయి. మారుతున్న అంశాలకు అనుగుణంగా మనం పరీక్షకు సిద్ధం కావాలి
అర్థశాస్త్రానికి సంబంధించి ముందుగా సెట్ సిలబస్ అధ్యయనం చేయాలి. ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. దానికోసం ప్రామాణిక పుస్తకాలను ఆధారం చేసుకోవాలి. చదివిన సిద్ధాంతాలు, వాటి ముఖ్యాంశాల్ని అనువర్తితం చేసుకుంటూ అభ్యసనం కొనసాగించాలి.
* ఈ సెట్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు బట్టీపట్టి, అర్హత సాధించాలనుకోవడం కుదరదు. డిస్క్రిప్టివ్ విధానంలో చదివితేనే ప్రశ్న ఏ కోణంలో అడిగినా జవాబు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకని అభ్యర్థులు ప్రతి పాఠ్యాంశానికీ సంబంధించి విస్తృతంగా అధ్యయనం చేస్తే లోతైన ప్రశ్నలకు జవాబులను గుర్తించవచ్చు.
* అర్థశాస్త్రం సిలబస్ అధ్యయనం చేసి ప్రామాణిక పుస్తకాల ఆధారంగా సిద్ధమవటం ప్రారంభ దశగా చెప్పవచ్చు.
* పాత ప్రశ్నపత్రాల ఆధారంగా కీలకమైన అధ్యాయాలు గుర్తించి వాటి ప్రాధాన్యాన్ని బట్టి సన్నద్ధత కొనసాగించాలి. అలా ఒక్కో అధ్యాయం పూర్తిచేసి, వాటిపై పట్టు సాధించాలి.
* అలా పూర్తయిన విభాగాల్ని అన్నింటినీ వీలయినన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేయటం ప్రధానం.
* తర్వాతి దశలో మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. తద్వారా సమాధానం గుర్తించంలో వేగం, కచ్చితత్వం అనే నైపుణ్యాలను పెంచుకోవచ్చు.