• facebook
  • whatsapp
  • telegram

డిజిటల్‌ బాటలో సేద్యం

సాంకేతిక సాయంతో సాగు

వ్యవసాయ చట్టాలపై భారతీయ రైతుల ఆందోళన ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చట్టాలు చివరకు సేద్యాన్ని కార్పొరేట్‌ పరం చేస్తాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ వంటి భారీ టెక్‌ సంస్థలు నేడు వ్యవసాయ సాంకేతికతల అభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్ర, రేపు సేద్యంలో డిజిటల్‌ వలసవాదానికి దారితీస్తుందనే విమర్శలున్నాయి. మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ అమెరికాలో అందరికన్నా ఎక్కువ పంట పొలాలున్న భూస్వామిగా అవతరించడం గమనార్హం. అమెరికాలో గేట్స్‌, ఆయన భార్య మెలిండా కలిసి 2,68,984 ఎకరాలు కొన్నారు. భారత్‌తో సహా ఇతర దక్షిణాసియా దేశాల్లో, ఆఫ్రికా దేశాల్లో అధిక దిగుబడి ఇచ్చే సుస్థిర వ్యవసాయాభివృద్ధికి బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందిస్తోంది. వాతావరణ మార్పులను తట్టుకోగల పంటలనూ ప్రోత్సహిస్తోంది. అయితే, సామాజిక, పర్యావరణ ఉద్యమకారిణి వందనా శివ- గేట్స్‌ ఫౌండేషన్‌ కార్యకలాపాలను దానధర్మ పెట్టుబడిదారీ విధానంగా వర్ణిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ తన ఎజ్యూర్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సాంకేతికత ఆధారంగా ఎజ్యూర్‌ ఫార్మ్‌ బీట్స్‌ అనే డిజిటల్‌ వ్యవసాయ వేదికను నిర్మిస్తోంది. నేలలో తేమ, ఇతర అంశాలను పసిగట్టే సెన్సర్లు, డేటా ఎనలిటిక్స్‌, కృత్రిమ మేధ వంటి సాంకేతికతలతో రైతులకు కీలకమైన డేటా అందించే వేదిక అది. ఎజ్యూర్‌ డేటాతో డ్రైవర్‌ రహిత ట్రాక్టర్లు, నాట్లు, కోత యంత్రాలు, క్రిమినాశనులను చల్లే డ్రోన్లను, సెన్సర్లను అభివృద్ధి చేయడానికి భారీ వ్యవసాయ సాంకేతిక కంపెనీలతో మైక్రోసాఫ్ట్‌ చేతులు కలిపింది. గేట్స్‌లానే అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ కూడా 4,20,000 ఎకరాల భూమి కూడగట్టారు. ఇందులో ఎక్కువ భాగం ఆయన కుటుంబ వారసత్వంగా సంక్రమించినదే.

చిన్నరైతులపై ప్రభావం

ఇక ఫేస్‌బుక్‌ సంస్థ భారత్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.44,000 కోట్ల పెట్టుబడి పెట్టడం, రిలయన్స్‌ ఆన్‌లైన్‌ కిరాణా వ్యాపార వేదిక జియోమార్ట్‌కు గొప్ప ఊతమిస్తుంది. భారత వ్యవసాయంలో ఫేస్‌బుక్‌ ఇప్పటికే ప్రముఖ పాత్రధారి అయింది. వ్యవసాయ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి భారత రైతు బృందాలు అత్యధికంగా ఉపయోగిస్తున్న సాంకేతిక సాధనాలు- ఫేస్‌బుక్‌, దాని అనుబంధ వాట్సాప్‌లే. మహారాష్ట్రలో హోయ్‌ అమీ షేట్కారీ (హెచ్‌ఏఎస్‌) వాట్సాప్‌ గ్రూపులో నేడు ఆరు లక్షలకుపైగా సభ్యులున్నారు. హెచ్‌ఏఎస్‌- ఫేస్‌బుక్‌ గ్రూపు చీడపీడలు, తెగుళ్ల గురించి రైతులను హెచ్చరిస్తూ, పంట దిగుబడులు పెంచడానికి తోడ్పడే సమాచారాన్నీ పంచుతోంది. జియో కృషి యాప్‌ సునిశిత వ్యవసాయ పద్ధతులను రైతులకు అందిస్తోంది. ఈ యాప్‌లో నమోదయ్యే రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు, నాట్లు, పంటకు నీరు పెట్టాల్సిన సమయం, తెగుళ్ల నిరోధానికి సంబంధించిన సమాచారం (డేటా) అందుతుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), గూగుల్‌ సంస్థలు కలిసి రైతులకు బిగ్‌డేటా టూల్‌ను ఆవిష్కరించాయి. ఆపిల్‌ సంస్థ సునిశిత వ్యవసాయ సాధనంగా ఆపిల్‌ వాచ్‌ను మలచింది. ఇలా ప్రపంచంలో అతిపెద్ద సాంకేతిక దిగ్గజ సంస్థలు ఆహార, వ్యవసాయ రంగాల్లోకి ప్రవేశించడం చిన్న రైతులను, ఆహార విపణులను అధికంగా ప్రభావితం చేయనున్నది. తీవ్రతరమవుతున్న వాతావరణ మార్పుల మధ్య నానాటికీ పెరిగిపోతున్న ప్రపంచ జనాభా ఆహార అవసరాలను తీర్చాలంటే కొత్త సాంకేతికతలు అవసరమని టెక్‌ కంపెనీలు వాదిస్తున్నాయి. ఈ రంగంలో టెక్‌ కంపెనీలకన్నా బహుళజాతి వ్యవసాయ, వ్యాపార కంపెనీలు ముందున్నాయి.

కొనుగోలుదారులతో సంబంధాలు

సేద్య యాప్‌లు, డ్రైవర్‌ లేని ట్రాక్టర్లు, డ్రోన్లు వేల ఎకరాల్లో విస్తరించిన పంట భూముల్లో సాగుకు ఉపయోగపడతాయి కానీ, చిన్నకమతాలకు పొసగవు. ప్రపంచ దేశాల్లోని 50 కోట్ల చిన్న కమతదారులే మన ఆహార అవసరాలను తీరుస్తున్నారు. వీరికి యాప్‌ల వల్ల ఉపయోగం ఎంత అనేది ప్రశ్నార్థకం. క్లౌడ్‌ సాయంతో నడిచే డ్రైవర్‌ రహిత ట్రాక్టర్లు, డ్రోన్లను కొనే స్తోమత వారికి ఎటూ ఉండదు. వేల ఎకరాల్లో మొక్క  జొన్న, గోధుమ, సోయా వంటి ఏక పంటలను వేసే భూస్వాములకు, వ్యవసాయ వ్యాపార కంపెనీలకు మాత్రమే ఆ స్తోమత ఉంటుంది. యాప్‌ల ద్వారా సేకరించే సమాచారాన్ని వినియోగించుకునే సామర్థ్యమూ వాటికే ఉంటుంది. చిన్న కమతాలున్న ప్రాంతాల్లో వ్యవసాయ విస్తరణ సేవలు, కేంద్రీకృత క్షేత్ర సమాచార సేకరణ యంత్రాంగాలు ఎన్నడో విచ్ఛిన్నమై పోయినందువల్ల చిన్న కమతాల నుంచి లభించే డేటా నాణ్యత అంతంత మాత్రమే. ప్రభుత్వాలు, సాంకేతిక కంపెనీలు ఈ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నాలు చేయడం లేదు. గ్రామీణ ప్రజలను మొబైల్‌, అంతర్జాలంతో అనుసంధానించే ప్రాజెక్టులపై అపార ప్రజాధనాన్ని ఖర్చుపెడుతున్న ప్రభుత్వాలు- వ్యవసాయ విస్తరణ సేవలను ఆధునికీకరించడానికి నిధులు కేటాయించడం లేదు. దీంతో డిజిటల్‌ సేద్యంపై పెట్టుబడి పెడుతున్న కంపెనీలకు లక్షలాది చిన్న రైతులను తమ డిజిటల్‌ నెట్‌వర్క్‌లోకి తీసుకురావడానికి అనువైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చిన్న కమతందారులను కార్పొరేట్‌, సహకార సేద్యం వంటి పద్ధతుల్లోకి తీసుకొచ్చి తమ డిజిటల్‌ సేవలను విక్రయించే వెసులుబాటు కలుగుతోంది. దళారులను తొలగించి రైతులను నేరుగా మార్కెట్లతో అనుసంధానిస్తామంటూ తామే కొత్త దళారులుగా అవతరించే అవకాశం సాంకేతిక, అగ్రిబిజినెస్‌, ఈ-కామర్స్‌ కంపెనీలకు చిక్కనున్నది. రైతులకు విత్తనాల నుంచి యాప్‌ల వరకు, డ్రోన్ల నుంచి డ్రైవర్‌ రహిత ట్రాక్టర్ల వరకు విక్రయిస్తూ, వ్యవసాయోత్పత్తులను తామే మార్కెట్‌ చేస్తూ ధరవరలను శాసించే సత్తా వీటి సొంతం కానున్నది. లాభాల్లో సింహభాగం ఈ సంస్థల పరమవుతుంది. దీన్ని నివారించడానికి వివిధ దేశాల్లోని రైతులు ‘ఫార్మ్‌హ్యాక్‌’ పేరిట ఆన్‌లైన్‌ సమాజంగా ఏర్పడి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొంటున్నారు. కర్ణాటక రైతులు తమ పంటల ఫొటోలను ట్విటర్‌లో ఉంచి నేరుగా కొనుగోలుదారులతో సంబంధాలు ఏర్పరచుకొంటున్నారు. డిజిటల్‌ సేద్యం కార్పొరేట్ల గుత్తస్వామ్యంగా మారకుండా నివారిస్తూ, రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వాలూ కంకణబద్ధం కావాలి.

‘యాప్‌’సాయం

రైతులకు విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమినాశనులను విక్రయించే అగ్రిబిజినెస్‌ కంపెనీలన్నింటికీ సొంత యాప్‌లు ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద విత్తన, క్రిమినాశనుల సరఫరా సంస్థ బేయర్‌ యాప్‌ను అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్‌ దేశాల్లో 2.4 కోట్ల హెక్టార్ల పొలాల్లో ఉపయోగిస్తున్నారు. బేయర్‌ యాప్‌ ద్వారా సమాచారం అందించే రైతులకు ఆ సంస్థ తగ్గింపు రేట్లపై విత్తనాలు, క్రిమినాశనులను అందించి, వాటి వినియోగంపై సలహాలిస్తోంది. విత్తన కంపెనీ మోన్‌శాంటోను బేయర్‌ సంస్థ ఏనాడో కొనుగోలు చేసింది. బేయర్‌ యాప్‌ ప్రపంచంలో అతిపెద్ద క్లౌడ్‌ సర్వీసెస్‌ వేదిక అయిన అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఇతర అగ్రిబిజినెస్‌ కంపెనీలకూ అమెజాన్‌ క్లౌడ్‌ సేవలు అందుతున్నాయి. డేటా ప్రవాహాన్ని నియంత్రించే టెక్‌ కంపెనీలకు, ట్రాక్టర్లు, విత్తనాలను అమ్మే అగ్రిబిజినెస్‌ కంపెనీలకు మధ్య బలపడుతున్న పొత్తుకు ఇదే నిదర్శనం.

- ఏఏవీ ప్రసాద్‌
 

Posted Date: 13-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం