• facebook
  • whatsapp
  • telegram

సుబాబుల్‌ రైతుల కష్టాల సాగు

పరిశ్రమలు పెరిగితేనే లాభాల పంట

ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పెరిగే సుబాబుల్‌ను భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు వాటి పెంపకానికి చాలా అనుకూలం. కాగితపు గుజ్జు పరిశ్రమలో సుబాబుల్‌ను ముడిసరకుగా వినియోగిస్తారు. వంట చెరకుగా, నారగా, పశువుల మేతగానూ ఉపయోగిస్తారు. సుబాబుల్‌ ఆకులతో తయారుచేసే పోషకాహార బిస్కట్లను పశువులకు తినిపించి పాల దిగుబడి పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొదట్లో పశువుల మేతకు సుబాబుల్‌ను ఎక్కువగా సాగుచేసేవారు. క్రమంగా కాగితపు పరిశ్రమల నుంచి గిరాకీ పెరగడంతో విస్తీర్ణం ఊపందుకుంది. గతంలో రైతులకు లాభాలను తెచ్చిన సుబాబుల్‌ను ప్రస్తుతం విక్రయించడానికే రైతులు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. విసిగి వేసారిన కొందరు సుబాబుల్‌ను తొలగించి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని పలువురు రైతులు 2000-2003 మధ్య నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో సుబాబుల్‌ సాగు చేపట్టారు. అప్పట్లో టన్ను ముడికర్రకు రూ.1500 చెల్లించేవారు. ఖర్చులన్నీ పోను రైతుకు రూ.800 దక్కేది. సుబాబుల్‌ను మూడేళ్లు పెంచితే ఎకరాకు 30 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేలదాకా ఆదాయం లభిస్తుంది. దాంతో ఎక్కువ మంది సుబాబుల్‌ సాగు చేపట్టడంతో 2007-08 నాటికి విస్తీర్ణం బాగా పెరిగింది. అప్పటి నుంచి గిరాకీ, సరఫరాలపై ముడికర్ర ధర ఆధారపడుతోంది. 2006లో రూ.2000 ఉన్న టన్ను ముడికర్ర ధర, 2009 నాటికి రూ.1700కు పడిపోయింది. దాంతో చాలామంది సుబాబుల్‌ సాగును వదిలిపెట్టారు. 2014కల్లా టన్ను ముడికర్ర ధర రూ.5400కు చేరింది. ఖర్చులు పోను రైతుకు రూ.4,000 మిగిలేది. ఫలితంగా మళ్ళీ లక్షల ఎకరాల్లో సుబాబుల్‌ వేశారు. డిమాండ్‌ను మించి ముడికర్ర సరఫరా పెరగడంతో ధర రూ.4500కు తగ్గింది. అదే సమయంలో 2014లో తెలంగాణలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు మూతపడింది. అంతకు ముందు ఉమ్మడి వరంగల్‌ జిల్లా కమలాపురంలోని ప్రైవేటు పేపర్‌ పరిశ్రమనూ మూసివేశారు. ఆ తరవాత ఉమ్మడి ఖమ్మం జిల్లా సారపాకలోని ఐటీసీ సంస్థకే సుబాబుల్‌ను విక్రయించాల్సి వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని సుబాబుల్‌ మొత్తాన్నీ ఆ కంపెనీ కొనుగోలు చేయడం కష్టమైంది. దాంతో మూడేళ్లకు మిల్లుకు తరలించాల్సిన చెట్లను, అయిదేళ్ల దాకా పెంచాల్సి వచ్చింది. అయినా కొనేవారు లేరు. విధిలేక ఇతర రాష్ట్రాల్లోని పేపర్‌ మిల్లులకు విక్రయించడంతో రవాణా ఖర్చులు పెరిగి రైతుల ఆదాయం తగ్గింది. 2020లో సిర్పూర్‌ పేపర్‌ మిల్లు తిరిగి ప్రారంభం కావడంతో రైతుల ఇబ్బందులు కాస్త తగ్గాయి. అయినా, గిరాకీని మించి సరఫరా ఉండటంతో పంటను సకాలంలో విక్రయించుకోలేక పోతున్నారు. మరోవైపు సుబాబుల్‌ను నరకడానికి కూలీల కొరతా వేధిస్తోంది. ప్రస్తుతం తోలు తీసిన టన్ను సుబాబుల్‌ కర్ర ధర రూ.5,600 ఉంది. ఖర్చులు పోను రైతుకు రూ.3,200దాకా మిగులుతోంది. టన్ను ముడికర్రకు ఇతర రాష్ట్రాల్లోని మిల్లులు రూ.4,500 నుంచి రూ.6,000 దాకా చెల్లిస్తున్నాయి. అందులో కర్ర నరకడం, రవాణా ఖర్చులు పోను రైతులకు రెండు వేల రూపాయల దాకా మాత్రమే దక్కుతోంది. ఇలా ఆది నుంచీ సుబాబుల్‌ రైతులు ఒడుదొడుకులకు గురవుతూనే ఉన్నారు.

తక్కువ పెట్టుబడి, వర్షాధారంగా సాగు చేసే అవకాశం, ఇతర పంటలతో పోలిస్తే నిలకడగా ఆదాయం వస్తుందని రైతులు సుబాబుల్‌ సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఇతర పంటల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం, పెట్టుబడి ఇతోధికంకావడంతో కొన్ని ప్రాంతాల్లో భూములను కౌలుకు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. అలాంటి చోట్ల భూ యజమానులు సుబాబుల్‌ వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆ పంటను ముడిసరకుగా వాడే పరిశ్రమలు మరిన్ని నెలకొల్పితే కర్రకు డిమాండ్‌ పెరిగి రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. పరిశ్రమలను ఆ పంటను పండించే ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి. ప్రభుత్వాలు ఆ కర్మాగారాలకు ప్రోత్సాహకాలను ఇవ్వాలి. పరిశ్రమలు ముందుగానే రైతులతో ఒప్పందాలు కుదుర్చుకొని సరైన ధర చెల్లించాల్సిన అవసరం ఉంది. ఆలస్యం చేయకుండా సుబాబుల్‌ను సకాలంలో కొనుగోలు చేయడమూ తప్పనిసరి.

- డి.ఎస్‌.బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నదీ తీరాల పరిరక్షణపై నిర్లక్ష్యం

‣ భారత్‌తో సంబంధాలు... జాన్సన్‌ ముద్ర

‣ విపత్తులతో ప్రపంచం విలవిల

‣ సమాన హక్కులే ప్రజాబలం

‣ బడుగులపై ఆగని అకృత్యాలు

‣ టెక్‌ కంపెనీల కట్టడికి అడుగులు

‣ లొసుగులమయం... జీఎస్టీ విధానం!

Posted Date: 16-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం