• facebook
  • whatsapp
  • telegram

పోషకాల్లేని పంటలతో పెనుముప్పు

రసాయన ఎరువులతో చౌడుబారుతున్న భూములు

స్వాతంత్య్రానంతరం మనదేశం హరిత విప్లవాన్ని సాధించింది. వరి, గోధుమ వంటి ఆహార పంటల్లో అధికోత్పత్తులతో స్వావలంబన సాధ్యమైంది. అదే సమయంలో బంగారం పండే నేలలు నిస్సారమయ్యాయి. దానితో ప్రధాన ఆహార పంటల్లో పోషకాల స్థాయి పడిపోతోంది. వ్యవసాయ పద్ధతుల్లో లోపాల కారణంగా, రైతులు ఎంతో పెట్టుబడి పెట్టి వేస్తున్న ఎరువులూ పంటకు అందడం లేదు. పైగా అవి లభ్యం కాని రూపంలోకి వెళ్లి నిల్వలు పేరుకుపోతున్నాయి. వీటన్నింటి ఫలితంగా నేలలో సేంద్రియ కర్బన శాతం ప్రమాదకరంగా తగ్గి పంటల్లో పోషకాల శాతం క్షీణించి రసాయన అవశేషాలను ఆహారంగా స్వీకరించాల్సి వస్తోంది. నేల సత్తువ క్షీణించే కొద్దీ మునుముందు మానవారోగ్యం మరింత ప్రమాదంలో పడవచ్చు.

మోతాదుకు మించి వినియోగం

మోతాదుకు మించి వేస్తున్న రసాయనాల వల్ల దిగుబడులు అటుంచి నేల చౌడుబారిపోతోంది. పౌష్టికాహార సమస్య నుంచి బయట పడేందుకు ఆహారోత్పత్తులను ఇబ్బడిముబ్బడిగా పెంచుకోగలిగాం కానీ, ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ఆహార పంటల్లో పోషకాల లభ్యత క్రమంగా పడిపోతోందని భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్‌)కి చెందిన బిదాన్‌చంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడించారు. వరి, గోధుమ, మొక్కజొన్నల్లో యాభై ఏళ్ల క్రితం ఉన్న పోషకాలు నేడు లేవని ఈ అధ్యయనం పేర్కొంది. 1960లో వరిలో జింక్‌ కిలోకు 27.1మి.గ్రా, ఐరన్‌ కిలోకు 59.8 మి.గ్రా. చొప్పున నమోదయ్యాయి. గోధుమలో ఇవి కిలోకు 33.3 మి.గ్రా, 57.6 మిల్లీ గ్రాముల చొప్పున ఉండేవి. ఇటీవల చేసిన పరిశోధనల్లో ఈ పోషకాలు తగ్గినట్టు గుర్తించారు. వరిలో జింక్‌ కిలోకు 20.6 మి.గ్రా, ఐరన్‌ కిలోకు 43.1 మిల్లీ గ్రాములకు తగ్గగా, గోధుమలోనూ ఇవి కిలోకు 23.5 మి.గ్రా, 46.4 మిల్లీ గ్రాముల మేరకే నమోదయ్యాయి. దిగుబడులు పెంచడం కోసం రసాయన ఎరువులు వేయడంపై ఉన్న శ్రద్ధ నేలల సంరక్షణపై ఉండటం లేదని ఈ అధ్యయనం నిరూపిస్తోంది. దేశంలో జింక్‌, ఐరన్‌ లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరగడానికి ఇదే కారణమని అధ్యయనం పేర్కొంది. తగినన్ని పోషకాలు ఇక్కడ కొరవడుతున్న కారణంగా అమెరికా ప్రజలు భారత్‌ బియ్యం కంటే థాయ్‌లాండ్‌ బియ్యాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దేశీయంగా సేంద్రియ వ్యవసాయ విధానాలకు తిలోదకాలు ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం.

జింక్‌ పాస్ఫేట్‌ మొక్కలకు అందకుండా భూమిలోనే ఉండిపోతున్నందు వల్లే వరి, గోధుమల్లో జింకు లోపం తలెత్తుతోంది. అదేవిధంగా దేశంలోని నేలల్లో ఐరన్‌ 70 శాతం వరకు ఉంది. అదీ పంటలకు లభ్యం కాని రూపంలోనే ఉండిపోవడం వల్ల మొక్కలు గ్రహించలేక పోతున్నాయి. దిగుబడులు పెరిగేందుకు ఇష్టానుసారం ఎరువులు, రసాయనాలను చల్లేస్తుండటంతో నేలలో సహజంగానే ఉండే, పంటకు మేలు చేసే సూక్ష్మజీవులూ అంతరిస్తున్నాయి. ఫలితంగా నేలలో పోషకాలు ఉన్నా అక్కరకు రావడం లేదు. దీన్ని బట్టి విత్తనం కంటే నేల సత్తువలోనే విషయం ఉందన్న సంగతిని గమనంలో ఉంచుకోవాలి. ప్రత్యామ్నాయంగా జీవ ఎరువులు వాడినా అవి పని చేయాలంటే నేలలో సేంద్రియ కర్బనం ఉండాల్సిందే. సేంద్రియ కర్బనం తగ్గడంతో అత్యుత్తమ విత్తనాలను వేసినా నేలలు స్పందించే శక్తిని కోల్పోయాయి. ఫలితంగానే నేటి ఆహార పంటల్లో పోషకాల స్థాయులు పడిపోతున్నాయి. వాటిని సంరక్షించుకునే ప్రత్యామ్నాయ పద్ధతులను ఆచరించడం ఒక్కటే ఇందుకు పరిష్కారం.

సేంద్రియ సేద్యమే శరణ్యం

పంటల్లో పోషకాల స్థాయి ఇనుమడించాలంటే నేలలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంపొందించాలి. అందుకు సేంద్రియ వ్యవసాయ విధానాల ఆచరణ అత్యుత్తమ మార్గం. పంట కోసిన తరవాత అవశేషాలను కాల్చకుండా చేలోనే కలియదున్నడం, పచ్చిరొట్టనిచ్చే పంటలు వేయడం, పంట మార్పిడి పాటించడం, పశువులు, జీవాలు, కోళ్లు, పందుల ఎరువులను చేలకు అందించడం ఎంతో అవసరం. నేలలో సేంద్రియ కర్బన శాతాన్ని బట్టి వీటిని ఎంతెంత మోతాదులో వేయాలనే లెక్కలు పాటించాలి. పంటకు జీవ ఎరువులను అందించాలి. నేలలో నత్రజనిని స్థిరీకరించేందుకు, పోషకాలను మొక్కలకు అందించడంలో సూక్ష్మజీవులు కీలకపాత్ర పోషిస్తాయి. అజటోబాక్టర్‌, అజోస్పైరిల్లమ్‌, అసిటోబాక్టర్‌, రైజోబియం, సైనో బాక్టీరియా, అజొల్లా, మైకోరైజా వగైరాలు పోషకాలను కరిగించి మొక్కలకు అందిస్తాయి. పలు సూక్ష్మజీవులు మొక్కల ఎదుగుదలకు దోహదపడతాయి. సహజ, సేంద్రియ సాగు పద్ధతులను ఆచరించడం ద్వారా నేలలో సూక్ష్మజీవులను కాపాడుకోగలిగితే అవి పైరుకు పోషకాలను అందించగలుగుతాయి. నేలలోని పోషకాల స్థాయిని సక్రమంగా ఉపయోగించుకోవడం ద్వారా విటమిన్‌ ఎ, సి,డిలను వరి, గోధుమల్లో సాధించి వాటికి పేటెంట్‌ సైతం పొందిన రైతు శాస్త్రవేత్త వెంకటరెడ్డి ప్రయోగాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. సమగ్ర పోషక యాజమాన్యంలో సేంద్రియ ఎరువుల్ని ఒక భాగంగా ఆచరిస్తే సత్ఫలితాలు అందుతాయని గుర్తించాలి. దీనివల్ల రైతులకు ఖర్చు తగ్గి నేలలోని పోషకాలను మొక్కలు గ్రహించి వాటి ద్వారా తినే ఆహారంలోనూ పోషకాల శాతం పెరుగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో నిస్సార నేలలు

తెలుగు రాష్ట్రాల్లోని నేలల్లో జింక్‌, ఇనుము, బోరాన్‌, మాంగనీస్‌ వంటి పోషక లోపాలు తీవ్రంగా ఉన్నట్లు గతంలో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. ఆంధ్రప్రదేశ్‌లోని 38 శాతం నేలలు, తెలంగాణలోని 27 శాతం భూముల్లో జింక్‌ లోపముంది. మరో 34 శాతం నేలల్లో జింక్‌ లభ్యత ప్రమాదకర స్థితికి చేరువగా ఉన్నట్లు వెల్లడైంది. 17 శాతం నేలల్లో ఐరన్‌ లోపముంది. వీటిని సవరించేందుకు వేస్తున్న రసాయన ఎరువులు సైతం 25 శాతం మేర పంటకు ఉపయోగపడటం లేదు. వాటిని నేలలు గ్రహించలేక పోవడమే అందుకు కారణం. దీనర్థం నేలలో సేంద్రియ కర్బన శాతం పడిపోవడమే. సారవంతమైన భూమి అంటే నేలలో సేంద్రియ కర్బన శాతం పుష్కలంగా ఉండాలి. అది 2.5 శాతం ఉంటే మన నేలలు బంగారం. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, అవగాహన లోపంతో సంప్రదాయ పద్ధతులకు తిలోదకాలు ఇచ్చిన ఫలితంగా దేశవ్యాప్త భూముల్లో సేంద్రియ కర్బనం 0.5 శాతం కంటే తక్కువకు పడిపోయింది. కర్బన శాతం ఇంత తక్కువ ఉన్నప్పుడు ఏ పంటకైనా ఎకరాకు 12 టన్నుల పశువుల ఎరువు వేయాల్సి ఉంటుంది. కానీ అధిక శాతం రైతులు పశుపోషణకు దూరమవడం వల్ల ఇది సాధ్యపడటం లేదు. కోళ్లు, జీవాల పెంపకం తగ్గడంతో ఎరువుల కోసం పొలంలో వాటి మందల్ని కట్టేయించడమూ అరుదైపోయింది.

- అమిర్నేని హరికృష్ణ

Posted Date: 28-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం