• facebook
  • whatsapp
  • telegram

విదేశీ ఎరువు... ధరల దరువు!

సర్కారుపై రాయితీల బరువు

ఎరువులపై ఇచ్చే రాయితీని కేంద్రం భారీగా పెంచింది. దేశ చరిత్రలోనే అత్యధికంగా గతేడాది(2020-21)లో లక్షా 34 వేల కోట్ల రూపాయలను ఎరువుల రాయితీకి చెల్లించింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో తొలుత రూ.79,530 కోట్లే ఇచ్చినా- తాజాగా రూ.94,305 కోట్లకు పెంచాల్సి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలను శాసిస్తున్న కొద్దిపాటి విదేశీ కంపెనీలు ముడిసరకుల ధరలు ఒక్కసారిగా పెంచేయడంతో కేంద్రం బడ్జెట్‌లో వేసిన అంచనాలన్నీ తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లోనే మారిపోయాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం(జనవరి-మార్చి) నాటికి బడ్జెట్‌ కేటాయింపుల్లో సవరణలు చేసి నిధులు పెంచడమో లేదా తగ్గించడమో చేస్తారు. కానీ విదేశీ ఎరువుల కంపెనీలు పన్నిన ధరల పెంపు వ్యూహంతో కేంద్రం దేశ చరిత్రలోనే తొలిసారి తొలి త్రైమాసికంలోనే రాయితీ నిధులను అదనంగా రూ.14,775 కోట్లు పెంచాల్సి వచ్చింది. గతేడాది భారతదేశంలో పంటల దిగుబడులు బాగుండటం, ఈసారి వాతావరణం అనుకూలంగా ఉంటుందనే సంకేతాలతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి విదేశీ కంపెనీలు గరిష్ఠ స్థాయిలో ధరలు పెంచుతూ వచ్చాయి. ఎరువుల చిల్లర ధరలు భారీగా పెంచడానికి కంపెనీలు సన్నద్ధంకావడంతో రాయితీ పెంచి కేంద్రం వాటిని అడ్డుకుంది.

దిగుమతులపై ఆధారపడుతున్న వైనం

భారతదేశ భూముల్లో పంటలు పండాలంటే పైర్లకు వేసే రసాయన ఎరువులు విదేశాల నుంచి రావాల్సిన దుస్థితి నెలకొంది. నిరుడు కోటీ 30 లక్షల టన్నుల వరకు డీఏపీ, యూరియా ఎరువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. భారతీయుల నిత్యావసరాలే విదేశీ కంపెనీలకు ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. ఇటీవల కేంద్రం ఎరువుల రాయితీని అదనంగా పెంచడానికి వెనక విదేశాల్లోని ఎరువుల కంపెనీల ధరల పెంపు వ్యూహాలే ప్రధాన కారణం. భారతదేశంలో యూరియా తరవాత డై అమ్మోనియం ఫాస్ఫేట్‌(డీఏపీ), పొటాష్‌ రసాయన ఎరువులు పంటల సాగుకు అత్యంత కీలకం. విదేశాల నుంచి ఒక టన్ను డీఏపీని దిగుమతి చేసుకోవాలంటే ఇప్పుడు రూ.45,590 ఖర్చవుతోంది. కానీ, చిల్లర మార్కెట్‌లో రైతుకు టన్ను డీఏపీని రూ.24 వేలకు కంపెనీలు అమ్ముతున్నందువల్ల మిగతా సొమ్మునంతా కేంద్రం రాయితీగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకాలం టన్నుకు రూ.10వేల చొప్పున రాయితీ ఇవ్వగా హెచ్చిన ధరలతో దాన్ని రూ.24,000కు పెంచి- చిల్లర ధరలు ఎగబాకకుండా కేంద్రం రైతులను ఆదుకుంది. ప్రస్తుతం చిల్లర మార్కెట్‌లో రైతు 50 కిలోల డీఏపీ బస్తాను రూ.1,200కు కొంటుంటే- మరో రూ.1,200 కేంద్రం రాయితీగా భరిస్తూ ఎరువుల కంపెనీలకు ఇస్తోంది. దేశంలో గతేడాది కోటీ 19 లక్షల టన్నుల డీఏపీని రైతులు వినియోగిస్తే అందులో 60 లక్షల టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే.

మనదేశంలో పంటల సాగుకు అన్నింటికన్నా అత్యధికంగా మూడున్నర కోట్ల టన్నుల యూరియాను వాడుతుండగా దాని తరవాతి స్థానంలో 1.19 కోట్ల టన్నులతో డీఏపీ ఉంది. ఈ ఏడాది డీఏపీపై ఇవ్వాల్సిన రాయితీయే రూ.25 వేల కోట్లకు చేరవచ్చని తాజా అంచనా. యూరియా ఒక్కటే కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంది. మిగతా రసాయన ఎరువులపై ప్రైవేటు కంపెనీలకు స్వేచ్ఛ ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిసరకుల ధరలు పెరిగినప్పుడల్లా ఇక్కడ చిల్లర ధరలు పెంచుతూ రైతులపై భారాన్ని మోపుతున్నాయి. ఉత్తర భారతదేశంలో యూరియాను చాలా ఎక్కువగా వాడతారు. దాని ధర పెరిగితే అక్కడి రైతుల్లో అసంతృప్తి ప్రబలుతుందని కేంద్రం నియంత్రిస్తోంది. ఉదాహరణకు యూరియా చిల్లర ధర రైతు మార్కెట్‌లో కొనే 45 కిలోల బస్తాకు రూ.266 ఉంది. 2012 నుంచి ఇప్పటిదాకా ఈ ధరను ఇలాగే పెరగకుండా కేంద్రం కొనసాగిస్తోంది. ఇందుకోసం ఒక బస్తాపై రూ.450 దాకా రాయితీని భరిస్తోంది. మిగతా ఎరువులపై కేంద్రానికి నియంత్రణ లేకపోవడంతో కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా ఇక్కడ చిల్లర ధరలను గత ఏప్రిల్‌లోనే పెంచాలని చూశాయి. అప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందువల్ల ధరల పెంపును కేంద్రం ఆపింది. ఇలా ఆపడానికే తప్పనిసరి పరిస్థితుల్లో డీఏపీపై ఇస్తున్న రాయితీనే 140 శాతం అదనంగా కేంద్రం పెంచాల్సి వచ్చింది. ఇందువల్లనే బడ్జెట్‌లో తొలుత కేటాయించిన రూ.79,530 కోట్లకు సవరణ చేసి ఇప్పుడు రూ.94,305 కోట్లకు పెంచింది.

మౌలిక సమస్యల పరిష్కారం కీలకం

రసాయన ఎరువుల వినియోగం, రాయితీల భారం తగ్గాలంటే సమస్యల మూలాల్లోకి వెళ్ళి వాటిని పరిష్కరించాలి. ప్రధానంగా వ్యవసాయ భూముల్లో ఏయే పోషకాలు ఎంత ఉన్నాయనేది మట్టి నమూనాలను తీసుకెళ్ళి ప్రయోగశాలల్లో పరీక్షించి ఆ ఫలితాలను రైతులకు పంట సీజన్‌ ఆరంభానికి ముందే ఇవ్వాలి. భూసార పరీక్షలు చేయించడానికి ప్రధానిగా మోదీ తొలిసారి బాధ్యతలు చేపట్టిన తరవాత అధిక ప్రాధాన్యమిచ్చారు. వర్షాధార ప్రాంతాల్లో ప్రతీ 25 ఎకరాల కమతంలో ఒక మట్టి నమూనా, సాగునీటి వసతి ఉన్న ప్రాంతాలైతే ప్రతీ 6.25 ఎకరాలకొక మట్టి నమూనా తీయాలనే నిబంధన పెట్టారు. దీనివల్ల 2015-19 మధ్యకాలంలో 5.27 కోట్ల మట్టి నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించి 22.78 కోట్ల ఫలితాల కార్డులు రైతులకిచ్చినా ఎలాంటి ఉపయోగాలు సిద్ధించలేదు. ప్రతీ రైతు తనకున్న ఎకరం, రెండెకరాల్లో ఒక్కో పంట వేస్తాడు. ఒక్కో పంటకు ఒక్కో రకం రసాయన ఎరువులు వాడుతున్నారు. ఇలా పాతిక ఎకరాలకు కలిపి తీసిన మట్టి నమూనాలో ఏ రైతు భూమిలో ఉన్న పోషకాలు ఎలా తెలుస్తాయి? ఈ పథకం అంతా గందరగోళంగా ఉందని, ఇలా 25 లేదా 6.25 ఎకరాల భూ విస్తీర్ణానికికొక మట్టి నమూనా నిబంధన అనేది పెట్టకుండా ప్రతీ రైతుకున్న కమతం నుంచి ఒక నమూనా తీసే అవకాశం కల్పించాలని తెలంగాణ వ్యవసాయశాఖ నాలుగేళ్ల క్రితమే కేంద్రాన్ని కోరినా స్పందన లేదు. రాయితీ భారం లక్ష కోట్ల రూపాయల నుంచి బాగా తగ్గించాలంటే కీలకమైన మౌలిక సమస్యల లోతుల్లోకి వెళ్ళి పరిష్కరించాలి. సేంద్రియ వ్యవసాయంపై, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపుపై అవగాహన పెంచాలి. పాడిని ప్రోత్సహిస్తే రైతులకు సులభంగా సేంద్రియ ఎరువులు లభిస్తాయి. తద్వారా రసాయన ఎరువుల వాడకమూ తగ్గుతుంది. భూసార పరీక్షలు సకాలంలో చేయించి ఆ ఫలితాల ఆధారంగా ఏ పంటకు ఎంత ఎరువు అవసరమైతే అంతే రైతులకు విక్రయించే దిశగా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది.

- మంగమూరి శ్రీనివాస్‌

Posted Date: 02-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం