• facebook
  • whatsapp
  • telegram

పన్ను ఎగవేతలో పోటాపోటీ

‘బహుళ జాతి’ మాయతో ఖజానాలకు తూట్లు

దేశదేశాల్లో ఉత్పత్తి, విక్రయాలు జరిపే బహుళజాతి సంస్థలు ఆయా దేశాల్లో సవ్యంగా పన్నులు కట్టకుండా తప్పించుకొంటున్నాయి. దీన్ని నివారించాలని ‘ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)’, జీ20 దేశాలు నిశ్చయించాయి. బహుళజాతి కంపెనీల వ్యాపారంపై అన్ని దేశాలూ కనీసం 15 శాతం అంతర్జాతీయ కార్పొరేట్‌ పన్ను వసూలు చేయాలని అమెరికా చొరవతో 38 దేశాలతో కూడిన ఓఈసీడీ ప్రతిపాదించింది. బడా సంస్థలు బహు తక్కువ పన్ను రేట్లు విధించే దేశాలకు తమ కార్యకలాపాలను తరలించకుండా నివారించడం కనీస కార్పొరేట్‌ పన్ను లక్ష్యం. దీనివల్ల ప్రపంచ దేశాల పన్ను ఆదాయం ఏటా భారీగా పెరుగుతుందని ఓఈసీడీ భావిస్తోంది. ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసిన 136 దేశాల్లో భారత్‌ వంటి జీ20 దేశాలూ ఉన్నాయి. భౌగోళిక సరిహద్దులకు అతీతంగా డిజిటల్‌ సీమలో వ్యాపారం చేసే టెక్నాలజీ కంపెనీలు అంతర్జాతీయ పన్ను చట్టాల కళ్లు కప్పి భారీస్థాయిలో మిగుల్చుకొంటున్నాయి. వాటి వ్యాపారం ఏదో ఒక్క దేశానికే పరిమితం కాదు. ఫలానా చోటే వాటికి కర్మాగారం ఉంటుందనీ చెప్పలేం. వివిధ దేశాల్లోని కర్మాగారాలకు లైసెన్సులు ఇచ్చి తమ పరికరాలను, సాఫ్ట్‌వేర్‌నూ రూపొందిస్తాయి. దేశదేశాల్లో డిజిటల్‌ మార్గంలో ఆర్జించే ఆదాయాన్ని అల్ప పన్ను దేశాల్లో లెక్కలు చూపి లాభాలపై అతి తక్కువ పన్నులు కడుతున్నాయి. కనీస కార్పొరేట్‌ పన్ను వల్ల దాదాపు 100 అతిపెద్ద బహుళజాతి కంపెనీల లాభాలపై పన్ను ఆదాయాన్ని అవి వ్యాపారం చేసే దేశాలన్నీ పంచుకోవడానికి వీలు కలుగుతుంది.

విక్రయాల ప్రాతిపదికన...

కార్పొరేట్‌ పన్నులు స్వల్ప స్థాయిలో వసూలు చేసే ఐర్లాండ్‌ వంటి దేశాల్లో బహుళజాతి కంపెనీలు అనుబంధ సంస్థలను నెలకొల్పి, వాటికి ఔషధ పేటెంట్లు, సాఫ్ట్‌వేర్‌, మేధాహక్కులపై రాయల్టీలను బదిలీ చేస్తున్నాయి. తద్వారా వాటిపై తమ మాతృ దేశాలకు, వ్యాపారం చేసే దేశాలకూ పన్నులు చెల్లించకుండా ఎగ్గొడుతున్నాయి. అమెజాన్‌, ఆపిల్‌, ఐకియా... తదితర బహుళజాతి కంపెనీలు వందల కోట్ల డాలర్ల పన్ను ఎగ్గొట్టడానికి ఐరోపాలో లగ్జెంబర్గ్‌ దేశ ప్రభుత్వంతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల సంఘం (ఐసీఐజే) 2014లో బయటపెట్టింది. బహుళజాతి కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడానికి కార్పొరేట్‌ పన్ను రేట్ల తగ్గింపులో దేశాల మధ్య పోటీ ముదిరే ముప్పు లేకపోలేదు. అయితే, అంతర్జాతీయ కనీస కార్పొరేట్‌ పన్ను ఇలాంటి అవాంఛనీయ ధోరణికి అడ్డుకట్ట వేస్తుందని ఆశిస్తున్నారు. కనీస అంతర్జాతీయ కార్పొరేట్‌ పన్ను ఒప్పందానికి రెండు మూల స్తంభాలు ఉన్నాయి. భారీ బహుళజాతి సంస్థలు తాము ఎక్కడైతే వస్తుసేవల విక్రయాలు జరుపుతూ, లాభాలు ఆర్జిస్తున్నాయో అక్కడ కూడా పన్నులు చెల్లించాలని మొదటి మూల స్తంభం (పిల్లర్‌-1) నిర్దేశిస్తోంది. దీనివల్ల అమెజాన్‌, ఆపిల్‌, గూగుల్‌ వంటి టెక్‌ కంపెనీలు ఇదివరకటికన్నా ఎక్కువ పన్నులు కట్టాల్సి ఉంటుంది. 2023 నుంచి అమలులోకి వచ్చే పిల్లర్‌-1 ప్రకారం 2,000 కోట్ల యూరోలకు మించి అంతర్జాతీయ ఆదాయాన్ని సంపాదిస్తూ, అందులో 10 శాతాన్ని మించి (పన్నులకు ముందు) అసాధారణ లాభాలను ఆర్జించే కంపెనీలు ఆ సూపర్‌ లాభాలపై 25 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. దాన్ని సంబంధిత దేశాలు పంచుకొంటాయి. 2024 నుంచి అమలులోకి వచ్చే పిల్లర్‌-2 కనీస అంతర్జాతీయ కార్పొరేట్‌ పన్నును 15 శాతంగా నిర్ణయించింది. అందుకే ఐర్లాండ్‌ 12.5 శాతం కార్పొరేట్‌ పన్నును 15 శాతానికి పెంచడానికి ఒప్పుకొంది. పిల్లర్‌-2 అమలులోకి వచ్చిన తరవాత ఏ దేశమూ 15 శాతంకన్నా ఎక్కువే తప్ప తక్కువ కార్పొరేట్‌ పన్ను వసూలు చేయడానికి వీల్లేదు. రెండు పిల్లర్‌లూ అమలులోకి వచ్చాక ప్రపంచ దేశాల మధ్య దాదాపు 12,500 కోట్ల డాలర్ల పన్ను ఆదాయం పునఃపంపిణీ అవుతుంది.

ఆర్థిక వ్యవస్థకు సుంకాల దన్ను

ఓఈసీడీ రెండు మూలస్తంభాల ఒప్పందంపై త్వరలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చర్చిస్తాయి. అన్నింటినీ మించి అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు)లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో అంతర్జాతీయ కనీస కార్పొరేట్‌ పన్ను ప్రతిపాదనను చేర్చనున్నారు. దీన్ని కాంగ్రెస్‌ తప్పకుండా ఆమోదిస్తుందని అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్‌ యెల్లెన్‌ ధీమా వ్యక్తంచేశారు. ఓఈసీడీ రెండు మూలస్తంభాల ఒప్పందాన్ని ఆమోదించడం వల్ల పన్నుల విధింపునకు తమకున్న సార్వభౌమ అధికారాన్ని దేశాలు కోల్పోతాయనే ఆందోళన లేకపోలేదు. అయితే, ఆ దేశాలు కనీస పన్ను 15 శాతంకన్నా తగ్గకుండా చూస్తూ, అంతకన్నా ఎక్కువ స్థానిక కార్పొరేట్‌ పన్ను విధించవచ్చు. లాభాల గణనలో కేవలం వస్తుసేవల విక్రయాలకు మాత్రమే ప్రాధాన్యమివ్వడం ప్రధానంగా పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్న వియత్నాం తదితర వర్ధమాన దేశాలకు నష్టదాయకం కావచ్చు. డిజిటల్‌ కంపెనీలకు మాత్రం భౌగోళిక సరిహద్దులు అడ్డురావు. ఏదిఏమైనా కొవిడ్‌ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించుకోవడానికి ప్రభుత్వాలు తమ పన్నుల ఆదాయం పెంచుకోకతప్పని పరిస్థితి నెలకొన్నది. ఇది అంతర్జాతీయ కనీస కార్పొరేట్‌ పన్ను విధింపునకు మార్గం సుగమం చేస్తోంది.

లోపాలను అడ్డు పెట్టుకొని...

సీమాంతర పన్నుల ఎగవేతలో ఇతర కంపెనీలకు ఆపిల్‌ సంస్థే దారిదీపం. ఐరోపా దేశాలన్నింటా వ్యాపారం చేసే ఆపిల్‌, అక్కడ ఆర్జించిన లాభాలను ఐర్లాండ్‌లోని తన కార్యాలయ ఖాతా పుస్తకాల్లో చూపుతుంది. అన్ని ప్రధాన దేశాల్లో కార్పొరేట్‌ పన్ను రేట్లు 25 శాతానికిపైనే ఉండగా, ఐర్లాండ్‌లో అది కేవలం 12.5 శాతం. ఆపిల్‌ సంస్థ ఐరిష్‌ పన్ను చట్టాల్లోని లోపాలను అడ్డుపెట్టుకొని ఆ కాస్త పన్నునూ చాలా వరకు ఎగ్గొడుతోంది. ఆపిల్‌ను ఆదర్శంగా తీసుకుని ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి టెక్‌ కంపెనీలు, అనేక ఫార్మా సంస్థలూ ఐర్లాండ్‌లో కార్యాలయాలను తెరిచాయి. అక్కడ మొత్తం 800 అమెరికన్‌ కంపెనీలకు అనుబంధ కార్యాలయాలు ఉన్నాయి. పన్నుల ఎగవేతను నిరోధించడానికి ఓఈసీడీ ప్రతిపాదించిన ఒప్పందంపై ఐర్లాండ్‌ కూడా సంతకం చేయడంతో ఇక ఆ దేశ కార్పొరేట్‌ పన్ను 12.5 శాతం నుంచి 15 శాతానికి పెరగనుంది. అక్కడికీ అది అమెరికా, చైనా, భారతదేశాల కార్పొరేట్‌ పన్ను రేట్ల (25 శాతం) కన్నా చాలా తక్కువ.

- కైజర్‌ అడపా
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సముద్రంలోకి అణువ్యర్థాలు

‣ బుల్లి విహంగాలకు కొత్త రెక్కలు

Posted Date: 20-10-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం