నానాటికీ ప్రపంచ జనాభా, ముఖ్యంగా యువజన సంఖ్య పెరుగుతున్నాయి. యువత కోసం 2030కల్లా నైపుణ్యం అవసరమైనవి, అంతగా నైపుణ్యాలు అక్కర్లేనివి మొత్తంగా సుమారు 60 కోట్లదాకా ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. ప్రపంచంలో ప్రతి 10 వ్యాపారాల్లో తొమ్మిది, ప్రతి మూడు ఉద్యోగాల్లో రెండు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగంలోనే ఉన్నాయి. తగిన నిధులు సమకూరిస్తే భారీ స్థాయిలో ఉపాధి కల్పించే సత్తా ఎంఎస్ఎంఈ రంగానికి ఉంది. కానీ, వర్ధమాన దేశాల్లో 13.1 కోట్ల ఎంఎస్ఎంఈ సంస్థలు తగినన్ని పెట్టుబడులు, రుణాలు అందక అల్లాడుతున్నాయి. ఇవి ఆ దేశాల్లోని ఎంఎస్ఎంఈలలో 41 శాతానికి సమానం. వర్ధమాన దేశాల్లో ఎంఎస్ఎంఈ రంగానికి 4.5 లక్షల కోట్ల డాలర్ల మేరకు రుణాలు అవసరమైనా అవి అందే మార్గం లేదు. అందులో 32 శాతం రుణాలు మహిళల యాజమాన్యంలో నడిచే ఎంఎస్ఎంఈలకే అవసరం. ఎంఎస్ఎంఈలలో 23 శాతాన్ని మహిళలే నడుపుతున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ), చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) ఆర్థికాభివృద్ధికి, ముఖ్యంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధనకు కీలకమని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఏటా జూన్ 27వ తేదీని ‘అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం’గా జరపాలని 2017లో సమితి జనరల్ అసెంబ్లీ 74వ ప్లీనరీ సమావేశం నిర్ణయించింది. ఎంఎస్ఎంఈ రంగం సృజనాత్మకత, నవీకరణ, కొత్త సాంకేతికతలను చేపడితే అపార ఉపాధి అవకాశాలను సృష్టించి పేదరికాన్ని తగ్గించగలుగుతుందని, వ్యక్తుల్లో వ్యవస్థాపక సామర్థ్యాన్ని పెంచి పరిశ్రమల విస్తరణకు పునాది వేస్తుందని, వీటన్నింటి ఫలితంగా సమితి ఆశించినమేర 2030కల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించగలుగుతామని ప్లీనరీ భావించింది. మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కొన్ని నేరుగా పేదరికం, నిరుద్యోగ నిర్మూలనను, ఆర్థికాభివృద్ధిని లక్షిస్తున్నాయి. వాటిలో మొదటిది- పేదరిక నిర్మూలన, రెండోది-ఆకలిని పారదోలడం, మూడోది-మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, అయిదోది- లింగ సమానత్వం, ఎనిమిదోది- హుందా అయిన ఉపాధిని కల్పిస్తూ సమ్మిళిత అభివృద్ధి సాధించడం, తొమ్మిదోది- నవీకరణ, సుస్థిర పారిశ్రామికీకరణ.
భారీగా ఉపాధి
కనీసం 10 మందికి ఉపాధి కల్పించే సంస్థలను సూక్ష్మ సంస్థలుగా, 300 మందికి ఉద్యోగాలిచ్చే పరిశ్రమలను చిన్న, మధ్యతరహా సంస్థలుగా వర్గీకరిస్తారు. ప్రపంచంలో 70శాతం ఉద్యోగాలను సూక్ష్మ,చిన్న పరిశ్రమలు కల్పిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) 2019 నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని కంపెనీలన్నింటిలో 90శాతం చిన్న, మధ్యతరహా కంపెనీలేనని, జీడీపీలో 50శాతం ఎంఎస్ఎంఈ రంగం ద్వారానే సమకూరుతున్నట్లు అంతర్జాతీయ చిన్న వ్యాపారాల మండలి (ఐసీఎస్బీ) లెక్కకట్టింది. ఆసియాలోని పరిశ్రమలు, వ్యాపారాల్లో 96శాతం ఎంఎస్ఎంఈ రంగంలోనే ఉన్నాయని, ఉపాధి కల్పనలో 62శాతం, జీడీపీకి 42శాతం వాటాను ఈ రంగం అందిస్తోందని 2019లో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) వెల్లడించింది. జి-20 దేశాలలో అత్యధిక పరిశ్రమలు, ఉద్యోగాలు ఎస్ఎంఈ రంగంలో ఉన్నాయి. జపాన్ వ్యాపార, పారిశ్రామిక సంస్థలన్నింటిలో సింహభాగం ఎస్ఎంఈలే. ఆ దేశంలో 70శాతం ఉపాధి ఈ సంస్థలే కల్పిస్తున్నాయి. జపాన్ పారిశ్రామికోత్పత్తిలో సగభాగానికి ఇవే మూలం. ప్రపంచమంతటా ఎంఎస్ఎంఈ రంగం అత్యధిక మహిళలు, యువతకు ఉపాధి కల్పిస్తోంది. వారిలోని నవీకరణ ప్రతిభను వెలికి తీస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) 2020లో వివరించింది. 2019 ఎంఎస్ఎంఈ ఆర్థిక సూచీల సమాచార నిధి ప్రకారం- ప్రపంచంలో అత్యధిక ఎంఎస్ఎంఈలు తూర్పు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉన్నాయి. తదుపరి స్థానాన్ని భారత్, బంగ్లా తదితర దక్షిణాసియా దేశాలు ఆక్రమిస్తున్నాయి. ఐరోపా, అమెరికాలవి ఆ తరవాతి స్థానాలే.
ఆర్థికంగా ఆదుకుంటే...
కొవిడ్ వల్ల దెబ్బతిన్న ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకుంటే ఆ రంగం 2030కల్లా ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు, తద్వారా మానవాళి ప్రగతికి గొప్ప ఊతమిస్తుంది. ఇంకా ఎంఎస్ఎంఈ రంగానికి అధునాతన యంత్రాలు, మౌలిక వసతులను సమకూర్చి సిబ్బంది సాంకేతిక నైపుణ్యాలను పెంచాలి. తమ ఉత్పత్తులను దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ విపణిలోనూ విక్రయించుకొనే సౌలభ్యం, మార్కెటింగ్ యంత్రాంగాన్ని సమకూర్చాలి. అంతర్జాతీయ పోటీని తట్టుకునే సామర్థ్యాన్ని కల్పించాలి. ప్రభుత్వం ముడి సరకులు, మౌలిక వసతులు, మార్కెటింగ్ వసతితోపాటు పెట్టుబడులు, రుణాలు సమకూర్చాలి. పన్ను రాయితీలు, పన్ను విరామాలు ప్రకటించాలి. 2025కల్లా అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని ఆశిస్తున్న భారతదేశం- ఎంఎస్ఎంఈ రంగ వృద్ధికి తోడ్పడేలా నిబంధనలను సరళతరం చేయాలి. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న దేశం హోదాను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారత్కు కట్టబెట్టింది. ఆ సంస్థ లెక్కల ప్రకారం భారత్ జీడీపీ వృద్ధిరేటు ఈ ఏడాది 8.7శాతంగా ఉండబోతోంది. చైనా రేటు 8.1శాతం! బ్రిటన్ (7.4), ఫ్రాన్స్ (7), అమెరికా (5.7), జర్మనీ (2.8), జపాన్ (1.6) వృద్ధి రేట్లలో భారత్ కన్నా వెనకే ఉన్నాయి. భారత్ ఏటా 10 శాతానికి పైగా వృద్ధిరేటు సాధిస్తే జీడీపీ వృద్ధి మరింత వేగం పుంజుకోవడంతోపాటు పేదరికం కూడా చాలా త్వరగా తరిగిపోతుంది. భారత అభివృద్ధి గాథలో కొత్త అధ్యాయాన్ని లిఖించే సత్తా ఎంఎస్ఎంఈ రంగానికి ఉంది. అందుకు తగిన అవకాశాలు, వాతావరణాన్ని ప్రభుత్వం శీఘ్రంగా కల్పించాలి.
భారత్ పరిస్థితి ఇదీ...
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ సముద్ర సంపదపై సాంకేతిక నేత్రం