• facebook
  • whatsapp
  • telegram

రూపాయి అంతర్జాతీయ కరెన్సీ కాగలదా?

ఎగుమతులే గొప్ప ఆసరా

‘డాలర్‌ బలుపు ప్రపంచానికి సలుపు’ అని లోగడ ఒక ఆర్థికవేత్త వ్యాఖ్యానించారు. డాలర్‌ బలపడటంతో భారతీయ రూపాయి, యూరో బలహీనపడటమే దానికి నిదర్శనం. ఒకప్పుడు యూరోకు డాలర్‌ కన్నా కాస్త ఎక్కువ విలువ ఉండేది. ఇప్పుడు యూరో విలువ 20 ఏళ్లలో తొలిసారి డాలర్‌తో దాదాపు సమాన స్థాయికి దిగి వచ్చింది. డాలర్‌తో పోలిస్తే చైనీస్‌ యువాన్‌, జపనీస్‌ యెన్‌, బ్రిటిష్‌ పౌండ్‌, రష్యన్‌ రూబుల్‌ విలువలూ క్షీణించాయి. కొవిడ్‌ లాక్‌డౌన్‌లు, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కలగలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుంగదీయడమే దీనికి కారణం.

డాలర్‌ హవా

ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం పేట్రేగుతోంది. ద్రవ్య సరఫరాను తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలని అమెరికా, ఐరోపాలతో సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి. దానివల్ల అమెరికా కరెన్సీ అయిన డాలర్‌ మాత్రమే బలపడి, ఇతర దేశాల కరెన్సీ విలువలు క్షీణించాయి. డాలర్‌ అంతర్జాతీయ రిజర్వు కరెన్సీ కాబట్టి అది భద్రమనే భావనతో ప్రపంచమంతటా మదుపరులు తమ పెట్టుబడులను అమెరికన్‌ డాలర్లలోకి మళ్ళించారు. 2023లో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందనే అంచనాల దృష్ట్యా వారు డాలర్‌ను సురక్షితమైనదిగా భావిస్తున్నారు. ఒక్క భారత్‌ నుంచే ఈ ఏడాది మూడువేల కోట్ల డాలర్లను పెట్టుబడిదారులు వెనక్కు తీసేసుకున్నారు. డాలర్‌ విలువ పెరగడానికి, రూపాయి విలువ పతనానికి ఇదే ప్రధాన కారణం. ఫలితంగా డాలర్‌-రూపాయి లావాదేవీల్లో స్థిరత్వం తీసుకురావడానికి భారతీయ రిజర్వు బ్యాంకు నడుం కట్టింది. ఇకపై అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులను వీలైనంతవరకు రూపాయల్లో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. ఆ దిశగా కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకుంది. మొదటగా అన్ని ఎగుమతులు, దిగుమతులకు ఇన్వాయిస్‌(బిల్లు)లను రూపాయల్లోనే రాయాలి. ఆ లావాదేవీలకు అంగీకరించే దేశాల కరెన్సీలకు, రూపాయికి మధ్య మారక విలువను మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయించాలి. చెల్లింపులను రూపాయల్లోనే జరపాలి. ఈ ప్రక్రియ ముందుకెళ్ళాలంటే విదేశీ బ్యాంకుల్లో భారతీయ బ్యాంకులు రూపాయిల్లో ‘వాస్ట్రో’ ఖాతాను తెరవాలి. వాస్ట్రో అంటే లాటిన్‌ భాషలో ‘మీది’ అని అర్థం. సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలకు డాలర్లలో చెల్లింపులు, జమలు ‘స్విఫ్ట్‌’ విధానంలో జరుగుతాయి. దాని నుంచి రష్యాను వెలివేయడంతో అక్కడి నుంచి భారత్‌కు రావలసిన 50 కోట్ల డాలర్లు స్తంభించిపోయాయి. రష్యా నుంచి ఆయుధాలు, చమురును దిగుమతి చేసుకోవడమూ ఇండియాకు కష్టమవుతోంది. ఈ చిక్కుముడి నుంచి గట్టెక్కడానికి రష్యా నుంచి భారత్‌ చౌకగా చమురును దిగుమతి చేసుకుంటూ, దానికి వాస్ట్రో ఖాతా ద్వారా రూపాయల్లో చెల్లింపులు జరుపుతోంది. డాలర్‌ డిపాజిట్లను ఆస్తులుగా పరిగణించడం వల్లనే అది అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా చలామణీ అవుతోంది. చైనా పారిశ్రామిక ఎగుమతులను పెంచి తన కరెన్సీ యువాన్‌ను అంతర్జాతీయ చెల్లింపు సాధనంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా, నాటోల ఆర్థిక ఆంక్షల వల్ల చైనీస్‌ యువాన్లలో చెల్లింపులను రష్యా స్వీకరిస్తోంది. అంతర్జాతీయ లావాదేవీల్లో మూడు శాతమే చైనీస్‌ కరెన్సీలో నడుస్తున్నాయి. 40శాతం లావాదేవీలు డాలర్లలోనే సాగుతున్నాయి.

విదేశీ పెట్టుబడులు పెరగాలి

దిగుమతుల కన్నా ఎగుమతులు ఎక్కువగా ఉంటేనే ఒక దేశ కరెన్సీ అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమవుతుంది. దిగుమతులు ఎక్కువైతే వాణిజ్య లోటు పెరిగిపోయి కరెన్సీ విలువ క్షీణిస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎగుమతులు పెంచడానికి భారత్‌ గట్టిగా కృషి చేయాలి. ఆ ఎగుమతులకు రూపాయల్లో చెల్లింపులు స్వీకరించాలి. ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌ 2021-22లో జరిపిన అంతర్జాతీయ వాణిజ్య విలువ లక్ష కోట్ల డాలర్లు. అందులో ఎగుమతుల విలువ 40,000 కోట్ల డాలర్లు. అదే ఏడాది భారత్‌ 8,300 కోట్ల డాలర్ల పైచిలుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) స్వీకరించింది. పెట్టుబడులు నిరాటంకంగా భారత్‌లో ప్రవేశించడానికి, భారత్‌ నుంచి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోవడానికి వెసులుబాటు కల్పిస్తే, విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. రూపాయిని పూర్తి పరివర్తనీయ కరెన్సీగా మార్చడం దానికి తొలిమెట్టు. ఇండియా ప్రధానంగా అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ), చైనా, యూఏఈ, సింగపుర్‌, సౌదీ అరేబియాలతో వాణిజ్యం నెరపుతోంది. ఆ దేశాలు డాలర్లు, యూరోలలో కాకుండా మన కరెన్సీలో చెల్లింపులను స్వీకరిస్తేనే రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా స్థిరపడుతుంది. మరోవైపు డాలర్‌కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్‌ దేశాలు అంతర్జాతీయ రిజర్వు కరెన్సీని ప్రవేశపెట్టాలనుకొంటున్నట్లు రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇటీవలి బ్రిక్స్‌ శిఖరాగ్ర సభలో వెల్లడించారు. బ్రిక్స్‌ దేశాల సొంత కరెన్సీలు కొత్త రిజర్వు కరెన్సీకి పునాదిగా నిలుస్తాయన్నారు. భారత్‌, బ్రెజిల్‌, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాలతో ఏర్పడిన బ్రిక్స్‌ సంఘంలో సౌదీ అరేబియా, తుర్కియే, ఈజిప్ట్‌ కూడా చేరడానికి సుముఖత చూపుతున్నాయి. ఇరాన్‌, అర్జెంటీనాలు ఇప్పటికే బ్రిక్స్‌లో చేరే ప్రక్రియ ప్రారంభించాయి. చమురు ఎగుమతిచేసే రష్యా, ఇరాన్‌లకు తోడు సౌదీ కూడా బ్రిక్స్‌లో చేరితే పెట్రో డాలర్‌ ఆధిపత్యం క్షీణించి బ్రిక్స్‌ దేశాల రిజర్వు కరెన్సీ సాకారమవుతుంది. ఆ కరెన్సీలో అంతర్భాగమైన రూపాయి కూడా అంతర్జాతీయంగా చలామణీ అవుతుంది.

ఆ వాతావరణం సృష్టిస్తేనే...

ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులకు డాలర్‌, యూరో, జపనీస్‌ యెన్‌, బ్రిటిష్‌ పౌండ్‌, చైనీస్‌ యువాన్‌ మాధ్యమాలుగా ఉపయోగపడుతున్నాయి. అత్యధిక చెల్లింపులు డాలర్లలోనే జరుగుతున్నాయి. రూపాయిని సైతం అంతర్జాతీయ కరెన్సీగా చలామణీ చేయాలంటే ఇండియా నుంచి వస్తుసేవల ఎగుమతులను విరివిగా పెంచాలి. రూపాయల్లో చెల్లింపులు స్వీకరించాలి. అలా రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చి, ఇతర దేశాలు రూపాయల్లో ఆస్తులు కూడబెట్టుకునే వాతావరణాన్ని సృష్టించాలి.

ప్రపంచ దేశాల ఆమోదం కీలకం

చమురు ఎగుమతులకు బదులుగా భారత్‌ నుంచి ఆహార పదార్థాలు, వస్త్రాలు, సౌందర్య ఉత్పత్తులను రష్యా దిగుమతి చేసుకుంటూ వాటికి రూపాయల్లో చెల్లింపులు జరుపుతోంది. దానివల్ల భారత్‌ నెలకు 300 కోట్ల డాలర్లు బయటికి వెళ్లిపోకుండా నివారించగలుగుతుంది. ఇరాన్‌, నేపాల్‌, భూటాన్‌లూ రూపాయిలో లావాదేవీలను అనుమతిస్తున్నాయి. జింబాబ్వే భారతీయ రూపాయిని అధికార కరెన్సీగా గుర్తిస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ భారత ప్రభుత్వ నిల్వల నుంచి ఆహార ధాన్యాల ఎగుమతికి అంగీకరిస్తే- ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల్లోని కొన్ని దేశాలు రూపాయల్లో వాణిజ్య లావాదేవీలకు సుముఖత చూపవచ్చు.

 

- ఏఏవీ ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సంక్షోభంలో చైనా బ్యాంకులు

‣ తీర ప్రాంతానికి ప్రకృతి కాపలా!

‣ అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ

‣ ప్రజాస్వామ్యానికి ఊపిరులూదిన ఓటుహక్కు

‣ డ్రాగన్‌ చక్రబంధానికి విరుగుడు వ్యూహం

‣ వేగంగా చౌకగా... రవాణా!

‣ ‘కాట్సా’ కోరల నుంచి మినహాయింపు?

Posted Date: 29-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం