• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యోల్బణ కట్టడికి పటిష్ఠ కార్యాచరణ

ప్రజల ఉపాధిపై, దేశాభివృద్ధిపై ద్రవ్యోల్బణం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. సామాన్య పౌరుల జీవనాన్ని అది ఇక్కట్లపాలు చేస్తుంది. అందుకే ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ సరైన చర్యలు చేపట్టడం అత్యావశ్యకం.

ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా తమ పోరు ముగియలేదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తాజాగా వ్యాఖ్యానించారు. భారత్‌లో ఇటీవల చిల్లర సరకుల ధరల పెరుగుదల కాస్త తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. సెప్టెంబరులో 7.41శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం అక్టోబరులో 6.77శాతానికి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.8శాతానికి తగ్గి, వచ్చే ఆర్థిక సంవత్సర ప్రథమ త్రైమాసికంలో అయిదు శాతానికి చేరుకుంటుందన్నది ఆర్‌బీఐ అంచనా. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేకపోతోందని ఆర్‌బీఐపై విమర్శలు తలెత్తుతున్న సమయంలో ఇది నిజంగా పెద్ద ఊరట. 2016లో నిర్ణయించిన ప్రకారం ఆర్‌బీఐ దేశంలో ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య పట్టి నిలపాల్సి ఉంది. ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాలలో ద్రవ్యోల్బణం నిర్దిష్ట పరిమితికి మించే ఉంది. ఇప్పుడిప్పుడే అది ఆరు శాతం లోపునకు దిగివచ్చింది. అంతమాత్రాన తొందరపడి సంబరాలు చేసుకోనవసరం లేదు. అసలు ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలేమిటో శోధించి తగు పరిష్కారాలను అన్వేషించి అమలుపరచాలి.

సామాన్యులకు భారం

అధిక ద్రవ్యోల్బణం భారత్‌కు కొత్తకాదు. ఈసారి మాత్రం అది 10 నెలలపాటు తగ్గకుండా ఉండిపోయింది. ఏమాత్రం ఊహించని ఈ పరిణామం ఒక్కరోజులో సంభవించింది కాదు. మూడు అంశాలు ద్రవ్యోల్బణాన్ని పెంచాయి. మొదటిది- కరోనా కాలంలో అంతర్జాతీయ సరఫరా గొలుసులు విచ్ఛిన్నమై సరకుల ధరలు పెరిగిపోవడం. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఆహార ధాన్యాలు, ఎరువులు, పొద్దు తిరుగుడు నూనె సరఫరాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇంధన ధరలు పెరిగి ద్రవ్యోల్బణం మరింత హెచ్చింది. 2022 జనవరిలో పీపా ముడి చమురు ధర 84 డాలర్లకు పైగా ఉండేది. జూన్‌ నాటికి అది 116 డాలర్లకు చేరుకుంది. ఫలితంగా ఎరువులు, పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగి ఉత్పత్తి, రవాణా వ్యయాలూ అధికమయ్యాయి. ఇక మూడో పరిణామం- అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను పదేపదే పెంచడం. దానివల్ల డాలర్‌ ఆకర్షణీయ మదుపు సాధనంగా మారి భారతీయ స్టాక్‌ మార్కెట్ల నుంచి పెట్టుబడులు అమెరికాకు తరలిపోయాయి. ఇది డాలర్‌తో రూపాయి మార్పిడి విలువ తగ్గడానికి కారణమైంది. డాలర్‌ ప్రియం కావడంతో భారతదేశ దిగుమతుల బిల్లు పెరిగి ఇంధనంతోపాటు అన్ని వస్తువుల ధరలూ ఎగబాకాయి. ఇంత జరుగుతున్నా ఆర్‌బీఐ తొణకకుండా వడ్డీ రేట్లను తక్కువగానే ఉంచుతూ వచ్చింది. కొవిడ్‌ వల్ల పట్టాలు తప్పిన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ వృద్ధి బాటలో నడిపించాలంటే తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వక తప్పదని ఆర్‌బీఐ సూచించింది. తద్వారా వ్యాపారాలకు, పరిశ్రమలకు స్వల్ప వడ్డీపై పెట్టుబడులు అందేలా చూడటం తన అభిమతమని వెల్లడించింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యుడు ధరల పెరుగుదలను తట్టుకోలేడని గ్రహించలేకపోయింది.

రిజర్వు బ్యాంకు నిర్ణయాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు మధ్య సమన్వయం ఉన్నప్పుడు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం సులువవుతుంది. ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వాలు సంక్షేమ వ్యయం విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. తమ ఆదాయమెంత, ఖర్చులెంత అని గమనించుకుంటూ సరైన విధానాలు చేపట్టాలి. దుబారాను, అనుత్పాదక వ్యయాన్ని కట్టడి చేయాలి. ప్రజల జేబుల్లోకి నేరుగా ధనం బదిలీచేస్తే వస్తుసేవలకు గిరాకీ అమాంతం పెరిగిపోతుంది. దాన్ని తీర్చగల స్థాయిలో ఉత్పత్తి లేకపోతే సహజంగానే ధరలు ఎగబాకుతాయి. రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ఆర్థిక క్రమశిక్షణ కొరవడితే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించినా పెంచినా పెద్ద తేడా ఉండకపోవచ్చు. అలాగని పేదలను మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేయాలని కాదు. పేదల కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధుల్ని అనర్హులు కైంకర్యం చేయకుండా జాగ్రత్తపడాలి. గిరాకీకి తగ్గ స్థాయిలో ఉత్పత్తులు సరఫరా కాక, జనం చేతిలో ఎక్కువ డబ్బు ఆడుతూ ఉంటే కొద్ది సరకుల కోసం ఎక్కువమంది పోటీపడతారు. ఈ పోటీయే ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దానివల్ల డబ్బు విలువ తగ్గుతుంది. పేదలకు లోగడకన్నా తక్కువ సరకులే వస్తాయి. అంతిమంగా వారి జీవన ప్రమాణాలను ద్రవ్యోల్బణం కుంగదీస్తుంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి.

దూరదృష్టి అవసరం

ఓట్ల కోసం జనాకర్షక పథకాలపై డబ్బు గుమ్మరించకుండా ఆ ధనాన్ని మౌలిక వసతుల విస్తరణ, విద్యావైద్యాలపై వెచ్చిస్తే దీర్ఘకాల ప్రగతి సిద్ధిస్తుంది. అభివృద్ధి వల్ల ప్రభుత్వానికీ ఆదాయం పెరిగి విత్తలోటు దిగివస్తుంది. అప్పుడు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను అవసరానికి తగ్గట్టు పెంచడానికి, తగ్గించడానికి అవకాశం లభిస్తుంది. కొవిడ్‌ వల్ల విచ్ఛిన్నమైన సరఫరా గొలుసులు ఇంకా యథాస్థితికి రాలేదు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ద్రవ్యోల్బణం ప్రస్తుతానికి తగ్గినందుకు సంబర పడకుండా దూరదృష్టితో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ సరైన విధానాలు చేపట్టాలి.

ఆర్‌బీఐ లోపం

గత 10 నెలల ద్రవ్యోల్బణం మన విధానాల్లో మార్పు రావాల్సిన అవసరాన్ని పట్టిచూపింది. ద్రవ్యోల్బణం తలెత్తగానే అది ఒక ముఖ్య సమస్య అని గుర్తించి వేగంగా కార్యాచరణ చేపట్టాలి. లేకుంటే విధానపరంగా నిర్లక్ష్య భావం ముప్పిరిగొంటుంది. కొవిడ్‌ కారణంగా వస్తు సరఫరాలు దెబ్బతినడం వల్ల ధరలు పెరుగుతున్నాయి. దానికితోడు అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు సమస్యను తీవ్రతరం చేశాయి. ఆర్‌బీఐకి ఆహార, ఇంధన ధరలపై అదుపు లేదనే మాట నిజమే. కానీ, నిత్యావసరాలు కాని ఇతర వస్తువుల ధరలను నియంత్రించే సత్తా దానికి ఉంది. ఆ అవకాశాన్ని ఆర్‌బీఐ ఉపయోగించుకోకపోవడం పెద్ద లోపం. సమస్యను మొగ్గలోనే తుంచే చర్యలు చేపట్టాలి. ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూనే కొంత స్వయంప్రతిపత్తినీ ప్రదర్శించాలి. ఉమ్మడి సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు ఉత్తమ ఆర్థిక ఫలితాలను సాధించడానికి అది తోడ్పడుతుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎరువుల భారం... సేంద్రియ మార్గం!

‣ ఇకనైనా ధరలు దిగివస్తాయా?

‣ నేల తల్లికి పుట్టెడు శోకం

‣ సహ చట్ట స్ఫూర్తిపై దాడి

‣ మదుపరుల పుట్టిముంచిన క్రిప్టో

‣ డేటా కేంద్రాల విపణిగా భారత్‌

Posted Date: 09-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం