‣ భారత్లో బ్యాంకింగ్ రంగ ప్రస్థానం
‘రుణాలు ఇవ్వడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి ప్రజల నుంచి నగదు డిపాజిట్లు స్వీకరించడం, డిపాజిట్ దారులు కోరిన వెంటనే నగదు చెల్లించడం, వారికి అవసరమైనప్పుడు చెక్కు, డ్రాఫ్టు లేదా ఇతర రూపాల్లో డబ్బు విత్డ్రా చేసుకునే సౌకర్యం కల్పించడం బ్యాంకుల బాధ్యత’ అని 1949నాటి బ్యాంకింగ్ నియంత్రణ చట్టం నిర్దేశిస్తోంది. కాలక్రమంలో బ్యాంకుల విధానాలు, కార్యకలాపాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. జాతీయీకరణ తరవాత బ్యాంకుల స్వరూపమే మారిపోయింది. స్వాతంత్య్రం సిద్ధించిన తరవాత ఈ ఏడున్నర దశాబ్దాల్లో బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకొన్న పరిణామాలేమిటి? అసలు లక్ష్యాన్ని నెరవేర్చడంలో అవి ఎంతవరకు సఫలీకృతమవుతున్నాయి?
బ్రిటిష్ పాలనలో బెంగాల్, బాంబే, మద్రాసు ప్రెసిడెన్సీలకు వేర్వేరు బ్యాంకులు ఉండేవి. తరవాత ఈ మూడింటినీ విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పరచారు. 1935లో రిజర్వు బ్యాంకును స్థాపించే వరకు ఇంపీరియల్ బ్యాంకే కేంద్ర బ్యాంకు విధులను నిర్వహించేది. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన తరవాత రిజర్వు బ్యాంకు- ఫైనాన్స్ రంగానికి, దేశంలోని బ్యాంకులన్నింటికీ ప్రధాన నియంత్రణదారు అయింది. ద్రవ్య విధానం, కరెన్సీ నోట్ల ముద్రణ, ప్రభుత్వ బాండ్ల జారీ వంటివి రిజర్వు బ్యాంకు ద్వారానే జరుగుతాయి. సర్సి.డి.దేశ్ముఖ్, బి.రామారావు, సి.రంగరాజన్, మన్మోహన్ సింగ్, వై.వి.రెడ్డి, దువ్వూరి సుబ్బారావు, రఘురాం రాజన్ వంటి విఖ్యాతులు రిజర్వు బ్యాంకు గవర్నర్లుగా పనిచేశారు. భారత్కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా 3,469 బ్యాంకు శాఖలే ఉండేవి. వాటిలో మొత్తం డిపాజిట్ల విలువ రూ.962 కోట్లు. అవన్నీ ప్రైవేటు బ్యాంకులే. సంపన్నులకు మాత్రమే అవి రుణాలిచ్చేవి. వ్యవసాయదారులు, చిన్న వ్యాపారాలకు అవి పైసా కూడా విదిల్చేవి కావు. నాటి రాజ సంస్థానాలకు ఏడు సొంత స్టేట్ బ్యాంకులు ఉన్నా, అవి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కనుసన్నల్లో నడిచేవి. 1949లో బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్టం చేయడంతోపాటు రిజర్వు బ్యాంకునూ జాతీయం చేశారు.
సమూల మార్పులు
వలస పాలన నుంచి విముక్తి పొందిన అనేక అల్పాదాయ దేశాల్లో బ్యాంకులను ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చి- పేదరిక నిర్మూలనకు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి వాటిని సమర్థ సాధనాలుగా ఉపయోగించసాగారు. 1969లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రూ.100 కోట్లకు తగ్గకుండా డిపాజిట్లు ఉన్న 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసి ప్రభుత్వరంగ బ్యాంకులుగా మార్చారు. 1980లో మరో ఆరు ప్రైవేటు బ్యాంకులు జాతీయమయ్యాయి. 1969లో దేశంలోని మొత్తం బ్యాంకు శాఖల సంఖ్య 8,262; 2014నాటికి ఆ సంఖ్య దాదాపు ఏడు రెట్లు పెరిగింది. 2007లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఇచ్చిన రుణాలు రూ.2,75,300 కోట్లు; 2013-14నాటికి అవి రూ.6,69,400 కోట్లకు చేరాయి. బ్యాంకుల జాతీయీకరణ తరవాత మొదటి పదేళ్లలో గ్రామీణ ఆర్థిక వికాసానికి, సమ్మిళిత అభివృద్ధి సాధనకు ప్రాధాన్యం లభించింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ), లోకల్ ఏరియా బ్యాంకులను ఏర్పరచారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వాణిజ్య బ్యాంకులు రుణాలివ్వసాగాయి. రాష్ట్ర, జిల్లా స్థాయి సహకార సంఘాలకు ఎప్పుడూ నిధుల కొరతేనన్నది నిష్ఠుర సత్యం. ఇంకా సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం, విద్యావంతులైన నిరుద్యోగులకు స్వయం ఉపాధి, నిరుపేదలకు నాలుగు శాతం వార్షిక వడ్డీపై రుణాలిచ్చే పథకాలను చేపట్టారు. బ్యాంకుల అధ్యక్షులు గ్రామాలను, వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి వాస్తవ స్థితిగతులను తెలుసుకొనేవారు. బ్యాంకుల జాతీయీకరణ తరవాత రెండో దశాబ్దంలో చిన్న, మధ్య తరహా రైతులకు, చిన్న పరిశ్రమలకు రుణ వితరణను విస్తరించారు. బ్యాంకుల నుంచి నేరుగా రుణాలు పొందినవారిలో చాలామంది ఎగవేతదారులయ్యారనే విమర్శలూ వచ్చాయి. 1982లో ‘జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్)’ను నెలకొల్పారు. 1990లో ప్రారంభమైన ‘భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి)’ గ్రామీణ, చిన్న పరిశ్రమలు, చేతి వృత్తులవారికి ప్రోత్సాహం అందించసాగింది.
పీవీ నరసింహారావు ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు బ్యాంకింగ్ రంగ స్వరూప స్వభావాలను మార్చివేశాయి. ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో నరసింహం కమిటీ ప్రైవేటు బ్యాంకులను ప్రోత్సహించడం ద్వారా బ్యాంకింగ్ రంగంలో పోటీని పెంచాలని సిఫార్సు చేసింది. ఆదాయం ప్రాతిపదికపై బ్యాలన్స్ షీట్లను రూపొందించే విధానం కనుమరుగైంది. ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు కేటాయించే ప్రతి రూపాయిలో 16 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతోందని 1989లో రాజీవ్ గాంధీ- భువనేశ్వర్ సభలో వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి చిన్న రైతులకు, చిన్న పరిశ్రమలకు బ్యాంకు రుణాలను పెంచాలన్న భావన విస్తరించింది. ప్రభుత్వ పథకాల అమలుకు పకడ్బందీ యంత్రాంగం కొరవడటంవల్లే పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఆశించిన ఫలితాలను అందించడంలో విఫలమవుతున్నాయి. పీవీ హయాములో తెచ్చిన సంస్కరణలు ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించాయి. తదనుగుణంగా గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధిని మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సిడ్బి ఈ నిధిని నిర్దేశిత ప్రయోజనాలకు వెచ్చిస్తుందని కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లలో కేటాయింపులు జరిపినా, ఖర్చు కాకుండా మిగిలిపోయిన మొత్తాలను ఈ నిధికి మళ్లించారు. సంస్కరణల అనంతరం బ్యాంకుల లాభదాయకత, సుస్థిరతలకు ప్రాధాన్యం పెరిగింది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యూటీఐ (యాక్సిస్) వంటి ప్రైవేటు బ్యాంకులు ఆవిర్భవించాయి. ఫెడరల్ వంటి సంప్రదాయ ప్రైవేటు బ్యాంకులు కొత్త రంగాల్లోకి విస్తరించాయి. రిటైల్ బ్యాంకింగ్, గృహ రుణాలు నానాటికీ వృద్ధి చెందాయి. మైక్రోఫైనాన్స్ సంస్థలు విరివిగా పుట్టుకొచ్చాయి.
బ్యాంకుల జాతీయీకరణ తరవాత నాలుగో దశాబ్దిలో గృహ, స్థిరాస్తి రంగాలకు, భారీ పరిశ్రమలకు, పెద్ద వ్యాపారాలకు విరివిగా రుణాలు ఇవ్వసాగారు. చిన్న పరిశ్రమలు, వ్యాపారాలను బ్యాంకులు పట్టించుకోవడం మానేశాయి. వ్యక్తులు కాకుండా సాంకేతిక వ్యవస్థలు రుణ వితరణను శాసించసాగాయి. అయితే, బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ పటిష్ఠంగానే ఉండటంతో 2008నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని భారత్ తట్టుకొని నిలబడగలిగింది. ఆ తరవాత నుంచి నెట్ బ్యాంకింగ్, ఏటీఎమ్లు విస్తరించసాగాయి. జాతీయీకరణకు ముందునాళ్లతో పోలిస్తే తరవాతి కాలంలో బ్యాంకింగ్ రంగం సమూలంగా మారిపోయింది. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, ఆర్ఆర్బీలు, విదేశీ బ్యాంకులు, సహకార గ్రామీణ, పట్టణ బ్యాంకులు, చిన్న పేమెంట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో బ్యాంకింగ్ రంగం కిక్కిరిసిపోయింది.
రుణాలంటేనే భయం!
జాతీయీకరణ తరవాత అయిదో దశాబ్దిలో బ్యాంకుల నిరర్థక ఆస్తులు పది లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఈ పాపంలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటివారి పాత్ర పెద్దదే. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, డీహెచ్ఐఎల్ వంటి పెద్ద ఎన్బీఎఫ్సీలు కుప్పకూలాయి. 2011 తరవాత భారీ కార్పొరేట్ సంస్థలకు, బ్యాంకులకు చెందిన 30 మంది ప్రమోటర్లు, సీఈఓలు జైలుపాలయ్యారు. రుణ మంజూరు అంటేనే బ్యాంకులు భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో బ్యాంకులు, ఖాతాదారుల మధ్య దూరం పెరిగిపోతోంది. కనీస నగదు ఉంచడం లేదని ఖాతాదారులపై జరిమానాలు విధించడం ఎక్కువైంది. బ్యాంకులు బ్యాంకింగేతర కార్యకలాపాలపై కమిషన్ల రూపంలో ఎక్కువ సంపాదిస్తున్నాయి. రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందక వడ్డీ వ్యాపారుల చేతికి చిక్కి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి. సమ్మిళిత అభివృద్ధిని వదిలేసి లాభాల కోసం పాకులాడుతున్నా, ఎన్పీఏల వల్ల ఆ లాభాలూ ఎండమావిగా మిగిలాయి. బ్యాంకింగ్ రంగాన్ని మళ్ళీ సమూలంగా సంస్కరించాల్సిన సమయం వచ్చింది.
నిరర్థక ఆస్తుల మేట
ఆర్థిక సరళీకరణ తరవాత ఎస్బీఐతోపాటు అన్ని బ్యాంకులూ గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో లాభసాటిగా లేని శాఖలను మూసివేశాయి. ఎస్బీఐ ఒక్కటే 5,000 శాఖలను మూసివేసింది. ఫలితంగా బ్యాంకింగ్ సౌకర్యం లేని గ్రామీణ పేదలకు ఆ సదుపాయాన్ని అందించాలన్న లక్ష్యం దెబ్బతిన్నది. నరసింహం కమిటీ సిఫార్సులకు అనుగుణంగా 39 బ్యాంకు విలీనాలు, స్వాధీనాలు జరిగాయి. 2008, 2015లో ఎస్బీఐ ఏడు అసోసియేట్ బ్యాంకులను విలీనం చేసుకుంది. బ్యాంకింగ్ రంగ సమస్యలకు బ్యాంకుల విలీనమొక్కటే పరిష్కారం కాదని వై.వి.రెడ్డి, దువ్వూరి సుబ్బారావు, రఘురాం రాజన్లు పదేపదే సూచించినా ప్రయోజనం లేకపోయింది. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) విపరీతంగా పేరుకుపోయాయి.
డిపాజిట్లపై అనాసక్తి
సమ్మిళిత వృద్ధి సాధనంగా బ్యాంకింగ్
వ్యవసాయం, ఉపాధి కల్పన, వ్యవస్థాపకత, మౌలిక వసతుల కల్పన, అంతర్జాతీయ ఫైనాన్స్ రంగాలన్నింటినీ గంపగుత్తగా నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించడం వల్ల సరైన ప్రయోజనాలు ఉండవని ఇంతవరకు జరిగిన అనుభవాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఆయా రంగాల ప్రాథమ్యాలకు అనుగుణంగా వేర్వేరు విధానాలను బ్యాంకులు చేపట్టవలసిన అవసరం ఉంది. అందుకు కావాల్సిన రీతిలో బ్యాంకింగ్ వ్యవస్థను పునర్నిర్మించాలి. ప్రస్తుతం వ్యవసాయ రంగం సంప్రదాయ సేద్యం నుంచి ప్రణాళికాబద్ధమైన, సేంద్రియ, హరిత సాంకేతికతలతో కూడిన విధానాల వైపు వేగంగా పురోగమిస్తోంది. కోళ్లు, గొర్రెల పెంపకం, రొయ్యల చెరువులు వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు విస్తరించాయి. మారుతున్న రైతుల అవసరాలను తీర్చే పనిని బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్బీ)లకు అప్పగించాలి. తమ గ్రామీణ శాఖలను వాటిలో విలీనం చేయాలి. వ్యవసాయ యంత్రాల కొనుగోలు రుణాలు, పంటల బీమా వంటి విధులను ఆర్ఆర్బీలు నిర్వహించాలి. రైతు రుణ అవసరాలు భారీగా ఉంటాయి కాబట్టి ఆర్ఆర్బీలతోపాటు గ్రామీణ సహకార బ్యాంకులూ రుణ వితరణ బాధ్యతను నిర్వహించాలి. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి నిర్వహణతోపాటు మరెన్నో కీలక బాధ్యతలు వహించే నాబార్డ్నూ పునర్వ్యవస్థీకరించాలి.
మారాల్సిన అజెండా
కొత్త పరిశ్రమలు, వ్యాపారాలను ప్రారంభించే వ్యవస్థాపకులను బ్యాంకులు ప్రోత్సహించి, ఉపాధి కల్పనకు ఊతమివ్వాలి. అంకురాలు, భారత్లో తయారీ, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాలను చేపట్టినా- అవి నత్తనడకన సాగుతున్నాయి. నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ప్రాధికార సంస్థను నెలకొల్పి పరిస్థితిలో గుణాత్మక మార్పు తీసుకురావాలని ప్రభాత్ కుమార్ కమిటీ సూచించింది. దాన్ని వెంటనే అమలు చేయాలి. భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి) ప్రస్తుతం స్థిరాస్తి, పారిశ్రామికేతర రంగాలకు నిధులు ఇస్తోంది. ఇక నుంచి ఈ తరహా రుణాలను వాణిజ్య బ్యాంకులకు వదిలిపెట్టి- తాను ఎంఎస్ఎంఈ రంగంలో కేవలం పారిశ్రామికోత్పత్తి సాగించే యూనిట్లకు ఆర్థిక సహాయం అందించాలి. సిడ్బి దగ్గరున్న నిధులను- ఇంక్యుబేషన్ నిధి, వెంచర్ క్యాపిటల్, ఈక్విటీ మార్కెటింగ్, సాంకేతికత-పునరావాస నిధి... ఇలా అయిదు రకాలుగా సంఘటిత పరచాలి. వీటిని చిన్న పరిశ్రమల విస్తరణకు సమర్థంగా వినియోగించాలి. ప్రభుత్వ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకులు ఇకపై ప్రాజెక్ట్ ఫైనాన్స్ మీద దృష్టి కేంద్రీకరించాలి. గృహ, స్థిరాస్తి, సేవారంగాలు, ఎగుమతి, దిగుమతులకు రుణాల అందజేతకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీర్ఘకాలిక మౌలిక వసతుల నిర్మాణ ప్రాజెక్టులకు రుణాలివ్వడం వల్లనే బ్యాంకులకు నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగిపోయాయి. ఇలాంటి ప్రాజెక్టుల్లో ఉండే సాధకబాధకాల గురించి బ్యాంకులకు పూర్తి పరిజ్ఞానం, అనుభవం లేకపోవడం ఈ దుస్థితికి కారణం. రిజర్వు బ్యాంకు చేపట్టిన రుణ పునర్వ్యవస్థీకరణ వల్ల వాణిజ్య బ్యాంకులకు ఒరిగిందేమీ లేదు. కేవలం మౌలిక వసతుల రంగానికి ఆర్థిక చేయూత అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయవలసిన సమయం ఆసన్నమైంది. బ్యాంకింగ్ రంగ సమస్యలను విధానకర్తలు సమగ్రంగా పరిశీలించి, సమష్టిగా పరిష్కారాలు కనుక్కోవాలి. బ్యాంకుల సమర్థ నిర్వహణకు స్వతంత్ర డైరెక్టర్లను ఎంపిక చేయాలి. అటువంటి ఉద్ధండుల జాబితాను ప్రభుత్వం సిద్ధంగా ఉంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు విక్రయించి కమిషన్లు సంపాదించే పనిని పక్కనపెట్టి డిపాజిట్ల సేకరణ, రుణ వితరణపైనే బ్యాంకులు పూర్తి శ్రద్ధ వహించడం అవసరం. ఫిర్యాదుల స్వీకరణ, సత్వర పరిష్కారానికి సమర్థ యంత్రాంగాన్ని ఏర్పరచడంపైనా రిజర్వు బ్యాంకు దృష్టి సారించడం తప్పనిసరి. బ్యాంకింగ్ ఆంబుడ్స్మన్ పదవి పదునెక్కాలి. రుణ సంబంధ ఫిర్యాదులకు ప్రత్యేక యంత్రాంగాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉంది.
స్వీయ దోషాలే కారణం
నగదు రహిత బ్యాంకింగ్ కార్యకలాపాలవల్ల డిపాజిట్లు క్రమేణా తగ్గిపోతున్నాయి. పని చేయని ఏటీఎమ్లు బ్యాంకులపై ఖాతాదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. బలహీన బ్యాంకింగ్ దేశ ఆర్థిక ప్రగతికి ఏమాత్రం క్షేమం కాదు. ప్రభుత్వ ఒత్తిళ్ల కారణంగా ఎడాపెడా రుణాలు ఇచ్చేయడం వల్ల బ్యాంకులకు ఎన్పీఏలు పెరిగిపోయాయి. వ్యవసాయానికి, ఎంఎస్ఎంఈలకు లక్ష్యాల మేరకు రుణాలిచ్చేశామని బ్యాంకులు చెప్పుకొంటున్నా- వాస్తవంలో ఈ రెండు రంగాలు సరిపడా నిధులు అందక కునారిల్లుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల రాష్ట్రాలు రుణ మాఫీ మంత్రాన్ని జపించడమూ బ్యాంకులను దెబ్బతీస్తోంది. రాజకీయ కారణాలవల్ల కేంద్రం, రిజర్వు బ్యాంకు అటువంటి వాటికి అడ్డు చెప్పలేకపోతున్నాయి. ఏ వ్యాపారం వర్ధిల్లాలన్నా నైతిక వర్తన ముఖ్యం. అది లోపించినప్పుడు నిధులు పక్కదారి పడతాయి. నైతికత కొరవడటం, సమర్థ నిర్వహణ లోపించడం ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగానికి శాపాలుగా పరిణమించాయి. ఈ దుస్థితిని తక్షణం సరిదిద్దాలి.