• facebook
  • whatsapp
  • telegram

వర్ధమాన దేశాల ‘వాణిజ్య సమరం’

ప్రయోజనాలకోసం డబ్ల్యూటీఓలో పట్టు

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఆవిర్భవించిన తరవాత వర్ధమాన దేశాలు తమ ప్రయోజనాల రక్షణకు ఎన్నడూ లేనంత సంక్లిష్ట సమరాన్ని ఇటీవలి 12వ మంత్రుల స్థాయి సమావేశంలో చేపట్టాయి. ఎలెక్ట్రానిక్‌ ప్రసారాలు లేదా డౌన్‌లోడ్‌లపై కస్టమ్స్‌ సుంకాలు విధించకూడదని 1998 డబ్ల్యూటీఓ సమావేశంలో తాత్కాలిక మారటోరియం విధించారు. దాన్ని ఏటా పొడిగిస్తూ వచ్చారు. గడచిన 24 ఏళ్లలో జరిగిన మంత్రుల స్థాయి సమావేశాల్లో దానిపై అభ్యంతరాలేమీ తలెత్తలేదు. ఈసారి మాత్రం మారటోరియాన్ని ఇకపై కొనసాగించకూడదని వర్ధమాన దేశాలు పట్టుపట్టాయి. కృత్రిమ మేధ, త్రీడీ ముద్రణ సాంకేతికతల వంటివి క్రమంగా విస్తరిస్తున్నాయి. వాటిని ఆఫ్‌లైన్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లోనూ బదలాయించవచ్ఛు మారటోరియం వల్ల వాటికి సుంకాలు విధించే వీల్లేదు. అది వర్ధమాన దేశాలకు ఎంతో నష్టదాయకం.

స్వదేశంలోనే రూపకల్పన

ఈ-కామర్స్‌ విజృంభణ నుంచీ వర్ధమాన దేశాలు లబ్ధి పొందలేని పరిస్థితి నెలకొంది. అందుకే డబ్ల్యూటీఓలో ఈ-కామర్స్‌ ప్రభావం, తరవాతి కార్యాచరణ గురించి అధ్యయనం చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని మరింత పటిష్ఠం చేయాలని, అది పూర్తయ్యేలోగా ఎలెక్ట్రానిక్‌ డౌన్‌లోడ్‌లపై మారటోరియాన్ని ఆరు నెలలదాకా మాత్రమే పొడిగించాలనే భావన ముందుకొచ్చింది. 2019 డిసెంబరులో భారత్‌, దక్షిణాఫ్రికాలు దాన్ని బలపరిచాయి. ఏతావతా ఆరు నెలలనుకున్నది కాస్తా రెండేళ్ల మారటోరియం పొడిగింపునకు దారితీసింది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమైన ఈ-కామర్స్‌పై చర్చలను పునఃప్రారంభించాలని జెనీవాలో డబ్ల్యూటీఓ 12వ మంత్రుల స్థాయి సమావేశానికి ముందే భారత్‌, దక్షిణాఫ్రికా, ఇండొనేసియాలు సంయుక్తంగా లేఖ రాశాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య, జపాన్‌, చైనా, దక్షిణ కొరియా, కెనడాల వంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు మొత్తం 86 దేశాలు విడిగా ఈ-కామర్స్‌ నిబంధనల రూపకల్పనకు బహుళపక్ష ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రతిపాదిస్తున్నాయి. భారత్‌ ఆ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తోంది. ఎలెక్ట్రానిక్‌ డౌన్‌లోడ్లపై మారటోరియంవల్ల సంపన్న దేశాల ఉత్పత్తులు సుంకాలు, కోటాలు లేకుండా వర్ధమాన దేశాల్లోకి ప్రవేశిస్తున్నాయి. దానివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు భారీగా ఆదాయాన్ని నష్టపోతున్నాయని భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొవిడ్‌ కాలంలో డిజిటల్‌ మౌలిక వసతులు బాగా అక్కరకొచ్చినా అదేసమయంలో దేశాల మధ్య డిజిటల్‌ అంతరాలూ పెరిగిపోయాయి. ప్రస్తుత ఎలెక్ట్రానిక్‌ యుగంలో వర్ధమాన దేశాలూ సొంత డిజిటల్‌ ఉత్పత్తులను, పరిశ్రమలను రూపొందించి విస్తరించాలి. ఎలెక్ట్రానిక్‌ ప్రసారాలపై మారటోరియం వల్ల వర్ధమాన దేశాలు కస్టమ్స్‌ సుంకాలతోపాటు అనేక ఇతర పన్నులు, రుసుములనూ వదులుకోవాల్సి వస్తోంది. అసలే కరోనా మహమ్మారివల్ల కుదేలైన వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఈ ఆదాయ నష్టాన్ని తట్టుకోలేవు. అవి మళ్ళీ తేరుకోవడానికి డిజిటల్‌ ఉత్పత్తులు, సేవలు కీలకమవుతాయి. వాటిని స్వదేశంలోనే రూపొందించాలని భారత్‌ ఆశిస్తోంది. ఆలోగా సంపన్న దేశాల ధాటిని తట్టుకోవడానికి వాటి డిజిటల్‌ ఉత్పత్తులపై కస్టమ్స్‌ సుంకాలను విధించడమే శరణ్యం. ఆ సుంకాల వల్ల విదేశీ వీడియోగేమ్స్‌ వంటి డిజిటల్‌ ఉత్పత్తుల ధరలు పెరిగి, స్వదేశీ వినియోగదారులను వాటికి దూరంగా ఉంచుతాయి. తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆదాయం పెరగడంతోపాటు సొంత డిజిటల్‌ వ్యాపారానికీ పునాదులు వేసుకోవచ్చు.

సంపన్న రాజ్యాల వాదన

డబ్ల్యూటీఓ 12వ మంత్రుల స్థాయి సమావేశంలో సంపన్న దేశాలు ఎలెక్ట్రానిక్‌ ప్రసారాలపై సుంకాల మారటోరియాన్ని పొడిగించాలని గట్టిగా ప్రయత్నించాయి. 25 ఏళ్లుగా దానివల్ల సంపన్న దేశాల బడా టెక్‌ కంపెనీలు ఎలాంటి సుంకాలూ చెల్లించకుండా డిజిటల్‌ ఉత్పత్తులను, సేవలను ఎగుమతి చేయగలిగాయి. ఎలెక్ట్రానిక్‌ డౌన్‌లోడ్‌లపై సుంకం విధించి ఉంటే 2017-2019 మధ్య కాలంలో వర్ధమాన దేశాలకు కేవలం 49 డిజిటల్‌ ఉత్పత్తుల ద్వారానే 5,600 కోట్ల డాలర్ల అదనపు ఆదాయం సమకూరి ఉండేదని ఒక అధ్యయనం తేల్చింది. నిరుపేద దేశాలైతే 800 కోట్ల డాలర్లను ఆర్జించగలిగేవి. ఆ ఆదాయం లభించకపోగా, రెండు మోతాదుల చవక కొవిడ్‌ టీకాల కొనుగోలుకే పేద దేశాలు 400 కోట్ల డాలర్లను వెచ్చించాల్సి వచ్చింది. కొవిడ్‌ విజృంభణ, సరఫరా గొలుసుల విచ్ఛిన్నంవల్ల ప్రపంచమంతటా ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు డిజిటల్‌ ఉత్పత్తులపై మారటోరియాన్ని ఎత్తివేస్తే వాటి ధరలూ పెరిగి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ మరింత ఆలస్యమవుతుందని సంపన్న దేశాలు వాదించాయి. 2023 మంత్రుల స్థాయి సమావేశందాకా మారటోరియాన్ని కొనసాగించేలా వర్ధమాన దేశాలను ఒప్పించాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏటా తప్పని విత్తన గండం

‣ పోరుబాటలో ఆకాశనేత్రం

‣ కడగండ్ల సేద్యం

‣ దేశ రక్షణలో మేలిమి పథమేనా?

‣ ముసురుతున్న అణుభయాలు

‣ వైద్యరంగంలో సాంకేతిక విప్లవం

Posted Date: 25-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం