• facebook
  • whatsapp
  • telegram

మిన్నంటుతున్న ఆకలి కేకలు

ప్రపంచంలోని చాలా దేశాలు అన్నిరకాలుగా అభివృద్ధి సాధిస్తూ మున్ముందుకు దూసుకుపోతున్నాయి. మరికొన్ని మాత్రం ఇంకా ఆకలి సమస్యతో కునారిల్లుతున్నాయి. ఇప్పటికే పేదరికంలో మగ్గుతున్న పలు దేశాల ప్రజలను ఆహార సంక్షోభం మరింతగా కుంగదీస్తోంది. అక్కడి ప్రభుత్వాలకు దాని పరిష్కారం సాధ్యం కావడం లేదు. అంతర్జాతీయ సమాజం సైతం ఆదుకోలేకపోవడంతో ఆయా దేశాల ప్రజలు దయనీయ స్థితిలో చిక్కుకుంటున్నారు.

ఆకలికి అసలు కారణం ఆహారం కోసం చెల్లించలేని అసమర్థత అని ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ స్పష్టీకరించారు. పేద  కుటుంబాలు ఒకటి రెండు ప్రధాన ఆహారాలపైనే ఆధారపడుతుండటంతో వారికి తగినంత విటమిన్లు, ప్రొటీన్లు అందడం లేదు. గర్భిణులు, చిన్న పిల్లల్లో పోషకాహార లోపం కారణంగా అనేక దుష్ఫలితాలు తలెత్తుతాయి. అయిదేళ్లలోపు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహారం ఎంతో కీలకం. కొన్ని దేశాల్లో సరైన ప్రకృతి వనరులు లేకపోవడం, మరికొన్ని దేశాల్లో వివిధ కారణాల వల్ల ఉన్న వనరులను ఉపయోగించుకోలేకపోవడం వల్ల అక్కడి ప్రజలను ఆహార కొరత వేధిస్తోంది. ఆకలి సమస్యతో బాధపడేవారు తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

తీవ్ర సమస్య

ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌ తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ ఆకలి సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్లు ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’ నివేదిక పేర్కొంది. అఫ్గాన్‌లో తాలిబన్‌ పాలకుల ఆంక్షలతో అనేక స్వచ్ఛంద సంస్థలు తమ సేవా కార్యకలాపాలను నిలిపివేశాయి. దీంతో ఆకలి సమస్య మరింత జటిలమవుతోంది. తాలిబన్‌ పాలకులు ప్రైవేటు సంస్థల్లో మహిళలు ఉద్యోగం చేయడాన్ని నిషేధించారు. పేదరికం, ఆకలి, నిరుద్యోగం, భద్రత లేకపోవడం వల్ల అఫ్గాన్‌లో ప్రజలు ముఖ్యంగా చిన్నారుల జీవన పరిస్థితులు దుర్భరంగా మారుతున్నాయి. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, ఇతర సంఘాలు- అఫ్గాన్‌లో మహిళా సిబ్బంది కొరత కారణంగా సేవా కార్యక్రమాలను నిలిపి వేశాయి. తీవ్రమైన పోషకాహార లోపం సహా అత్యవసర స్థాయి ఆహార అభద్రత, ఆకలి సమస్యల్ని ఎదుర్కొంటున్న దేశాల్లో యెమెన్‌, డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (డీఆర్‌సీ), సూడాన్‌, సోమాలియా, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌ వంటి దేశాలున్నాయి. హైతీలోనూ సమస్య తీవ్రంగానే ఉంది. ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నవారి సంఖ్య భారీగా పెరగడానికి వివిధ దేశాల్లో అంతర్గత పరిస్థితులు, వాతావరణ మార్పులు, కొవిడ్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం వంటివి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ దేశాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించే విషయంలో అంతర్జాతీయ సమాజం సైతం విఫలమైంది. మనదేశంలో ఆకలి మరణాలు లేకపోయినా పోషకాహార లోపం వేధిస్తోంది. ప్రఖ్యాత పత్రిక లాన్సెట్‌ ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం రాజస్థాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, అస్సామ్‌లలో ఆకలి మంటలు, పోషకాహార లోపం అధికంగా ఉన్నాయి. ప్రపంచ ఆకలి సూచీ-2022లో మన దేశం 107వ ర్యాంకులో నిలిచింది. అయితే, ఈ నివేదికపై అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

మరింత కృషి అవసరం

వాతావరణ మార్పులు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పంటల దిగుబడులను బలహీన పరుస్తున్నాయి. 2030 నాటికి గోధుమ, మొక్కజొన్న వంటి ఉత్పత్తులు కొంతమేర తగ్గవచ్చని అంచనా. పోషకాహార లోపం సమస్యను నిలువరించడానికి మరింత తీవ్రస్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశంలోనూ పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఇందుకోసం దశాబ్దాలుగా ప్రభుత్వాలు వ్యయం చేస్తూనే ఉన్నాయి. దేశంలో పిల్లల్లో పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిశు అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోంది. పూర్వప్రాథమిక విద్యతోపాటు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, రోగ నిరోధకత పెంపు, ఆరోగ్య పరీక్షలు తదితర సేవలు అందించడమే దీని లక్ష్యం. ఈ పథకం పది లక్షలకుపైగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఎనిమిది కోట్లమందికి పైగా సేవలు అందిస్తోంది. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందించడానికి కేంద్రం ‘పోషణ్‌ అభియాన్‌’ను ప్రారంభించింది. ఎన్ని పథకాలు, కార్యక్రమాలను చేపట్టినా, వాటిని నిర్దిష్టంగా అమలు చేయడం, లబ్ధిదారులకు సమగ్రరీతిలో ప్రయోజనాలు దక్కడమే కీలకం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతులైన పౌరులు అవసరం. ఆరోగ్యానికి పోషకాహారమే ముఖ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా మరింతగా దృష్టి సారిస్తేనే ఆరోగ్య భారతం ఆవిష్కృతమవుతుంది! 

- దేవవరపు సతీష్‌బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జన్యు మార్పిడి పంటలతో మేలెంత?

‣ జపాన్‌లో జనాభా సంక్షోభం

‣ మితిమీరిన ఎరువులతో నేల నిస్సారం

‣ అటు సవాళ్లు... ఇటు అవకాశాలు!

Posted Date: 23-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం