• facebook
  • whatsapp
  • telegram

ఈశాన్యంలో సరిహద్దుల నెగళ్లు

ఈశాన్య భారత్‌లో రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాల వేడి చల్లారడం లేదు. ఇటీవల అస్సాం-మేఘాలయ సరిహద్దుల్లో ఓ వివాదం చినికిచినికి గాలివానలా మారింది. ఫలితంగా జరిగిన హింసాత్మక ఘటనలు ప్రాణనష్టానికి దారితీశాయి. ఇరురాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలపై రెండో విడత చర్చల ప్రారంభానికి ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకరం!

దేశవ్యాప్తంగా భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. ఈశాన్యంలో మాత్రం రాష్ట్రాల విభజనకు పర్వతశ్రేణులను ఆధారంగా చేసుకొన్నట్లు విమర్శలున్నాయి. అక్కడ అస్సాం-మేఘాలయ సరిహద్దు వివాదం మొదలై అర్ధ శతాబ్దం దాటిపోయింది. 1972లో మేఘాలయను ఏర్పాటు చేశారు. దీనికి 1969 అస్సాం పునర్‌వ్యవస్థీకరణ (మేఘాలయ) చట్టం ఆధారంగా సరిహద్దులు నిర్ణయించారు. 1951లో నాటి అస్సాం ముఖ్యమంత్రి బోర్డోలోయ్‌ నేతృత్వంలోని కమిటీ సిఫార్సులను ఇందుకు ప్రామాణికంగా చేసుకోవడం వివాదాలకు బీజం వేసింది. జయంతియా హిల్స్‌ బ్లాక్‌-1, 2లను అస్సామ్‌లోని కార్బీ ఆంగ్లోంగ్‌ జిల్లాలకు, గారో హిల్స్‌ను అస్సామ్‌లోని గోల్పరా జిల్లాకు బదిలీ చేయాలని అందులో సూచించారు. వాటిని మేఘాలయ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఆ ప్రాంతాలు ఖాశీ-జయంతియా పర్వతాల పరిధిలోకి వస్తాయని వాదిస్తోంది. ఆ రాష్ట్రం వద్ద దాన్ని నిరూపించే పత్రాలు లేవని అస్సాం చెబుతోంది. మైదాన ప్రాంతంలో ఉండిపోయిన ఖాశీ, గారో తెగల్లో చాలామంది భౌగోళికంగా అస్సామ్‌లో నివసిస్తున్నా, వారి పేర్లు మేఘాలయలోని ఓటర్ల జాబితాలో ఉన్నాయి. పశ్చిమ గారో హిల్స్‌లోని లాంగ్‌పిహ్‌ అత్యంత వివాదాస్పద ప్రదేశంగా పేరొం దింది. ఇది అస్సామ్‌లోని కామరూప్‌ జిల్లా సరిహద్దుల్లో ఉంటుంది. తరచూ లాంగ్‌పిహ్‌లోని ఉమ్వాలిలో అస్సాం పోలీస్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం మేఘాలయకు ఇబ్బందికరంగా మారింది. స్థానిక ఖాశీ తెగ ప్రజలు వీటికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు.

ఎడతెగని యత్నాలు...

అస్సాం, మేఘాలయ సరిహద్దు వివాదం పరిష్కారానికి 1983లో సంయుక్త అధికారుల సంఘాన్ని నియమించారు. భారత సర్వే సంస్థ ఇరు రాష్ట్రాల సరిహద్దులను మరోసారి నిర్ధారించుకోవాలని ఆ సంఘం సూచించింది. ఆచరణలో అది అమలు కాలేదు. 1985లో జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ నేతృత్వంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదికను మేఘాలయ ఆమోదించలేదు. 1991లో భారత సర్వే సంస్థ నేతృత్వంలో సరిహద్దులను నిర్ధారించడాన్ని సైతం ఆ రాష్ట్రం తప్పుపట్టింది. కేంద్రం జోక్యం చేసుకొని సరిహద్దు వివాదం పరిష్కారానికి నోడల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలంటూ మేఘాలయ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో కేంద్రం ఈ వివాదాలపై చర్చించేందుకు అస్సాం-మేఘాలయతో నోడల్‌ అధికారులను నియమింపజేసింది. అదీ పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో ఆ వివాదాన్ని పరిష్కరించేలా కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేయాలంటూ మేఘాలయ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. గతేడాది ఇరు రాష్ట్రాలు జరిపిన పలు విడతల చర్చలు ఫలితాన్నిచ్చాయి. మొత్తం 12 వివాదాస్పద ప్రదేశాల్లో ఆరుచోట్ల తేలిగ్గా పరిష్కారం లభిస్తుందని గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముసాయిదా తీర్మానంపై సంతకాలు చేశారు. మార్చిలో ఆరు వివాదాస్పద ప్రాంతాల్లో పరిష్కారానికి అంగీకరిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా ఓ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే, ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో జరిగిన ఈ ఒప్పందంలో స్థానికుల అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదనే విమర్శలున్నాయి.

జాతీయ భద్రతకు కీలకం

తొలి విడత ఒప్పందం కోసం అయిదు సూత్రాలను పాటించారు. వీటిల్లో చారిత్రక వాస్తవాలు, జాతులు, పరిపాలన సౌలభ్యం, నదులు, పర్వతాల వంటి సహజ సరిహద్దులను పరిగణనలోకి తీసుకొన్నారు. లాంగ్‌పిహ్‌ వంటి జటిలమైన వివాదాలు ఉన్నచోట్ల మరింత కలుపుగోలు శైలిలో ఇరుపక్షాలు వ్యవహరించాల్సి ఉంటుంది. మార్చిలో జరిగిన ఒప్పందంపై మేఘాలయలోని పలు స్థానిక జాతులు అసంతృప్తితో ఉన్నాయి. కొన్ని సంస్థలు హోంశాఖకు లేఖలు రాశాయి. తాము అల్పసంఖ్యాకులుగా మిగిలిపోయే రాష్ట్రాల్లో ఉండటానికి ఇక్కడి తెగలు ఇష్టపడటం లేదన్న విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ఎటువంటి పునరావాస ప్యాకేజీలను అమలు చేయకుండా ఒప్పందాలకు వెళితే బెడిసికొట్టే ప్రమాదం ఉంది. రెండో విడత చర్చల నేపథ్యంలో ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. నిరుడు మిజోరంతో జరిగిన ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని చూస్తే దీర్ఘకాలం సరిహద్దు వివాదాలు కొనసాగించడం అస్సాం భద్రతకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అస్సామ్‌కు మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌తో వివాదాలున్నాయి. వాస్తవాధీన రేఖకు సమీపంలోని రాష్ట్రాల మధ్య వివాదాలను విదేశీ శక్తులు వాడుకోకముందే పరిష్కరించుకోవడం జాతీయ భద్రత దృష్ట్యా చాలా అవసరం.

- పి.ఫణికిరణ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వర్ధమాన వాణి... విశ్వశ్రేయ శ్రేణి!

‣ ఉద్గారాల పేరిట సేద్యంపై దాడి!

‣ సమాచార బిల్లు సమగ్రమేనా?

‣ ఇస్రో గఘన యాత్ర

‣ రాజకీయ చట్రంలో రాజ్యాంగ సంస్థలు

Posted Date: 03-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం