• facebook
  • whatsapp
  • telegram

స్వావలంబనే పటుతర రక్షణ

సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌ల నుంచి నిత్యం భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న భారత్‌- తన రక్షణకు కావాల్సిన ఆయుధాలను స్వయంగా తయారు చేసుకోక తప్పదు. ఈ క్రమంలో రక్షణ పరంగా ఇండియా స్వావలంబన పథంలో వడిగా ముందుకు సాగుతోంది.

చారిత్రకంగా చూస్తే భారత్‌ ఎన్నడూ ఆయుధోత్పత్తికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. క్రీ.శ.1200-1458 మధ్య బహమనీ సుల్తానులు సముద్ర మార్గం ద్వారా వస్త్రాలు, మసాలా దినుసులను ఎగుమతి చేసి ఫిరంగులు, తుపాకులను దిగుమతి చేసుకునేవారు. 1500 సంవత్సరం నుంచి కొన్నేళ్లపాటు పోర్చుగీసువారి ద్వారా దేశంలోకి ఆయుధాలు సరఫరా అయ్యేవి. మొగలుల కాలంలో శతఘ్నుల వినియోగం పెరిగింది. 17వ శతాబ్దంలో మరాఠా పీష్వాలు ఫిరంగుల తయారీకి కార్ఖానా, ఫిరంగి గుళ్ల కర్మాగారాలను నెలకొల్పారు. వారు తయారు చేసిన ఫిరంగులు అంత సమర్థమైనవి కాకపోవడంతో ఐరోపావారి సహకారం తీసుకోవాల్సి వచ్చింది. టిప్పు సుల్తాన్‌ పాలనలో మాత్రం ఫ్రెంచివారి సహాయంతో మెరుగైన ఫిరంగులు, తుపాకులు తయారయ్యేవి. బ్రిటిష్‌ వలస పాలకులు దేశంలో ఆరు ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలను స్థాపించినా, వాటిలో భారతీయులకు అవకాశం కల్పించలేదు.

ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యం

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1960ల నాటికి ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల సంఖ్య 12కి పెరిగింది. వాటిలో పిస్తోళ్లు వంటివి తయారయ్యేవి. 1960-80ల మధ్యకాలంలో ఆయుధోత్పత్తి నెమ్మదిగానే అయినా కొంతవరకూ పెరిగింది. సోవియట్‌ యూనియన్‌, బ్రిటిష్‌ వారి సహకారంతో కొన్ని ఆయుధాల కూర్పును దేశీయంగా చేపట్టారు. 1983లో అయిదు క్షిపణి వ్యవస్థల తయారీకి భారత ప్రభుత్వం సమగ్ర క్షిపణి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి రక్షణ రంగంలో స్వావలంబన కృషి కొత్త మలుపు తిరిగింది. ఆ కార్యక్రమం బ్రహ్మోస్‌, అగ్ని-5 వంటి అధునాతన క్షిపణులను అందించింది. 1992లో ఏపీజే అబ్దుల్‌ కలాం కమిటీ రక్షణ పరంగా స్వావలంబన ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పింది. 2000-2014 మధ్య కాలంలో స్వావలంబన దిశగా ప్రభుత్వం బుడిబుడి అడుగులు వేసింది. పాకిస్థాన్‌ నుంచి ఆగని ఉగ్రవాదుల చొరబాట్లు, చైనాతో సరిహద్దు ఘర్షణలు, కొవిడ్‌ కాలంలో సరఫరా గొలుసుల విచ్ఛిన్నం వల్ల రక్షణ ఆధునికీకరణ, స్వయంసమృద్ధి ఎంత ఆవశ్యకమో తెలిసివచ్చింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల క్రెమ్లిన్‌, చైనాలు బాగా దగ్గరవుతున్నాయి. రేపు చైనాతో ఘర్షణ ముదిరితే భారత్‌కు రష్యా నుంచి పూర్తి స్థాయి మద్దతు అందుతుందా అనేది సందేహాస్పదమైంది. పైగా ఇండియా ఇప్పటికీ ఆయుధ దిగుమతిదారుల జాబితాలో అగ్ర భాగాన ఉంది. అంటే, తన రక్షణ కోసం విదేశాలపై ఆధారపడక తప్పడం లేదు. బడ్జెట్‌లో 13.31శాతాన్ని (రూ.5.25 లక్షల కోట్లను) భద్రత కోసం ఖర్చు చేస్తున్న భారత్‌- రక్షణోత్పత్తుల పరిశ్రమపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇందులో భాగంగా   ప్రైవేటు భాగస్వామ్యానికీ చోటు కల్పించారు. ఈ క్రమంలో 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.87,000 కోట్ల విలువైన ఆయుధాలను, సంబంధిత సామగ్రిని అందించిన భారతీయ రక్షణోత్పత్తుల పరిశ్రమ, 2022లో తన ఉత్పత్తిని రూ.94,600 కోట్లకు పెంచుకొంది

రక్షణ పరికరాల విషయంలో పారిశ్రామిక లైసెన్సింగ్‌ విధానాన్ని సైతం ప్రభుత్వం సరళీకరించింది. స్వదేశంలో తయారీకి అవకాశమున్న ఆయుధాల జాబితాను ప్రకటించి, వాటి దిగుమతులపై ఆంక్షలు విధిస్తోంది. సాంకేతిక పరిజ్ఞాన బదిలీని, పెట్టుబడులను ప్రోత్సహించడానికి రక్షణోత్పత్తుల ఆఫ్‌సెట్‌ విధానాన్ని సవరించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగాన్నీ రక్షణోత్పత్తుల పరిశ్రమలో భాగస్వామిని చేయడానికి ప్రభుత్వం శ్రీజన్‌ పోర్టల్‌ను సృష్టించింది. తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌లలో రక్షణ పరిశ్రమల కారిడార్లను నెలకొల్పింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ కారిడార్‌ నోడల్‌ సంస్థ 2022 జులైలో ప్రైవేటు పరిశ్రమల నుంచి రూ.10,500 కోట్ల పెట్టుబడులను తీసుకురాగల 69 ఎంఓయూలను కుదుర్చుకుంది.

2022-23 కేంద్ర బడ్జెట్‌ రక్షణ పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)లో ప్రైవేటు పరిశ్రమలకు, అంకుర సంస్థలకు మరింత ఎక్కువ భాగస్వామ్యం కల్పించింది. 16 డీఆర్‌డీఓ ప్రయోగశాలల నుంచి 21 సాంకేతికతలను ప్రైవేటు పరిశ్రమలకు బదిలీ చేస్తున్నారు. టాటా మోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌ సంస్థలు ప్రత్యేక హెచ్‌ఎంవీ (హై మొబిలిటీ వెహికల్స్‌) ట్రక్కులను రక్షణ శాఖకు సరఫరా చేస్తున్నాయి. ఎల్‌అండ్‌టీ, మహింద్రా సంస్థలు సైతం ట్రక్కులు, ప్రత్యేక వాహనాలు, శతఘ్నుల సరఫరాకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో 2021 నుంచి ప్రైవేటు విభాగంలో తొలిసారిగా ఏర్పాటైన ఏరోలాయ్‌ టెక్నాలజీస్‌ సంస్థ విమానాలు, హెలికాప్టర్‌ విడిభాగాలను తయారు చేస్తోంది. డ్రోన్లు, జలాంతర్గాములు, తేలికైన శతఘ్నులు, అంతరిక్ష వాహనాల విడిభాగాలూ అక్కడ ఉత్పత్తి అవుతాయి. భారత్‌, ఇజ్రాయెల్‌ రక్షణ సంస్థలు కలిసి పరిశోధన-అభివృద్ధి చేపట్టడానికి ఒప్పందం కుదుర్చుకొన్నాయి. రక్షణ రంగంలో సహ ఉత్పత్తి, వాణిజ్య వృద్ధికి భారత్‌, అమెరికాలు సైతం సమావేశాలు జరుపుతున్నాయి. 2021-26 కాలంలో రక్షణ రంగంలో నవీకరణ సాధనకు ఐడెక్స్‌ సంస్థకు కేంద్రం రూ.498 కోట్లు కేటాయించింది. భారతీయ అంతరిక్ష రక్షణ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు అక్టోబరులో ప్రారంభించారు. అందులో అంకుర సంస్థలు, ప్రైవేటు పరిశ్రమలు పాలుపంచుకొంటాయి.

సవాళ్లను అధిగమిస్తూ...

ఆయుధాలు, ఇతర రక్షణ సామగ్రిని స్వదేశంలోనే తయారుచేయడం వల్ల ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి. కొత్త సాంకేతికతలు వృద్ధి చెందుతాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో సాహసంగా ముందడుగు వేస్తోంది. ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెద్దయెత్తున ప్రోత్సహిస్తోంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తితో రక్షణ శాఖ పలు దిగుమతి కాంట్రాక్టులను రద్దుచేయడం హర్షణీయ పరిణామం. అయితే, రక్షణ ఉత్పత్తుల పరంగా మనం నిర్దేశించుకున్న లక్ష్యాలలో కొన్నింటిని సకాలంలో చేరుకోవడంలో వెనకబడ్డామన్నది కాదనలేని సత్యం. ఈ విషయంలో ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. పారదర్శకత, విశ్వాసాలను పాదుగొల్పాలి. మన ఎగుమతుల నాణ్యతను పెంచడానికి గట్టి కృషి జరగాలి. భారత సాయుధ బలగాలకు అత్యాధునిక ఆయుధాలు, నిఘా వ్యవస్థలను సమకూర్చి ప్రపంచంలో మేటి సైన్యంగా తీర్చిదిద్దాలి. ఆత్మ నిర్భరత విషయంలో స్వల్పకాలికంగా, మధ్యకాలికంగా ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తూనే విధానాలను నిరంతరం సమీక్షించుకుంటూ దీర్ఘకాలంలో స్వావలంబన సాధనకు అంకితం కావాలి.

పరస్పర సహకారం

రక్షణోత్పత్తుల రంగంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం జోరుగా ముందుకు సాగుతోంది. స్వదేశీ పరిశ్రమల నుంచి రూ.76,390 కోట్ల విలువైన రక్షణ సామగ్రిని కొనుగోలు చేయడానికి రక్షణ శాఖ నిరుడు జూన్‌లో పచ్చజెండా ఊపింది. సుఖోయ్‌ 30 ఎంకేఐ యుద్ధ విమానాల కోసం ప్రత్యేక ఇన్‌ఫ్రారెడ్‌ సెర్చ్‌ అండ్‌ ట్రాక్‌ సిస్టమ్‌ (ఐఆర్‌ఎస్‌టీ)ని సంయుక్తంగా రూపొందించి ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌), భారత్‌ ఎలెక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) ఒప్పందం కుదుర్చుకొన్నాయి. రక్షణోత్పత్తుల రంగంలో సహకరించుకోవాలని భారత్‌, జపాన్‌లు నిశ్చయించాయి. 150 సైనిక డార్నియర్‌ 228 విమానాలను పలువురు కొనుగోలుదారులకు హెచ్‌ఏఎల్‌ అందజేసింది. రెండు పౌర డార్నియర్‌ 228 విమానాలనూ రూపొందించింది.

ఎగుమతుల్లో వృద్ధి

దేశీయంగా వైమానిక, అంతరిక్ష, నౌకానిర్మాణ పరిశ్రమలు 2020-21లో రూ.85,000 కోట్ల విలువైన ఉత్పత్తులను అందించాయి. అందులో ప్రభుత్వ రంగ సంస్థల వాటా రూ.68,000 కోట్లు. 2019 నాటికి 30 దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసిన భారత్‌- రక్షణ ఎగుమతుల్లో 19వ స్థానంలో నిలిచింది. 2025కల్లా రూ.35,000 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర రక్షణ సామగ్రిని విదేశాలకు ఎగుమతి చేయాలని భారత్‌ లక్షిస్తోంది. ఆత్మనిర్భర్‌ భారత్‌, మేకిన్‌ ఇండియా కార్యక్రమాలతో భారత్‌ స్వావలంబన దిశగా వడిగా అడుగులు వేస్తోంది. ప్రైవేటు రంగంతోపాటు అంకుర పరిశ్రమలను, విద్యావేత్తలను ఈ కృషిలో భాగస్వాముల్ని చేస్తోంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైవేటు పరిశ్రమలకు బదిలీ చేసి ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. 2020లో ప్రకటించిన రక్షణ సామగ్రి సేకరణ కార్యక్రమం (డీఏపీ) స్వదేశీ పరిశ్రమల నుంచే ఆయుధ తయారీకి కావాల్సిన మూల యంత్రాలను సేకరించాలని తలపెట్టింది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ లాభసాటి పద్ధతులతో పండుగలా సేద్యం

‣ మౌలిక వసతులే భవితకు బాటలు

‣ నదుల్ని కాటేస్తున్న వ్యర్థాలు

‣ మానవ తప్పిదం... ప్రకృతి ఆగ్రహం!

‣ ఎగుమతులు పెరిగితేనే ఆర్థిక ప్రగతి

‣ తుర్కియే జిత్తులకు పైయెత్తు!

Posted Date: 18-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం