• facebook
  • whatsapp
  • telegram

రహదారి భద్రత మరీచికేనా?

జీవితం క్షణభంగురమన్న భారతీయ తత్వ చింతన అక్షర సత్యమని దేశీయ రహదారులు నిర్దాక్షిణ్యంగా రుజువు చేస్తున్నాయి. భాగ్యనగరిలో జన, వాహన సంచారం నామమాత్రమైన నిశిరాత్రి వేళ ఎర్రలైటును పట్టించుకోకుండా దూకుడుగా దూసుకుపోయిన అయిదుగురు యువకుల విషాదాంతం గుండెల్ని మెలిపెడుతోంది. పట్టుమని అయిదు క్షణాలు ఆగితే అయిదు ప్రాణాలు నిలిచేవన్న కథనాలు- నిర్లక్ష్యపూరిత వేగం ఎంతగా ప్రాణాంతకమవుతున్నదో చాటి చెబుతున్నాయి. కొవిడ్‌ నియంత్రణలు సాగినన్నాళ్లూ బాగా దిగివచ్చిన రహదారి ప్రమాదాలు, సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో అసాధారణంగా పెరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సగటున రోజుకు 60దాకా రోడ్డు ప్రమాదాలు, ప్రతి గంటంపావుకో మరణం సంభవిస్తుండగా- ఏపీలో రోజుకు 57 ప్రమాదాలు, దాదాపు 22 మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం నిర్లక్ష్యాలే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్పష్టీకరిస్తున్న జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక- నిరుడు తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్‌లో పదిశాతం వంతున ప్రమాదాలు తగ్గాయని వెల్లడించింది. 2019లో తెలంగాణ వ్యాప్తంగా 6,964 మంది, ఏపీలో 7,984 మందిని బలిగొన్న     రహదారి ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా లక్షా 51 వేల మందికిపైగా అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా వాహనరాశిలో ఒక్కశాతం కూడా లేని ఇండియా రహదార్లపై నెత్తురు చిందించడంలో ప్రథమ స్థానంలో నిలవడం సిగ్గుచేటు! ఎకాయెకి 22 లక్షల పైచిలుకు యాక్సిడెంట్లతో తొలిస్థానంలో నిలిచిన అమెరికాలో మృతుల సంఖ్య 37,461కి పరిమితం కావడం నుంచి, రహదారి భద్రతపై దీక్ష పూని ప్రమాదాల సంఖ్యను రెండు లక్షల 13 వేలకు, మృతుల్ని 63 వేలకు పరిమితం చేయగలిగిన జన చైనా నుంచి ఇండియా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పట్టుమని అయిదు శాతమైనా లేని జాతీయ, రాష్ట్ర రహదారులపైనే 61 శాతం మరణాలు నమోదవుతున్నాయి. 18-45 ఏళ్ల వయస్కులే రహదారి ప్రమాద మృతుల్లో 70 శాతంగా ఉండటం- అవి సృష్టిస్తున్న సామాజిక ఆర్థిక మహా సంక్షోభానికి నిలువుటద్దం!

సగటున రోజూ 29 మంది అభం శుభం తెలియని పిల్లలు రహదారుల రక్తదాహానికి బలైపోతున్న దేశం మనది. గుండెలు పిండే ఈ విషాదం నుంచి జాతిని విముక్తం చేసేలా 2020 నాటికి రహదారి ప్రమాద మృతుల సంఖ్యను సగానికి తగ్గిస్తామంటూ 2015లో బ్రసీలియా ప్రకటనకు భారత్‌ ఓటేసినా, ఎక్కడి గొంగడి అక్కడే ఉంది. ప్రపంచవ్యాప్త రహదారి ప్రమాద మృతుల సంఖ్యలో ఇండియా వాటా 11 శాతంగా ఉందని, పర్యవసానంగా దేశం ఏటా స్థూల దేశీయోత్పత్తిలో 3.4 శాతం (దాదాపు ఏడు లక్షల కోట్లు) నష్టపోతోందని కేంద్రమంత్రి గడ్కరీయే విశ్లేషిస్తున్నారు. మలుపులున్న రహదారులపై నిరుటి ప్రమాదాల్లో 20,141 మంది మరణించగా, నేరుగా సాగిపోయే రోడ్ల మీదే 96,624 మంది మృత్యువాత పడటం- అతివేగం, నిర్లక్ష్యపూరితంగా వాహనం నడపడం పెచ్చుమీరిన వాస్తవాన్ని ధ్రువీకరిస్తున్నాయి. నిరుడు తెచ్చిన మోటారు వాహన సవరణ చట్టాన్ని పిల్లల భద్రతానిబంధనలతో సహా సంపూర్ణంగా అమలు చేయాలని సేవ్‌లైఫ్‌ ఫౌండేషన్‌ సంస్థ గట్టిగా కోరుతోంది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థాయుల్లో ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఐటీఎస్‌) అమలుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య నమూనాను ప్రతిపాదిస్తున్న కేంద్రం- మరో అయిదేళ్లలో రహదారి రక్తదాహాన్ని సగానికి తగ్గించాలని లక్షిస్తోంది. పదేళ్లలో ఏకంగా 13 లక్షల మందిని బలిగొని, అరకోటి మందిని మంచానికి పరిమితం చేసిన రహదారుల నరమేధం- ఎన్నో కరోనాల పెట్టుగా కళ్లకు కడుతోంది. సాంకేతికత (ఇంజినీరింగ్‌), అవగాహన (ఎడ్యుకేషన్‌), చట్టాల అమలు (ఎన్‌ఫోర్స్‌మెంట్‌), అత్యవసర సంరక్షణ (ఎమర్జెన్సీ కేర్‌)లను కట్టుదిట్టంగా పట్టాలకెక్కిస్తే ప్రమాదాల నియంత్రణ అసాధ్యమేమీ కాదని నిపుణులు మొత్తుకొంటున్నారు. నిర్లక్ష్య పూరితంగా వాహనం నడిపి ప్రాణాలు బలిగొనే వారిపై హత్యానేరం కేసులు పెట్టి కఠిన దండనలు విధించినప్పుడుగాని రహదారి భద్రత గాడిన పడదు!

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం