• facebook
  • whatsapp
  • telegram

జనారోగ్యంతోనే ‘ఆత్మనిర్భర్‌’

ఇండియా సహా ప్రపంచ దేశాలన్నింటికీ ఈ ఏడాది కొవిడ్‌ నామ సంవత్సరమైంది. పటిష్ఠ ఆరోగ్య వ్యవస్థలకు పేరెన్నికగన్న దేశాలూ కరోనా మహమ్మారి ధాటికి దిమ్మ తిరిగి పోగా, జనారోగ్య రంగాన- 195 దేశాల్లో 145వ స్థానంలో నిలిచిన ఇండియా గురించి చెప్పేదేముంది? స్థూల దేశీయోత్పత్తిలో 1.3 శాతం లోపే ఉన్న సర్కారీ కేటాయింపులతో ఈసురోమంటున్న వైద్య ఆరోగ్య రంగం- కొవిడ్‌లాంటి ప్రాణాంతక మహమ్మారుల తాకిడిని ఏమాత్రం తట్టుకొనే పరిస్థితి లేనేలేదని రుజువైంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే కోటి మందికిపైగా జనావళికి సోకి లక్షా 45 వేల మందిని బలిగొన్న కొవిడ్‌ ఉద్ధృతి కొంత ఉపశమించడం ఊరటనిచ్చేదే అయినా, బ్రిటన్‌లో కొత్తగా కోరసాచిన కరోనా ఉత్పరివర్తన వైరస్‌ మళ్ళీ భయాందోళనలు పెంచుతున్న వేళ ఇది. తలకు మించిన వైద్య ఖర్చుల్ని భరించలేక అప్పుల పాలై ఏటా ఆరు కోట్ల మంది దారిద్య్ర రేఖ దిగువకు జారిపోతున్న దేశం మనది. కొవిడ్‌ కారణంగా ఉపాధి మార్గాలు మూసుకుపోయి అల్లాడుతున్న సామాన్య జనంపై కొవిడ్, గాయంపై గునపంపోటులా మారింది. చికిత్సా వ్యయం భరించదగిన స్థాయిలో ఉండటం కూడా ఆరోగ్య హక్కులో అంతర్భాగమేనని, సగటు పౌరులకు కొవిడ్‌ రక్షణ అందని ద్రాక్షలా మారిందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మధ్యే ఆవేదన చెందింది. ఈ నేపథ్యంలోనే- సమగ్ర ప్రజారోగ్య చట్టాన్ని రూపొందించాలన్న పార్లమెంటరీ స్థాయీసంఘం, కొవిడ్‌ లాంటివి విరుచుకు పడ్డప్పుడు ప్రైవేటు ఆసుపత్రులపై తగు నియంత్రణలు, ఔషధాలు నల్లబజారుకు తరలిపోవడాన్ని నిలువరించే ఏర్పాట్లు ఉండాలంటోంది. జాతీయ విపత్తుల నిభాయక ప్రాధికార సంస్థలో కొవిడ్‌ లాంటి ఉత్పాతాల్ని ఎదుర్కొనే ప్రత్యేక వ్యవస్థ కొలువు తీరాలని, బీమా సదుపాయం ఉన్న వారందరికీ నగదు రహిత వైద్యం అందేలా చూడాలని సూచించింది. ఇలాంటి పైపై పూతలు కాదు- అట్టడుగు స్థాయి నుంచి ప్రజారోగ్య వ్యవస్థల్ని పటిష్ఠంగా నిర్మించే చొరవే కావాలిప్పుడు! 

కొవిడ్‌ సోకినవారు బతికి బయటపడినా ఆర్థికంగా చితికి పోతున్నారన్న సుప్రీం ధర్మాసనం- సరసమైన ధరల్లో చికిత్సలకు సర్కారీ ఆసుపత్రుల్ని సిద్ధం చేయడమో లేదా ప్రైవేటు ఆసుపత్రుల రుసుములను నియంత్రించడమో జరగాలని ఇటీవలే ఆదేశించింది. ప్రజారోగ్యం మెరుగుదల ప్రభుత్వాల ప్రాథమిక విధుల్లో ఒకటని ఆదేశిక సూత్రాలు చాటుతున్నాయి. ఏడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఆ మౌలిక బాధ్యతను విస్మరించబట్టే- ఆరు లక్షల మంది వైద్యులు, 20 లక్షల మంది నర్సుల కొరత జతపడి, స్వస్థ సేవల్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య అసమానతల అగాధం అంతకంతకూ పెరిగిపోయింది. ఈ దురవస్థకు విరుగుడుగా 2024 నాటికల్లా దేశ స్థూల దేశీయోత్పత్తిలో 2.5 శాతాన్ని వైద్య ఆరోగ్య రంగానికి కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. కొవిడ్‌లాంటి మహోత్పాతాల ఉరవడిపై శాస్త్రవేత్తలు విస్పష్ట హెచ్చరికలు చేస్తున్న తరుణంలో, బ్రిటిష్‌ కాలంనాటి మహమ్మారుల చట్టాన్ని సాంతం సంస్కరించడంతోపాటు, జనారోగ్యానికి నేరుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే పూచీ పడేలా పటుతర వ్యవస్థల నిర్మాణం సాగాలి. బ్రిటన్‌లోని జాతీయ ఆరోగ్య సేవ (ఎన్‌హెచ్‌ఎస్‌)- పౌరులందరికీ వర్తిస్తూ ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళ్లడం మొదలు అక్కడ క్లిష్టమైన శస్త్రచికిత్సలు, రేడియేషన్, కీమోథెరపీ సహా అనారోగ్యం నయమై తిరిగి వచ్చేదాకా అన్ని సేవలూ ఉచితంగానే అందిస్తోంది. కొంతమంది అదనంగా ఆరోగ్య బీమా తీసుకొని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే సదుపాయమూ ఉంది. ఈ తరహా సార్వత్రిక ఆరోగ్య సేవలు, బీమా సదుపాయాల్ని ప్రభుత్వాలు కల్పించి- తక్షణ, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలతో వైద్య ఆరోగ్య రంగాన్ని అన్ని విధాలుగా పరిపుష్టం చేస్తేనే- ఆత్మనిర్భర్‌ భారత్‌ సాక్షాత్కరించగలిగేది!  

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం