• facebook
  • whatsapp
  • telegram

అయిదేళ్ల అజెండాతో ముందడుగు

ఎలెక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై ప్రభుత్వ ప్రణాళిక 

రాబోయే అయిదేళ్లలో దేశంలో 100 కోట్ల సెల్‌ఫోన్లు, అయిదు కోట్ల ల్యాప్‌టాప్‌లు, మరో అయిదు కోట్ల టీవీలు ఉత్పత్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఎలెక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, సమాచార ప్రసార శాఖల మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఇటీవల సీఐఐ సమావేశంలో ప్రకటించారు. ఎలెక్ట్రానిక్‌ ఉత్పత్తులు ప్రత్యేకించి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, అంతర్జాల ఆధారిత ఉపకరణాల తయారీలో పురోగతిపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని తెలుస్తోంది. అత్యంత కీలకమైన సెమీకండక్టర్ల నుంచి స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో వినియోగించే డిస్‌ప్లేలు, చిప్‌సెట్లు, ప్రాసెసర్ల వరకు ఎన్నో ఉత్పత్తుల కోసం ఎక్కువగా మనం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఇప్పటి వరకు మన దేశంలో ఎలెక్ట్రానిక్స్‌ తయారీ అంటే విదేశాల నుంచి విడిభాగాలు తీసుకొచ్చి ఇక్కడ ఒక్కచోటుకు చేర్చి బిగించడమే అనే పరిస్థితి ఉంది. దీన్ని అధిగమించి ‘ఎలెక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌ డిజైన్, మాన్యుఫాక్చరింగ్‌ (ఈఎస్‌డీఎమ్‌)’లో దేశాన్ని ప్రపంచస్థాయి ఉత్పత్తి కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 2019లో జాతీయ ఎలెక్ట్రానిక్స్‌ విధానాన్ని (ఎన్‌పీఈ) తీసుకొచ్చింది. ఈ రంగంలో అవసరమైన అన్ని ఉత్పత్తులనూ ఇక్కడే తయారుచేసి, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయాలనేది దీని ముఖ్యోద్దేశం. 2025 నాటికి దేశంలో ఈ తరహా ఉత్పత్తుల తయారీ, ఎగుమతుల ద్వారా రూ.26 లక్షల కోట్ల టర్నోవర్‌ సాధించాలని ఎన్‌పీఈలో లక్ష్యంగా నిర్ణయించారు. 2025 నాటికి దాదాపు రూ.13 లక్షల కోట్ల విలువైన 100 కోట్ల ఫోన్లను దేశీయ అవసరాల కోసం తయారు చేయాలని, ఏడు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే మరో 60 కోట్ల స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఎలెక్ట్రానిక్స్‌ తయారీ రంగం దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానానిదే కాబట్టి ఈ రంగంలో భారీ స్థాయిలో పరిశ్రమల ఏర్పాటు, ఇప్పటికే ఉన్నవాటిని విస్తరించడం, చిన్న చిన్న ఉత్పత్తి సంస్థలతో కలిసి సమూహాలు ఏర్పాటు చేయడం, ఉత్పత్తికి తగ్గట్లు సరఫరా వ్యవస్థను పటిష్ఠపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు ప్రణాళికలు రూపొందించింది. 

భారీ ప్రోత్సాహకాలు
సాంకేతిక ఉపకరణాల తయారీ రంగంలో దేశంలో పెట్టుబడులు పెట్టేలా జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించేందుకు ప్రభుత్వం- ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్‌ఐ)లో ఏకంగా రూ.40,951 కోట్లతో ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ పథకం కింద 15 వేల రూపాయల కంటే ఎక్కువ విలువైన స్మార్ట్‌ఫోన్లు తయారు చేసే సంస్థలకు ఒక్కోదానికి గరిష్ఠంగా నాలుగేళ్లలో వెయ్యి కోట్ల రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తామని ప్రకటించింది. దేశీయ కంపెనీలకు ఒక్కోదానికి నాలుగేళ్లలో రూ.200 కోట్లు ఇవ్వనుంది. ట్రాన్సిస్టర్లు, కెపాసిటర్లు, సర్క్యూట్‌ బోర్డులు వంటి నిర్దేశిత ఎలెక్ట్రానిక్‌ విడిభాగాల తయారీ పరిశ్రమలకు ఒక్కోదానికి నాలుగేళ్లలో రూ.100 కోట్లు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించింది. 

ఎలెక్ట్రానిక్‌ విడిభాగాలు, సెమీ కండక్టర్ల తయారీ ప్రోత్సాహక పథకం (స్పెక్స్‌) కింద రానున్న ఎనిమిదేళ్లలో రూ.3,285 కోట్లు ప్రోత్సాహకాలుగా అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ఒప్పందం నాటి నుంచి అయిదేళ్లలో పరిశ్రమను నెలకొల్పినవారికి పరిశ్రమ ఏర్పాటు, యంత్ర సామగ్రి కొనుగోలు, సాంకేతిక వసతుల కల్పన, ఉత్పత్తి పరిశోధన- అభివృద్ధిలో వెచ్చించే ఖర్చులో 25 శాతం వరకు తిరిగి చెల్లించనున్నారు. ఎలెక్ట్రానిక్స్‌ ఉత్పత్తి సమూహాల పథకం (రెండోదశ) కింద- వీటి తయారీ రంగానికి అవసరమైన మౌలిక అవసరాలు తీర్చే పరిశ్రమలకు ఎనిమిదేళ్లలో రూ.3,762 కోట్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఎలెక్ట్రానిక్స్‌ తయారీ రంగం ప్రస్తుతం 20 లక్షల మందికి ఉపాధి చూపుతోంది. పీఎల్‌ఐ కింద పెట్టుబడులు పెట్టే పరిశ్రమల ద్వారా 2024 కల్లా మూడు లక్షల మందికి ప్రత్యక్షంగా, తొమ్మిది లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెబుతున్నారు. 

పరిశ్రమ ఏమంటోంది? 
ప్రభుత్వ ప్రయత్నాలను పరిశ్రమ వర్గాలు స్వాగతిస్తున్నాయి. అయితే ఎలెక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో చైనా, తైవాన్, జపాన్‌ తదితర దేశాలతో పోలిస్తే మనం బాగా వెనకబడి ఉన్నామని, ఇలాంటి పరిస్థితుల్లో నాలుగైదేళ్ల ప్రోత్సాహకాలతో లక్ష్యాన్ని చేరలేమని అవి అంటున్నాయి. ముఖ్యంగా రక్షణ, ఐటీ వంటి కీలక రంగాల్లో ముఖ్యపాత్ర పోషించే సెమీ కండక్టర్లను పూర్తిస్థాయిలో మన వద్దే తయారు చేసేందుకు చాలా కసరత్తు అవసరమని భారత ఎలెక్ట్రానిక్స్, సెమీకండక్టర్‌ సంఘం అధ్యక్షులు సత్యగుప్తా చెబుతున్నారు. సెమీకండక్టర్‌ తయారీ పరిశ్రమ లాభనష్టాలు లేని స్థితికి చేరాలన్నా కనీసం పదేళ్లు పడుతుందంటున్నారు. దీనికి సరిపడా ఆర్థిక వనరులు మన కంపెనీల వద్ద లేకపోవడం వల్లే ఇప్పటికీ సెమీ కండక్టర్ల తయారీలో కీలక భాగాలన్నింటినీ దిగుమతి చేసుకుంటున్నామనేది కాదనలేని సత్యం. ‘రానున్న పదిహేనేళ్లపాటు ఈ రంగంపై రూ.2.20 లక్షల కోట్లు వెచ్చించగలగాలి. అప్పుడే మనం సెమీకండక్టర్లు, ఎలెక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో స్వయం సమృద్ధ దేశంగా ఎదుగుతాం’ అనేది సత్యగుప్తా అభిప్రాయం. ఇస్రో, డీఆర్‌డీఓలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో వెన్నుదన్నుగా నిలవడం వల్లే అవి ప్రస్తుతం ప్రపంచస్థాయిలో అద్భుతాలు సృష్టించగలుగుతున్నాయన్న సంగతిని గుర్తించాలి. 

ముందుకొస్తున్న కంపెనీలు
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలూ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన స్థలం కేటాయించడం, నీరు, విద్యుత్తును రాయితీ ధరలకు అందించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. ఉదాహరణకు శాంసంగ్‌ చైనాలోని తన మొబైల్‌ డిస్‌ప్లే తయారీ కర్మాగారాన్ని మూసివేసి ఉత్తర్‌ ప్రదేశ్‌కు తరలించేందుకు సిద్ధమైంది. రూ.4,825 కోట్లతో నెలకొల్పనున్న ఈ కర్మాగారానికి యూపీ ప్రభుత్వం స్టాంప్‌ డ్యూటీ మినహాయింపునిచ్చింది. విద్యుత్తును రాయితీ ధరకు ఇవ్వనుంది. టెలికం, సాంకేతిక ఉత్పత్తుల తయారీ రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించిన తొలి మూడు నెలల్లోనే 22 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో ఐఫోన్లు తయారుచేసే ఫాక్స్‌కాన్‌ హాన్‌ హై, విస్ట్రాన్, పెగాట్రాన్‌తోపాటు శాంసంగ్, రైజింగ్‌ స్టార్‌ లాంటి విదేశీ సంస్థలు దేశంలో సెల్‌ఫోన్‌ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా సెల్‌ఫోన్ల అమ్మకాల ఆదాయంలో అత్యధిక వాటా పొందుతున్న యాపిల్‌ (37 శాతం), శాంసంగ్‌ (22 శాతం) దేశంలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం- స్మార్ట్‌ఫోన్ల తయారీలో ముందడుగు వేయాలన్న భారత లక్ష్యసాధనకు ఎంతగానో  ఉపకరించనుంది. లావా, డిక్సాన్‌ టెక్నాలజీస్, మైక్రోమ్యాక్స్, పాడ్జెట్స్‌ లాంటి దేశీయ కంపెనీలు సైతం తయారీ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేశాయి. ఎలెక్ట్రానిక్స్‌ విడిభాగాల తయారీ విభాగంలో ఏటీఅండ్‌ఎస్, అసెంట్‌ సర్క్యూట్స్, విసికాన్, వాల్సిన్, సహస్ర, విటెస్కో, నియోలింక్‌ తదితర కంపెనీలు పేర్లు నమోదు చేసుకున్నాయి.

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి 
 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం