• facebook
  • whatsapp
  • telegram

మహిళా సాధికారత ఎప్పటికి సాధ్యం?

శాస్త్రసాంకేతిక రంగాల్లో అతివల వెనకబాటు

నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారనేది కాదనలేని సత్యం. సంప్రదాయ సామాజిక శాస్త్రాలతో పాటు శాస్త్ర సాంకేతిక, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ లాంటి విభిన్న కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎయిమ్స్‌లలో చేరుతున్న మహిళల శాతం ఏటా పెరుగుతోంది. ఈ పరిణామాలు మహిళల సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలో తల్లిదండ్రులు తమ కుమార్తెలకు భాష, సాహిత్యం, లలిత కళలు, సామాజిక శాస్త్రం, చరిత్ర వంటి పరిమిత అంశాల్లో మాత్రమే చదువు చెప్పిస్తూ వచ్చారు. ‘సైన్సు, టెక్నాలజీవంటివి ఆడపిల్లలకు ఎందుకులే’ అనే భావం ఉండేది. క్రమంగా మార్పు వచ్చింది. అయినప్పటికీ పురుషులతో పోల్చిచూస్తే విద్య, సామాజిక, ఆర్థిక రంగాల్లో స్త్రీల పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో లేదనేది వాస్తవం. దిల్లీలోని ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ 2016లో రూపొందించిన విజన్‌ డాక్యుమెంట్‌ ప్రకారం భారత్‌లో ఉన్నత విద్యారంగంలో మహిళల భాగస్వామ్యం తక్కువగానే ఉంది. ఆర్ట్స్‌, సామాజిక శాస్త్రాల కోర్సుల్లో 40శాతం చేరితే; ఇంజినీరింగ్‌, టెక్నాలజీలో 16.34శాతమే ఉన్నారు. సైన్స్‌లో 12.6శాతం, ఐటీ-కంప్యూటర్స్‌లో 4.11శాతం, మెడిసిన్‌లో 2.87శాతం చొప్పున ఉన్నారు.  

భారత్‌వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మహిళా సాధికారత సంతృప్తికరంగా లేదని అధ్యయనాలు చాటుతున్నాయి. కళాశాలల్లో బాలికల ప్రవేశాలు తగినంత ఉండటం లేదు. మన దైనందిన జీవితానికి, శాస్త్రసాంకేతిక రంగాలకు విడదీయరాని బంధం ఉంది. అందువల్ల సమాజ పురోగతికి, దేశాభ్యున్నతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడే ఈ రంగాల్లో పురుషులతో పాటు మహిళలూ సమానంగా ప్రవేశించినప్పుడే మహిళా సాధికారత సాకారమవుతుందని నిపుణులు అంటున్నారు.  పోస్టు గ్రాడ్యుయేట్‌ స్థాయి వరకు మహిళల శాతం ఒకింత మెరుగ్గానే ఉన్నా- ఆపై పరిశోధనాపరమైన చదువుల్లో (ఎంఫిల్‌, పీహెచ్‌డీ) వారి నిష్పత్తి పడిపోతోంది. పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో పనిచేసే మొత్తం నిపుణుల్లో మహిళల శాతం కేవలం 14 మాత్రమేనని చెప్పే యునెస్కో గణాంకాలు వారి పట్ల కొనసాగుతున్న దుర్విచక్షణకు నిదర్శనం. మరోవైపు భారతదేశంలో 2016, 2019 మధ్య కాలంలో టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితానికి సంబంధించిన ఉద్యోగాల్లో 44శాతం పెరుగుదల నమోదు కావడం ఆహ్వానించదగినది. ఈ ధోరణి నిస్సందేహంగా ప్రపంచంతో పాటు దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతం అందించేదే అయినా- ఇందులో మహిళా భాగస్వామ్యం తగ్గడం ఆందోళన కలిగించే విషయం. మహిళలు శాస్త్ర సాంకేతిక రంగంలో దుర్విచక్షణను ఎదుర్కోనడానికి గల కారణాలను పరిశీలిస్తే... చారిత్రకంగా అనేక కట్టుబాట్ల మధ్య పెరిగిన ఆడపిల్లలపై కుటుంబ సామాజిక, ఆర్థిక సమస్యలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో సాధారణ విద్య అభ్యసించడమే భారమైంది. సైద్ధాంతికతతో కూడిన తర్కబద్ధమైన సైన్స్‌ విద్య మరింత కష్టతరమైంది. ఫలితంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వారి పాత్ర అంతంత మాత్రంగానే మిగిలిపోయింది. ఇటీవల సైన్స్‌లో పట్టభద్రులైన మహిళల్లో చాలామంది జూనియర్‌, డిగ్రీ కళాశాలల్ల్లో అధ్యాపకులవుతున్నారు. శాస్త్రవేత్తల స్థాయికి వెళుతున్నవారు తక్కువేనని చెప్పాలి. వైజ్ఞానిక, పరిశోధనాశాలల్లో కర్మాగారాల్లో స్త్రీలు పనిచేస్తున్నప్పటికీ శాస్త్రవేత్తలుగా, సాంకేతిక నిపుణులుగా చాలా కొద్దిమంది మాత్రమే ఎదగగలుగుతున్నారు.

స్త్రీలకు వైజ్ఞానిక రంగ అవసరం ఎంత ఉందో, అంతకంటే ఎక్కువగా వైజ్ఞానిక రంగానికి మహిళల అవసరం ఉంది. ఈ రంగంలో రాణించాలంటే ముందుగా బాలికలను సైన్స్‌ కోర్సులో ప్రవేశం పొందేలా ప్రోత్సహించాలి. ఇటీవల ఆమోదించిన జాతీయ విద్యావిధానం బాలికలకు సామాజిక మద్దతు ఇవ్వడం గొప్ప ముందడుగు. ప్రపంచ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల సమాన ప్రాతినిధ్యం లేకుండా ఏ రంగమూ పురోగమించలేదు. స్త్రీ పురుష సమానత్వం ఒక మానవ హక్కు. దీన్ని నిజం చేయడానికి సైన్స్‌లో మహిళలకు సముచిత స్థానం కల్పించవలసి ఉంది. బాలికలను సైన్స్‌ వైపు ఆకర్షించడానికి ఇప్పటికే డాక్టరేట్లు పొందిన మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించి, వారి సృజనాత్మక పరిశోధనలను దేశ ప్రగతికి వినియోగించుకోవడం ఎంతైనా అవసరం. ఉన్నత విద్య అభ్యసిస్తున్న బాలికలకు ప్రత్యేక ఉపకార వేతనాలు, అకాడమీ ఫెలోషిప్‌ వంటివి అందించాలి. చదువులో, వృత్తిలో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా ముందుకు నడిచి విజయాలు సాధించిన మహిళా శాస్త్రవేత్తల విజయ గాథలను పాఠ్యాంశాలుగా బోధించాలి. ఆడపిల్లల హక్కులు కాపాడటంతో పాటు సామాజిక, ఆర్థిక సాధికారతను అందించాలి. ఆడపిల్లల స్థితిని మెరుగుపరచడంలో కుటుంబ పాత్రను బలోపేతం చేయాలి. మహిళా శక్తిని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. కేంద్రం శాస్త్ర సాంకేతిక రంగానికి స్థూల జాతీయ ఉత్పత్తిలో తగినన్ని నిధులు కేటాయించాలి. పితృస్వామ్య సమాజం విధించిన అనేక కట్టుబాట్లను ఛేదించుకొని ఇప్పుడిప్పుడే సాధికారత దిశగా అడుగులు వేస్తున్న మహిళకు సమాజం చేయుత ఇవ్వవలసిన అవసరం ఉంది. అలాగైతేనే రాజ్యాంగం సూచించిన లింగ సమానత్వం ఆచరణలో వీలవుతుంది. శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళ అజేయంగా రాణించడానికి బాటలు పడతాయి!

- జి.శ్యామల
 

Posted Date: 30-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం