• facebook
  • whatsapp
  • telegram

విపక్షాల సమతాకేంద్రం... మమత!

మారిన పరిస్థితుల్లో మెరుగైన అవకాశాలు

వచ్చే జాతీయ సార్వత్రిక ఎన్నికలకు రాజకీయ పార్టీలు అప్పుడే సమాయత్తం అవుతున్నట్లు ప్రస్తుత రాజకీయ వాతావరణం సూచిస్తోంది. పశ్చిమ్‌బంగ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్త రాజకీయాల్లో గణనీయ మార్పును తీసుకొచ్చాయి. కాంగ్రెస్‌తోపాటు, దాని నాయకత్వం శతాధిక వర్ష వయోభార ప్రభావానికి లోనవడంతో వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలను నడిపించే నేత కోసం వెతుకులాట ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో విపక్షంలోని నాయకత్వ శూన్యతను ఆసరాగా చేసుకొని దిల్లీ పీఠాన్ని అధిరోహించాలన్న కలను నెరవేర్చుకోవడానికి పశ్చిమ్‌బంగ సీఎం మమతాబెనర్జీ పావులు కదుపుతున్నారు. మోదీకి వ్యతిరేకంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఆమె రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టడమే ఇందుకు ఉదాహరణ. అందివచ్చే ఏ అవకాశాన్నీ చేజార్చుకోకూడదని మమత వ్యూహాత్మక అడుగులు మొదలుపెట్టారు. అందులో భాగంగా తన మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటులో కూర్చోబెట్టడం ద్వారా తాను రాష్ట్ర రాజకీయాలు వీడితే తన వారసుడు అతనే అనే సంకేతాలు ఇచ్చారు.

ఇదే అదను

‘టీఎంసీని జాతీయ పార్టీగా మలిచేందుకు చేసే ప్రయత్నాలు ఈసారి భిన్నంగా ఉంటాయి. కేవలం ఒకటి రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడానికో, ఓట్ల వాటా పెంచుకోవడానికో పరిమితం కాబోము. భాజపా మీద యుద్ధం చేసి, ఎన్నికలు గెలవడమే మా లక్ష్యం’ అన్న అభిషేక్‌ వ్యాఖ్యలు మమత అంతరంగాన్ని చాటుతున్నాయి. 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాలు సాధించి నాయకత్వ పటిమను చాటుకున్న మమత... 2009, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ పైచేయి సాధించి ప్రత్యర్థులను సమర్థంగా నిలువరించారు. ప్రతిసారీ హోరాహోరీ పోరులో గెలుస్తూ మరింత రాటుతేలుతున్నారు. మోదీ ధాటికి బలహీనపడిన విపక్ష శిబిరానికి ఇప్పుడు మమత తరహా దూకుడు అవసరం ఉంది. 66 ఏళ్ల మమతాబెనర్జీ ప్రస్తుత అవకాశాన్ని అందుకోలేకపోతే 2026 వరకు ముఖ్యమంత్రిగానే ఉండిపోతారు. అప్పటికి ఆమె వయస్సు 70 ఏళ్లు దాటుతుంది. 2024 ఎన్నికల్లో జాతీయ రాజకీయాలకు రాలేకపోతే 2029 వరకు వేచిచూడాల్సి వస్తుంది. అప్పటికి దాదాపు 75 ఏళ్లు నిండిపోతాయి. అప్పటికి ఇతర యువ నేతలు జాతీయ స్థాయికి ఎదిగితే మమతకు అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు. విపక్ష నేతల్లో మమతతోపాటు, మాయావతి, శరద్‌పవార్‌, నీతీశ్‌కుమార్‌, నవీన్‌ పట్నాయక్‌, కేసీఆర్‌ వంటి నేతలూ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయడం ద్వారా జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ఇదివరకు జాతీయ రాజకీయాలకు ప్రత్యామ్నాయ నేతగా కనిపించిన బీఎస్పీ అగ్రనేత మాయావతి వ్యక్తిగత సమస్యలతో ఇటీవలి కాలంలో మౌనముద్ర దాల్చారు. శరద్‌ పవార్‌కు వయోభారం అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయి. నీతీశ్‌కుమార్‌కు రాజకీయ అనుభవం ఉన్నా, ప్రస్తుతం ఎన్డీయేలో కొనసాగుతున్నారు. ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌కు ఇప్పటికే 75 ఏళ్లు పైబడటానికి తోడు, ఆయన ఏనాడూ జాతీయ రాజకీయాలపై ఆసక్తి కనబరచలేదు. లాలూప్రసాద్‌, ములాయంసింగ్‌లు వారసులైన అఖిలేష్‌, తేజస్వీయాదవ్‌ల భవిష్యత్తుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దక్షిణాది నేతల్లో కేసీఆర్‌ తప్ప మిగిలిన వారెవ్వరూ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై దృష్టిసారించే పరిస్థితి లేదు. వయోభారం దృష్ట్యా సోనియాగాంధీ క్రియాశీలకంగా కాంగ్రెస్‌ను నడిపించలేక పోతుండగా, రాహుల్‌ అధ్యక్ష పదవి చేపట్టడంపై ఊగిసలాడుతుండటంతో, ఆయన నాయకత్వంపై ప్రతిపక్షాలకూ నమ్మకం కుదిరేలా కనిపించడం లేదు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయంతో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆశలు చిగురింపజేసినా, ఆమ్‌ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ముందడుగు వేయలేకపోవడంతో ఆయన ప్రాభవం అక్కడికే పరిమితమైంది.  

పార్టీల ఐక్యతే కీలకం

గత సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు- దేశంలోని మొత్తం ఓట్లలో 25.16శాతం, పడిన ఓట్లలో 37.76 శాతం వాటా దక్కింది. మొత్తం ఓట్లలో 74.84శాతం, పడిన ఓట్లలో 62.24శాతం అధికార పక్షానికి వ్యతిరేకంగా వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలను ఏకతాటిపై నడిపించే నేత లేకపోవడం, ఎక్కడికక్కడ ప్రతిపక్షాలు ఒంటరిగా వెళ్లడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అధికార పార్టీ 37.76శాతం ఓట్లతోనే గెలుపు తీరం చేరింది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో తేడా కనిపిస్తోంది. ఎన్డీయే సర్కారు పనితీరును ప్రశ్నిస్తూ, జనంలోకి వెళ్లేందుకు కొవిడ్‌ రెండో ఉద్ధృతి పరిణామాలు ప్రతిపక్షాలకు బలమైన ఆయుధంగా భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ బలాన్ని తగ్గించకపోయినా, ప్రతిపక్షాలు తమ బలాన్ని సంఘటితం చేసుకోగలిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పోలైన 61,36,56,298 ఓట్లలో భాజపాకు పోలైన 22,90,76,879 ఓట్లు మినహాయిస్తే మిగతా 38,45,79,419 ఓట్లు ప్రతిపక్షాలకే దక్కాయి. వీటిని సంఘటితం చేసుకోగలిగితే, అధికార పక్షాన్ని నిలువరించే శక్తి ప్రతిపక్షాలకు దక్కుతుంది. వరస ఓటములు, నేతల ఫిరాయింపులతో స్థైర్యం కోల్పోయిన కాంగ్రెస్‌ ప్రతిపక్షాలను ఏకం చేయలేని పక్షంలో, మమత వంటి నేతలకు అవకాశాలు పెరుగుతాయి.

దీదీకి సానుకూల సమయం!

భారత్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భాజపాకు వ్యతిరేక కూటమిగా ప్రతిపక్షాలు కలిసివస్తే, ముందుండి నడిపే అవకాశాలు మమతా బెనర్జీకే ఎక్కువగా ఉన్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సొంత రాష్ట్రంలో ప్రత్యర్థుల్ని బలహీనపరిచే లక్ష్యంతో పార్టీని వీడివెళ్లిన వారందర్నీ తిరిగి చేర్చుకోవడానికి తలుపులు తెరిచారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సొంత రాష్ట్రంలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలన్నదే మమత వ్యూహం. గతంలో కాంగ్రెస్‌, భాజపాల మధ్య పరస్పర పోరు జరిగే సమయంలో మమత, జయలలిత, మాయావతిల్లో ఎవరో ఒకరి నాయకత్వంలో మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలన్న చర్చలు నడిచినా- సర్దుబాటు ధోరణి కరవై, ఆ ప్రయత్నాలేవీ కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్‌ పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ రావడంతో ఇప్పుడు ఆ పార్టీ ఖాళీ చేసిన స్థానాలను విపక్షాలన్నీ కలిసి భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ములాయం, లాలూప్రసాద్‌, శరద్‌యాదవ్‌, దేవెగౌడ, మాయావతి, మమతాబెనర్జీ, శరద్‌పవార్‌ తదితర నేతలంతా ప్రధానమంత్రి రేసులో ఉండటంతో, ప్రతిపక్షానికి ఎవరు నాయకత్వం వహించాలన్న ప్రశ్నకు సమాధానం రాలేదు. ఇప్పుడు కాలానుగుణంగా వచ్చిన మార్పులతో చాలామంది నాయకత్వాన్ని కోరుకొనే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిణామాలు మమతా బెనర్జీకి సానుకూలంగా మారాయి.

- చల్లా విజయభాస్కర్‌
 

Posted Date: 16-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం