• facebook
  • whatsapp
  • telegram

పాసవాన్‌ పార్టీలో ముసలం

ఎల్‌జేపీ సంక్షోభం వెనక బిహార్‌ సీఎం?

ఊహకందని పరిణామాలతో బిహార్‌ రాజకీయాలు తరచూ జాతీయ స్థాయిలో చర్చనీయాంశాలవుతుంటాయి. భాగస్వామ్య పక్షాలతో భేదాభిప్రాయాలు రావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే కొత్త మిత్రులతో జట్టుకట్టి నీతీశ్‌కుమార్‌ మళ్ళీ కుర్చీ ఎక్కిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పట్లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వీ యాదవ్‌(ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ చిన్న కుమారుడు)పై అవినీతి ఆరోపణలు వచ్చాయని, ఆయనను పదవి నుంచి తప్పించాలని నీతీశ్‌ పట్టుబట్టారు. అందుకు లాలు సహా ఎవరూ అంగీకరించకపోవడంతో తానే పదవిలోంచి తప్పుకొన్నారు. అప్పటివరకు తీవ్రంగా విభేదించిన భాజపాతో చేతులు కలిపి మళ్ళీ సింహాసనం అధిష్ఠించారు. రాష్ట్ర ప్రజలు ‘సుశాసన్‌ బాబు’గా పిలుచుకునే నీతీశ్‌ ఇటువంటి రాజకీయాలు చేస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. నరేంద్రమోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆయన ఎన్డీయేను వీడి బయటకు వెళ్ళడం, తరవాత తిరిగి రావడం సంచలనం సృష్టించాయి. 

తాజాగా లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ)లో తలెత్తిన సంక్షోభం వెనకా నీతీశ్‌కుమార్‌ హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. బిహార్‌లో మంచి పట్టు ఉన్న దళిత నాయకుడు రాంవిలాస్‌ పాసవాన్‌ జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. పాసవాన్‌ మరణం తరవాత ఎల్‌జేపీ పగ్గాలను ఆయన రెండో భార్య రీనా కుమారుడైన చిరాగ్‌ చేపట్టారు. రాంవిలాస్‌ తమ్ముడు పశుపతి కుమార్‌ పారస్‌కు ఇది ఏమాత్రం గిట్టలేదు. తేజస్వీ యాదవ్‌ క్రికెట్‌ను వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడే 2013 ప్రాంతంలో చిరాగ్‌ బాలీవుడ్‌ను విడిచి వచ్చేశారు. కంగనా రనౌత్‌తో కలిసి నటించిన ‘మిలే న మిలే హమ్‌’ చిత్రం పరాజయం పొందడంతో రాజకీయాల్లోకి వచ్చి ‘యువనేత’ అయ్యారు. అప్పటికే పాసవాన్‌ తన పార్టీని కుటుంబ వ్యవహారంగా మార్చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పశుపతి- అన్న మాట జవదాటని లక్ష్మణుడిలా ఉండేవారు. పాసవాన్‌ మరణం తరవాత పరిస్థితులు మారిపోయాయి. బాబాయ్‌-అబ్బాయ్‌ల మధ్య సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి. తాజాగా తిరుగుబాటు బావుటా ఎగరేసిన అయిదుగురు ఎల్‌జేపీ ఎంపీలు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పశుపతిని ఎన్నుకున్నారు. దీనితో చిరాగ్‌ రాజకీయ భవిష్యత్తుపైనే నీలినీడలు కమ్ముకున్నాయి.

చిరాగ్‌ దుందుడుకు వైఖరితో పశుపతి నొచ్చుకున్నారని, అందువల్ల పార్టీలో చీలిక అనివార్యమైందన్నది కొందరి భావన. ఈ తిరుగుబాటు వెనక నీతీశ్‌కుమార్‌ ఉన్నారన్న వాదనే గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి సన్నిహితుడు, ముంగేర్‌ ఎంపీ లల్లన్‌ సింగ్‌తో పశుపతి కొన్నాళ్లుగా మంతనాలు జరుపుతున్నారు. ప్రధాని మోదీకి అమిత్‌షా ఎంత సన్నిహితులో, నీతీశ్‌కు లల్లన్‌ సైతం అంతేనన్నది బిహార్‌లో అందరికీ తెలిసిన విషయమే! 2005 శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన లోక్‌ జనశక్తి పార్టీ 29 స్థానాలను గెలుచుకుంది. ఆ సమయంలో ఫార్మా దిగ్గజం రాజా మహేంద్రను రాజ్యసభకు పంపించి, ఆయన అందించిన ‘అర్థబలం’తో 12 మంది ఎల్‌జేపీ ఎమ్మెల్యేలను లల్లన్‌ చీల్చగలిగారు. వారందరికీ జేడీయూ టికెట్లిచ్చి ఉప ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించి, నీతీశ్‌ ప్రభుత్వానికి కావాల్సిన బలం చేకూర్చి పెట్టారు. అప్పటి నుంచి జేడీయూ, ఎల్‌జేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండూ ఎన్డీయేలోనే ఉన్నా- ఎల్‌జేపీని గుర్తించడానికే నీతీశ్‌ ఇష్టపడలేదు. అయినా రాంవిలాస్‌ పాసవాన్‌ ఆరు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీ చేయించి, అందరినీ గెలిపించుకున్నారు.

2020 అసెంబ్లీ ఎన్నికల నాటికి విభేదాలు మరింత ముదిరాయి. ఎల్‌జేపీకి నీతీశ్‌ కేవలం 25 స్థానాలే కేటాయించారు. అప్పటికే పార్టీ అధ్యక్షుడైన చిరాగ్‌ మాత్రం ఏకంగా 135 స్థానాల్లో అభ్యర్థులను మోహరించారు. భాజపాతో సన్నిహితంగా ఉంటూ, ఆ పార్టీ అభ్యర్థులపై పోటీ పెట్టకుండా జేడీయూనే లక్ష్యం చేసుకున్నారు. ఎల్‌జేపీ ఆ ఎన్నికల్లో ఒక్క చోటే గెలిచినా, జేడీయూ బలాన్ని 43కు తగ్గించడంలో కీలకపాత్ర పోషించింది. దానితో 74 స్థానాలతో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనితో కత్తికట్టిన నీతీశ్‌- ఇప్పుడు పశుపతి ద్వారా పార్టీని చీల్చారని చిరాగ్‌ వర్గీయులు వాపోతున్నారు. అయితే, నాయకుడిగా ఎదిగేందుకు చిరాగ్‌కు ఇది మంచి అవకాశమనే వారూ లేకపోలేదు. రాంవిలాస్‌ పట్ల దళితుల్లో ఉన్న ప్రేమాభిమానాలను  ఆలంబనగా చేసుకుని, రాష్ట్ర రాజకీయాల్లో చిరాగ్‌ చురుకైన పాత్ర పోషించవచ్చు. కానీ, ఆ స్థాయికి చేరాలంటే ముందు ప్రస్తుత సంక్షోభానికి తట్టుకుని, పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తెచ్చుకోవాలి. కానీ, రాజకీయాల్లో కాకలుతీరిన నీతీశ్‌కు ఎదురొడ్డి ఎలా నిలబడగలరన్నదే ఆసక్తికరం!  

- కామేశ్వరరావు పువ్వాడ

Posted Date: 18-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం