• facebook
  • whatsapp
  • telegram

హిమ సీమలో ఎన్నికల వేడి

పర్వత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దశాబ్దాలుగా కాంగ్రెస్‌, భాజపాల మధ్యనే అక్కడ ప్రధాన పోటీ నెలకొంది. ఈసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ తన అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమైంది.

శీతల వాతావరణానికి నెలవైన హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నవంబర్‌ 12న అక్కడ పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ ఎనిమిదిన ఓట్ల లెక్కింపు చేపడతారు. మొత్తం 68 స్థానాలున్న ఆ రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. హిమాచల్‌లో ప్రధానంగా కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ (భాజపా) మధ్యనే పోటీ నెలకొంది. 1971 జనవరి 25న ప్రత్యేక రాష్ట్రంగా హిమాచల్‌ప్రదేశ్‌ ఆవిర్భవించింది. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌, భాజపాలు ఒక దాని తరవాత ఒకటి అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. ఈసారి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ బరిలో నిలవనుంది. హిమాచల్‌లో వరసగా రెండోసారి అధికారం చేపట్టాలని భాజపా ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం ఆ పార్టీ జాతీయ స్థాయి నేతలను ప్రచారంలోకి దింపుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో ఇప్పటికే పర్యటనలు జరిపారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంతో పాటు ఓటర్లపై మరిన్ని హామీలు గుప్పించారు. 

హిమాచల్‌ప్రదేశ్‌ మొత్తం ఓటర్లు 55.74 లక్షలు. మహిళా ఓటర్లతో పోలిస్తే పురుష ఓటర్లే అధికం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ అక్కడ 44 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ 21 సీట్లకే పరిమితమైంది. భాజపా దాదాపు 49 శాతం ఓట్లను సాధించింది. హస్తం పార్టీ సుమారు 42 శాతం ఓట్లు రాబట్టింది. హిమాచల్‌లో ఈ దఫా కూడా భాజపాయే విజయ దుందుభి మోగిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ నమ్మకంగా చెబుతున్నారు. ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల మాదిరిగా ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చకుండా హిమాచల్‌లో ఈసారీ జైరామ్‌నే సీఎం అభ్యర్థిగా భాజపా కొనసాగిస్తోంది.

అరణ్యాలతో నిండిన హిమాచల్‌లోని పర్వత ప్రాంతాల్లో దాదాపు ఇరవై వేలకు పైగా గ్రామాలు చెల్లాచెదురుగా విస్తరించి ఉంటాయి. జాతీయ భావం మెండుగా నిండిన ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌, భాజపాలు మినహా ఇతర ప్రాంతీయ పార్టీల ఎదుగుదలకు మొదటి నుంచి అవకాశం తక్కువగా ఉంటోంది. చాలా రాష్ట్రాల్లో మాదిరిగా స్థానిక సమస్యలతో ఏదైనా ప్రాంతీయ పార్టీ హిమాచల్‌ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆస్కారం లభించడంలేదు. ఆ విషయం తెలిసీ, ఈసారి ఆమ్‌ఆద్మీ పార్టీ తన అదృష్టాన్ని అక్కడ పరీక్షించుకోవాలని చూస్తోంది. గెలుపు కోసం పంజాబ్‌లో మాదిరిగా హిమాచల్‌లోనూ కేజ్రీవాల్‌ భారీ ప్రచారానికి తెరతీశారు. పంజాబ్‌లో ఆయన వ్యూహాలు ఫలించి ఆప్‌ ఘన విజయం సాధించింది. హిమాచల్‌లో అవి ఎంతమేరకు అక్కరకొస్తాయో వేచి చూడాలి.

చిన్న రాష్ట్రం కావడంతో హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులైన ఓటర్లే ఎన్నికల విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. వారి తీరును బట్టే పార్టీల ఎన్నికల ప్రచార వ్యూహాలు సిద్ధమవుతాయి. స్థానికంగా ప్రజలను ప్రభావితం చేసే ప్రధాన ఆర్థిక సమస్యలు ఏమీ లేవు. అయితే మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను చూపించి భాజపా నేతలు- ఇటీవల పెరిగిన జీవన వ్యయాలు, అధిక ధరల సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వర్గపోరు, అసంతృప్తుల సెగలు ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భాజపాలో వర్గపోరు సగం స్థానాల్లో ఉన్నట్లు ఎన్నికల పండితులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌లో అది మూడో వంతు స్థానాలకే పరిమితం. హస్తం పార్టీలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతుండటం ఆ పార్టీకి చికాకుగా మారింది. హిమాచల్‌ రాజకీయాల్లో 1995 నుంచి రాజపుత్ర సామాజిక వర్గ ప్రాబల్యమే కొనసాగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 57 సామాజిక వర్గాలు షెడ్యూల్‌ కులాల (ఎస్‌సీల) జాబితాలో ఉన్నాయి. ఏది ఏమైనా ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా హిమాచల్‌ ఎన్నికల్లో కులం ప్రాధాన్యం అంతగా ఉండదని చాలామంది భావిస్తుంటారు. కానీ, అంతర్గతంగా అది కీలక భూమిక పోషిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

- ఆర్‌.పి.నైల్వాల్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ యుద్ధ తంత్రాన్ని మార్చేస్తున్న డ్రోన్లు

‣ పేదరికంపై పోరుబాట

‣ చైనాపై జిన్‌పింగ్‌ ఉడుంపట్టు

‣ వెంటాడుతున్న ఆహార అభద్రత

‣ పట్టపగ్గాలు లేని డాలర్‌

Posted Date: 18-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం