• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2022-23

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర తలసరి ఆదాయంలో 13.98% వృద్ధి నమోదైందని 2022-23 సామాజిక, ఆర్థిక సర్వేలో ప్రభుత్వం అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే రూ.26,931 కోట్లు పెరిగిందని వెల్లడించింది. దేశ తలసరి ఆదాయంలో వృద్ధి కంటే ఇది అధికమని తేల్చింది. 2022-23 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.13.17 లక్షల కోట్లకు చేరిందని, 16.22% వృద్ధి నమోదైందని పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సచివాలయంలో సామాజిక ఆర్థిక సర్వే నివేదికను విడుదల చేశారు.
తలసరి ఆదాయంలో 13.98% వృద్ధి
అందులోని ప్రధానాంశాలు..
 రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021-22లో రూ.11,33,837 కోట్లు ఉండగా.. 2022-23లో రూ.13,17,728 కోట్లుగా అంచనా వేశారు.
‣ రాష్ట్ర తలసరి ఆదాయం 2021-22లో రూ.1,92,587 ఉండగా.. 2022-23లో రూ.2,19,518కి చేరుతుందని అంచనా వేశారు.
నవరత్నాల అమలుతో ప్రగతి
నవరత్నాల అమల్లో భాగంగా నగదు బదిలీ ద్వారా మొత్తం రూ.1.97 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లో  జమ చేసినట్లు ఆర్థిక సర్వే నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. విద్యారంగంలో మన బడి ‘నాడు- నేడు’ పథకం అమలు ద్వారా మూడేళ్లలో 57,189 పాఠశాలలు, 3,280 విద్యాసంస్థల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి రూ.16,022 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.
‣ రైతు భరోసాకు రూ.27,063 కోట్లు, ఉచిత పంటల బీమాకు రూ.6,872 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణాలకు రూ.1,834 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించింది. ఆక్వా రైతులకు విద్యుత్తు రాయితీ కింద రూ.2,747 కోట్లు, వ్యవసాయ విద్యుత్తు రాయితీకి రూ.27,800 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.
‣ పెట్టుబడుల సదస్సులో రూ.13.42 లక్షల కోట్లకు 378 ఒప్పందాలు చేసుకోవడం ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగంలో రూ.19,115 కోట్ల పెట్టుబడితో 1.52 లక్షల యూనిట్ల ఏర్పాటు ద్వారా 13.63 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు వివరించింది. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 69 భారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
‣ సుస్థిర లక్ష్యాల సాధన (ఎస్‌డీజీ)లో రాష్ట్రం 4వ ర్యాంకు సాధించినట్లు తెలిపింది. ఎస్‌డీజీ సాధనకు నవరత్నాలను అనుసంధానించినట్లు పేర్కొంది.
‣ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల విధానం, రీ సర్వే, భూ హక్కు, భూ రక్ష, స్పందన కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించింది.
రంగాల వారీగా వృద్ధి (ప్రస్తుత ధరల ప్రకారం)
వ్యవసాయం: 20.72%, ఉద్యానం 12.58%, పశుసంవర్థకం 7.32%, మత్స్యరంగం 19.41%
పారిశ్రామికం: ఖనిజ తవ్వకాలు 15.81%, ఉత్పత్తి 11.81%, విద్యుత్తు, గ్యాస్‌ ఇతరాలు 30.96%, నిర్మాణం 16.94%
సేవారంగం: వాణిజ్యం, హోటళ్లు 28.42%, రైల్వే 17.82%, రవాణా, ఇతరాలు 21.64%, రియల్‌ ఎస్టేట్‌ 13.14%

ఆర్థిక స‌ర్వే 2022-23

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.