ఈనాడు, అమరావతి, కానూరు, న్యూస్టుడే: ఫిబ్రవరిలో జరిగిన జేఈఈ మెయిన్ పేపర్-1 మొదటి విడతతో పోలిస్తే.. రెండో విడతలో తొలిరోజు మార్చి 16న ఉదయం జరిగిన పరీక్ష కఠినంగా ఉందని నిపుణులు తెలిపారు. ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని, న్యూమరికల్ సమస్యలు ఎక్కువ సమయం తీసుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. గణితం-బిలో ప్రశ్నలు బాగా కఠినంగా వచ్చినట్లు తెలిపారు. పక్షం రోజుల వ్యవధిలోనే మరోసారి పరీక్ష రాసే అవకాశం కల్పించినా మొదటిసారి కంటే ఈసారి స్కోర్ పెరిగే అవకాశం లేదన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది. మధ్యాహ్నం జరిగిన పరీక్షలో నిరూపక జ్యామితి నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారని, విద్యార్థులు ఎక్కువ సమయం తీసుకునేలా ఉన్నాయని తెలిపారు. ‘గణితం ప్రశ్నలు కొన్ని కఠినంగా ఉన్నాయి... మరికొన్ని ఎక్కువ సమయం తీసుకునేలా ఉన్నాయి’ అని జేఈఈ నిపుణుడు ఉమాశంకర్ తెలిపారు. మరో నిపుణుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ ఉదయం ప్రశ్నపత్రంలో భౌతిక, రసాయనశాస్త్రాల ప్రశ్నలు కొంత సులభంగా ... మధ్యాహ్నం పరీక్షలో మధ్యస్తంగా ఉన్నాయని తెలిపారు. ఈసారి ఆంగ్లం, హిందీతోపాటు మరో 11 ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం అభ్యర్థుల్లో ఆంగ్లం ప్రశ్నపత్రాన్ని 5,79,759 మంది, హిందీని 19,497 మంది, ఇతర భాషలను 20,382 మంది ఎంచుకున్నట్లు జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) తెలిపింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.