* యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ ట్విటర్లో వెల్లడి
దేశవ్యాప్తంగా పలు ప్రముఖ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-పీజీ)’కు మార్చి 20 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు మార్చి 20న రాత్రి నుంచి ఏప్రిల్ 19వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ ట్విటర్లో వెల్లడించారు. దరఖాస్తు రుసుంను డెబిట్/ క్రెడిట్ కార్డులతో పాటు నెట్బ్యాంకింగ్, యూపీఐ ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చని సూచించారు. ఈ పరీక్షకు అభ్యర్థుల అర్హత, పరీక్ష కేంద్రాలు, పరీక్ష ఫీజు, సమయం, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తదితర వివరాలను మార్చి 20న అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు తమ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా 66 కేంద్రీయ, రాష్ట్రీయ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం గతేడాది ఎన్టీఏ నిర్వహించిన పరీక్షకు దాదాపు 6.07 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం తెలిసిందే.
యూజీ ఛైర్మన్ ట్వీట్ ప్రకారం ముఖ్య తేదీలివే..
దరఖాస్తుల స్వీకరణ: మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 సాయంత్రం 5గంటల వరకు
ఆన్లైన్ ఫీజు చెల్లింపు: ఏప్రిల్ 19న రాత్రి 11.50గంటల వరకు
దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు గడువు: ఏప్రిల్ 20 నుంచి 23వరకు
అడ్మిట్ కార్డుల డౌన్లోడ్, పరీక్ష తేదీ తదితర అంశాలను తర్వాత ప్రకటిస్తారు.
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిష్యత్తు శాస్త్రవేత్తలకు, ప్రొఫెసర్లకు నెట్!
‣ కాలుష్య నియంత్రణ బోర్డులో కొలువులు
‣ అమెరికాలో అడ్వాన్స్డ్ కోర్సులు ఇవే!
‣ 5 వేలకుపైగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
‣ ఎగ్జామ్కి ముందు ఏం చేయకూడదు?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.