* ప్రస్తుత మూడు సబ్జెక్టుల విధానానికి బదులుగా ప్రతిపాదన
* వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టేందుకు కసరత్తు
* విద్యార్థులు నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు
ఈనాడు, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సిలబస్ను మార్పు చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం డిగ్రీలో మూడు సబ్జెక్టుల విధానం ఉండగా.. ఒకే సబ్జెక్టు విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ మార్పులు చేయనుంది. ప్రస్తుతం బీఎస్సీలో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు చదువుతున్న విద్యార్థి కొత్త విధానంలో ఈ మూడింటిలో ఏదో ఒక సబ్జెక్టు ఎంపిక చేసుకొని చదువుకోవచ్చు. అదే ప్రధాన సబ్జెక్టుగా ఉంటుంది. మైనర్ సబ్జెక్టులుగా ఆయనకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. బీఎస్సీ చదువుతూనే ఆర్థిక శాస్త్రం, మ్యూజిక్, యోగా... ఇలా తనకు నచ్చిన వాటిని చదువుకోవచ్చు. వీటికి అదనంగా క్రెడిట్లు ఇస్తారు. విద్యార్థి బహుళ సబ్జెక్టులపై అవగాహన కలిగి ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. 60శాతం ఆఫ్లైన్లో... 40శాతం ఆన్లైన్లోనూ చదువుకునేలా కోర్సులను డిజైన్ చేస్తున్నారు. ఆన్లైన్లోనూ మైనర్ డిగ్రీలు పూర్తి చేసే అవకాశం విద్యార్థికి ఉంటుంది. ప్రస్తుతం మూడు సబ్జెక్టులకు కలిపి 75 క్రెడిట్లు ఇస్తున్నారు. కొత్త దాంట్లో ఒక సబ్జెక్టుకు 25 క్రెడిట్లు ఇస్తారు. ఐచ్ఛికంగా విద్యార్థి ఎంపిక చేసుకునే రెండు సబ్జెక్టులకు 50 క్రెడిట్లు ఉంటాయి. క్రెడిట్ల విధానంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.
ఎప్పుడైనా చదువుకునేలా..
ప్రస్తుతం అమలు చేస్తున్న నాలుగేళ్ల డిగ్రీలో విద్యార్థి ఎప్పుడైనా బయటకు వెళ్లిపోయే అవకాశం కల్పిస్తారు. మొదటి ఏడాది చదువు మానేస్తే సర్టిఫికెట్ ఇస్తారు. రెండేళ్లు చదివితే డిప్లొమా, మూడేళ్లు చదివితే డిగ్రీ, నాలుగేళ్లు చదివితే ఆనర్స్ డిగ్రీ ఇస్తారు. మొదటి లేదా రెండో ఏడాదిలో చదువు ఆపేసిన విద్యార్థి ఎప్పుడైనా మళ్లీ చదువుకోవాలనుకుంటే డిగ్రీలో చేరి చదువుకోవచ్చు. ఇప్పటికే ఇంజినీరింగ్లో ఈ విధానం ఉంది. ఇప్పుడు డిగ్రీలోనూ దీన్ని తీసుకురాబోతున్నారు. విద్యార్థి మధ్యలో వెళ్లిపోయి మళ్లీ చదువుకోవాలనుకొని వస్తే ఎక్కడ చేర్చుకోవాలి? మధ్యలో వెళ్లి తిరిగి వచ్చేందుకు నిర్ణీత గడువు ఎంత పెట్టాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నారు. కోర్సుకు కావాల్సిన క్రెడిట్లు సాధిస్తే డిగ్రీ ప్రదానం చేస్తారు. ప్రధాన డిగ్రీతో పాటు మైనర్ డిగ్రీలు చదువుకునే వెసులుబాటు ఉంటుంది. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఒకేసారి డ్యుయల్ డిగ్రీలు చదివే విధానాన్ని తీసుకురావాలని ఆదేశించింది. ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఒక డిగ్రీని మాత్రమే చదివే అవకాశం ఉండగా.. విద్యార్థులు ప్రత్యక్షంగా లేదా ఆన్లైన్లో ఒకేసారి రెండు డిగ్రీలు పూర్తి చేసే విధానం ప్రవేశ పెట్టాలని సూచించింది. దీనిపైనా ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఈ విధానాన్ని ఎలా ప్రవేశ పెట్టాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. సిలబస్ రూపకల్పనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న నాలుగేళ్ల డిగ్రీలో మొదటి మూడు సెమిస్టర్లలో జీవన నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ధి కోర్సులు ఉన్నాయి. మొదటి, రెండు ఏడాదిల్లో రెండేసి నెలల చొప్పున, మూడో ఏడాదిలో ఆరు నెలల ఇంటర్న్షిప్ను అమలు చేస్తున్నారు. నాలుగో ఏడాది రీసెర్చ్తో పాటు విద్యార్థి చదివిన సబ్జెక్టులకు అనుగుణంగా కోర్సులను రూపొందిస్తున్నారు. పీజీ మొదటి ఏడాదిలో చదివే వాటిని నాలుగో ఏడాదికి తీసుకొస్తున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నకిలీ వెబ్సైట్లతో జాగ్రత్త!
‣ అందరి అంచనాల ప్రకారం ఉండాలా?
‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.