రాష్ట్రంలో 97 శాతం హాజరు
వచ్చే నెలలో ఫలితాల వెల్లడి
అర్హత మార్కులు తగ్గే అవకాశం
ఈనాడు, హైదరాబాద్: ఎంబీబీఎస్ సహా పలు వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా సెప్టెంబరు 12న నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్) ప్రశాంతంగా ముగిసింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నీట్ ప్రశ్నపత్రం కొంత కఠినంగానే ఉందని విద్యార్థులు చెప్పారు. తద్వారా అర్హత మార్కులు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబరు రెండో వారంలో నీట్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశముందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 95 శాతం, తెలంగాణలో సుమారు 97 శాతానికిపైగా విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు అంచనా. ఇందులో అభ్యర్థులు సాధించిన అర్హతల మేరకు ఎంబీబీఎస్తోపాటు బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 8 పట్టణాల్లో, 112 కేంద్రాల్లో నీట్ను నిర్వహించారు. పరీక్షకు సుమారు 55వేల మంది దరఖాస్తు చేసుకోగా.. సుమారు 53వేల మంది హాజరైనట్లుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వర్గాలు పేర్కొన్నాయి. కచ్చితమైన హాజరు వివరాలను ప్రకటించడానికి కొంత సమయం పడుతుందని ఎన్టీఏ వర్గాలు తెలిపాయి.
ఉదయం 11 గంటల నుంచే..
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్ష సమయం కాగా, కొవిడ్ నిబంధనల్లో భాగంగా ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో.. ఎందుకైనా మంచిదని అత్యధిక విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. అన్ని కేంద్రాల్లోనూ థర్మల్ స్క్రీనింగ్ పరికరాలతో ప్రవేశ ద్వారం వద్దే శరీర ఉష్ణోగ్రతను పరిశీలించారు. అన్నిచోట్లా శానిటైజర్లు, మాస్కులను అందుబాటులో ఉంచారు. నిబంధనలకు విరుద్ధంగా వస్త్రధారణ, ఎలక్ట్రానిక్ పరికరాలను వెంట తీసుకొచ్చిన విద్యార్థులను లోనికి అనుమతించలేదు. కొందరు విద్యార్థులు వేర్వేరు కారణాలతో ఆలస్యంగా రావడంతో వారిని పరీక్షకు అధికారులు అనుమతించలేదు.
గణాంక ప్రశ్నలతో ఎక్కువ సమయం
ఈసారి నీట్లో 20 ప్రశ్నలను అదనంగా ఇవ్వడం సమయం కోల్పోవడానికి కారణమైందని విద్యార్థులు వాపోయారు. ఇచ్చిన 3 గంటల సమయంలో మొత్తం 200 ప్రశ్నలు చదవాల్సి రావడంతో సాధారణ విద్యార్థులకు సమయం సరిపోలేదు. రుణాత్మక మార్కులూ ఉండడంతో విద్యార్థులు ఆచీతూచీ సమాధానాల్ని ఎంచుకున్నారు. ‘‘ఈసారి ప్రశ్నపత్రంలో అధిక సమయాన్ని తీసుకునే ప్రశ్నలను ఎక్కువగా ఇచ్చారు. జనటిక్స్, బయోటెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడంతో విద్యార్థులు సమయం ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చింది. జంతుశాస్త్రంలో ‘వానపాము’పై సిలబస్లో లేని ప్రశ్నను ఒక దాన్ని ఇచ్చారు. వృక్ష, జంతు శాస్త్ర ప్రశ్నలకు సమాధానాలు రాయడంలో ఎక్కువ సమయం తీసుకోవడంతో.. ఆ ప్రభావం రసాయన, భౌతిక శాస్త్రాలపై పడింది. చివరిలో భౌతిక శాస్త్రంలో మొత్తం ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కొంత కఠినమైనవి, గణించే ప్రశ్నలుండడంతో భౌతికశాస్త్రంలో విద్యార్థులకు సమయం సరిపోలేదు. ఈసారి 450 మార్కులొచ్చిన వారికి సీటు వచ్చే అవకాశాలుంటాయి’’ అని ప్రముఖ విద్యావేత్త శంకర్రావు తెలిపారు.
ఉశ్రద్ధగా.. చురుగ్గా చదవలేకపోతున్నారా ?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.