* బీసీ, సాధారణ గురుకులాల్లో 2,225 పోస్టులు
* సమాచార, పౌరసంబంధాలశాఖలో 166 ఉద్యోగాలు
* అనుమతులు మంజూరు చేసిన సర్కారు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం మరో 2,391 ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. మహాత్మాజ్యోతిబాపూలె బీసీ గురుకులాల్లో 2,132 పోస్టులు, సాధారణ గురుకులాల్లో 93, సమాచార పౌరసంబంధాలశాఖలో 166 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జనవరి 27న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రప్రభుత్వం 2022-23 ఏడాదికి 33 కొత్త బీసీ గురుకులాలు, 15 డిగ్రీ కళాశాలలు మంజూరు చేసింది. వీటిలో బోధన, బోధనేతర పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురుకులాల్లో అదనపు పోస్టులు మంజూరు చేసేందుకు ఇటీవల మంత్రిమండలి ఆమోదించింది. బీసీ గురుకులాల్లో గ్రూప్-3 సర్వీసుల కిందకు వచ్చే 12 జూనియర్ అసిస్టెంట్లు, గ్రూప్-4 సర్వీసుల పరిధిలోని 141 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ఆర్థికశాఖ తెలిపింది. బీసీ గురుకులాలకు 63 స్టాఫ్నర్సుల పోస్టులు మంజూరు చేసి, వీటిని వైద్య, ఆరోగ్య నియామక బోర్డు ద్వారా భర్తీ చేయాలని సూచించింది. బీసీ, సాధారణ గురుకులాల్లోని మిగతా పోస్టులన్నీ గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ కానున్నాయి. సమాచార పౌర సంబంధాల శాఖలో 166 పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగించింది. రాష్ట్రంలో మరో 2,391 ఉద్యోగాల భర్తీకి అనుమతులు జారీ చేశామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ట్విటర్లో తెలిపారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆయా నియామక సంస్థలు చేపడతాయని వెల్లడించారు.
వారం, పదిరోజుల్లో ప్రకటనలు
ఆర్థిక శాఖ ఉత్తర్వులతో గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి. కొత్తగా మంజూరైన పోస్టులను భర్తీచేసేందుకు వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధంచేసి, గురుకుల నియామక బోర్డుకు అందించేందుకు బీసీ గురుకుల సొసైటీ కసరత్తు ప్రారంభించింది. రోస్టర్ ప్రకారం, జోన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టులు గుర్తించనుంది. ఈ ప్రక్రియ వారం, పదిరోజుల్లో పూర్తిచేసి, ప్రతిపాదనల్ని గురుకుల నియామకబోర్డుకు అందించనుంది. కొత్త కొలువులతో గురుకుల నియామక మండలి భర్తీచేయనున్న పోస్టుల సంఖ్య 11,105కి పెరిగాయి. ఇందులో అత్యధికంగా బీసీ గురుకులాల్లో 5,786 పోస్టులున్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీలో 2,267, ఎస్టీ గురుకుల సొసైటీలో1,514, మైనార్టీ గురుకుల సొసైటీలో1,445, సాధారణ గురుకుల సొసైటీలో 93 పోస్టులున్నాయి.
గ్రూప్-3, 4 ఉద్యోగ ప్రకటనల్లో చేరనున్న పోస్టులు..
టీఎస్పీఎస్సీ ఇప్పటికే గ్రూప్-3, 4 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. కొత్తగా మంజూరయ్యే ఉద్యోగాలను కూడా ఈ ప్రకటనల్లో చేరుస్తామని కమిషన్ ఇప్పటికే చెప్పింది. తాజాగా బీసీ గురుకులాల్లో గ్రూప్-3 కింద 12, గ్రూప్-4 కింద 141 పోస్టులకు అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులకు సంబంధించి ప్రతిపాదనలు వెంటనే అందజేయాలని బీసీ సంక్షేమశాఖను టీఎస్పీఎస్సీ కోరింది.
గురుకుల నియామక బోర్డు భర్తీచేసే ఉద్యోగాలు
బీసీ గురుకులాల్లో...
* జూనియర్ లెక్చరర్లు -602
* డిగ్రీకళాశాల లెక్చరర్లు - 480
* ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) - 324
* పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) - 235
* సాధారణ గురుకులాల టీజీటీ - 87
* ల్యాబ్ అసిస్టెంట్లు - 60
* డిగ్రీకళాశాల లైబ్రేరియన్లు - 37
* పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు - 33
* పాఠశాల ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు - 33
* కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్లు - 30
* డిగ్రీకళాశాల ఫిజికల్ డైరెక్టర్లు - 20
* డిగ్రీకళాశాల అసిస్టెంట్ లైబ్రేరియన్ - 15
* స్టోర్ కీపర్ - 15
* లైబ్రేరియన్లు - 11
* పాఠశాల లైబ్రేరియన్లు - 11
* ప్రిన్సిపల్ (పాఠశాలలు) - 10
* సాధారణ గురుకులాల ఆర్ట్,క్రాఫ్ట్,మ్యూజిక్ టీచర్ - 6
పౌరసంబంధాలు, సమాచార శాఖ...
* పబ్లిసిటీ అసిస్టెంట్ - 82
* సహాయ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్లు - 41
* ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్ - 22
* సహాయ ప్రజాసంబంధాల అధికారులు - 16
* ప్రజాసంబంధాల అధికారులు - 4
* ఎడిటర్ (ఉర్దూ) - 1
టీఎస్పీఎస్సీ భర్తీచేసేవి...
* బీసీ గురుకుల జూనియర్ అసిస్టెంట్లు (గ్రూప్-3) - 12, (గ్రూప్-4) - 141
వైద్య,ఆరోగ్య నియామకబోర్డు...
* బీసీ గురుకుల స్టాఫ్నర్సులు - 63
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.