దిల్లీ: దేశంలో మొదటిసారిగా జాతీయ స్థాయిలో మూల్యాంకన సంస్థ ఏర్పాటుకు ఎన్సీఈఆర్టీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం టొఫెల్, జీఆర్ఈ తదితర ప్రతిష్ఠాత్మక పరీక్షలు నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్)తో జత కట్టింది. ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డవలప్మెంట్’(పరాక్) పేరుతో కొత్త వ్యవస్థను గత నెలలోనే ఎన్సీఈఆర్టీ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలు మూల్యాంకనం చేసేందుకు వీలుగా గుర్తింపు పొందిన పాఠశాల విద్యా మండళ్లకు ‘పరాక్’ మార్గదర్శనం చేస్తుంది. ఆ దిశగా నాణ్యతా ప్రమాణాలు నిర్దేశించడంతో పాటు నిబంధనలు రూపొందిస్తుంది. నూతన జాతీయ విద్యా విధానం-22 ప్రకారం వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యా మండళ్ల పరిధిలో మార్కుల విషయంలో ఉన్న వైరుధ్యాలను తొలగించి, క్రమబద్ధీకరిస్తుంది. కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి ఈటీఎస్ సాంకేతిక సహకారం అందించనుందని ఎన్సీఈఆర్టీకి చెందిన ఎడ్యుకేషన్ సర్వే విభాగం అధిపతి, ఆచార్య ఇంద్రాని బాధురి తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకే విధంగా విద్యా ప్రణాళికలు రూపొందించడం వల్ల నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు బోధన-అభ్యసనల్లో సార్వజనీనత ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉత్తమ విద్యకు భారత్ భవిష్యత్తులో దిక్సూచీగా మారుతుందని, పరాక్ వ్యవస్థ ఇతర దేశాలకు సైతం ఒక నమూనాగా ఉంటుందని ఈటీఎస్ సీఈవో అమిత్ సేవక్ తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.