దిల్లీ: భారతీయ వైద్య విద్యార్థులు (Medical Graduates) ఇకపై విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ (WFME) నుంచి జాతీయ వైద్యమండలి (NMC) వచ్చే 10 ఏళ్ల కాలానికి గుర్తింపు లభించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో భారత్లో వైద్య విద్య అభ్యసించిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్లలో పీజీ కోర్సుల్లో చేరడంతో పాటు ప్రాక్టీస్ చేయొచ్చని వెల్లడించింది. 2024 నుంచి భారతీయ వైద్య విద్యార్థులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో ఉన్న, రాబోయే పదేళ్లలో ఏర్పాటయ్యే వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్ఎమ్ఈ గుర్తింపు పొందుతాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 706 వైద్య కళాశాలలు ఉన్న విషయం తెలిసిందే. ‘‘ఈ వెసులుబాటుతో భారతీయ వైద్య కళాశాలలకు, నిపుణులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. విదేశాల్లోని వైద్య విద్యాసంస్థలకు భారత్లోని కళాశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. వైద్య విద్యలో సరికొత్త ఆవిష్కరణలకు ఇది తోడ్పాటునందిస్తుంది. భారత్లో అందించే వైద్య విద్య అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందనేందుకు డబ్ల్యూఎఫ్ఎమ్ఈ గుర్తింపు నిదర్శనం. దీని వల్ల భారతీయ వైద్య విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా తమ కెరీర్ను కొనసాగించవచ్చు. అంతేకాకుండా, విదేశీ విద్యార్థులను భారత వైద్య కళాశాలలు ఆకర్షిస్తాయి’’ అని ఎన్ఎమ్సీ ప్రతినిధి డాక్టర్ యోగేందర్ మాలిక్ తెలిపారు. అంతర్జాతీయంగా అత్యున్నతస్థాయి ప్రమాణాలతో వైద్య విద్యను అందించేందుకు డబ్ల్యూఎఫ్ఎమ్ఈ కృషి చేస్తోంది. డబ్ల్యూఎఫ్ఎమ్ఈ గుర్తింపు ప్రక్రియ కోసం ప్రతి వైద్య కళాశాల నుంచి 60 వేల డాలర్లు రుసుము వసూలు చేస్తోంది. దీంతో దేశంలోని 706 వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్ఎమ్ఈ గుర్తింపు కోసం మొత్తంగా సుమారు 4,23,60,000 డాలర్లు ఖర్చు కానుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.