• facebook
  • whatsapp
  • telegram

Ekalavya Schools: ఏకలవ్య పాఠశాలల్లో వెయ్యికిపైగా కొలువులు

* కేంద్ర నిర్ణయంతో పూర్తిస్థాయి నియామకాలకు అవకాశం



 

 

 

ఈనాడు, హైదరాబాద్‌: ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో (ఈఎంఆర్‌ఎస్‌) బోధన, బోధనేతర పోస్టులను మూడేళ్లలో భర్తీచేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో తెలంగాణకు వెయ్యికిపైగా పోస్టులు రానున్నాయి. గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లలకు 6 నుంచి 10 వరకు నిర్బంధ విద్యను అందించేందుకు గురుకుల తరహాలో కేంద్రం వీటిని ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23 ఏకలవ్య గురుకుల విద్యాలయాలు కొనసాగుతున్నాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు, మహబూబాబాద్‌లో అయిదు ఉన్నాయి. అవన్నీ నాలుగేళ్ల క్రితం వరకు గిరిజన గురుకుల సొసైటీకి అనుబంధంగా ఉన్నాయి. వీటికి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ తరహాలో ప్రత్యేక సొసైటీ ఉండాలని గిరిజన మంత్రిత్వశాఖ నిర్ణయించడంతో రాష్ట్రంలోనూ తెలంగాణ ఏకలవ్య గిరిజన గురుకుల విద్యాలయ సొసైటీ ఏర్పాటైంది. ఈఎంఆర్‌ఎస్‌లన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేయాలని స్పష్టంచేసింది. అప్పటివరకు ఈఎంఆర్‌ఎస్‌ల్లో పనిచేస్తున్న గిరిజన గురుకుల సొసైటీ ఉపాధ్యాయులను సొసైటీలో విలీనం చేయాలని సూచించగా, కేంద్రం ఒప్పుకోలేదు. దీంతో వారిని రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గురుకుల సొసైటీ పరిధిలోకి బదిలీ చేసింది. ప్రస్తుతం ఈఎంఆర్‌ఎస్‌ సొసైటీ పాఠశాలల్లో ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందితో బోధన కొనసాగిస్తోంది. నిబంధనల ప్రకారం ఒక్కో ఈఎంఆర్‌ఎస్‌లో 6 నుంచి 10 వరకు చదివే విద్యార్థులు 480 మంది ఉంటారు. బోధన సిబ్బంది 29 మంది, బోధనేతర సిబ్బంది 23, నాలుగో తరగతి ఉద్యోగులు పది మంది అవసరం. ఈ లెక్కన రాష్ట్రంలోని ఈఎంఆర్‌ఎస్‌లో 1,426 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా వెయ్యికి పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆయా సొసైటీల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.  

* ఆదిమ గిరిజనుల అభివృద్ధికి ఊతం...
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆదిమ గిరిజనుల అభివృద్ధి మిషన్‌లో భాగంగా వారి అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను పెద్దఎత్తున కల్పించనుంది. ఆదిమ గిరిజనుల కోసం ఇప్పటికే నిధులు ఖర్చుచేస్తున్నా, ఆ మొత్తం సరిపోవడం లేదు. తాజాగా మూడేళ్ల మిషన్‌ కోసం రూ.15వేల కోట్లు ఖర్చుచేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని 570 ఆవాసాల్లో ఆదిమ గిరిజనులు ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం కేంద్రం ఏటా రూ.8-9 కోట్ల వరకు నిధులు ఇస్తోంది. తాజాగా బడ్జెట్‌లో భారీగా నిధులను పేర్కొనడంతో ఎక్కువ సౌకర్యాలు కల్పించేందుకు వీలవుతుంది.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.