ప్రవేశాలు నిలిపివేయాలని ఉన్నత విద్యామండలికి లేఖ
అవినీతిపై ప్రశ్నిస్తుండడమే కారణమని విద్యార్థుల ఆరోపణ
ఎస్కేయూ (అనంతపురం), న్యూస్టుడే: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని న్యాయశాస్త్ర విభాగంలో 2022-23 విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు నిలిపివేయనున్నారు. ఆచార్యులు, సహాయాచార్యులు తగినంతమంది లేక మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సు నిర్వహించలేమని, ప్రవేశాలు నిలిపివేయాలని ఎస్కేయూ అధికారులు ఉన్నత విద్యామండలికి డిసెంబరు 1న లేఖ రాశారు. మాస్టర్ ఆఫ్ లా కోర్సు మాత్రమే కొనసాగిస్తామని పేర్కొన్నారు. న్యాయశాస్త్ర విభాగంలో ఆచార్య పుల్లారెడ్డి, సహాయాచార్యుడు శ్రీరాములు ఉన్నారు. వీరిలో పుల్లారెడ్డి మెడికల్ లీవులో వెళ్లారు. దీంతో మూడేళ్ల న్యాయశాస్త్ర కోర్సులు నిర్వహించలేమని పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీలోని అవినీతి, అక్రమాలు, వసతి గృహాల్లో నాసిరకం భోజనం, విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలపై న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థులు ప్రశ్నిస్తుంటారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కి పెట్టడానికే న్యాయశాస్త్రం కోర్సులను మూసివేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎస్కేయూలోని లా విభాగంలో ఆచార్యుడు, సహాయాచార్యుడితో పాటు 8 మంది తాత్కాలిక బోధకులు ఉన్నారు. ఇంతమంది ఉన్నా కోర్సు నిర్వహించలేమని చెప్పడం విశేషం. బోధించే వారు తక్కువమంది ఉన్నారనుకొంటే ఇతర విభాగాల్లోని ఎన్నో కోర్సులు మూసివేయాల్సి ఉంటుంది! ఎస్కేయూలో లా కోర్సులో చేరడానికి రూ. 5,000 ఫీజు చెల్లిస్తే చాలు. ఇక్కడ ప్రవేశాలు నిలిపివేస్తే.. ప్రైవేటు కళాశాలలో చదవడానికి కనీసం రూ.25,000 రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.