రికార్డు స్థాయిలో నియామకాలు
రూ.కోట్లలో వేతన ప్యాకేజీ
ఈనాడు, హైదరాబాద్: ఐఐటీల్లో ఈ నెల ఒకటో తేదీ నుంచి మొదలైన ప్రాంగణ నియామకాలు సరికొత్త రికార్డును స్పష్టిస్తున్నాయి. కొలువుల ఆఫర్లు పెరగడమే కాక వార్షిక వేతనం రూ.కోటి, ఆపై అందుకుంటున్న వారి సంఖ్యా గత ఏడాదితో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటున్నట్లు ఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆగస్టు నుంచే ప్లేస్మెంట్ల ప్రక్రియ మొదలవుతుంది. ఐఐటీల్లో మాత్రం అది డిసెంబరు నుంచి ఆరంభమవుతుంది. డిసెంబరు 1న పలు ఐఐటీల్లో ఆ ప్రక్రియ మొదలైంది. మొదటి విడత కింద ఈనెల 15 వరకు ఎంపికలు కొనసాగుతాయి. మరికొద్ది రోజుల్లో ప్రాంగణ ఎంపికలపై మరింత స్పష్టత రానుంది.
ప్రముఖ ఐఐటీల్లో ఇదీ పరిస్థితి..
‣ ఐఐటీ మద్రాస్లో తొలి రోజు డిసెంబరు 1న 445 మందికి కొలువులు దక్కాయి. అందులో 25 మందికి వార్షిక వేతనం రూ.కోటి దాటింది. వారు మన దేశంలోనే పనిచేస్తారు. నాలుగు కంపెనీలు 15 మందికి అంతర్జాతీయ ఉద్యోగాలు ఇచ్చాయి. వీరందరు విదేశాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
‣ ఐఐటీ బాంబేలో మొదటి రోజు 46 కంపెనీలు విద్యార్థులను ఆన్లైన్/ఆఫ్లైన్లో ముఖాముఖీ నిర్వహించాయి. 250 ఆఫర్లు ఇవ్వగా.. 175 మంది కొలువుల్లో చేరేందుకు అంగీకరించారు. ఈ ఏడాది వేతన ప్యాకేజీలో పెద్ద మార్పు లేదని ఐఐటీ బాంబే తెలిపింది. ఇంటర్న్షిప్ చేసిన 300 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆయా కంపెనీలు ఆఫర్లు ఇవ్వగా అందులో 175 మంది అంగీకారం తెలిపారు.
‣ ఐఐటీ ఖరగ్పుర్లో మొదటిరోజు 760 ఆఫర్లు దక్కాయి. అందులో 16 అంతర్జాతీయ ఆఫర్లు ఉన్నాయి. అంతర్జాతీయ కొలువులకు ఎంపికైన వారిలో అత్యధిక ప్యాకేజీ రూ.2.60 కోట్లు.
‣ ఐఐటీ వారణాసిలో ప్రాంగణ నియామకాల్లో రెండు రోజుల్లో 640 మంది ఎంపికయ్యారు. మొత్తం 173 కంపెనీలు పాల్గొన్నాయి. అత్యధిక వార్షిక వేతనం రూ.1.20 కోట్లు. లభించిన వేతనాలు రూ.12 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉన్నాయి.
‣ ఐఐటీ దిల్లీలో 650 మంది కొలువులకు ఎంపికయ్యారు. అందులో 50 మంది రూ.కోటి వేతనం అందుకోనున్నారు. వారు దేశంలోనే (డొమెస్టిక్ ఆఫర్) పనిచేస్తారు. మరో 20 మందికి విదేశీ జాబులకు ఎంపికయ్యారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.