సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున
ఈనాడు డిజిటల్, అమరావతి: ఎస్సీ విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న నీట్, జేఈఈ శిక్షణ కేంద్రాలకు అదనంగా బాలికల కోసం మరో నీట్, జేఈఈ శిక్షణ కేంద్రాన్ని విశాఖ జిల్లా మధురవాడలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఎస్సీ గురుకుల విద్యార్థులు పది, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు 56 అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సచివాలయంలో ఆయన ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయకర్తల (డీసీవో)తో మే 23న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గురుకులాల్లో విద్యార్థుల రోజువారీ హాజరు నివేదికను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరచిన వెంటనే పుస్తకాలు, నోటు పుస్తకాలు విద్యార్థులకు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. డీసీవోలు పది, ఇంటర్మీడియట్ ఫలితాల్లో తక్కువ ఫలితాలు వచ్చిన గురుకులాలకు వెళ్లి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలి. ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ల పదోన్నతుల ప్రక్రియ విద్యాసంవత్సరం ఆరంభానికి ముందే పూర్తి చేయాలి. ప్రిన్సిపాళ్లకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడకు వెళ్లి చేరాల్సిందే’ అని స్పష్టం చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.