ఇంటర్లో సాధారణ స్థాయికి ఉత్తీర్ణత శాతం
ప్రస్తుతం ఫస్టియర్ పాసైన వారు తొమ్మిది, పది తరగతుల్లో పరీక్షలు రాయకుండా ఇంటర్కు వచ్చిన వారే. సెకండియర్ పాసైన వారు పది పరీక్షలు రాయలేదు. మొత్తానికి కరోనా బ్యాచ్గా పేరొందినా తాజా ఫలితాల్లో సత్తా చాటడం విశేషం.
ఈనాడు, హైదరాబాద్: కరోనా మహమ్మారి విద్యార్థులను ఆగమాగం చేసినా విద్యా పరంగా వారు మళ్లీ కోలుకున్నారు! ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఇంటర్ ఫలితాలను మంగళవారం విడుదల చేయగా ఉత్తీర్ణత శాతం కరోనాకు ముందు స్థాయిలోనే రావడం విశేషం. ఇంటర్ ఫస్టియర్లో 63.32 శాతం, సెకండియర్లో 67.16 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ను పక్కనబెట్టి కేవలం జనరల్ ఇంటర్నే తీసుకుంటే ఆ శాతం వరుసగా 64.85, 68.68 శాతంగా నమోదైంది. గత డిసెంబరులో వెల్లడైన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కేవలం 49 శాతం మందే పాస్ కాగా....తదనంతరం ప్రభుత్వం అందర్నీ ఉత్తీర్ణులను చేసింది. తాజా ఫలితాల్లో ఏకంగా 67 శాతానికిపైగా పాసయ్యారు. నాంపల్లి విద్యాభవన్లో మంగళవారం ఫలితాలను విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘‘గత ప్రథమ సంవత్సరం పరీక్షల్లో అధిక శాతం మంది తప్పారు. దాంతో అప్రమత్తమైన విద్యార్థులు బాగా చదివారు. అధ్యాపకులు కూడా కష్టపడ్డారు. దానివల్లే ఈసారి సెకండియర్లో ఉత్తీర్ణత పెరిగింది’’ అన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పరీక్షల కంట్రోలర్ ఖాలిక్, ఓఎస్డీ సుశీల్కుమార్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నింజె తదితరులు పాల్గొన్నారు.
ఫలితాల ముఖ్యాంశాలు
‣ ప్రథమ సంవత్సరం జనరల్లో 4,14,380 మందిలో 1,76,992 మందికి 75, ఆపై శాతం మార్కులు(ఏ గ్రేడ్) దక్కాయి. ద్వితీయ సంవత్సరం జనరల్లో 3,92,258 మందికి 1,44,076 మంది ఏ గ్రేడ్ మార్కులు పొందారు.
‣ ఫస్టియర్లో అబ్బాయిలు, అమ్మాయిల ఉత్తీర్ణత శాతం వరుసగా 54.25, 72.33 శాతంగా నమోదైంది. సెకండియర్లో 59.21, 75.28 శాతంగా ఉంది. అంటే అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 15-18 అధికం.
‣ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్, హనుమకొండ, కుమురంభీం ఆసిఫాబాద్ అగ్రస్థానాల్లో నిలిచాయి. ఫస్టియర్లో మేడ్చల్(76), హనుమకొండ(74), ఆసిఫాబాద్ 72 శాతంతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ద్వితీయ ఇంటర్లో మేడ్చల్ 78 శాతంతో ప్రథమ, 77 శాతంతో ఆసిఫాబాద్, హనుమకొండ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. రంగారెడ్డి 75 శాతంతో మూడో స్థానంలో ఉంది. మెదక్ ప్రథమ సంవత్సరంలో 40 శాతం, ద్వితీయంలో 47 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో నారాయణపేట 75, 76 శాతాలతో అగ్రగామిగా ఉంది. ఒకేషనల్ ఫస్టియర్లో 34 శాతంతో జగిత్యాల, సెకండియర్లో 47 శాతంతో సిద్దిపేట అట్టడుగున నిలిచాయి.
ప్రైవేట్లో కంటే గురుకులాల్లో ఉత్తీర్ణత ఎక్కువ
ప్రథమ, ద్వితీయలలో ప్రభుత్వ కళాశాలల్లో వరుసగా 47.70, 63.56 శాతం మంది పాసయ్యారు. గురుకులాల్లో ఆ శాతం 73.30, 78.25గా నమోదైంది. ప్రైవేట్ కళాశాలల్లో అది 66.50, 68.30 శాతం.
‣ ప్రథమంలో 16, ద్వితీయలో 46 మంది ఫలితాలను విత్హెల్డ్లో ఉంచారు.
‣ హెచ్ఈసీ(చరిత్ర, ఆర్థికశాస్త్రం, పౌరశాస్త్రం) ఫస్టియర్లో 31.80 శాతం, సెకండియర్లో 45.70 శాతం మందే పాసయ్యారు.
‣ ఒకేషనల్ ప్రథమ సంవత్సరంలో 50.70 శాతం, ద్వితీయంలో 60.12 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ప్రయోగ పరీక్షలు జులై 26 నుంచి
తప్పిన విద్యార్థులకు ఆగస్టు 1నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయోగ పరీక్షలు జులై 26 నుంచి 30 వరకు జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 30-జులై 6మధ్య సంబంధిత కళాశాలల్లో రుసుం చెల్లించాలి. ప్రథమ సంవత్సరంలో అన్నీ పాసైన వారు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు.
గ్రూపుల వారీగా అగ్రగణ్యులు వీరే..
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఎంపీసీ గ్రూపులో 994 మార్కులతో ఇద్దరు, బైపీసీలో 993 మార్కులతో నలుగురు రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కులు సాధించారు.
సెకండియర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారి వివరాలు
ఎంపీసీ గ్రూపు: ఎన్నం నవ్యశ్రీ(994)-కరీంనగర్, చిలుకా సాయి కీర్తన్(994)-నిజామాబాద్
బైపీసీ గ్రూపు: ఆకుల అర్చన(993)-కరీంనగర్, మైసా మనస్వని(993)- బాచుపల్లి, రంగారెడ్డి జిల్లా, షేక్ నుహ తన్సీమ్(993)-సాయినగర్, కూకట్పల్లి, నేహ త్రిషిక(993)- సాయినగర్, కూకట్పల్లి మేడ్చల్ జిల్లా
సీఈసీ గ్రూపు: షరీన్ బేగం(981)- ఫలక్నుమా, హైదరాబాద్ జిల్లా
హెచ్ఈసీ గ్రూపు: నాంపల్లి నాగలక్ష్మి(977)-కొంపల్లి, మేడ్చల్ జిల్లా
ఎంఈసీ గ్రూపు: గంట శ్రీ చక్రిత(986)- కరీంనగర్, పిల్లి హర్షిత(986)- హైదర్నగర్, కూకట్పల్లి, మేడ్చల్ జిల్లా; నేలబొట్ల సాయి మనోజ్ఞ(986)-లక్డీకాపుల్, హైదరాబాద్ జిల్లా
సర్కారు కళాశాలల్లో అగ్రగణ్యులు వీరే..
ఎంపీసీ గ్రూపు: జెల్లా అమన్(990)- ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిర్పూర్ కాగజ్నగర్, కుమురం భీం జిల్లా. కొర్రా మేఘన సింధు(990)- ప్రభుత్వ కళాశాల హసన్పర్తి, హనుమకొండ జిల్లా
బైపీసీ గ్రూపు: మదిహ ఫిర్దోస్(983)- హైదరాబాద్ మలక్పేట ప్రభుత్వ బాలికల కళాశాల
ఎంఈసీ: డీవీఎల్ఎన్ఎస్ మృదుల(961)- హైదరాబాద్ మారేడ్పల్లి జూనియర్ కళాశాల
సీఈసీ: నూర్ ఫాతిమా(963)- కుత్బుల్లాపూర్ ప్రభుత్వ కళాశాల, మేడ్చల్ జిల్లా
హెచ్ఈసీ: అఫ్రా తహూర్(926)- ప్రభుత్వ బాలికల కళాశాల, జగిత్యాల
రీకౌంటింగ్కు రేపటి నుంచి దరఖాస్తులు
ఇంటర్ పరీక్ష పత్రాల పునఃపరిశీలనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్బోర్డు వెసులుబాటు కల్పించింది. ఈ నెల 30 నుంచి జులై 6లోపు http://tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పరీక్షపత్రాల రీకౌంటింగ్ కోసం ఒక్కో పత్రానికి రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన పరీక్షపత్రాలతోపాటు వెరిఫికేషన్ కోసం ఒక్కో పత్రానికి రూ.600 చొప్పున చెల్లించాలి.
11 నుంచి ఫస్టియర్ తరగతులు
రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులను జులై 11 నుంచి ప్రారంభించాలని బోర్డు కార్యదర్శిని ఆదేశించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు బుధవారం కాలపట్టిక విడుదల చేస్తామని బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం(2022-23) రాష్ట్రంలో కొత్త జూనియర్ కళాశాలలు మంజూరు కాలేదని చెప్పారు.
ఎంపీసీలోనే అత్యధిక ఉత్తీర్ణత
ఇంటర్ పరీక్షల్లో మిగతా గ్రూపులతో పోల్చితే ఎంపీసీ విద్యార్థులే అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. హెచ్ఈసీ విద్యార్థులు అత్యల్ప ఉత్తీర్ణత పొందారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోనూ ఇదే ఒరవడి కొనసాగింది.
41 ఎస్సీ గురుకులాల్లో 100% ఫలితాలు
ఇంటర్ ఫలితాల్లో గురుకులాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయి ఉత్తీర్ణత సగటు కంటే గురుకులాల్లో సుమారు 25 శాతం ఎక్కువగా ఉంది. సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీకి చెందిన 41 కళాశాలల్లో వందశాతం ఫలితాలు నమోదయ్యాయి.
‣ ద్వితీయ సంవత్సరంలో 93.23 శాతం, ప్రథమ సంవత్సరంలో 88.03 శాతం ఉత్తీర్ణులయ్యారు.
‣ మహాత్మా జ్యోతిబాఫులే బీసీ గురుకుల సంస్థ విద్యార్థులు ద్వితీయ సంవత్సర పరీక్షల్లో 93.84శాతం, మొదటి సంవత్సరం 84.81శాతం ఉత్తీర్ణత సాధించారు.
‣ గిరిజన సంక్షేమ గురుకులాల సొసైటీలో 82.09శాతం ఉత్తీర్ణత నమోదైంది.
‣ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 94.18శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం ఏడు కళాశాలలకుగాను రెండు కళాశాలల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు.
‣ రాష్ట్రంలో 172 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీల్లో) ఇంటర్ సెకండియర్లో 86.64 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో 81.02 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్లో 14, సెకండియర్లో 16 కేజీబీవీల్లో 100 శాతం మంది పాసయ్యారు.
‣ తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల(టీఆర్ఈఐ) పరిధిలోని 35 టీఎస్ఆర్ జూనియర్ కళాశాలల నుంచి 2,742 మంది పరీక్షలు రాయగా 2,674 మంది ఉత్తీర్ణులయ్యారని, 97.21 శాతం మంది పాసయ్యారని ఆ సొసైటీ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు.
ఇంటర్ ఫలితాల్లో వీణా-వాణిలకు ఫస్ట్ క్లాస్
అవిభక్త కవలలు వీణా-వాణి ఇంటర్ ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ప్రతిభ చాటారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన వీణా-వాణి మారగాని మురళి, నాగలక్ష్మి దంపతుల కుమార్తెలు. వారు 2003 అక్టోబరు 16న తలలు అతుక్కుని జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్ వెంగళ్రావునగర్లోని మహిళ, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ ఆవరణలోని బాలసదన్లో ఆశ్రయం పొందుతూ ఇంటర్ పూర్తి చేశారు. ప్రభుత్వం వారికి అక్కడే శిక్షణకు తగిన ఏర్పాట్లు చేసింది. విద్యాశాఖ ప్రత్యేక అనుమతితో బాలసదన్లోనే పరీక్షలు రాశారు. సీఈసీ గ్రూప్తో చదివిన వీణ 712, వాణి 707 మార్కులు సాధించినట్లు తల్లిదండ్రులు మంగళవారం ‘న్యూస్టుడే’కు తెలిపారు. వీరికి రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బాలసదన్కు చేరుకొని వారికి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటర్ ఫలితాల్లో మళ్లీ తప్పులు!
ఇంటర్ ఫలితాల వెల్లడిలో బోర్డు నిర్లక్ష్యం విద్యార్థులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోని ఇంటర్ బోర్డు అధికారులు ఫలితాలపై నిర్లక్ష్యం వహిస్తున్నట్లు మరోసారి స్పష్టమవుతోంది. ఫలితాలు మంగళవారం విడుదల కాగా....కొందరు విద్యార్థులు అన్నింట్లో మంచి మార్కులతో పాసైనా ఒక సబ్జెక్టులో మాత్రం సున్నా రావడం అధికారుల నిర్లక్ష్యానికి ఉదాహరణ. ఫలితాల విడుదల సందర్భంగా ఇంటర్బోర్డు కార్యదర్శి జలీల్ మాట్లాడుతూ.. పొరపాట్లు జరగకుండా ఉండేందుకు మార్కులను డబుల్ చెక్ చేశామని, అందుకే రెండు మూడు రోజులు ఆలస్యమైందని చెప్పారు. అయినా తప్పులు రావడం గమనార్హం. ఫలితాల కోసమే పదవీ విరమణ పొందిన ఒక అధికారిని గత మూడేళ్లుగా ఓఎస్డీగా కూడా నియమించుకున్నారు. తప్పులపై లోతుగా విచారణ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ వస్తోంది.
ఆర్థికశాస్త్రంలో సున్నా
ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బద్రి గోపి గత ఏడాది హెచ్ఈసీ ఫస్టియర్ పాసయ్యాడు. ఈసారి సెకండియర్లో ఆంగ్లంలో 70, తెలుగు-90, చరిత్ర-93, రాజనీతిశాస్త్రంలో 80 మార్కులు రాగా ఆర్థికశాస్త్రంలో సున్నా మార్కులు వచ్చాయి. విద్యార్థి గోపి మాత్రం తాను 80 మార్కులు వస్తాయని ఆశించగా...సున్నా రావడంతో అధ్యాపకుల దృష్టికి తెచ్చాడు. పునఃపరిశీలనకు దరఖాస్తు చేస్తే న్యాయం జరుగుతుందని వారు విద్యార్థికి ధైర్యం చెప్పారు. ఈ విషయం బోర్డు దృష్టికి కూడా వచ్చినట్లు సమాచారం.
సంస్కృతంలో ఫెయిల్
మహబూబ్నగర్ జిల్లాలో ఓ ప్రైవేట్ కళాశాలలో చదివిన హరికిషన్ బైపీసీ ప్రథమ సంవత్సరంలో సాధారణ మార్కులతో పాసయ్యాడు. ద్వితీయ సంవత్సరంలో సంస్కృతంలో సున్నా మార్కులు వచ్చాయి. మిగిలిన నాలుగు సబ్జెక్టుల్లో పాసయ్యాడు. ఆంగ్లంలో 50 మార్కులు సాధించిన ఆ విద్యార్థికి సంస్కృతంలో సున్నా మార్కులు రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఇలా చాలా మందికి సున్నా మార్కులు వచ్చినట్లు సమాచారం.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.